శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label పుణ్యభూమి నాదేశం. Show all posts
Showing posts with label పుణ్యభూమి నాదేశం. Show all posts

కర్నాటక లోని ఏడు ముక్తి స్థలాలు

>> Tuesday, March 3, 2015

కర్నాటక లోని ఏడు ముక్తి స్థలాలు
భారత పురాణాలు మనకు ఏడు ముక్తిని ప్రసాదించే దివ్య క్షేత్రాల గురించి తెలియచేశాయి. దర్శన, స్మరణ,పఠన, శ్రవణ మాత్రాననే మానవుల సర్వ పాపాలు తొలగిపోయి వారిని భగవత్‌ సన్నిధిని చేర్చే అవి అయోధ్య, మథుర, మాయ ( హరిద్వార్‌), కాశి, కంచి, అవంతిక ( ఉజ్జయిని), మరియు పూరి. వాటితో సరిసమానమైన స్థలాలు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్నాయి.
అవి ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్యం, కుంబాసి, కోటేశ్వర, శంకర నారాయణ, కొల్లూర్‌ మరియు గోకర్ణం.

స్కాందపురాణం లోని సహ్యాద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాలు ఉత్తర కర్నాటకలో పరశురాముడు సృష్టించిన నేటి కొంకణ భూభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ ఏడు క్షేత్రాలు కూడా ఎన్నో శతాబ్దాల చరిత్రకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయాలు.
ఉడిపి
శ్రీ కృష్ణ క్షేత్రాలలో పేరొందిన ఉడిపికి ఆ పేరు రావడానికి సంభందించి రెండు రకాల కధనాలు వ్యాప్తిలో ఉండటం విశేషం. ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్ధం. నక్షత్రాల దేవుడు వెన్నెల రేడు చంద్రుడు. దక్ష శాపం నుండి సదాశివుని కృప వలన విముక్తుడై, శాశ్వతంగా ఆయన శిరమందు నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన క్షేత్రం అయినందున ఈ పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతున్నది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. రెండవ కధనం ప్రకారం ఉడిపి అన్న పదం ఒడిపు అన్న తుళు పదం నుండి వచ్చినది అని, దానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !
ఉడిపి దై్వత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలం.
పదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.
కుక్కే సుబ్రహ్మణ్యం దేవస్థానం
ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా (160 కి. మీ ) దక్షిణ కర్ణాటకలో ఉన్నది.
ఈ దివ్య క్షేత్ర పురాణ గాధ సత్య యుగం నాటిది.
లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనతో మార్గశిర సుద్ద షష్టి నాడు ఇక్కడే జరిగినది.
స్కన్దునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు.
ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార.కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ది.
దీనికి గల కారణం గురించిన గాధ ఇలా ఉన్నది.
గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది.
శంకర నారాయణ ఆలయం

కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. స్థానిక గాధ గురించిన విశేషాలు అందుబాటులో లేవు. కానీ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా లభించిన ఆధారాల వలన తెలుస్తోంది.
సహ్యాద్రి పర్వతాలలో ఒకే పానువట్టం మీద హరిహరులిరువురూ లింగ రూపాలలో కొలువుతీరిన ఒకే ఒక్క క్షేత్రం ఇదేనేమో ! వ్యత్యాసము తెలియడానికి అన్నట్లు విష్ణు లింగ పై భాగాన కామ ధేనువు గిట్టల ముద్రలుంటాయి. మరో విశేషము ఏమిటంటే ఇక్కడ జయ విజయులు మరియు నంది ఉండటం. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు.
కోటేశ్వర
ఉడిపికి సుమారు ముపై్ప కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది. గతంలో ఉన్న ఏడు ప్రాకారాలలో కొంత వరకు కనుమరుగయ్యాయి.
ఆలయ వెలుపల ఉన్న పెద్ద గద్దెను నిర్మించిన విధానానికి దానిని ఎక్కితే లోపల గర్భాలయంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని నేరుగా కాంచవచ్చును.
ఈ ఆలయంలో అన్ని ప్రత్యేక రూపాలలో కనపడతాయి.
ఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, రెండో ప్రాకారంలో ఉన్న ఏనాటిదో తెలియని పెద్ద శిలా శాసనం ( ఇందులోని భాష గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటారు) ఇలా ప్రతివక్కటి విశేషమే !
అనెగుద్దె ( కుంభాషి )
సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది అనెగుద్దె లేక కుంభాషి. ఉడిపికి ముపై్ప కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరినది విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు.
గజముఖుదు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనే గుద్దే ( ఏనుగు తల). పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట.
తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి వారు ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచడానికి యాగం ఆరంభించారట.
దానిని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట.
కుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలవబడుతోంది.
యాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట.
యాగారంభములో పాండƒ వులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి నేటికీ అందరి పూజలు అనుకొంటున్నారు. ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగ నది అంత ర్వాహినిగా ప్రవహించడం వలన వస్తోంది అంటారు.
దగ్గరలో సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి ఉంటాయి. అలానే వారి ఆలయాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో పెద్దశిరస్సు, చెవులతో, నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి దర్శనమిస్తారు.
కొల్లూర్‌ శ్రీ మూకాంబిక దేవి : 
కోలా మహర్షి లోక కళ్యాణార్ధం చేసిన తపస్సుకు సంతసించిన సదా శివుడు ప్రత్యక్షం కాగ మహర్షి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యాన్ని కోరుకోన్నారట.
అందుకే లింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది.
తదనంతర కాలంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఇక్కడ శ్రీ చక్ర సహిత దేవి యొక్క పంచలోహ విగ్రహాన్ని, శ్రీ చంద్రమౌలీశ్వర లింగాన్ని ప్రతిష్టించారట.
దేవి నవరాత్రులు, శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీ మహాబలేశ్వర స్వామి కొలువుతీరిన గోకర్ణం :
ఉత్తర కర్ణాటకలో ఉన్న సప్త ముక్తి క్షేత్రాలలో ఆఖరిది గోకర్ణం.
రామాయణ కాలం నాటి ఈ క్షేత్ర గాధ అందరికి తెలిసినదే !
పరమ శివుని మెప్పించి ఆత్మ లింగాన్ని తీసుకొని లంకానగారానికి వెళుతున్న రావణాసురుని నుండి ఉపాయంతో గణపతి ఇక్కడ ఉంచాడు అన్నదే ఆ గాధ !
శ్రీ మహా బలేశ్వర స్వామి కొలువు తీరిన గోకర్ణం ఒక ఆద్యాత్మిక పర్యాటక కేంద్రం.
గోకర్ణం ఉడిపికి నూట డెభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ ఏడు స్థలాలను ఈ క్రింది మార్గంలో సందర్శించవచ్చును.
తొలుత నేరుగా గోకర్ణం. తరువాత ఉడిపి తరువాత కుక్కే సుబ్రహ్మణ్యం.
ఉడిపి నుండి బయలుదేరి కుందుపర వెళ్ళే దారిలో కుంబాషి, కోటేశ్వర సందర్శించుకొని కుందుపర, కొల్లూరు మీదగా శంకరనారాయణను చేరుకొని నాలుగు రోజులలో ప్రశాంతంగా యాత్ర పూర్తి చేసుకోవచ్చును.

Read more...

సరిగ్గా సంవత్సరం క్రితం దేవభూములైన బదరీ,కేదారనాథ్ లలో నేను

>> Wednesday, June 4, 2014



శ్రీరామ
          పవిత్ర హిమాలయాలలో గంగమ్మ తల్లి

కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్నది ఎందుచేతనో వాయిదాపడుతుంది. నాజీవితంలో తప్పనిసరిగా చూడాలనుకున్న హిమాలయ ఋషిభూములను చూసే అవకాశం నిరుడు ఈరోజులలోకలిగింది. గతఏడాది మాతమ్ముడువాళ్లు టూర్లో భాగంగా బదరీ,కేదారనాథ్  యాత్రకు వెళుతూ  నాకు నాభార్యకుకూడా టికెట్ లు బుక్ చేశారు. .కానీ మాకు  వీలవలేదని టికెట్స్ కాన్సిల్ చేసుకున్నాం .
అయితే అనుకోకుండా విజయవాడ వెళ్ళి అప్పటికే ఢిల్లీవరకు  బుక్చెసిన టిక్కెట్ ఉందికనుక బృందావనం వరకు వెళ్ళివద్దామని రైలెక్కాను ఒక్కడినే.  ముందు బృందావనం దర్శించుకున్నాను .అమ్మ రాధమ్మ నామస్మరణతో  రాధే...రాధే   అంటూ పులకరించిపోతున్న పుణ్యభూమి అది. మాపరమగురువులు బృందావనంలో నిర్మించిన రాధామహాలక్ష్మీ ఆశ్రమం కు వెళ్లాను . మధురస్టేషన్ నుండి  బృందావనం వరకు వచ్చిన ఆటోవాడు అక్కడ మాట్ళాడినదానికంటే ఎక్కువచెప్పి వాదన వెసుకుంటాడు, పరమ అబద్దం ఆడతాడు. సరీ మొదట్లోనే తగిలావా నాయనా గొడవకు అనుకుని వాడ్ని వదలి ఆశ్రమంలో కెళ్ళి అక్కడ ఆశ్రమనిర్వహణచూస్తున్న అమ్మఅంజనీమాత కునమస్కరించి  నాప్రయాణసంకల్పం  వివరించాను. అక్కడకొలువై ఉన్న రాధారాణిని దర్శించుకుని  సాయంత్రం యమునాతీరం చేరుకున్నాను. అమ్మ యమునకు ఇస్తున్న హారతిదర్శించాను.  తరువాత ప్రసిధ్ధ రాధామాధవ దేవాలయానికి,ఆపై బాంకే బిహారీజీ మందిర్ కు వెళ్ళి దర్శనం  చేసుకున్నాను, బాంకే బిహారీజీదగ్గర జరుగుతున్న పూజావిధులను చూస్తే మనకేమో కొత్తగానూ,ఉంది అక్కడి భక్తులకు చాలా ఉత్సాహంగానూ అనిపిస్తున్నది. శాస్త్రీయతకంటే అక్కడ ప్రేమ భక్తికే  ప్రాధాన్యత. పూజ్యగురుదేవులు రాధికాప్రసాద మహరాజ్ వారు వ్రాసిన గ్రంథాలలో బాంకే బిహారీజీ చూపిన లీలలు చదివి వున్నందున ఆయననను మనసారా దర్శించుకున్నాను.

 రేపొద్దుటే బదరీనాథ్ వరకు వెళ్ళిరావాలని ఉన్నదమ్మా! అని అంజనీమాతను అడుగగా అమ్మ నవ్వి సరే అన్నారు. రాత్రికి అక్కడే ఉండి పొద్దుటే బయలుదేరాను. అమ్మ నాపై వాత్సల్యంతో  అన్నం వండించి పాక్ చెపిమ్చి ఇచ్చారు దారిలో తినటానికని.
ఇక మధురస్టేషన్ నుండి ః హరిద్వార్ వరకు వెళ్ళాలని మధుర స్టేషన్ కుచేరాను. ట్రైన్ కు చాలాసమయం ఉందని తెలియటంతో  కన్నయ్య నుదర్శించు కోవటానికి మందిరానికి వెళ్ళాను.  సాక్షాత్తూ పరమాత్మ ఆవిర్భంచిన దివ్యస్థలం . ఆజన్మస్థలం దర్శించి మోకరిల్లి పులకరించినది తనువు. పక్కనే బ్రహాండమైన మసీదుగోపురం జన్మస్థలిని ఆక్రమించి   ధర్మాన్ని ఆవరించిన కలిమాయలా, హిందువుల లో లోపించిన  ధార్మికనిష్టకు ప్రతీకలా కనిపిస్తూ మనసును పిండివేసింది. ఏమిటీ దౌర్భాగ్యం, మనకు. కోట్లాది హిందువుల జన్మభూమిలో     వీరివిశ్వాశాలను అపహాస్యం చేయటమే ధ్యేయంగా   అత్యంత పవిత్రస్థలాలైన, అయోధ్య,కాశీ,మధుర లలో ఆలయాలపై ఇలా అన్యమతస్థులు దాడిచేసి తమకట్టడాలను కడుతున్నా  నాటి  హిందువులునోరెళ్ళబెట్టుకుని చూస్తున్నారా ? అని ఆవేశం వచ్చినది. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?  అప్పుడు,ఇప్పుడూ హిందువుల రాజకీయ స్వార్ధాలవల్ల హైందవానికి అవమానాలే మిగులుతున్నాయి కదా ? అని మనసు ఎదురు ప్రశ్నించటం తో
మౌనం వహించాను.

ఇక మధ్యాహ్నం   హరిద్వార్  వెళ్ళే ట్రైన్ ఎక్కగానే దానిలో విజయనగరం నుండి వస్తున్న యాత్రికులబృందాలు అందులో శ్రీనివాసరావు గార్ల ధ్వయం పరిచయమయ్యారు. వారు మూడురోజులుగా ప్రయాణిస్తున్నారు దీనిలో .నాదగ్గరున్న అన్నాన్ని వారిద్దరికి కూడా పంచాను.  ఇక వారి తోపాటు వస్తున్న వారి జిల్లావాల్ల ప్రవర్తనతో నాకొచ్చిన కోపం ,స్పందన  ఇవన్నీ గతంలో వ్రాశాను. ఈలింక్ లో చూడండి. అప్పుడు వ్రాసిన పోస్ట్

హరిద్వార్ దిగేసరికి రాత్రి పదయింది. రిషీకేశ్ కు బస్సులు లేవు. అందుకని మేంముగ్గురం కలసి అక్కడే ఓ హోటల్ లో రూమ్ తీసుకుని ఆరాత్రి అక్కడుండి పొద్దుటే  రిషీకేశ్ చేరాం. అక్కడ మన ఆంధ్రాసత్రం చేరాము. చాలాప్రశాంతమైన సౌకర్యవంతమైన స్థలం అది. అక్కడ హాలులోనే విశ్రాంతి తీసుకున్నాం .ఆపక్కనే టిటీడి వారి ఆలయంలో ఉన్న శేఖర్ అనే పూజారి మితృడుగా మారాడు దర్శనానికి వెళ్ళినప్పుడు. ఆయన వద్ద యాత్రలో ఎదురయ్యే  పరిస్థితులగూర్చి వివరాలు సేకరించాను నేను తీసుకెళ్ళిన లగేజీలో కొంత మరొకబాగ్ లో సర్ది ఆయనదగ్గర ఉంచాను. కేదార్నాథ యాత్రలో కావలసిన దుస్తులు,బూట్లు  వస్తువులు కొనుగోలుచేశాం. మరుసటిరోజు . తరువాత విజయనగరం యాత్రికులు వేరే వాహనం మాట్ళాడుకుని చార్ ధామ్ యాత్రకు ప్లాన్ చేసుకోగా నేను ఒంటరిగానే గౌరీకుండ్ కు బయలుదేరాను. దారిపొడవునా లోయలలో కోడెతాచులా మెలికలుతిరుగుతూ దూకుతూ ప్రవహిస్తున్న గంగమ్మ. బస్సులో హిమాలయ సౌందర్యాలను చూస్తూ  స్వరరాగ గంగా ప్రవాహమే .......అనే ఏసుదాస్ గారి పాట పాడుకుంటూ ఉన్నాను. గౌరీకుండ్ వెళ్ళేసరికి    సాయంత్రమయింది

ఇక  అక్కడ ఉన్న వేడినీటి బుగ్గలలో స్నానం ముగించుకుని బస్సులో తోడయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన యాత్రికమితృని తో కలసి మందాకినీ నది ఒడ్డునే ఒక చిన్న రేకులషేడ్ [అదే కాటేజీ అనుకోవాలి] లో అద్దెకు దిగాము.
తెల్లవారు  జాముననే లేచి తయారయిపోయి  కొంతలగేజీ అక్కడే ఉంచి  నదక మొదలెట్టాను. కొంతదూరం నడ్చేసరికే ఆయాసం ఎగదన్నుకొస్తున్నది.  ఉద్యోగం వచ్చాక ఎక్కువకాలం నీడన కూర్చొని ఉండటం..అలాఘే హిందూపబ్లిక్ స్కూల్ పేరిట మెమి నిర్వహిస్తున్న పాఠశాల ను ముసివేయటం వలన వ్యాయామం తగ్గినది. అంతకుమునుపు సాయంత్రం వేళల్లో పిల్లలతో కలసి వాలీబాల్ లాంటీ ఆటలు ఆడేవాళ్లం.అదీ లేదిప్పుడు. పర్యవసానం ఇదిగో ఇలా అయింది. ఇహ నావల్లకాదనుకుని ఒక పక్కనచేరి బతిమాలుతున్న  గుర్రాలయజమానులలో ఒకడితో వేయిరూపాయలకు బేరం మాట్లాడుకున్నాను. వాడు ఒకగుర్రాన్ని ఒకపిల్లవాడిని ఇచ్చాడు ఆగుర్రం ఎక్కగానే అర్ధమైంది  ఇది మోయటం కాదుకదా పడిపోకుండా ఉండటమే గొప్ప అని. అంత బలహీనంగా ఉంది. ఈ గుఱం వద్దు అని దిగేసరికి వాడు వేరొక గుర్రాన్ని తెచ్చి అప్పగిమ్చాడు. ఇక  దారిపొడవునా గుర్రాలు,డోలీలు గోలగోల గాసాగుతున్నాయి. మనం ఇంత ఆపసోపాలు పడుతున్నా గుర్రాలవెంట నడుస్తున్న సహాయకులకు అలుపూసొలుపూ లేదు . ప్రకృతి బిడ్డలుకదా !. వెలుగు రేఖలు విచ్ఉకునే కొద్దీ హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తున్నది. అవిగో ఆకాశాన్ని తాకుతున్న శిఖరాలు వాటికి పచ్చని పట్టుచీరకట్టి తలపై వెండి కిరీటాలెట్టి ముస్తాబుచేశారా అన్నట్లున్నాయి.  ఆహా! జన్మ ధన్యం . దిక్కుమాలిన శరీరం నడవటానికి సహకరిస్తే ఇంకా ఆనందంగా చూస్తూ వెల్లొచ్చు.  ఒకవైపు వెళుతున్న గుఱాలమీద బాలెన్స్ గాకూర్చోలేక పడిపోతున్నవారున్నారు. ఇక కొందరిని బుట్టలలో కూర్చోబెట్టుకుని   దానిని వీపుకు తగిలించుకుని ఆశిఖరాలకెగబాకుతున్న షెర్ఫాలవంటి వారినిస్థానిక కూలీలను చూస్తే మాపుణ్యమంతా ఈ గుర్రాలకు,ఈ మోతగాళ్లకే చెందుతుంది అని అనిపించింది.

మధ్యలో రాంబాడా వద్ద ఆగి గుఱాలకు నీరు మేతా ఇచ్చారు. స్వామి దర్శనం దాకా ఏమీ తీసుకోదలచలేదు నేను.
సుమారు పదిగంటలకు  కేదారేశ్వరుని  శిఖరదర్శనమయ్యింది. హరహరమహాదేవ అనిస్మరిస్తూ గుర్రందిగి  నడక సాగిద్దమంటే ఊపిరి ఆడటం లేదు. కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. కాళ్ళీడ్చుకుంటూ  మందాకినీ  స్నాన్ ఘాట్ కు చేరుకుని  ఆతల్లికి నమస్కరించి స్నానం ఎలా చెయ్యాలా ? అని ఆలోచిస్తున్నాను. వేలు పెడితే కొరుక్కుపోయేంత చల్లని నీళ్ళు. పైనుండి మంచు కరిగి వస్తున్నాయి అందరూ కొద్దిగా నీళ్ళుతీసుకుని నెత్తిన చల్లుకుంటున్నారు. కొద్దిసేపు సందిగ్దం లో ఉన్నా ఏమైతే అదైందనుకుని ఉరవడిగా సాగుతున్న ఆప్రవాహం మొదటి మెట్టుపై పనుకుని బుడుంగున మునక వేశాను . అంతే!  వళ్ళు గడ్డకట్టుకుపోయింది  పైకి లేచి చూస్తే కాళ్ళుచేతులూ కొంకర్లుపోతున్నాయి. సూర్యునికభిముఖంగా నిలబడి కాళ్ళు చేతులూ కొద్దిసేపు రుద్దుకుని వేడిపుట్టాకగాని శరీరం స్వాధీనం లోకి రాలేదు.అలసట మటుమాయమయ్యింది . మందాకినీ జలాలో జీవశక్తి శరీరంలో చైతన్యాన్ని నింపింది. కాకుంటే అక్కడ నుండి నడక మాత్రం భారంగా ఉంది. ఇక లైన్ లోకి వెళ్ళి నిలుచుంటే ఒంటిగంటదాకా దర్శనం కాలేదు. అక్కడా డబ్బులుతీసుకుని జనాన్ని ముందు దర్శనం చేపించే పండాలు ,లైన్లలో దూరే మన తెలుగువాళ్ళు లైన్ లో ముమ్దు నిలుచున్నవారికి ఆలస్యంగా దర్శనం అయ్యేలా సహకరిస్తున్నారు.
లోపలకెళ్ళి స్వామికి నమస్కరించి తీసుకెళ్ళిన  నేతితో అభిషేకించుకుని  బయటకు వచ్చాను. అక్కడ క్షేత్రపాలక భైరవ మూర్తి ఉన్న కొండపైకి నడచే ఓపిక లేకపోయింది. అంతకుముందుమూడురోజులుగా అక్కడి రొట్టెలు  తినలేక,ముతకబియ్యం ఆచప్పిడి కూరలూ లోపలకు పోక  సరిగా నిద్రలేక నీరసం ఆవహించి ఉన్నది. హిమాలభూములుకనుక అంతగా గమనికలోకిరాలేదు. బయటకొచ్చాక  అక్కడదాతలు ప్రసాదంగా ఇస్తున్న సాంబారుకిచిడి లాంటిపదార్థం కొంతతీసుకుని నేను తీసుకెళ్ళిన బన్ కాస్త తిన్నాను.  మందాకినిలో మునగటం ఎంతతప్పో మెల్లిగా తెలిసిరాసాగింది. శరీరంలో వణుకు మొదలవుతున్నది. అక్కడ ఒక రెస్ట్ రూమ్ లో ఆరాత్రి ఉండాలని డబ్బుచెల్లించి వెళితే అక్కడ గోడలనుండికూడా నీరు చెమ్మదిగుతున్నది. బెడ్ దాదాపు తడిసిపోయి ఉంది ఒకగంట తంటాలుపడ్డా అక్కడ ఇక  ఉండలేకపోయాను. సరైన రక్షన దుస్తులు వసతి లేదు ఇకరాత్రికి ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని తోస్తున్నది. వెంటనే రూమ్ ఖాళీ చేసి మూడుగంటల నుండి నడకప్రారంభించాను . హఠాత్తుగా మేఘాలావరించి చిన్న తుంపర మొదలైంది. దారంతా పరచిన రాళ్ళు అరగిపోయి గుర్రపు లద్దెలతో చిత్తడి చిత్తడిగా మారి జారిపోతున్నది.  కొనుక్కున్న బూట్లు భారంగా మారాయి వాటినీ విప్పి చేతిలో పట్టుకుని దారివెంటకాకుండా అడ్దదారులలో కిందకుదిగుతూ చల్లగా ఐస్ లాతగులుతున్న నీటిప్రవాహాలు దాటుతూ సుమారు ఏడుమైళ్ళుదూరం రాంబాడా దాక వచ్చాను. ఇక అక్కడ కొచ్చేసరికి మోకాలు పట్టుకున్నది. అడుగుతీయటం గగనమైంది. చిన్నగా గుర్రాలాపినస్థలం దాకా వెళ్ళి  ఏడు వందలకు మాట్ళాడుకుని ఓ చిన్న గుర్రం ఎక్కాను. చీకట్లుపడుతున్నాయి. జాగ్రత్త కాలు దానికి ముందువైపు తగలనియ్యవద్దు అని వాహన యజమాని హెచ్చరిస్తున్నాడు. దారిఏటవాలుగా ఉంది. ముందుకు వాలిపోకుండా వెనక్కువాలికూర్చోవాలి.  జాగ్రత్తగా ఉండకపోతే అంతేసంగతులు.  మా ఆవిడను తీసుకురాకపోవటం ఎంత  మంచిపనో బాగా అర్థమైంది.
ఎఅవరూ భారీ విగ్రహం కల కుఱవాడు పైకెళ్ళెసరికి ఆక్శిజన్ అందక మరణించాడులాఉంది  శవాన్ని డోలీలో ఉంచి మోసుకువస్తున్నారు కూలీలు మనస్సు కలుక్కుమన్నది. అతని  భార్యాపిల్లలను తలచుకుని. త్వరత్వరగా
నడచినా చీకట్లుకమ్మేసరికి ఇంకా దారిలోనే ఉన్నాం/ గుర్రపుయజమానుల అరుపులు యాత్రికుల కేకలు ప్రయాణం సాగుతున్నది. నడుస్తున్న గుర్రాలన్నీ సకిలిస్తున్నాయి . నావాహనం మాత్రం ఎదో తేడాగా అరుస్తున్నది. ఆ అరుపు గాడిదలు ఓడ్రపెట్టినప్పుడు వచ్చే ధ్వనిలాఉంది. వాహన యజమానినడిగాను. బాబూ! ఇది గుఱం కాదే ? అని ఆయన ఎదో చెప్పాడు అర్ధం కాలేదు. నాకర్థమైంది, ఇది గుర్రం మాత్రం కాదు అని.
చీ చీ ఇంతబ్రతుకూ బ్రతికి గాడిదనెక్కిఊరేగుతున్నామా ? ఇంకా నయం ఫోటొ తీసుకోలేదు. ఓరి నీయమ్మకడుపుమాడా ! ఏదో గుర్రం  ఎక్కానంటే చెప్పుకోవటాకిని బాగుంటుంది గానీ గాడిదనెక్కానని తెలిస్తే పరువుపోతుంది ముఖ్యంగా పెండ్లాముందు,బామ్మర్ధులముందు.వాల్లందరికీ తెలిస్తే ఎంతపరువునష్టం. ఒక్కడినిరావటమే మంచిదయింది  ఎంతపనిచేశావురా గుర్రం అనిచెప్పి  అంటూ తెలుగులో నాకొచ్చిన తిట్లతో వానిని  దీవిస్తూ  నాపై నేనే జోకులేసుకుని నవ్వుకుంటూ చిన్నగా గౌరీకుండ్ చేరాను రాత్రి తొమ్మిదింటికి.  ఇక ఆగిన నా అశ్వం[అనుకుందాం] నిలబడలేక జారికూలబడింది నాడా కాల్లో ఇరుక్కుని నేనూ పడ్డాను . ఊరిముందరకొచ్చి బోర్లపడటం అంటే ఇదే రా అనుకుని చిన్నగా కాళ్ళీడ్చుకునివెళ్ళి అక్కడ ఒక హోటల్ లాంటిదానిలో దూరి రెండు మెతుకులు అన్నం తినబోతే వాంతి వచ్చేలా ఉంది. సరేనని క్రితం రాత్రి బసకొచ్చి చుస్తే ఆరేకులషేడ్లు కూడా ఖాళి లేవు. బయట చలి ,ఒంట్లో జ్వరం తీవ్రమవుతున్నాయి. ఆ రెస్ట్ హౌసత్రం యజమానినే బ్రతిమాలి పైన ఖాళిగాఉన్న ఒక రేకుల షేడ్ లో రాత్రికి తలదాచుకోవటానికి ఐదువందలిచ్చి వెళ్ళీ నిద్రపోదామంటే జ్వరం ఎక్కువై నిద్రరావటం లేదు. తలనొప్పి. అర్ధరాత్రి బయటకొచ్చి చూస్తే మన తెలుగువాళ్లెవరో ఉన్నారు. వాళ్లనడిగి ఒక టాబ్లెట్ తీసుకుని వేసుకుని పనుకున్నాను. ఉదయాన్నే లేచి మరలా వేడినీటికుండంలో స్నానం  చేసి రుద్రప్రయాగ్ బయలుదేరాను. అప్పటికి నాదగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. రుద్రప్రయాగ్ లో ఏటిఎమ్ వెతుక్కుని డబ్బు తీసుకుని బదరీనాథ్ వెళ్ళే బస్సెక్కాను. పాతాళంలో ఉన్నట్లుగా మెలికలు తిరుగుతూ వస్తున్న అలకనంద అందాలను చూస్తూ బదరీ సాయంత్రం ఐదనుకున్నది రాత్రి పదకొండు గంటలకు చేరాం బదరీ. బయట ఎవరూ ఉండవద్దు అని మైకులో హెచ్చరికలు చేస్తున్నారు. బస్సులో పరిచయమయిన అనంతపురం యాత్రికులతో కలసి చినజియ్యర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళీ తలదాచుకోవాలని అబ్యర్థించినా నిర్ధాక్షిణ్యంగా ఖాళిలేదు వెళ్ళ్మని వెళ్ళగొట్టారు నిర్వాహకులు. నాతోటి వాళ్లు వేరేచోటూ వెతుక్కుంటూపోగా చిన్నగా బస్టాండ్ కేవెళ్ళాలని నడుస్తున్నాను చలిలో వణుకుతూ. నాపై కనికరించాడేమో స్వామి.దారిలో పశ్చిమబెంగాలుకు  చెందిన ఒక సత్రం వద్ద బయటకు వచ్చి దారితెలియక తచ్చాడుతున్న ఒక వృద్దురాలిని చూపాడు. ఆవిడ తమవాళ్లు లోపల ఉన్నారని బయటకు వచ్చి దారితెలియటం లేదని చెప్పింది. ఆవిడవెంట నేనూ లోనికెళ్ళి  దారి చూసుకుంటూ మూడంతస్థుల ఆబిల్డింగ్ లోని కెళ్ళి అక్కడ వరండాలోనే పక్కపరుచుకుని పనుకున్న యాత్రికుల తోపాటు నేనూ విశ్రమించాను. ఆవిధంగా స్వామి కాపాడాడు నన్ను.
ఉదయాన్నే స్నానం జపం ముగించుకుని బదరీనాథుని దర్శనానికై బయలుదేరాను .అద్భుతమైన ఆథ్యాత్మికతరంగాలా హిమాలయాలలో.  లైన్లలో ముందున్న జనాన్ని మాయచేసి ముందుకెళ్ళి కలవటం మన తెలుగువారికి తెలిసినంతగా ఏ భాషవారికీ తెలియదనిపించింది మనవాళ్లను చూస్తుంటే . లోపలకెళ్ళి ఆదివ్యమంగళ మూర్తిని దర్శించుకుని  తరించాను. నా వస్త్రధారన చూసేమో ఎవరూ నన్ను తోసివేయలేదు బయటకు. ప్రశాంతంగా స్వామిదర్శనం చేసుకుని  బదరీ వృక్షరూపంలో కొలువైన అమ్మను దర్శించుకుని ఒకపక్కకొచ్చేసరికి అక్కడున్నారు మాగురువుగారు  ఆంజనేయస్వామి వారు, 
ఆరోజు హనుమజ్జయంతి, నాదగ్గర పూజకు ఏ పూజాద్రవ్యాలూ లేవు. ఆయనముందుకూర్చుని చాలాసేపు చాలీసాపారాయణం జపం  చేసుకున్నాను. బయటకు వచ్చి బ్రహ్మకపాలతీర్ధంలో మాపెద్దలకు తర్పణాలిచ్చాను అక్కడి మన తెలుగు పురోహితుని సహాయంతో.
ఇక అక్కడనుండి నడవాలంటే బాగానీరసంగా ఉంది. చిన్నగా రాత్రి బసచేసిన సత్రం వద్దకు చేరుకోగానే గులాబ్ బాబా సత్సంగం ఒంగోలు వాల్లు చేస్తున్న అన్నదాన కార్యక్రమం కనపడింది. వెళ్ళి మనవంటకాలతో తృప్తిగా భోంచేసి నాకు చేతనైనంత సమర్పించి తిరుగు ప్రయానమయ్యాను ఎవరో ఇకపద అని తరుముతున్నట్లుగా ఉంది మనసు. సరస్వతీ నది దర్శనానికి వెళ్ళే ఓపిక లేదు. తిరుగు ప్రయాణంలో బస్సులలో ఖాళీలేక ఒక జీపులో ఢిల్లీకి,హర్యానాకు చెందిన యాత్రికులువెళుతుంటే నేనూ కలసి బయలుదేరాను. మధ్యలో వాడు జ్యోతిర్మఠ్ వద్దకువచ్చి అక్కదనుండి మరొకజీపు ఎక్కించారు. రాత్రికి రుషీకేశ్ కు తీసుకెలతానని డ్రైవర్ చెప్పినా ఎంతవేగంగా వచ్చినా పదిగంటలకు కేవలం  కీర్తినగర్ వద్దకు మాత్రమే రాగలిగాము. నాకైతే పూర్తిగా ఓపిక నశించింది. వెనుకసీటులో పనుకుని నిద్రపోయాను. అక్కడ పోలీసులు చెక్ పోస్ట్ వద్ద ఆపివేశారు. అప్పటిదాకా డాంబికాలుపోతున్న మా జీపులోనిఢిల్లీ యాత్రికులు పోలీసులు ఈరాత్రికి వాహనాలు నిలిపివేయడంతో వారిప్రయత్నాలు ఫలించక బిక్కమొహం వేశారు.  అక్కడి సబ్ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ కు ఢిల్లీ లో హోమ్ శాఖలో పనిచేస్తున్న డిఎస్పీ మిత్రునిద్వారా ఫోన్ చేపించి వాహనాలు కదిలేలా చూశాను. రాత్రి రెండున్నరకు రుషీకేశ్ కు చేరాను  ,ఉదయాన్నే దయానందాఅశ్రమం వెనుక  గంగమ్మలో మునకలువేసి కూర్చుంటే ఎంతసేపటికీ ఆతల్లి ఒడిని వదలి ఇవతలకు రాబుధ్ధివేయలేదు.పగలుకొంత విశ్రాంతి తీసుకుని హరిద్వార్ చేరి ఢిల్లీ కి వెళ్ళటానికి ట్రైన్ దొరకక సాయంత్రం వరకు వేచిఉండాల్సి వచ్చింది.  రాత్రి ఎనిమిదిగంటలకు ఢిల్లీ  ట్రైన్ ఉన్నందున సాయంత్రం గంగాహారతికి హరిద్వార్ ఘాట్ లకు వెళ్ళివచ్చేసరికి ఆట్రైన్  వెళ్ళిపోయింది. కాశీ వెళ్ళే ట్రైన్ ఒకటి బయలుదేరుతున్నది టిక్కెట్ వద్ద క్యూలైన్ చాలా పొడవుగా ఉంది.  ఎలానూ వచ్చాం కనుక మరలా ప్రాప్తమున్నదో లెదో కాశీ విశ్వేశ్వరుని దర్శనం చెస్తే మంచిదికదా అని టిక్కెట్ కోసం ట్రైన్ వెళ్ళిపోతుందని ముందుకువెళ్ళటానికి ఎవరూ పోనివ్వలేదు. పరమాత్మ సంకల్పమా అన్నట్లు ఒక కానిస్టెబుల్ నాదగ్గర కొచ్చి .ఎక్కడికెళ్ళాలని అడిగి డబ్బుతీసుకుని ముమ్దుకెళ్ళి టిక్కెట్ తెచ్చి ఇచ్చాడు. సరే ! ట్రైన్ లోకెళ్ళి చూద్దునుకదా !క్రింద సీట్లు లేవు పైన ఆక్రమిమ్చుకుని పిల్లపాపలను కూర్చో బెట్టుకున్నారు లగేజీల బల్లలపై.  పిల్లలను క్రిందకు దించి కూర్చోబెట్టుకోమని  ఎంత అభ్యర్థించినా ఆహిందీవాళ్లకు  పట్టలేదు. మరలా ఇందాక కానిస్టెబులే స్వామి పంపాడా అన్నట్లు  ఆపెట్టెలోకి వచ్చి నన్నుచూసి ఇలా మెతకగా ఉంటేఎలాస్వామీ ! అని వారిని అదిలించి పైన ఖాళిచేపించినాకు ఇప్పించాడు. పరమేశ్వరుని దర్శనానికి బయలుదేరానని ఇలా ఏ ప్రమథగణములోని భక్తుడొ సహాయపడ్డాడని నమస్కరిమ్చుకున్నాను మనస్సులో.

ఇక మరుసాటిరోజు  సాయంత్రం నాలుగుగంటలకు వారణాసిలో అడుగుపెట్టేభాగ్యం కల్పిమ్చాడా తండ్రి శివయ్య.
వెంటనే దశాశ్వమేథ్ ఘాట్ కు వెళ్ళి అక్కద పడవలో అవతలివడ్డుకు వెళ్ళీ స్నానం చేసి పూజాద్రవ్యాలుతీసుకుని స్వామి దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ కాశీలో దర్శనంలో పాటించవలసిన క్రమం నేను పాటించలేకపోయాను.  నేరుగా స్వామిని దర్శించుకుని జ్ఞానవాపీమందిర్ నుఆక్రమిమ్చి కట్టిన మసీదునుచూసి కొద్దిసేపు మనదుస్థితికి వగస్తూ అనంతరం అన్నపూర్ణాదేవి దర్శనం.ఆపై విశాలాక్షిమాత పీఠాన్ని దర్శించుకుని అక్కడ లలితాపారాయణం చేసుకుని బయటకొచ్చాను. అక్కద పురోహితుల,వ్యాపారుల వేధింపులు చూసిఏవగింపుకలిగి   కాశీక్షేత్రాన్ని దర్శించానన్న తృప్తిని పూర్తిగా గుండెల్లో నింపుకోలేకపోయాను.
 రాత్రికి గంగాకావేరి ఎక్స్ ప్రెస్ కోసం రాత్రి పదకొండున్నరదాకా ఎందుకు వెయిట్ చేయాలనే అతి తెలివితో మొఘల్ సరాయ్ స్టేషన్ కు వెళ్ళి సంఘమిత్ర  ఎక్కాను. ఇక మొదలయ్యింది శిక్ష . రిజర్వేషన్ లేదు. ఐనా రిజ్ర్వేషన్ భోగీ ఎక్కాను మామూలు టిక్కెట్ తో. కాలు కదపటానికి సందులేదు. కదలాటానికి మెదలటానికి వీలులేకుండా నిలబడ్డచోటే జోగుతూ ,ఆకలి నీరసం, నరకం చూశాను. అదీ మరునాడు మధ్యాహ్నం దాకా. కనీసం బాత్ రూమ్కు వెళ్ళటానికి కూడా   జాగాలేదు. అంతలా కిటకిటలాడుతున్నారు నాలాంటీ జనం ఆ రైల్ నిండా . ఈలోపల టిసీ లు వచ్చి ఆభోగీ ఎక్కినందుకు ఏడువందలఏభైరూపాయల ఫైన్  వశూలుచేశారు. అన్నం లేదు నీళ్ళు లేవు.
మరునాడు మధ్యాహ్నానికి ఓపిక నశించింది . మధ్యప్రదేశ్ లో అనుకుంటా ఇటార్సీ అనే శ్టెషన్ లో దిగిపోయాను జనాన్ని నెట్టుకుంటూ బయటకొచ్చి.  రెండునిమిషాలు గుండెల నిండా గాలిపీల్చుకునేసరికి గంగా కావేరి  ఆ శ్టేషన్ కొచ్చింది. టిక్కెట్ కొనేసమయం లేదు. ఏమైతే అదైందనుకుని  ఎక్కాను. దానిలోనూ బాగా జనం ఉన్నారుకాని కొద్దిగా కదలాడవచ్చు అటూ ఇటూ. అందులో పూర్వమెప్పుడో మధ్యప్రదేశ్ లో స్థిరపడ్డ తెలుగు ఫ్యామిలీ ఉన్నారు. వారితీ మాట కలిపి చిన్నగా సీటుసంపాదించుకున్నాను. మరుసటి పొద్దుటే విజయవాడ లోదిగాను. ఆరోజు శుక్రవారం. విజయవాడ చేరకముందే మాపిల్లవాడు మాలకొండారెడ్డికి ఫోన్ చేయగా వాడు  బైక్ తీసుకునివచ్చి స్టెషన్ బయట సిద్ధంగా ఉన్నాడు. ముందు  కృష్ణ కు పోనివ్వమని చెప్పి  శరీరం అలుపుతీరేలా  స్నానం  చేసి నేరుగా కొండ మీదకెళ్ళాను అమ్మనుచూసేందుకు . దివ్యమైన రూపంతో అమ్మ కిలకిలా నవ్వుతున్నది,. ఏరా! అన్నీచూసొచ్చావా ? బాగా అయిందా? అని ఎగతాళిచేస్తున్నట్లు తోచింది. నీకు అమ్మను నాన్నను,తీర్ధాన్ని క్షేత్రాన్ని, ధ్యానాన్ని,ధ్యేయాన్ని  అన్నీ నేనే....అన్నీ నేనే ...  అని అభయహస్తం చూపి అనునయించినట్లనిపించి అమ్మకు సాష్టాంగపడ్డాను/  రాత్రికి ఇంటికొచ్చి మందిరంలో అమ్మను చూడగానే అమ్మ కొంగుచాటున దూరి భయం తీర్చుకున్న బాలకునిలా అయింది మనస్సు.

అమ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే....

అదిగదుగో గంగమ్మ అగాథాల లోయలలో


గౌరీకుండ్ లో

 
 బదరీనాథుని దర్శనానికి వెళుతూ


 రుషీకేశ్ లో గంగమ్మ ఒడిలో


 హరిద్వార్ గంగా హారతి దర్శిస్తూ
కాశీనగరదర్శనం చేస్తూ గంగమ్మ ఒడిలో పడవపై





నేను ఇంటికొచ్చిన పదిరోజులకే          కేదారనాథుని క్షేత్రంలో విలయం సంభవించినది,   అక్కడ జరుగుతున్న అపచారాలనుచూసి ఏదో ఒకనాడు ముంపు వస్తుంది మనకు అనుకున్నాను కానీ ఇలా భీకరదృశ్యం  చూస్తాననుకోలేదు. ఎవరో ఇకచాలు పద ఇంటికి అని తరిమినట్లు అనిపించటం, నేను చార్ధామ్ యాత్రలో సగమే పూర్తిచేసుకుని వెనుకకు వేగంగా తిరిగిరావటం అంతా  అమ్మదుర్గమ్మ ఆజ్ఞ ఏమో ననిపిస్తున్నది


అప్పటి నుండి వ్రాయాలని అనుకుంటూన్నా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ ఇప్పుడు వ్రాయగలుగుతున్నాను ఇది.

 

Read more...

రామరాజ్యము -శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

>> Sunday, December 29, 2013

అలెగ్జాండరు చక్రవర్తి భారతదేశమున పంజాబ్‌ ప్రాంతములో ఒకానొక
గ్రామముగుండా పయనించుచుండెను. సేనాసమేతుడై అమాత్యశేఖరులతో గూడి ఆ
గ్రామమునందు పోవుచుండ ఆనతి దూరమున గ్రామస్థులందరు ఒకచోట గుమిగూడి తీవ్ర
వాదోపవాదములు గావించుకొనుచు సంఘర్షణకు దిగుచున్న దృశ్యమును చూచెను. ఇక
ప్రయాణమును నిలిపివైచి, మంత్రివర్యుని బిలిచి, ఆ వృత్తాంతమేమియో
తెలిసికొనిరమ్మని పంపెను. మంత్రిగారట్లే ఆ గుంపులో జొరబడి అచట జరుగుచున్న
విషయమంతయు సాంగోపాంగముగ తెలిసికొని తిరిగి రాజుయొద్దకు వచ్చి ఈ ప్రకారముగ
విన్నవించెను....

'మహాప్రభూ! ఆ గ్రామమున ఒక రైతు కలడు. అతనికి ఒక ఎకరము పొలము కలదు. దానిని
అతడు సమీప గ్రామమందలి మరియొక రైతునకు అమ్మివేసెను. పొలము కొన్న అసామి
దానిని దున్ను కొనుచుండగా నేలలో ఒక బంగారుపాత్ర కనిపించెను. దానిని
తీసికొని అతడు నేల అమ్మినరైతు యొద్దకుపోయి, అయ్యా! మీరు నాకమ్మిన నేలను
దున్నుకొనుచుండగా అందులో ఈ సువర్ణపాత్ర లభించినది. మీరు నేల
అమ్మినారేకాని అందులోని పాత్రను అమ్మలేదు. కావున ఇది మీసొత్తేకాని
నాదికాదు. అందుచేత దీనిని మీరు పరిగ్రహించి నాకు మనస్సంతోషమును
కలుగజేయుడు అని విన్నవించుకొనెను. ఆ వాక్యములను విని నేల అమ్మినరైతు
ఇట్లు సమాధాన మొసంగెను - "అయ్యా! నేను ఏ క్షణమందు మీకు నా నేలను
అమ్మినానో, అందులోని సమస్త పదార్థములున్ను మీవశమే అయిపోయినట్లు లెక్క, ఇక
వాటితో నాకు ఎలాంటి సంబంధమును లేదు. కాబట్టి దయచేసి ఈ బంగారు పాత్రను
మీరే ఉంచుకొని అనుభవించుడు!"

కాని నేల కొన్న పెద్దమనిషి అందులకు అంగీకరించలేదు. బలవంతముగ దానిని
ఇచ్చివేయ దలంచెను. ఈ ప్రకారముగ ఇరువురి మధ్య వాదోపవాదములు చెలరేగెను.
ఇరువురి పక్షములను సమర్థించంటకు వారి వారి అనుయాయులు కూడ చాలమంది అచటికి
వచ్చి చేరిరి. కొద్దిసేపటికి గుంపు చేరిపోయెను. ఆ వింత చూచుటకై
ఎక్కడెక్కడి జనులో పరుగున వచ్చిచేరిరి. అరుపులు, కేకలు, ఈలలచే ఆ ప్రదేశ
మంతయు ప్రతిధ్వనించెను.

ఇంతలో కొందరు పెద్దమునుష్యులు అచటికి వచ్చి ఇరువురికి రాజీ కుదర్చ
దలంచినవారై పొలము అమ్మినవానిని "అయ్యా! మీకు సంతానము కలదా? అని ప్రశ్నింప
'నాకొక కుమారుడు కలడు. వివాహమునకు సిద్ధముగా నున్నాడు అని అతడు
ప్రత్యుత్తరమిచ్చెను. అట్లే ఆ మధ్యస్థులు పొలము కొన్నవానిని మీకు సంతానము
కలదా? అని ప్రశ్నింప నాకొక కుమార్తె కలదు. వివాహమునకు సిద్ధముగా నున్నది.
అని యాతడు పలికెను. అపుడు మధ్యస్థులు ఇరువురి వాక్యములను ఆలకించినవారై ఈ
ప్రకారముగ ఇరువురికి రాజీచేసిరి - పొలము కొన్న వాడు తన కుమార్తేను పొలము
అమ్మినవాని కొమారున కిచ్చి వివాహము చేసి ఆ బంగారుపాత్రను కట్నముగా
నొసంగవలెను. మధ్యస్థుల ఆ సమయోచితమైన తీర్పుచే అ బంగారుపాత్ర ఇరుపక్షములకు
చెందిపోయెను. మధ్యస్థుల ఆతీర్పును ఇరువురును సంతోషముగ ఆమొదించి అ
ప్రకారముగ కార్యాన్విత మొనర్చిరి.

ఇదియే రామరాజ్యము. ప్రజల ఇట్టి మనస్తత్వమే రామరాజ్య చిహ్నము. పరస్పర
ప్రేమ, అనురాగము, కరుణ, దయ, పరోపకారము, స్వార్థత్యాగము - ఇట్టి
ఉదాత్తగుణము లెచట తాండవించు చుండునో, అదియే రామరాజ్యము, ఏ ప్రజలిట్టి
మహోన్నత సద్గుణరాశిని అవలంబించియుందురో వారే రామరాజ్య ప్రజలు. అట్టివారు
ఏ క్షోభయులేక పరమ
శాంతముగ తమతమ జీవితములను కొనసాగించుచుందురు. కావున శాంతి
సౌభాగ్యములను వాంఛించు ప్రతిమానవుడును తన హృదయమును పవిత్రముగను,
నిర్మలముగను, సచ్ఛీలవంతముగను గావించుకొనవలయును.

నీతి: పవిత్రమగు శీలము, నిర్మలహృదయము, సదాచరణ, పరోపకారభావన,
త్యాగశీలత్వము జనులు కలిగి యుండినచో, అదియే రామరాజ్యము కాగలదు. అట్టి
రామరాజ్యస్థాపనకే జనులు యత్నించవలయును. 

[kbn sharma]

Read more...

మనం నిర్వహించే శ్రాద్ధకర్మలు చనిపోయిన వారికి ఎలా అందుతాయి?

>> Monday, November 11, 2013

దేవ ఋణం అంటే?
మనం పీల్చుకోవడానికి ప్రాణవాయువు, మనల్ని మోస్తూ పంటలివ్వడానికి భూమి, మన అవసరాలను, దప్పికను తీర్చే జలము మొదలగు ఈ పంచ భూతాలే మన జీవితానికి ఆధారములు.  ఇవి భగవంతుని సృష్టిలో భాగములే.  అట్టి ఈ పంచభూతాలే మనకు ప్రత్యక్ష దేవతలు.  వాటికి మనం ఎంతో ఋణపడి ఉన్నాం.  నీటి నిచ్చినందుకు జలం, వెలుగునిచ్చి నందుకు సూర్యుడు, ప్రాణాన్నిచ్చినందుకు గాలి మననుండి ప్రతిఫలం ఆశించడం లేదు కదా!! కనుక వాటిపట్ల కృతజ్ఞతా భావనతో ప్రతినిత్యం గృహంలో భగవదారాధనను నిర్వర్తించుటచే దేవ ఋణం తీరుతుంది. 

ఋషి ఋణం అంటే?
మన శాస్త్రాలకు, సంస్కృతికి మూలం ఋషులు.  వాటిని ప్రసాదించిన వారికి ఋణపడి యున్నాము.  భౌతికంగా వారు మన ముందు లేకపోయినా, మన గురువును వారి ప్రతిరూపంగా భావించి, సద్బుధ్ధితో వారిని సేవించాలి.  వారు మనకందించిన శాస్త్రములను అధ్యయనం చేసి దానిని ఆచరించడం ద్వారా ఋషి ఋణాన్ని తీర్చుకోవచ్చు. 

పితృ ఋణం అంటే?
మన జన్మకు కారకులైన తల్లి దండ్రులకు మనం ఋణపడి వున్నాం.  వారు జీవించి ఉన్నంత కాలం కంటతడి పెట్టకుండా చూసుకోవాలి.  మన వలన వారు ఏనాడూ  కష్టపడకూడదు.  ఎన్నడూ బాధ పడకూడదు.  అంతేకాదు వారు మరణించిన పిదప శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటి కర్మలను ఆ తిథినాడు విధిగా నిర్వర్తిస్తూ పితృ ఋణం తీర్చుకోవాలి.   

మరణించిన తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేయాలా? 
తల్లిదండ్రుల ఋణాన్ని శ్రాద్ధ కర్మలను ఆచరించుట ద్వారానే తీర్చుకోగలము.  శ్రద్ధతో చేసేదే శ్రాద్ధమంటారు.  మన జన్మకు కారకులై, మనలను పెంచి పోషించినందుకు కృతజ్ఞతగా వారు జీవించి యున్నంతవరకు వారికి కావలసిన వసతి సౌకర్యాలను ఏర్పరచి సుఖ పెట్టాలి. అనంతరం వారికి శ్రాద్ధ విధులు నిర్వహించి ఋణం తీర్చుకోవాలి. 

మనం నిర్వహించే శ్రాద్ధకర్మలు చనిపోయిన వారికి ఎలా అందుతాయి? 
"ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ" ఋణానుబంధ రూపమే ఈ జన్మ. ప్రతి వ్యక్తికీ ఈ లోకంతో ఋణముంటుంది. తల్లిదండ్రుల ఋణాన్ని కొడుకు తీర్చడమే మన హిందూ సంస్కృతిలో విశిష్టమైన అంశం.  వారి ఋణాన్ని తీర్చేందుకై కొడుకు నిర్వహించే శ్రాద్ధ కర్మలను పితృలోకంలో వసించే పితృదేవతలు స్వీకరిస్తారు.  తద్వారా ఋణ విముక్తులై వంశాభివ్రుద్ధిని, శాంతిని పొందుతారు.  

స్వర్గస్థులైన తల్లిదండ్రులకు బ్రహ్మకపాలంలో శ్రాద్ధకర్మలు చేస్తే మరింక ఎప్పుడూ చేయనవసరం లేదని అంటారు.  అది నిజమేనా? 
మహాదోషం.  అది బద్ధకానికి, సోమరితనానికి నిదర్శనం.  అనుకోని అవాంతరం ఎదురై శ్రాద్దకర్మ చేయలేకపోతే అప్పుడు బ్రహ్మకపాలంలో చేసిన తీర్థవిధి రక్షిస్తుంది. అంతేకాని మనం ఇంట్లో మూడు పుటలు సుష్ఠుగా తింటూ, సంవత్సరానికి ఒక్కసారి పెట్టే శ్రాద్ధాన్ని విస్మరించడం దోషం. బ్రహ్మకపాలం పేరు చెప్పుకుని మీ కపాలాన్ని సోమరితనానికి గురి కానివ్వకండి. 

భూత ఋణం అంటే? 
మనకు నిత్యజీవితంలో ఎన్నో జీవరాశులు సహకరిస్తున్నాయి.  కనుక వాటిపట్ల మనం ఋణపడి ఉన్నాము.  క్రిమి, కీటకాల వంటి అల్పజీవుల పట్ల కూడా దయ, జాలి గలిగి మెలగాలి.  ఈ ప్రకృతిలో మనతో పాటు జీవించే సర్వహక్కులు వాటికీ ఉన్నాయి.  వాటిని హింసించడం, చంపడం వంటి క్రూరమైన చర్యలు మానుకుని వాటి జీవనానికి సహకరించుట ద్వారా భూతఋణం తీర్చుకోవచ్చు. 

అతిథి ఋణం అంటే? 
"అతిథిదేవోభవ" తిథి, వార నక్షత్రాలు చూడకుండా వచ్చే వాడే అతిథి.  అట్టి అతిథిగా మన ఇంటికి విచ్చేసే వారిని సత్కరించాలి.  వారిని చులకనగా చూడడం, తూలనాడడం చేయకూడదు. వారిని తగు రీతిలో సత్కరించుటయే గృహస్థుల ధర్మం. 

​అతిథులను సత్కరించుకునే భాగ్యం మనకు కలిగించినందుకు అతిథిని అభినందించాలి. తక్కిన ఆశ్రమవాసులైన బ్రహ్మచారులను, వానప్రస్థులను, సన్యాసులను గృహస్తులే పోషించి ఆదరించాలి.  ఈ రకంగా పంచ ఋణాలను తీర్చుకుంటూ పిల్లలను సంస్కార వంతులుగా తీర్చిదిద్ది, పెద్దల పట్ల బాధ్యతలను నెరవేరుస్తూ, సద్గురువు నాశ్రయించి, గురువు ఉపదేశించిన వాక్యాలతో జీవితాన్ని సంస్కరించుకునే సాధకుడు ధన్యుడు, కృతకృత్యుడు. 

Read more...

ఆహిరి-రాగంపైన ఒక చిన్నకథ!

>> Saturday, July 27, 2013



ఇది ఒక పెంకె సంగీతసాధకుడి కథ అని చెప్తారు.
శాస్త్రప్రకారం ఆహిరిరాగాన్ని ఉదయం పాడకూడదని పెద్దలమాట. (పాడితే పగటిపూట భోజనం దొరకదని నమ్మకం.) ఒక యువగాయకకిశోరం 'ఎందుకు కాదు?' - అని గురువుదగ్గర గొడవచేసి, ప్రొద్దున్నే నేర్పమని అడిగాడట. గురువు మాత్రం సాయంత్రపు కాలాల్లోనే నేర్పి, 'బాబూ! నీతో నేను ప్రొద్దున్న ఆలాపన చేయను, నీకు కావలసివస్తే విడిగా ప్రయత్నించుకో!' అన్నాడట!
ఇతగాడు ఏమైనా మాటను తప్పుగా ఋజువుచేయడంకోసం ఒకరోజున ప్రొద్దున్నే చద్ది-అన్నపు మూటని కట్టుకుని, ప్రక్క ఊరి పొలిమేరలకు వెళ్ళాడట. అక్కడ మూటను ఒక వెదురుచెట్టుకి కట్టి, తన సాధన మొదలుపెట్టాడట. అయితే, వెదురుచెట్లకి ఒక లక్షణం ఉంది - ప్రొద్దెక్కుతున్నకొద్దీ అవి పైపైకి లేచిపోతాయి! ఇతడు తన సాధనను పూర్తిచేసుకునేసరికి, మూట అందనంత ఎత్తుకి వెళ్ళిపోయిందట!

తన ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా భోజనం కావాలని అడుగుదామంటే - తిండిమాట అటుంచి, చీవాట్లు తినవలసివస్తుందనే భయంతో మనవాడు ప్రక్క ఊరికి వెళ్ళి, అసలు సంగతి చెప్పకుండా ఒకరింట్లో భోజనం కావాలని అడిగాడట. వాళ్ళు ' దానికేం బాబూ, నీ అదృష్టం బాగుంది, ఈ ఇంటాయనకి లేకలేక కొడుకు పుట్టాడు, ఈవేళ బారసాల, కాబట్టి విందుభోజనం దొరుకుతుంది నీకు’ అని చెప్పారట. మనవాడు పంక్తిలో కూర్చుని, తాను శాస్త్రాన్ని అబద్ధంగా ఋజువుచేయగలుగుతున్నందుకు సంతోషంతో అప్రయత్నంగా 'నా ముద్దుల ఆహిరీ!’ అన్నాడట! వీడి ఖర్మకాలి, ఆ ఇంటాయన భార్య పేరు కూడా ఆహిరే!

ఇది విన్న చాలామందికి కోపం వచ్చి, మనవాడిని చిత్తుగా తన్ని, సామాను గదిలో పడేశారట!

అలా సాయంత్రంవరకు అక్కడే పడి ఉన్నాడు మనవాడు. సాయంత్రం వీడి సంగతి జ్ఞాపకం వచ్చి, ఆ గదిని తెరిచి మళ్ళీ తన్నారట! వీడు అప్పుడు వాళ్ళని బ్రతిమాలి, సంగతంతా చెప్పాక, వాళు నొచ్చుకుని, అప్పుడు భోజనం పెట్టారట. అయితే, అప్పటికే పగలు ముగిసిపోయింది!

Read more...

విష్ణువుకు ప్రియమైన తొలి ఏకాదశి

>> Thursday, July 18, 2013


ప్రధమైకాదశి అను సంస్కృతి నామాన్ని బట్టి తెలుగు వారు దీనిని తొలి ఏకాదశి అని వ్యవహరి స్తున్నారు. సంవత్సరానికి 24 ఏకాదశులు... అందునా అధికమాసంలో ఇరవై ఆరు ఏకాదశు లు వచ్చినా ప్రధమైకాదశి, మహా ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశిని గొప్పగా చెప్పడానికి కారణాలు వున్నాయి. సంవత్సరానికి అయనములు రెండు. అందునా దక్షిణాయన పుణ్యకాలం యందు పం డుగలు అధికంగా వస్తాయి. అంతేకాక ఆరోగ్యం కోసం నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవస రం రీత్యా పెద్దవారు అనేక వ్రతాలు పెట్టారు. అట్టి పండుగలను ప్రారంభం ఈ ఏకాదశి నుంచే.ఇంకో విధంగా చూస్తే చాతుర్మాస్యదీక్ష దినాల ఏకాదశుల్లో మొదటిది కావడం వలన కూడా దీనికి ప్రధమైకాదశి అని పేరు వచ్చింది. అసలు ఈ తొలి ఏకాదశి పండుగ గురించి బ్రహ్మవైవర్త పురాణం లో వివరంగా ఉంది. ఈ ఏకాదశి విశిష్టమైనది. విష్ణుమూర్తికి ప్రియమైనది. ఈ రోజు హరిశయ నోత్సవం జరుపుతారు. శేషశాయి అయిన లక్ష్మీనారాయణలిరువురినీ కూడా భక్తితో శ్రద్ధగా పూజి స్తారు. కనీసం ఈనాడు ఏకభుక్తమైనా ఉపవాసం ఉంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతారం భం. శివ విష్ణు భక్తులిద్దరూ చేసే వ్రతమిది.
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే ఏకాదశి అంటారు.
ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.
ఏకాదశి రోజున శ్రీహరిని పూజించండం మంచిది

ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు.
ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై పండుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాలలో చెపుతారు. అం టే వ్రతము తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చేస్తారు. ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు.
అయితే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించుట వల్ల హరిశయనైకాదశి అనే పేరు కూడా ఉం ది. అలాగే శయనైకాదశి అని కూడా అంటుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తొలి ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఎందుకంటే పండుగల ప్రారంభానికి పండుగగా!
తినగూడని, విసర్జించవలసిన పదార్థాలు...
గుడం (బెల్లం), తైలం (నూనెలు), కాల్చినవి, మాంసాహారం, కొత్త ఉసిరి, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, మంచంపై పడుకొనుట, బయట భుజించుట తగవు. ఈ నాలుగు నెలలు ఇవన్నీ పనికి రానివిగా గుర్తించాలి. బుద్ధుడు చాతుర్మాస్య వ్రతమాచరించినట్లు జాతక కథలలో చాల చోట్ల చెప్పబడింది. జైనులు (అహింసా వ్రతాన్ని పాటిస్తారు). చాతుర్మాస్య వ్రతాన్ని వారు పాటిస్తారు నేటికీ!అసలు ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చతుర్మాస్య వ్రతాకల్పం ప్రారం భించాలని భగవంతుడు యుధిష్ఠరునకు చెప్పినట్లు అందున్నది. ఈ వ్రతంలో పిప్పల వృక్షం ప్రధానం అంటే ఆ వృక్షానికి ప్రదక్షిణ, దేవాలయాల్లో దీపారధన, ఈ వ్రతంలో సరస్వతీ పూజ కూడా ఉంది.
శ్రీ నారాయణ స్తుతి...
సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్భవమ్‌
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్‌
అంటే... అనంత శిరస్సులు, అనంతమైన నేత్రములు కలవాడు, విశ్వమంతటికీ సుఖములు కలిగించేవాడు, సర్వ ప్రాణులనూ ఆధారభూతుడు, శాశ్వతుడు, అన్ని లోకాలకు శుభములను కలిగించే వాడు, మంగళ కరుడు, మోక్ష ప్రదాత అయిన శ్రీ మహా విష్ణువుకు నమస్కారం!
అసలు చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి!...

ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి. విష్ణువును నివేదన చేశాకనే! ఆహారం తీసు కోవాలి. యతులకు ఇది చాలా ముఖ్యమైన వ్రతం. గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని చేయచ్చు.
బౌద్ధులలో చాతుర్మాసం...
చాతుర్మాస్య వ్రతం హిందువులలోనే కాక బౌద్ధమతస్థులలో కూడా వుంది. వారికి జూలై నెల లో ఏదో ఒక రోజున బర్మియు వాసో అనే మాసం ఆరంభమవుతుంది. ఆ వాసో మాసపు పూర్ణిమ రోజున బౌద్ధుల చతుర్మాస్య వ్రతం మొదలవుతుంది. క్రైస్తవ మతంలో లెంట్‌ నామంతో నలుబది దినాల ఉపవాసాల పండుగగా క్రైస్తవులకు ఉందనవచ్చును. అంటే హిందు, బౌద్ధ, క్రైస్తవులలో రకరకాలుగా చెప్పవచ్చును.
బౌద్ధుల చాతుర్మాస్య వ్రతంలో వాసో వృక్షం, పంచశీల పఠనం రెండూ ప్రధానంగా వుంటా యి. బౌద్ధ యువతీ, యువకులు పౌర్ణమి వెళ్ళిన తర్వాత కలసి వనాలకు వెళ్ళి పసుపు పచ్చని పూలతో ఆకర్షణీయంగా పూచిన వాసో వృక్షం పుష్పాలని గంపల కొద్దీ తీసుకెళ్ళి బుద్ధ దేవునికి స్తారు. బౌద్ధ విహారాల్లో, గృహ దేవతా పూజకీ బాగా వాడతారు.
అయితే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండలేకపోయినా చతుర్మాస్యాల్లోని (8 ఏకాదశులు కదా నాలుగు నెలలకి) ఏకాదశులైనా మనం ఉపవాసం వుంటే మంచిది. (వంకాయ, రాగి, తరుబూజ ఈ ఏకాదశుల్లో తినగూడదని శాస్త్ర వచనం).అయితే యతులకు ఈ వ్రతం ఆచరించటానికి కొన్ని సూచనలున్నాయి. వ్యాస మహర్షిని పూజిం చాలి, ముండనం చేయించుకోవాలి, మరల వ్రతం సమాప్తం అయ్యే వరకూ క్షవరం పనికిరాదు.చాతుర్మాస్య వ్రతం అయ్యేదాక నిమ్మపళ్ళు, అలసందెలు (బొబ్బర్లు), ముల్లంగి, గుమ్మడి, చెరుకు... వీటిని వర్జించాలిట.
మొదటి నెల కూరలు, రెండో నెల పెరుగు, మూడవ నెల పాలును, నాల్గవ నెల ద్విదళ పత్ర శాకములున్నూ అన్నంతో అధరువులుగా వాడచ్చు. (కూరలు, పచ్చళ్లు మొదలైనవి ఏవీ తీసు కొనరాదు). ఇవన్నీ శరీర స్వాస్థ్యం కోసమే. సన్యాసి అంటే ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊరిలో గడిపేటటువంటి వాడై (అతన్నే గ్రామైక రాతడు అంటారు) వుండాలి. అయితే వర్షాకాలము నాలుగు నెలలు అతడు ఒక్క చోటనే గడపవచ్చును. అలా గడపటాన్ని చాతుర్మస్య వ్రతంగా పేర్కొంటారు.
అయితే ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు (కార్తీక శుద్ధ ఏకాదశి వరకు) ప్రతి దినం ఆవుల కోష్టాన్ని పరిశుభ్రం చేసి, అలంకరించి, బియ్యపు పిండితో 23 పద్మాలు వేసి, గంధ పుష్పాక్షతలతో పూజించి, ప్రదక్షణ నమస్కారాలు చేసి, పద్మాలు ఎన్ని ఉన్నాయో అన్ని అప్ప ములను, వాయనములను బ్రాహ్మణులకు ఇవ్వాలి.
కొట్టాల నడుమ మండపం ఏర్పరచి అందులో విష్ణువు ప్రతిమనుంచి ఆరాధించి, గోవుల్ని పూజించాలి అంటారు. ఈ ప్రధమ ఏకాదశికి పండరీపురంలో పెద్ద జాతర జరుగుతుంది. సతీసక్కుబాయి ముక్తి పొం దింది ప్రధమ ఏకాదశి నాడే అని మహారాష్టల్రో ఆ మహాసాధ్వి గుర్తుగా ఉత్సవాన్ని జరుపుతా రు. అయితే ఆంధ్ర దేశంలోనూ అత్యంత ఘనంగా అన్ని వైష్ణవాలయాల్లో ఈ నాటి రాత్రి విష్ణు శయన వ్రతాలు చేస్తారు. ఈనాటి నుంచి నాలుగు మాసాల పాటు ప్రతిదినము పురాణ గ్రంథా లు పఠిస్తారు.
ఉభయ గోదావరి జిల్లాలలో...
మాగాణి గ్రామాల్లో వ్యవసాయదారులు ఆనాడు కొత్త పాలేరుని కుదుర్చుకుంటారు. తొలి ఏకాదశి నాడు గాని, ఆ మర్నాటి నుంచి గాని క్రొత్త పాలేరును పిలిచి కొత్త బట్టలు ఇచ్చి పండి వంటలతో భోజనం పెట్టటం ఆనవాయితీ.
గుంటూరు జిల్లాలో...
దీన్ని ఈ ప్రాంతం వారు పేలపుపిండి పండుగ అంటారు. అంటే పేలాలు విసిరి బెల్లంలో కలుపుకొని తింటారని, దాన్ని వంట మీద జల్లుకుంటారని అది వారి ఆచారమని కొందరు అంటుంటారు.
నెల్లూరు పరిసరాలు...
ఏరు ముందా? ఏకాదశి ముందా? అని అక్కడ సామెతలు. పెన్నా నదికి ఆ సమయానికి కొత్త నీరు వస్తుందని ఈ ఏకాదశికి కొంచెం ముందు వెనుకగా! ఏరువాక పనులకి ఉత్కంఠంగా ఎదురు చూసే నెల్లూరు ప్రాంతవాసులకి ఇది ఆనందకరమైన పండుగ!ఇక హిందువులు ఈనాడు రాత్రి పూట సంపూర్ణంగా విష్ణుమూర్తి దేవాలయాల్లో విష్ణుమూర్తిని ఆభరణాదులతో అలంకరించి జాజి పువ్వులతో పూజించి, పవళింపు సేవ చేసి, కీర్తనలు పాడి, విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తారు. ప్రతి పండుగకి పరమార్ధం వుంది. ప్రతి పండుగకి విశిష్టతతో పాటుగా ఆచరించాల్సిన ఆరోగ్య సూత్రాలు సమ్మిళితమై వున్నాయి. దాన్ని సద్వినియోగ పరచుకొని ఆరోగ్యం, ధాన్యం, భక్తి, ముక్తి పొందటం మానవ ధర్మం!
ఇవాల్టి ప్రధమకృత్యం బౌద్ధ భిక్షువులకు బహుమానాలు. గృహస్థులు కొందరు కలసి బహుమాన ప్రధానాలు చేస్తారు భిక్షువులకు! అసలు బౌద్ధభిక్షువులు బర్మా భాషలో పొంగేయిన్‌ అంటారు. బహుమతులు తీసుకున్న బౌద్ధ భిక్షువులు తివాసీలు పరచిన అరుగుమీద కూర్చొని పంచశీలాలు పేర్కొంటారు. అది విని మిగిలిన ప్రజలు తిరిగి చెపుతారు. దాని తర్వాత అంతా విందు భోజనాలు. ఆ తర్వా త గృహస్థులు ఫలహారాలు స్వీకరిస్తారు. బౌద్ధ భిక్షువులకు వారిచ్చే బహుమానాలు కొత్త దుస్తులు, పాదుకలు, గొడుసలు, కంబళ్లు... వారి ఆశ్రమవాసానికి ఉపయోగపడేవి వుంటాయి. వాసో నెలలో ప్రారంభం అయ్యి తాడిం గ్యూట్‌ అను నెలలో ముగుస్తుంది (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌... నాలుగు మాసాలు నడుస్తుంది).
ఈ నాలుగు మాసాలు వారు తమ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళరు. వెళ్లాల్సి వచ్చినా అక్కడ నిద్రించక ఆ రాత్రికే తమ ఆశ్రమానికి వస్తారు. బౌద్ధుల అభిప్రాయం మానవలోకం కన్నా ఉత్తమమైన లోకంలో బుద్ధుడు ఈ నాలుగు నెలలు తల్లితో వుంటాడని అంటే మాతబోధ, జ్ఞానబోధతో, ఉపవాసాలతో, ప్రార్ధనలతో ఈ నాలుగు నెలలు వెళ్లదీస్తారు.నాలుగు నెలల చివరికి (తాడిం గ్యూట్‌ మాసం పౌర్ణమినాడు) చాతుర్మాస్య వ్రతానికి ఆఖరి రోజున వారి గురువైన బుద్ధుడు భూమి మీదకి వస్తాడని నమ్మకం! దీపతోరణాలతో ఆనాడు బుద్ధునికి అందరూ స్వాగతం ఇచ్చి ఉపచారాలు చేస్తారు!
అంటే ఈ తొలి ఏకాదశి నాడు హిందువులైన, బౌద్ధులైనా వారి వారి మతాన్ని, నమ్మకాన్ని విశ్వాసాన్ని, అనుసరించి వారి వారి దైవాలని ఎంతో శ్రద్ధగా, భక్తిగా, రంగరంగ వైభవంగా పూజించి ఉపవాసాలు వుండి భక్తితో కొలచి ధ్యానం చేస్తారు.ఆషాఢ శుద్ధమే ప్రధమైకాదశి. ఆరోగ్య నిమిత్తమే ఈ వ్రతమని పెద్దలు చెబుతారు.
వర్షాకాలం ఆరంభం కనుక క్రిమి కీటకాలకు పుట్టిల్లు. రోగాలు కొత్తవి పుట్టటం వల్ల ఇపుడు చెప్పిన (విస ర్జించవలసిన పదార్ధాలు) పదార్ధాలు తినకూడనివి అన్నీ త్రిదోష ప్రకోపనములే! అందువల్ల మిత పథ్యాహారలతో గడుపుట మంచిది.అసలు విష్ణువంటే సూర్యుడే. అంతవరకూ ఉత్తర దిక్కుగా వున్న సూర్యుడు ఈనాటి నుండి దక్షిణ దిక్కుగా వాలినట్లు కనపడటం వల్లే విష్ణువు శయనించాడని, ఈ రోజు గోపద్మ వ్రతమా చరించాలని పెద్దల సూచన!

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP