శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నేను నాల్గురోజులుంటాను, పోతాను, నీ వైభవం మాత్రం అమరం’ అని దేశమాతను సంభావించే స్థాయికి వ్యక్తి ‘వికాసం’ చెందడం నేటి అవసరం

>> Tuesday, September 6, 2011

- తాడేపల్లి హనుమత్‌ప్రసాద్

దేశ ఔన్నత్యమే తమ ఔన్నత్యంగా, జాతి పతనం తమ పతనంగా భావించే సుశిక్షితులైన సంస్కారవంతులైన ప్రజలు జాతికి, దేశానికి నిజమైన రక్షణ- అనేది చరిత్ర చెప్పే సత్యం. గతంలో , లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన బెన్గురియన్ ‘ఎంతమంది మీ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నారని అడిగితే ‘ఓ అయిదువేల మంది ఉండొచ్చని’ జయప్రకాశ్ చెప్పారట. కోట్లాదిమంది ఉన్న సమాజంలో 5000 మంది పనిచేయడమేమిటని ఆయన ఆశ్చర్యపోయాడు. తమ జాతికి చెందిన ప్రతి ఒక్కరూ ఇజ్రాయిల్ ఆవిర్భావం కొరకు ప్రయత్నించిట్టు ఆయన చెప్పారు. ఒక శాస్తవ్రేత్త ప్రేరణతో ఇజ్రాయిల్ ఆవిర్భావం జరిగిందని, ఒక నగరమేయరు కుమార్తె కూడ సరిహద్దుల్లో తుపాకీపట్టి గస్తీ కాసిందని ఇజ్రాయిల్ కథ విన్నవారికి తెలిసిన విషయమే. ఇజ్రాయిల్ లోప్రతి విద్యార్థినీ విద్యార్థి తమ చదువు తరువాత మూడేళ్లు సైన్యంలో పనిచేయాలి. అందుకే తమ చుట్టు ఉన్న అనేక అరబ్బు రాజ్యాల దాడుల నుంచి ఇజ్రాయిల్ ప్రజలు తమను తాము రక్షించుకోగలుగుతున్నారు.
కెనడావంటి దేశాలు స్వచ్ఛంద సేవక - వలంటీర్-దళాలను ప్రోత్సహిస్తున్నాయ. స్వచ్ఛందంగా వివిధ రకాల సేవలనందించేందుకు ముందుకు రమ్మని ప్రజలకు పిలుపునిస్తున్నాయ. వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. వారినుంచి తమ కళలను, విజ్ఞానాన్ని, సమయాన్ని, ధనాన్ని కోరడం జరుగుతుంది. ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికాలో స్వచ్ఛంద సైనిక శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. . తమ స్వంత ఖర్చులతో పౌరులు ఇందులో పాల్గొనేవారు. కేవలం సైన్యం మీదనే కాక, సుశిక్షితులైన పౌర సైన్యంమీద కూడా దేశం ఆధారపడాలన్నది వారి ఆలోచన. కీస్తుశకం 1910,1920 సంవత్సరాల మధ్య వివిధ సమయాల్లో ఈ శిబిరాలు జరిగాయి. పౌరులను భౌతికంగా బౌద్ధికంగా, ఆరోగ్యవంతంగా నీతివంతంగా తీర్చిదిద్దేందుకు ఈ శిబిరాలుఉపకరించాయి. అమెరికా ఆదర్శాలకనుగుణంగా జీవించే పౌర సమాజ నిర్మాణానికి ఈ శిక్షణ బాటలు వేసింది. బాల్యంనుండే వారికి దేశభక్తి పాఠాలు బోధిసున్నారు. ‘అవర్ ఫ్లాగ్’ అన్న పాఠంలో వారి దేశంకోసం త్యాగాలకు సిద్ధపడాలని బోధిస్తున్నారు. రష్యాలో ‘సోకాగొకాయ్’ అనే సంస్థ వ్యక్తిగత శీలాన్ని పెంపొందిస్తూ సామాజిక జీవనాన్ని బలోపేతం చేసేందుకు ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించేందుకు పని చేస్తున్నది.1970వ దశకంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ రష్యా వెళ్లినప్పుడు అప్పటి రష్యా అధ్యక్షుడు ఈ సంస్థ గురించి చెబుతూ,‘‘ మీ దేశంలో ఇలాంటి శిక్షణ ఇచ్చే సంస్థ ఉందా ?’’, అని అడిగితే ‘‘లేకేం మా దగ్గర రాష్ట్రీయ స్వయంసేవక సంఘం -ఆర్‌ఎస్‌ఎస్- ఉంది’’, అని ఆమె బదులిచ్చిందట. రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం జపాన్‌లో పౌర శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వబడింది. సామాన్య పౌరుడికి కూడా జపాన్ సంస్కృతి పట్ల అవగాహన, దేశంకోసం కావాల్సిన పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం, భావ పరివర్తన వంటి వాటి పట్ల శిక్షణఇస్తున్నారట. భారత్ కర్మభూమి.వేల సంవత్సరాల విదేశాల దాడుల్లో పతనమైన సమాజపు క్రమశిక్షణను దేశభక్తిని గాడిలో పెట్టేందుకు ఆయా సమయాల్లో చాణుక్యుడు పు ష్యమిత్రుడు, రాణాప్రతాప్,శివాజీ, గురుగోవింద్‌సింగ్ వంటి వారు ప్రయత్నించారు. పౌర సమాజంలో సైనిక లక్షణాన్ని పాదుకొలిపి దేశ రక్షణకు ప్రయత్నించారు. స్వాతంత్య్రానంతరం కూడా చిన్మయ నిషన్, రామకృష్ణమిషన్, వివేకానంద కేంద్ర వంటి అనేక సంస్థలు వ్యక్తులను, దేశ ధర్మాలకోసం తీర్చిదిద్దే ప్రయత్నం జరుపుతున్నాయి. వ్యక్తిగత పరమార్ధమే కాక జాతియొక్క సౌభాగ్యము, సంతోషం కోసం జనం శిక్షణ పొందితే అది జాతికి రక్షణ అవుతుంది. ‘నేను నాల్గురోజులుంటాను, పోతాను, నీ వైభవం మాత్రం అమరం’ అని దేశమాతను సంభావించే స్థాయికి వ్యక్తి ‘వికాసం’ చెందడం నేటి అవసరం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP