శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల లాభమేమిటి?

>> Saturday, November 9, 2013

మన దేశానికి భారత దేశమనే పేరు కలదు.  భారత శబ్దానికి అర్థం ఏమిటి?
​భారత అనే శబ్దంలో మూడు అక్షరాలు ఉన్నాయి.  'భా' అనే అక్షరానికి ప్రకాశమని, 'ర' అంటే రమించడం అని, 'త' అంటే తరించడం అని అర్థం.  జ్ఞాన మార్గంలో రమించి తరించేవాడు భారతీయుడు.  అందుకే మన భారతదేశాన్ని 'కర్మభూమి' అని, ఇతర దేశాలను 'భోగభూములని' అంటారు.
కర్మభూమికి భోగభూమికి గల తేడా ఏమిటి? 
భారత దేశంలో 'కర్మ' కు ప్రాధాన్యత ఇవ్వబడినది.  కర్మను ప్రధానంగా పరిగణించి దానినే ఆచరిస్తూ జీవనం సాగిస్తారు.  ఇతర దేశాలలో 'భోగానికే' ప్రాధాన్యత.  వాటిని పొందేందుకే వారు జీవనం సాగిస్తారు. కావున ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసముంది.

కర్మ అంటే ఏమిటి? 
భారతీయ సంస్కృతిలో జన్మించిన ప్రతి హిందువు వేద శాస్త్రములనే ప్రామాణికంగా భావిస్తాడు.  మనిషి మనుగడకై వేద శాస్త్రాలు యోగ్యమైన జీవన విధానానికి తోడ్పడే కర్మలను నిర్దేశిస్తున్నాయి.  అట్టి శుభప్రదమైన కర్మలనే ఆచరిస్తూ తాత్విక చింతనతో జన్మను చరితార్థం చేసుకుంటారు హిందువులు.

హిందూ అంటే? 
సంస్కృత వ్యాకరణంలో 'హిమ్' అనే ధాతువుకు పాపము అని అర్థము.  'దూ' అనగా దూషయతి, ఖండయతి.  కనుక హిందువనగా పాపరహితుదని అర్థం.  సింధు నదికి, హిందూ మహాసముద్రానికి మధ్య భాగంలో నివసించే వారిని హిందువులని, వీరి విశిష్టమైన ఆచారవ్యవహారాలతో కూడిన సంస్కృతిని హిందూ ధర్మమని చెప్పబడింది.
హిందూ ధర్మం అని పిలవడం తప్పా? 
తప్పే లేదు.  సనాతన ధర్మంగా పిలవబడే మన ధర్మానికి హిందూ ధర్మమనే పేరుతొ పిలవడం తప్పుగా ఎలా భావించ వచ్చు? పేరు గురించి పెద్ద రాద్దాంతం చేసుకోవలసిన పనిలేదు కానీ, మన ఆచార వ్యవహారాలను మరచిపోయి, దిగజారిపోకుండా హిందూ అనే పేరుతొ వ్యవహరించడం దోషమేమీ కాదు.
నేటి  ధర్మ ప్రచారకులు ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకై మన ప్రాచీన ఆచారాలను, ధార్మిక భావాలను, శాస్త్రాలను పరిరక్షించి రాబోవు తరం వారికి అందించే యోగ్యులైన అనుసంధాన కర్తలు కావాలి.
మతం అన్నా, ధర్మం అన్నా ఒకే అర్థాన్ని సూచిస్తుందా? 
మనిషి యొక్క మతి (మనసు)లో కలిగిన భావననే మతమంటారు.  వ్యక్తిని ఆలంబనగా చేసుకుని ఉద్భవించినవే మతాలు.  మనం అత్యంత ప్రమాణంగా భావించే వేదాలను వ్యక్తులు ఊహించి చెప్పినవి కావు.  త్యాగమూర్తులైన ఋషులు తపమాచరించి దర్శించిన సత్యాలను వేదములంటాము. అట్టి వేదములు నిర్దేశించిన మార్గమే ధర్మమార్గం.  అందుకే మనది మతం కాదు.  సనాతన ధర్మమని గ్రహించాలి.  ధర్మమే మనకు ప్రధానం.  శాస్త్రం సూచించిన మార్గాన్ని అనుసరించడమే ధర్మం.  అట్టి శాస్త్రాన్ని ప్రామాణికంగా అంగీకరించే మన సంస్కృతిలో వ్యక్తిగతమైన ఆలోచనలకు, రాగద్వేషాలకు తావు లేదు.
సనాతన ధర్మం అన్నారు.  సనాతనం అంటే ఏమిటి? 
సనాతనం అంతే శాశ్వతంగా ఉండేదని అర్థం.
సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల లాభమేమిటి?
సనాతనధర్మశాస్త్రాలు మానవుని శ్రేయస్సుకై ప్రధానంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి.  (1) జీవన విధానం; (2) జీవిత లక్ష్యం.  ఇవి రెండూ అర్థం కాని వారి జన్మ వ్యర్థమే.  అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పురుషార్థాల ద్వారా పొంద వచ్చని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి.
పురుషార్థాలంటే ఏమిటి? 
ధర్మార్థ కామ మొక్షములే పురుషార్థములు.  ఈ లోకంలో ప్రతి వ్యక్తీ సుఖంగా జీవించాలని కోరుకుంటాడు.  ఆ కోరికనే "కామః" అంటుంది శాస్త్రం.  అట్టి సుఖాన్నిచ్చే పరికరములను పొందడానికి ధనం అవసరం.  కనుక ధనాన్ని "అర్థః" అంటుంది.  అయితే ఈ ధనాన్ని 'ధర్మ' మార్గంలో ఆర్జించి తద్వారా జీవితంలో సుఖాన్ని, హాయిని, తృప్తిని పొందే జీవన విధానాన్ని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 
మనిషి జీవన విధానానికి ధర్మ, అర్థ, కామములు ప్రధానమైన అంశములైతే, మనిషి యొక్క జీవిత లక్ష్యానికి 'మోక్షమే' అత్యంత ప్రధానమైన అంశముగా శాస్త్రాలు పరిగణిస్తున్నాయి.  అట్టి జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పొందాలనుకునే వారికి ఆశ్రమ ధర్మాలను ప్రభోధిస్తున్నాయి.

ఆశ్రమ ధర్మములంటే ఏమిటి?
ఆశ్రమ ధర్మములంటే జీవన విధానానికి, జీవిత లక్ష్యానికి శాస్త్రం సూచించిన నిర్దిష్టమైన పంథా అని అర్థం.  జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తికి ముఖ్యంగా జీవన విధానం పట్ల అవగాహన అవసరం.  జీవితాన్ని అర్థం చేసుకోలేనివాడు జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమే.   అందుకే మన సనాతన ధర్మ శాస్త్రాలు మానవ జీవితాన్ని (1) బ్రహ్మచర్యాశ్రమం; (2) గృహస్థాశ్రమం; (3) వానప్రస్థాశ్రమం; (4) సన్న్యాసాశ్రమం గా పరిగణిస్తుంది.
బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి?
ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి దశ.  ఈ దశలోనే ప్రతి వ్యక్తీ తన జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.  శిశువుకు మొట్టమొదటి గురువు తల్లి, తదుపరి గురువు తండ్రి.  తరువాత 'ఆచార్యుడే గురువు'అట్టి గురువు వద్ద నియమ నిబంధనలతో తన విద్యార్థి దశ ప్రారంభం అవుతుంది.  ఈ దశనే బ్రహ్మచర్యాశ్రమం అంటారు.
గృహస్థాశ్రమం అంటే ఏమిటి?
బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడాన్ని గృహస్థాశ్రమం అంటారు.  ఈ గృహస్తు ఎంతసేపూ ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, సుఖాల వరకే పరిమితం కాకూడదు.  మోక్షమనే చివరి పురుషార్థమైన జీవిత లక్ష్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి.  అర్థ, కామములను ధర్మబద్ధంగా నెరవేర్చుకునే వ్యక్తికి క్రమేపీ మోక్షరూపమైన పరమాత్మను పొందేందుకు అవకాశాన్ని కల్పించేదే గృహస్థాశ్రమం.
ఈ దశలో స్త్రీ పురుషులు ఇరువురిని హిందూ ధర్మ శాస్త్రాలలో వివరించిన విధంగా పవిత్రమైన వైవాహిక వ్యవస్థతో కలుపుతారు.  అనంతరం వారిరువురూ భార్య, భర్త అనే బాధ్యతాయుతమైన పాత్రలతో జీవితంలో ప్రధానమైన ఘట్టం లోకి అడుగిడుతారు.  వారికి కేవలం విలాసము, సుఖ భోగాలే లక్ష్యం కాకూడదు.
విలాసవంతమైన పాలరాతి మేడలలో కుటుంబ సభ్యులు నవగ్రహాల్లాగా తలొక దిక్కుకీ చూస్తూ ఎడమొహం, పెదమొహం తో జీవిస్తుంటే అది గృహస్థాశ్రమం అనబడదు.  ఆకలిలేని వాడికి పంచభక్ష్య పరమాన్న భోజనం ఎంత నిరుపయోగమో మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత లోపించిన కుటుంబాలలో ఎన్ని మేడలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అంతే.  కుటుంబం లోని వారు కలసి మెలసి అన్యోన్యతతో తమ ధర్మాలను, బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించే విధానాన్నే గృహస్థాశ్రమం అంటారు.

భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?

మళ్ళీ చెప్పుకుందాం ..........

భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?
భార్య తన తల్లిదండ్రులను, తన వాళ్ళను, తన ఇంటి పేరును, గోత్రాన్ని వదులుకుని భర్తనే తన సర్వస్వమని భావిస్తుంది.  అట్టి భార్య  'హృదయంతే దదామి' అంటుంది.  అనగా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని అర్థం.  భర్త 'తవచిత్త మనుచిత్తం భవతు' అంటాడు.  నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్థం.
భౌతికమైన ఆకర్షణలకే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.   ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి.  ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి యుండాలి.  భార్యను అర్థాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి.
భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?
భర్త యొక్క మనోభావాలకు, అభిరుచులకనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానములతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతుంది.  అందుకే 'భార్యామూలమిదంగృహం' అన్నారు.  పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంత సేపూ బాగుండడం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపగించడం, ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు.  పరిస్థితులు బాగా లేనపుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకో గలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యొన్యతతో, సదవగాహనతో వ్యవహరించాలి.
గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యమునకే పరిమితం చెందక సంతానం పట్ల సరైన అవగాహనతో తల్లి, తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్థవంతంగా వ్యవహరించాలి.

తల్లిదండ్రుల యొక్క బాధ్యత?
సుపుత్రో సప్తమోరసః అనే నానుడి.  అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం.  పిల్లలు మీ ప్రతిబింబాలని మరువకండి.  మీలో కలిగే ప్రతీ భావాలు, గుణాలు, సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి.  కనుక మీ భావాలను, గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుండాలి. మీ ప్రవర్తన వారికి ఆదర్శవంతం కావాలి.
మీ తదనంతరం ఈ భూమిపై కొనసాగే మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి, సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చి దిద్దేందుకై కృషి చేయండి. స్వార్థంతో రాగ ద్వేషాలకు లోబడి మానసిక వత్తిడికి, ఘర్షణకు గురికాకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులు గా యోగ్యమైన భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి.
కుటుంబంలో కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసినపుడు ఎలా ప్రవర్తించాలి?
జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని ఒడి దుడుకులను ఎదుర్కోక తప్పదు .  అవగాహనా రాహిత్యం వలన కుటుంబంలో స్పర్థలు తలెత్తుతూ ఉంటాయి.   పరిష్కరించుటకు సరియైన ఆలోచనా మార్గాన్ని ఎంచుకోవాలి.  ఒకవేళ మీ చేతులు దాటితే వాటంతట అవి సర్దుకునేందుకు కాలానికే అవకాశం ఇవ్వాలి.   సర్దుకోకపోతే అవి పరమేశ్వరుని ఆజ్ఞగా భావించి వాటిని తట్టుకొనేందుకు మనసును సంసిద్ధ పరుచుకోవాలి. 

నన్ను మాటలతోనో, చేతలతోనో బాధపెట్టే వారిని చూడగానే నాలో ద్వేషం కలుగుతోంది.  ఇటువంటి వ్యతిరేకభావాల నుండి ఎలా బయటపడాలి?  
బాధపెట్టే వారు తటస్ఠించినపుడు మనలో వ్యతిరేక భావాలు ఉదయిస్తాయి.  పెనుగాలి తాకిడికి చెట్టు పడిపోకుండా నిలబడ గలగడం ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది. అలాగే, కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొన గలిగిన స్థాయి వారి మానసిక స్థైర్యాన్ని సూచిస్తుంది. ఈ స్థాయి కేవలం భగవదనుగ్రహంతోనే సిద్ధిస్తుంది.  కనుక ప్రతీ గృహస్థు అనుక్షణం తనకు లభించిన దానిని భగవత్ప్రసాదంగానే స్వీకరించ గలిగే స్థాయిని అలవరచుకోవాలి.  అట్టి వ్యక్తిలో రాగద్వేషాలు తొలగి క్రమేపీ వ్యతిరేకభావాల నుండి బయట పడగలిగే స్థితి చేకూరుతుంది. 
నన్ను బాధ పెట్టే వ్యక్తి పరాయి వారైతే ఉపేక్షించవచ్చు.  కానీ వారు మనతోనే కలసిఉండే వారైతే? నా కుటుంబ సభ్యులే అయితే? నేనేం చేయాలి? 
వారి అవగాహనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి.  అలా మారకపోతే మనమే మన దృక్పథాన్ని మార్చుకోగలగాలి.  మంచి రుచికరమైన పదార్థాన్ని తింటున్నపుడు పొరపాటున ఒక్కోసారి నాలుకను కరుచుకుంటాం.  ఆ బాధ వర్ణనాతీతం.  దాన్ని భరించలేం. అంతమాత్రం చేత నాలుకను బాధ పెట్టిన పళ్ళను రాలగొట్టం కదా! ఆ బాధను ఓర్చుకుంటాం.  కారణం పళ్ళు, నాలుక రెండూ మనలో భాగాలే. అలాగే కుటుంబ వ్యవస్థలో అందరూ భాగాలేనని గ్రహిస్తే ఇతరుల వల్ల కలిగే దుఃఖాలను, బాధలను కూడా పరిపక్వ దృష్టితో అంగీకరించి సర్దుకు పోగలం. 

ఈ అవగాహనతోనే మన వాక్కు, ఆలోచనలు సంస్కరించ బడతాయి.  రాగద్వేష రహిత స్థితి ఏర్పడుతుంది.  క్రమేపి మనసుకి శాంతి కలిగి అలజడి తగ్గుతుంది. 
ఇటువంటివి చదువుతున్నంత సేపూ, వింటున్నంత సేపూ బాగుంటాయి.  మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగలేకపోతున్నాం.  ఎందుకని? 
మళ్ళీ చెప్పుకుందాం ..........

ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

1 వ్యాఖ్యలు:

Anonymous March 6, 2017 at 11:02 PM  
This comment has been removed by the author.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP