శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరిత్ర 30,31,32,33

>> Sunday, June 3, 2012


మధ్యాహ్నం ఆశ్రమమునకు తిరిగి వచ్చి చూడగా అక్కడ ముగ్గురు నలుగురు పరమహంసలు ఏదో విషయమును గూర్చి చర్చించటానికి కూర్చున్నారు. వారిముందు దేవనాగరి లిపిలో ఉన్న 25-30 వ్రాత ప్రతులుండినాయి. స్వామీజీ మంగళదాసుని పిలిచి ఒక పుస్తకమును తెప్పించి అందులో ఒక భాగమును తెరచి, వారికి తెలుపవలసిన విషయమును చూపించారు. వారి జిజ్ఞాసకు తగిన సమాధానం చూపించారు. అట్లా సాయంకాలంవరకు ఆ ముగ్గురు నల్గురు పరమహంసలు తమ సందేహ నివృత్తి చేసుకొన్నారు. సంధ్యా సమయంలో ఆకాశం మేఘావృతమైంది. వెంటనే వారు ముగ్గురు స్వామివారి వద్ద అనుజ్ఞ తీసుకొని వెళ్లిపోయారు. నేను కూడా వెళ్లిపోవటానికి అనుజ్ఞ అడిగాను. కాని నన్ను వారు కూర్చోమని ఆదేశించారు. కొద్దిసేపటికి బ్రహ్మాండమయిన వర్షం ప్రారంభమయింది. రెండు గంటలవరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉండింది. రాత్రి చాలా పొద్దుపోయింది. వర్షం తగ్గకపోగా ఉద్ధృతమయింది. భయంకరమైన ఆ అంధకారంలో ఇంటికి వెళ్ళకుండా నేను అక్కడే ఉండిపోదామనుకొన్నాను. ఆ సమయంలో స్వామివారు నన్ను దగ్గరకు పిలిచి ఇంటికి వెళ్ళమని చెప్పారు. నేను వారి ఆదేశమును విని ఎంతో విచారించాను. ఎందుకంటే ఆ స్థితిలో ఇంటికి వెళ్ళడం మానవుని శక్తికి మించిన పని. అందువలన వర్షం వెలిసేంతవరకు ఆగుతానని వారితో చెప్పాను. కాని స్వామివారు అప్పుడే వెళ్లిపొమ్మని ఆజ్ఞ ఇచ్చారు.
నేను మంగళదాసుతో ‘‘ఈవేళ ఎందువల్లనో స్వామివారు కఠినమైన ఆదేశం ఇచ్చారు. నేను ఎంత కష్టపడవలసివస్తుందో? గొడుగు లేదు. వెలుతురు లేదు. పైగా భయంకరమైన అంధకారం, నాల్గుదిక్కులా జడివాన, భయంకరమైన మేఘగర్జనలు, మెరుపులు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎట్లా వెళ్లాలి? నాకు బాధ తప్పదు అని అన్నాను. మంగళదాసు ‘‘మీరు భయపడవలసిన పనిలేదు. బాబాగారి ఆజ్ఞను పాలించండి. బహుశః దీనిలో వారి ఉద్దేశ్యము ఏదో ఉండి ఉంటుంది’’ అని అన్నాడు.
నేను ఏవేవో ఊహిస్తూ స్వామివారికి నమస్కరించి, వారి పాదదూళిని నుదుట గ్రహించి తలుపు బయటకు వెళ్లాను. అక్కడ జడివాన కురుస్తున్నది. కాని ఒక్క వర్షపు బిందువు కూడా నామీద పడటంలేదు. ఆ విధంగా కొద్ది దూరం వెళ్ళగానే ఒక బాబుగారు లాంతరు పట్టుకొని నా ముందు నడవసాగారు. ఆ వెలుతురును చూచి నేను గట్టిగా అరచి- ‘‘అయ్యా! మీరు ఎటు వెళ్తారు’’ అని అడిగాను. జవాబు రాలేదు. నేను తొందరగా నడుస్తున్నాను. కాని ఆ లాంతరు పట్టుకొని నడిచేవారిని పట్టుకోలేకపోయాను. అప్పుడు నేను పరిగెత్తసాగాను. అయినా ఆయనను అందుకోలేకపోయాను. విచిత్రమేమిటంటే మొదట నాకు ఎంత దూరంలో ఉన్నారో, పరిగెత్తినపుడు అంతే దూరంలో ఉన్నారు. నేను మళ్లీ మెల్లగా నడవసాగాను. నాకు ఆ లాంతరు వెలుతురు బాగానే కనబడుతున్నది.అలాంటప్పుడు నేను ఎందుకు కష్టపడి ఆయన వద్దకు వెళ్లాలి అనుకొన్నాను. లాంతరు పట్టుకొని వెళ్లేవారు ఇదివరకటిలాగానే నా ముందు మెల్లగా నడుస్తున్నారు. నాకు వెలుతురు కనిపిస్తూనే ఉన్నది. నా లక్ష్యం వెలుతురు మీద తప్ప వేరేదానిపైన లేదు. వర్షపునీరు నా కాళ్ళకు తగులుతున్నదే కాని శరీరానికి ఎక్కడా తగలటం లేదు. ఏ కారణంవల్ల నేను ఆ విధంగా అంత సుఖంగా వెళ్తున్నానో దానిని గూర్చి నా మనస్సులో ఏ మాత్రం ఆలోచన లేదు. నేను ఇల్లుచేరుకొన్నాను. లాంతరు పట్టుకున్న వ్యక్తి అదృశ్యులయ్యారు. ఒక్కసారి నేను ఆశ్చర్యచకితుడనయ్యాను.


  • తెలుగు అనువాదం: ఆచార్య హరిశివకుమార్ ఆచార్య రేగులపాటి మాధవరావు
  • 31/05/2012
అంతేకాక స్వామివారు నన్ను అక్కడ ఉండవద్దని చెప్పటానికి కారణమేమిటో తెల్సింది. అంత మహాపురుషుని అనుగ్రహమునకు పాత్రుడను అయ్యానని తెల్సి, నా ఆత్మ ఎంతో సంతృప్తి చెందింది. భక్తి భావముతో ఆయనకు నమస్కారములు చేశాను. అంతటి అలౌకికమైన శక్తిగల మహాపురుషుని వలన దీక్షకు పొందే అదృష్టం కలిగిందని గ్రహించాను. మరునాడువారు నాకు దీక్షను ఇస్తారు. అందులో ఎలాంటి బాధ రాకూడదని భావిస్తూ భోజనం చేసి పడుకొన్నాను. వారి అలౌకిక కార్యకలాపముల గూర్చి ఆలోచిస్తూ గాఢ నిద్రలో మునిగిపోయాను.
మరునాడు మాఘశుద్ధ పంచమి ప్రాతఃకాలములోనే ఆశ్రమమునకు వెళ్లి స్వామివారికి నమస్కరించాను. మేమిద్దరం కలిసి స్నానముకు వెళ్లాం. వారి స్నానం ప్రతిరోజు రెండు గంటలకు తక్కువ పట్టదు. నేను అంతసేపు ఎప్పుడూ నీటిలో ఉండేవాడిని కాదు. కనుక రేపు ఒడ్డున కూర్చొని వారు బయటకు వచ్చేవరకు నిరీక్షించేవాడిని. స్నానం చేసి ఒడ్డుకు రాగానే వారి శరీరమును తుడిచేవాడిని. ఆ తర్వాత ఆశ్రమమునకు తిరిగి వచ్చేవాళ్లము. ఈనాడుకూడా అలాగే చేశాను.
స్నానం చేయటానికి వెళ్లివచ్చే సమయాలలో స్వామివారు నా భుజంమీద చెయ్యి వేసి నడిచేవారు.
స్నానం చేసి తిరిగి వచ్చిన తరువాత స్వామివారు తన గద్దెపైన కూర్చున్నాను. నేను నేలమీద నాకు నిర్దేశించిన స్థానములో కూర్చున్నాను. కొంతసేపటికి వచ్చిపోయేవారు ఆగిపోయిన తర్వాత స్వామివారు నన్ను తమ ఆసనం వద్దకు పిలిచి మంత్రోపదేశం చేశారు. దాని విధి విధానం తెలిపినారు. ఆ తర్వాత గద్దెమీద కూర్చొని ఇలా అన్నారు.
‘‘ఏ విషయమైనా ఎంతవరకు చెప్పవలెనో అంతవరకే చెప్పాలి. అనవసరంగా ఏదో చెప్పి సమయం వృథా చేయకూడదు. అనవసరమైన విషయాలు చెప్పటంవలన ఎంతో నష్టం సంభవిస్తుంది. ఎవరి ధర్మాన్నీ ద్వేషించకూడదు. ఎవరికి ఏ ధర్మముపైన నమ్మకముంటుందో వారికి దానివలననే ముక్తి లభిస్తుంది. ఆహార విహారముల వలన ధర్మానికి హాని కలుగదు. కాని ముక్తి లభించటంలో ఆలస్యం అవుతుంది. మహమ్మదీయులు కూడా ముక్తిని సాధించగలరు. అనన్యచిత్తులై భక్త్భివంతో భగవంతుని పిలిచేవారికి ముక్తి త్వరగా లభిస్తుంది’’ అని చెప్పి మళ్లీ ఈ విధంగా చెప్పసాగారు. ‘‘నీవు ఇన్ని సంఘటనలు చూసి మోహపరవశుడవు అవుతున్నావు. వీటిలో ఒక్కటి కూడా ఆశ్చర్యజనకం కాదు. ఎందుకంటే మానవుడు నిజంగా మానవుడే అయితే, ఈ అలౌకిక కార్యములన్నీ చేయగలడు. కేవలం ఆహార విహారాలు మానవుని సుఖ సంతోషాలకోసమే సృష్టింపబడలేదు. భగవంతునిలో ఏయే శక్తులున్నాయో అవే శక్తులు మనుష్యులలో కూడా ఉన్నాయి. భగవంతుడు మానవుని తన ఇష్టానుసారం తయారుచేసి అతనిలో తన సమస్త శక్తులను సమకూర్చి జీవుని శ్రేష్టతమునిగా చేశాడు. కాని ఎవరికీ ఆ శక్తిని ఉపయోగించుకోవటం తెలియదు. ఎవరివలన ఈ ప్రపంచం సష్టించబడిందో, ఎవరైతే ఎల్లప్పుడూ మన వెంటే ఉంటారో, అటువంటి భగవంతుని తెలుసుకోవటానికి కాని, ఆయనను దర్శించటానికిగాని ఎవరికీ కోరిక ఉండదు. ఒకవేళ ఎవరికైనా ఆ భగవంతుని తెలుసుకోవాలనే కోరిక ఉన్నా ఆయనను చేరే విధానం తెలియదు. అందువలన అతడు తనకు నచ్చిన విధానమును అనుసరించి 10 రోజులలో ఆ భగవంతుని దర్శనంకాకపోతే ఆ పనిని విడిచిపెట్టి నాస్తికుడవుతాడు. భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించేవారికి లేదా ఆయనను చేరటానికి ప్రయత్నించేవారికి భగవంతుడు తప్పక వశమవుతాడు.
ఈ ప్రపంచమును సృష్టించినవారు అన్నివేళలా అన్నిస్థానములోలను ఉంటారు. వారే ఈశ్వరులు. వారు ఈ సమస్త జగత్తులో వ్యాపించి యున్నారు. మనం మన ఆలోచనతోనూ, జ్ఞానబలంతోనూ వారిని వెదికి పొందాలి. గట్టి ప్రయత్నం చేస్తే దానిని మనము తప్పక పొందవచ్చు’’.
 
 
 స్వామివారి ఉపదేశాత్మక సందేశాన్నివిని నేను వారిని ‘‘నిజంగా భగవంతుని దర్శనం కలుగుతుందా!’’ అని అడిగాను. దానికివారు ‘‘సాధన చేసినప్పుడు, గురుకృప లభించినప్పుడు భగవంతుని దర్శనం తప్పక కలుగుతుంది. నీవు నిజంగా భగవంతుని దర్శింపదలిచినావా?’’ అన్నారు. నేను ఆతృతతో ‘‘ప్రభూ! అట్లా జరిగితే నేను నిజంగా ధన్యుడినే. ఈనాడు స్వయంగా భగవంతుడినే గురువు రూపంలో పొందటం నా సౌభాగ్యము. భగవంతుని గుణగణాలను తెలియనివారు ఎవ్వరూ భగవంతుని దర్శనం పొందలేరు’’ అన్నాను. అప్పుడు స్వామివారు ‘‘నేటి రాత్రి నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు ప్రొద్దుపోయింది. ఇంటికి వెళ్ళు’’ అన్నారు. వారి ఆజ్ఞానుసారం నేను ఇంటికి వెళ్లాను.
ఆ రోజు మధ్యాహ్నం కాక, సంధ్యా సమయంలో ఆశ్రమానికి వెళ్లి, స్వామివారికి నమస్కరించి దగ్గరలో కూర్చున్నాను. కొద్దిసేపటికి స్వామివారు నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకొని వెళ్లారు. వారు కూర్చొనగానే నేను కూడా వారికి దగ్గరగా కూర్చున్నాను. అప్పుడు స్వామివారు నాకు ప్రక్కన ఉన్న చిన్న గదిలోని కాళీమాత విగ్రహాన్ని చూసిరమ్మన్నారు. నేను వెళ్లి చూసి వచ్చాను రాతితో చేసిన ఆ విగ్రహం అక్కడ నిశ్చలంగా ఉన్నదని చెప్పాను. అప్పుడు స్వామివారు నవ్వి ‘‘ఆ కాళీమాత విగ్రహాన్ని నీవు ఇక్క చూడదలిచావా?’’ అని అడిగారు. అందుకు నేను ‘‘గురుదేవా! నేను ఆ తల్లిని ఇక్కడే చూసే సౌభాగ్యములను పొందగలనా?’’ అన్నాను. ఆ తల్లిని చూడటమన్నా, దర్శించటమన్నా ఒకటే కదా! అందువలన ‘ఆ జగన్మాతను నాకు మీరు దర్శింపజేస్తే కృతార్థుడను’’ అన్నాను. అప్పుడు గురుదేవులు నన్ను స్థిరంగా కూర్చోమని చెప్పి, తాము ధ్యానావస్థలోకి వెళ్లారు. ఒక గంట తరువాత ధ్యానం నుంచి లేచి ఆ జగన్మాతను పిలిచారు. నేను ఎంతో శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాను. ఇంతలో ఒక బాలారూపిణియై ఆ తల్లి మెల్ల మెల్లగా నడుచుకుంటూ వచ్చి వారి ముందు ఆగింది. దీపం వెలుగులో ప్రకాశవంతంగా మెరిసిపోతున్న ఆ పార్థివ రూపాన్ని చూసి ఆశ్చర్య చకితుడనైనాను. ఆమెను ‘తల్లీ’ అని పిలవాలనే భావన ఈ మనస్సులో ఒక్కసారి మెదిలింది. ఆ సమయంలో నా ముందు జగన్మాత, గురుదేవులు ఉన్నారు. ఒకవేళ మృత్యువు ప్రాప్తిస్తే సశరీరంగా స్వర్గం దొరుకుతుందని కూడా భ్రమపడ్డాను. ఆనందము భయములతో నా నోటి నుండి మాట కూడా రాలేదు. నేను జడపదార్థంలాగా నిలిచిపోయాను.
అచేతనమైన పాషాణము సచేతనమైనది కాని సచేతన ప్రాణినై ఉండి కూడా అచేతనమైనాను. నేను మామూలు స్థితికి వచ్చిన తర్వాత ఆ మాతృమూర్తి ఉన్నచోటనే ఉన్నదో లేదో చూచి రమ్మని గురుదేవులు అన్నారు. అప్పుడు నాకు మరింత భయం కలిగింది. ఆ భయంలో నేను స్వామివారికి అతి చేరువగా ఉన్నాను. స్వామివారు చిరునవ్వు నవ్వి తన వద్దకు రమ్మని చెప్పారు. నేను వారి వద్ద కూర్చొని ఆ జగన్మాతను చూస్తున్నాను. అంతా నిశ్చలంగా ఉన్నది. కాని నానోటినుండి మాత్రం మాటలు వెలువడటంలేదు. స్వామివారి ఆజ్ఞను తీసుకొని ఆ దేవికి నమస్కారం చేశాను. ఆ తర్వాత ఆ దేవి చరణధూళిని ముఖముపైన, సర్వాంగములపైన రుద్దుకొని నా జీవితమును సార్థకము, పునీతము చేసుకొన్నాను. ఆ తల్లి చరణములు మామూలు మనుష్యుల చరణముల లాగానే ఉండినవి. కొద్దిసేపటికి స్వామి నాతో ‘‘జాగ్రత్తగా చూడు. తర్వాత ఏ సందేహము ఉండకూడదు’’ అని అన్నారు. అప్పుడు స్థిరచిత్తుడనై చూశాను. కొంచెం సేపు అయిన తరువాత గురుదేవులే ఆ దేవిని తన స్థానమునకు వెళ్లమని చెప్పారు. అప్పుడు ఆ దేవి చిన్న బాలికలాగా మెల్లమెల్లగా వెళ్లి తన ఆసనముపైన మూర్త్భీవించినది. అప్పుడు నేను గురుదేవుని చూసి రాయి ఎలా నడుస్తుందని ప్రశ్నించాను. దానికి గురుదేవులు ‘‘నీ శరీరము ఎట్లా నడుస్తున్నది? అది జడమే కదా! సిద్ధసాధకుని గుణమువలన మన్ను, పాషాణములలోకూడా ఆత్మ మరియు చైతన్యములు సంచరిస్తాయి.
ఇంకాఉంది

 అప్పుడు ఆ మూర్తి నడుచుట, మాట్లాడుట, వినుట మొదలైన పనులు చేస్తుంది’’ అని చెప్పారు. ఆ తర్వాత మరునాడు ప్రొద్దున మనిద్దరము కలిసి వెళ్దామని చెప్పి గురుదేవులు తమ ఆసనం దగ్గరకు చేరుకొన్నారు.
మర్నాడు మాఘమాస షష్ఠి మేమిద్దరం కలిసి స్నానమునకు వెళ్లినాము. పంచగంగా ఘాట్ వద్దకు ఆనాటి రాత్రి కూడా రావలెనని, ఆనాటితో నీ పనులన్నీ పూర్తి అవుతాయని, ఆ తర్వాత రావలసిన పని ఉండదని గురుదేవులు చెప్పారు. గంగాస్నానము చేసివచ్చిన గురువుగారి శరీరమును తుడిచాను. ఆ తర్వాత మేమిద్దరం ఆశ్రమమునకు వచ్చాము. ఆ మధ్యాహ్నం అంబాదేవి అన్నం వండి తీసుకొని వచ్చింది. నన్ను ఇంటికి వెళ్లమని ఆజ్ఞాపించి స్వామివారు భోజనమునకు భోజనముకు కూర్చున్నారు. నేను ఇంటికి వచ్చిన భోజనము చేసి కొంచెం సేపటికి నిద్రపోయాను. మెళకువ వచ్చేసరికి సంధ్యా సమయమయింది. కొద్దిగా ఆలస్యమయిందని భావించి తొందరగా ఆశ్రమమునకు వెళ్లి గురుదేవులకు నమస్కారం చేసి వారి వద్ద కూర్చున్నాను. వారి వేదిక వద్ద ఖచోడీలు ఉండినాయి. అందులోనుండి రెండునాకిచ్చి, తాము రెండు తిన్నారు. ఆ తర్వాత నన్ను గదిలోకి తీసుకొని వెళ్లారు. స్వామివారు కూర్చున్న తర్వాత నేను కూడా వారి వద్ద కూర్చున్నాను. ఒకటి రెండు విషయాలు వారు ప్రస్తావించిన తరువాత స్వామివారు నాతో ప్రత్యేకంగా ఇలా చెప్పారు. ‘‘ఓ ఉమాచరణ్! నీవు ఇప్పుడు బంధనములలో పడిపోయావు. ప్రతిరోజు నీవు చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. వాటిపట్ల ఎలాంటి అవహేళనా చేయకూడదు. పగలు సమయం దొరకకపోతే సంధ్య సమయంలో చేయాలి. సంధ్యా సమయంలో సమయం దొరకకపోతే రాత్రిపూట చేయాలి. సమయం దొరకటం లేదని చెబితే పని సఫలం కాదు. నీవు నిర్లక్ష్యం చేస్తే నాకు అంతా తెలిసిపోతుంది’’ అని.
ఆ తర్వాత స్వామివారు మరలా ఇలా చెప్పసాగారు. ‘‘నేను నీకు మొట్టమొదటనే చెప్పాను. భగవంతుడు తన సంపూర్ణశక్తిని మానవునిలో నిక్షిప్తం చేసి వానిని సమస్త జీవరాశిలో శ్రేష్ఠునిగా సృష్టించాడు. కావున మానవుడు కూడా భగవంతునిలాగానే ఏపని అయినా చేయగలడు. దీనిని నేను నీకు ప్రత్యక్షంగా చూపగలను. దానిని చూసి నీవు మానవుడే భగవంతుడు అని తెలుసుకుంటావు. ఆ భగవంతుడు ఆత్మరూపంలో హృదయమందును, పరబ్రహ్మరూపంలో మస్తిష్కమందును విరాజమానుడై యున్నాడు. ఆయన ఏదో పేరుతో కన్నులకు కనబడే శరీరం కాదు. ఇదంతా ఈశ్వరుడే. ఈమొత్తం ప్రపంచం అతనిదే. నేను ఏమీ కాదు. నాది ఏమీ లేదు అని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. సమత, సత్సంగము, ఆలోచనము, ఆనందము అనే నాల్గింటిని ఎప్పుడూ మనం మిత్రులుగా గుర్తించాలి. ధర్మాన్ని గూర్చి ఎవ్వరితోనూ, వాద వివాదాలు చేయకూడదు. ఎక్కడైనా ధర్మాన్ని గూర్చి తర్కవితర్కములు జరుగుతూంటే అక్కడినుండి వెళ్లిపోవాలి’’ అని చెప్పి, నన్ను కండ్లు మూసుకొమ్మని ఆజ్ఞాపించారు. తాము కూడా స్వయంగా ధ్యానమగ్నులయినారు. దాదాపు ఒక గంట తర్వాత ధ్యానమును విడిచి నాతో ‘‘ఒకసారి కండ్లుతెరచి మనం ఎక్కడ ఉన్నామో చూసి చెప్పు’’ అన్నారు. నేను కండ్లు తెరచి చూసేసరికి మేము ఆ గదిలో లేము. గంగపైన ఒక మంచం వేయబడి ఉన్నది. దానిపైన ఒక తెల్లటి పరుపు, ఆ పరుపుకు తెల్లటి గలేబు, దానిపైన ఒక తెల్లని దుప్పటి ఉన్నాయి. ఆ మంచమునకు రెండు వైపులా మూడు మూడు దిండ్లు ఉన్నాయి. దానిపైన స్వామివారు పడుకొని ఉన్నారు. వారి శరీరం తెల్లగా కనబడుతున్నది. నేను వారి వద్ద కూర్చొని ఉన్నాను. ఇది నేను యథార్థముగా చూచిన విషయము. వారు నాతో ఇలా అన్నారు. ‘‘మనము గంగపై ఉన్నాము కదా! మరి గంగలో నీరు ఉన్నదో లేదో చూడు’’ అని నేను తలవంచి చేతితో నీటిని తాకినాను. ఆ సమయంలో నాకు మంచంతో సహా మునిగిపోతామేమో అన్న భయం కలిగింది. అందుచేత వారిని అంటిపెట్టుకొని కూర్చున్నాను.
- ఇంకాఉంది

3 వ్యాఖ్యలు:

sri June 3, 2012 at 2:51 PM  

thanks for sharing

sri June 3, 2012 at 2:51 PM  

thans for sharing

giribabu August 1, 2012 at 6:40 AM  

Was looking for the great Saint. Have you heard about Kamakshi Baba in Madras..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP