శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అంబళ్ పడి అళప్పల్

>> Sunday, August 26, 2018

అంబళ్ పడి అళప్పల్

గురువులకి సన్యాసులకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం భగవంతుని పైన నిశ్చలమైన సడలని విశ్వాసం. మహాస్వామి వారు అలాంటి విశ్వాసం కలిగిఉన్న వారిలో నిశ్చయంగా ఒకరు.

మహాస్వామి వారి తొలి యాత్రలలో భాగంగా శ్రీమఠం శిబిరం ఆంధ్రదేశం లోని ఒక చిన్న పల్లెటూరుకు వచ్చింది. అప్పట్లో మఠానికి సరిగ్గా నిధులు ఉండేవి కావు. కాని మహాస్వామి వారు ఎప్పుడూ దాని గురించి ఆలోచించేవారు కాదు. ఆ పల్లె ప్రజలు కూడా వారికి ఉన్నదాంట్లోనే మఠానికి కావాల్సిన పూజా ద్రవ్యాలు, భిక్ష, అన్నదానం మొదలగునవి సమకూరుస్తున్నారు. కాని వారు సమర్పించేవి ఒక్కరోజుకు కూడా సరిపోవటం లేదు. ఆ పరిస్థితి చూసి మఠం మేనేజరు మహాస్వామి వారికి, మరొక చోటికి వెళ్దామని మనవి చేసారు.

మహాస్వామి వారు ఆ ఊరి అందానికి, ప్రశాంతతకి ముగ్ధులై ఇంకా కొన్ని రోజులు ఉండగలిగితే వారు ధ్యానం చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. కాని ఉదయం పూజకు కూడా సంభారాలు ఏమి లేవని ఇక ఈ ఊళ్ళో ఎవర్నీ అడగి ఇబ్బంది పెట్టలేమని మేనజరు వారు మహాస్వామితో అన్నారు. రేపు మహాస్వామి వారి భిక్షకు కూడా ఏమి లేదని వాపోయారు. మహాస్వామి వారు నవ్వుతూ నేను ఉపవసిస్తాను నాకేమి అవసరం లేదులే అన్నారు. మేనేజరు వినమ్రతతో అది మహా పెరియవకు సులభం. కాని మఠం ఉద్యోగులకు, నాకు అది అసాధ్యం అని అన్నారు. అంతట మహాస్వామి వారు “కలత వలదు. అంబళ్ పడి అళప్పల్ (అంతా అమ్మవారు చూసుకుంటుంది అనే అర్థం ఉన్న తమిళ సామెత. పడి అనునది ధాన్యం కొలిచే ఒక పరికరం)”. ఎక్కడో ఉన్న ఈ పల్లెటూరిలో అమ్మవారు ఎలా చేస్తారు అని మేనేజర్ గారు చిన్నగా గొణిగారు. ఎవరైనా డబ్బు ఇచ్చినా కొనుక్కోవడానికి చాలా దూరం వెళ్ళాలి. చుట్టుపక్కల కూడా ఏమి దొరకని పస్థితి అని మహాస్వామి వారికి తెలిపారు. శ్రీవారు చిన్నగా నవ్వి వెళ్ళిపోయారు.

మేనేజరు గారు శిబిరం బయట నిద్రించాటానికి ప్రయత్నిస్తున్నారు. కాని వారికి ఉన్న బరువు బాధ్యతల వల్ల నిద్ర రావడంలేదు. రాత్రి 11 గంటల సమయంలో చక్రాల సందులో లాంతర్లు వేలాదదీసి ఉన్న కొన్ని ఎడ్లబండ్లు వరుసగా రావడం ఆయన గమనించారు. వారు శిబిరం దగ్గరకు రాగానే బండి నుండి ఒకడు మేనేజరు దగ్గరకు వచ్చి, దక్షిణ దేశం నుండి వచ్చిన సాధువు ఉన్న చోటు ఎక్కడ అని అడిగాడు. అతను ఇదే అని చెప్పగానే వారి నాయకుడు వచ్చి “మేము దగ్గరలోని పల్లె నుండి వచ్చాము. పండిన పంటలో మొదటి ధాన్యపు రాశిని ఊరి దైవానికి ఇవ్వడం మా ఆచారం. ఈ సాధువు గురించి విన్న తరువాత ఈసారి మొదటి పంట వీరికి ఇద్దామని వచ్చాము” అని మేనేజరు వారితో చెప్పాడు. ఉదయం మళ్ళా అందరూ పనులకు వెళ్ళాలి కాబట్టి ఈ రాత్రికే ఇవ్వాలని వచ్చారు.

మేనేజరు వారికి ఈ విషయం విన్న తరువాత నోట మాట రాలేదు. కొద్దిసేపటి తరువాత సంభాళించుకుని లోపలికి వెళ్ళి మహాస్వామి వారిని మేల్కొలిపి విషయం తెలియపరచి సంభారములు తీసుకోవడానికి వారి ఆనుమతి తీసుకున్నారు. మహాస్వామి వారు బయటకు వచ్చి అక్కడున్న వారందరిని అనుగ్రహించి ఆశీర్వదించారు. ఆ ఊరి పెద్ద వినయంగా మహాస్వామి వారితో వాళ్ళ ఆచారం ప్రకారం వాటిని అర్పిస్తాము అని మహాస్వామి వారి అంగీకారం తీసుకున్నాడు.

వాళ్ళు పడిని(ధాన్యం కొలిచే సాధనం) తీసుకుని వాటినిండా ధాన్యం కూరగాయలు పోసి అక్కడున్న మఠం బుట్టల్లోకి వంపారు. మేనేజరు ఈ సంఘటనను చూసి కన్నీరు కారుస్తూ అర్ధరాత్రి అమ్మవారు ఇచ్చిన “అంబళ్ పడి అనంతళ్” అంటూ అలా నిలబడిపోయారు. మహాస్వామి వారు అక్కడున్న కూరగాయల్లో నుండి గుమ్మడికాయను తీసుకుని మేనేజరుకు ఇచ్చి, “నువ్వు రేపు హాయిగా నీకు ఇష్టమైన పాల కూటు చేయించుకో“ నువ్వేమి ఉపవసించాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

చిత్రలేఖనం - సుతన్ కాళిదాస్ (హరిహర సుతన్), చెన్నై

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP