శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగ స్వామి చరిత్ర భాగములు -27,28,29

>> Monday, May 28, 2012

అయితే స్వామివారికి నామీద ఇంత దయ ఉంటే మొదట నాకు ఇన్ని కష్టాలు ఎందుకు కలిగించి ఉంటారు? బహుశా మొదట కష్టం అనుభవించనిదే, తరువాత సుఖం దొరకదు కాబోలు. ఈ విధంగా నా విషయాలూ మాట్లాడుతూనే రాత్రి గడిచిపోయింది. అప్పుడు స్వామివారు నాతో ఇట్లా అన్నారు. ‘‘నీవు ఇంటికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని తొందరగా తిరిగిరా! ఈనాడు మనిద్దరం కలిసి స్నానం చేద్దాం’’ అని.
నేను అట్లాగే చేశాను. తిరిగి వచ్చిన తరువాత ఇద్దరం కలిసి గంగాస్నానానికి వెళ్లాము. రేవులో దిగిన తరువాత స్వామివారు నాతో ఇట్లా అన్నారు. ‘‘ఉమాచరణ్‌గారూ! రాత్రి మీరు వచ్చేటప్పుడు ఒక తెల్లకాగితాల పుస్తకం తెచ్చుకోండి. నేను చెప్పినది వ్రాసుకోండి. దానివలన మీకెంతో లాభం కలుగుతుంది. కేవలం విన్నంతమాత్రాన జ్ఞాపకం ఉండదు. ఎన్నో థార్మిక గ్రంథాలు చదవవలసిన అవసరం లేదు. నేను వ్రాయించింది చదువుకొని జ్ఞాపకం ఉంచుకొంటే ఎంతో జ్ఞానం కలుగుతుంది. జీవునికి ముక్తికి మించిన వస్తువేదీ లేదు. ఆత్మజ్ఞానాన్ని మించిన జ్ఞానం ఏదీ లేదు. జ్ఞానాన్ని- ముక్తిని పొందటానికి ఎన్నో శాస్త్రాలు చదవనవసరంలేదు. కేవలం ప్రధాన సిద్ధాంతాలను, మాటలను తెలుసుకొంటే కార్యం సిద్ధిస్తుంది. మానవునికి ముక్తిని మించిన గమ్యం లేదు. ముక్తిని పొందాలనే కోరికే ఎప్పుడూ ఉండాలి. ఎన్ని రోజులవరకూ జ్ఞానం కలుగదో అప్పటివరకూ జన్మించటం, కష్టాలనుభవించటం, మరణించటం తప్పదు. ఈ ప్రపంచంలో నీవు చూస్తున్నదంతా మిథ్యే! ప్రపంచంలో రాజుకైనా, సామాన్య వ్యక్తికైనా కేవలం సుఖం మాత్రమే అనుభవించే అధికారం కాని, శక్తి కాని లేవు’’.
స్వామివారి ఉపదేశాన్ని విని ఎంతో సంతోషించాను. మేమిద్దరం స్నానం చెయ్యటానికి గంగలో దిగాము. స్వామివారు కొంతసేపు నిస్తబ్దులై ఉండి, స్థిరచిత్తులయ్యారు. వారు అవయవాలను కదల్చకుండానే ప్రవాహానికి ఎదురుపోసాగారు. కొంతదూరం వెళ్లిన తరువాత నీటిలో మునిగి అదృశ్యులయ్యారు. బహుశః రెండు గంటలు అయిన తరువాత నీటినుండి వెలుపలికి వచ్చి, నా వద్దనే మెట్ల మీద కూర్చున్నారు. నేను వారి శరీరాన్ని తుడిచాను. అక్కడినుండి ఆశ్రమానికి వచ్చాము. వారు తమ గద్దెపైన ఆసీనులయ్యారు. నేను వారి గద్దె పక్కనే కూర్చున్నాను. కొంచెంసేపు అయ్యాక వారి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లాను.
భోజనం చేసి, స్వామివారు చెప్పినట్లు ఒక పుస్తకాన్ని తీసుకొని సంధ్యా సమయానికి ఆశ్రమానికి వెళ్లాను. హారతి అయిన తరువాత స్వామివారు నన్నొక గదిలోకి తీసుకొని వెళ్లారు. వారుకూర్చోగానే, వారిదగ్గరనే నేను కూడా కూర్చున్నాను. స్వామివారు గంభీర స్వరంతో ఇలా చెప్పసాగారు.
నేటినుండి ప్రారంభించి నిన్ను నీవు తెలుసుకునే పద్ధతిని నీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతాను. నువ్వు వ్రాసుకొంటూ ఉండు. నీవు పనె్నండు విషయాలు అర్థం చేసుకోవాలి. జగత్సృష్టికి ముందు ఈ ప్రపంచంలో ఒక్క ఈశ్వరుడు తప్ప ఏమీ లేదు. కనుక-
1.మొదట ఆ ఈశ్వరుని గురించి చెబుతాను. 2.సృష్టి 3.సంసారం 4.గురుశిష్యులు 5.చిత్తశుద్ధి 6.్ధర్మం 7.ఉపాసన 8.పునర్జన్మ 9.ఆత్మబోధ 10.తన్మయత్వం 11.కొన్ని ముఖ్యమైన మాటలు 12.తత్త్వజ్ఞానం. ఇవి అర్థం చేసుకుంటే నీకు ఎంతో లాభం కలుగుతుంది అని ఈశ్వరుని గురించి చెప్పసాగారు. నేను వ్రాయసాగాను. ఆ విధంగా 13 రోజులలో ఆ పనె్నండు విషయాలు పూర్తి అయినాయి. ఆ తర్వాత వారు ఇలా అనానరు. ఇప్పుడు నీవు ఏ ధర్మశాస్తమ్రునూ చదువనవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ చదివినకొద్దీ మనస్సు ఏ ఒక్క దానిపై స్థిరంగా నిలువదు. అంతేకాక నానా రకముల సందేహాలు పుడుతాయి.
ఆ తర్వాత స్వామివారు ఇట్లా చెప్పసాగారు. నీకు దేవతా తత్త్వాన్ని గూర్చి కొంత తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది. దాన్ని గూర్చి కూడా ఎటువంటి సందేహం ఉండకూడదు.

అందువలన నీవు మరొక్క నోట్‌బుక్ తెచ్చుకో. నేను నీతో మరి పనె్నండు విషయాలు వ్రాయిస్తాను.
వారి ఆదేశానుసారము మర్నాడు నేను మరొక్క పుస్తకము తీసుకొని వెళ్లాను. వారు నన్ను అదే గదిలోకి తీసుకొని వెళ్లి వరుసగా 6 రోజులలో పనె్నండు విషయాలు వ్రాయించారు. అవి- 1.కృష్ణలీల 2.రామలాల 3.సీతాపహరణము 4.రామరావణ యుద్ధము 5.సముద్ర మథనం 6.ఇంద్రుడు 7.వాయువు 8.వరుణుడు 9.గౌతముడు 10.తీర్థయాత్రలు 11.్భజనము - బట్టలు 12.శుచి-అశుచి- అనేవి. అవి వ్రాయించిన తర్వాత ఆ రెండు వ్రాతప్రతులను ఎంతో భద్రంగా ఉంచమని ఆదేశించారు. ఆ తర్వాత వారు వ్రాసిన ‘మహావాక్య రత్నావళి’ అనే పేరుగల ఒక పుస్తకాన్ని ఇచ్చారు. మధ్యమధ్యలో దానిని చదవమని చెప్పారు.
ఇంట్లో చివరి సంతానం అందరికీ ప్రియమైనట్లే, స్వామివారు నాతో ఎంతో ప్రేమగా మెలిగేవారు. రెండునెలల నుండి వరుసగా వచ్చిపోతూ ఉండటంవలన నేను కూడా ఆశ్రమవాసిననే భావము అందరికీ కల్గింది. ముఖ్యంగా మేమిద్దరం కలిసి స్నానం చేయటంవలన, ఈ బెంగాలీ బాబును స్వామివారు తమ శిష్యునిగా చేయబోతున్నారని అనుకొన్నారు. నేను పూర్వంలాగా సాహసపూర్వకంగా కాక, నిర్భయంగా ఆశ్రమానికి వెళ్తూ ఉండేవాడిని. తండ్రి ఇంట్లో కొడుకుకు అధికారం ఉన్నట్లే ఆశ్రమంలో నాకు అధికారం దొరికింది. ఆశ్రమానికి వచ్చి వెళ్లటం నా ఇష్టంపైన ఆధారపడి ఉండింది. నా మనస్సు ఆలోచనా సముద్రంలో విహరించసాగింది. స్వామివారు నాపైన అంత దయ చూపినారు. కనుక నేను దీక్ష తీసుకోక ఉండలేకపోయాను. అందుకు నేను అక్కడ ఎన్ని రోజులు ఉండవలసి వచ్చినా అన్ని రోజులూ ఉండాలనే అనుకొన్నాను.
మరునాడు నేను స్వామివారి సన్నిధిలో కూర్చొని వారి పాదసేవ చేయసాగాను. అప్పుడు మంగళదాసు నాతో ఇలా అన్నాడు ‘‘ఉమేష్‌బాబు! (అప్పటినుండి మంగళదాసు నన్ను ఉమేష్‌బాబు అని పిలువసాగాడు) నీవు స్వామివారిని వశపరచుకొన్నావు. స్వామివారు నిన్ను శిష్యునిగా స్వీకరిస్తారని తెలుస్తున్నది’’ అని. అది విని నేను ఎంతో ఉత్సాహంతో ప్రశ్నించాను. ‘‘మీరు నా గురించి స్వామివారి ద్వారా ఏదైనా విన్నారా?’’ అని. అది విని మంగళదాసు ‘‘మిమ్మల్ని శిష్యునిగా స్వీకరించటానికి ఇంకా ఏమికావాలి? బాబాగారు ఎవరితోనూ ఇంతటి సత్సంబంధాన్ని పెంచుకోలేదు’’ అని అన్నాడు.
బెంగాలీ బాబు ఎంతో శాంత స్వభావం కలవాడని అప్పుడప్పుడు అనేవారట. మంగళదాసు అన్న ఆ మాటలు విని నేను ప్రసన్నమయ్యాను. స్వామివారి ద్వారా దీక్షను స్వీకరించాలని నా మనస్సులో ఆశపుట్టింది. వెంటనే మంగళదాసుతో - ‘‘మీరు నాకు దీక్ష ఇప్పించే సహాయం చేయాలి. అప్పుడప్పుడు బాబాగారిని అడుగుతూ ఉండండి. వారి మనస్సును తెలుకొంటూ ఉండండి’’ అని అడిగాను. మంగళదాసు దానికి ఒప్పుకొన్నాడు. సంధ్యా సమయం కాగానే ఇంటికి వెళ్లాను. మర్నాడు ప్రొద్దున నేను స్వామి దగ్గరే కూర్చొని వారి అలౌకిక ప్రజ్ఞ, యోగశాస్త్రంలో వారి పాటవములను గూర్చి ఆలోచిస్తూ వారి వద్దనే యోగశిక్షణ పొందాలని ఆలోచించి నా కోరికను తెలపటానికి వారి దగ్గరకు వెళ్లాను. నేను ఏమి చెప్పకముందే స్వామివారు మంగళదాసుని పిల్చి ఈ బెంగాలీబాబు ఇప్పుడు దీక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాడు’’ అని అన్నారు. వెంటనే నేను చేతులు జోడించి ‘‘మీరు నాపై ఎంతో దయ చూపించారు. ఇది ఎవరికీ లభించని అదృష్టం. అయినా మీరు నన్ను ఎలాగైనా ఉద్ధరించాలి’’ అని వేడుకొన్నాను. దానికి స్వామీజీ- ‘‘ఆ విషయాన్ని గూర్చి రాత్రి ఆలోచించుదాం. అది చాలా కఠినమైన పని. ఇప్పటివరకు మీరు స్వతంత్రులు. దీక్ష తీసుకొంటే బందీలయిపోతారు’’ అని చెప్పి ఇంటికి వెళ్లమని ఆదేశించారు.
తరువాత సంధ్యా సమయంలో నేను ఆశ్రమానికి వెళ్లి కూర్చోగానే ఇదివరకటి చిన్న గదిలోకి వెళ్లి కూర్చోమని ఆదేశించారు.
- ఇంకాఉంది
నేను అట్లా చేశాక ఈవిధంగా అన్నారు. ‘‘నీవు ఎప్పుడైనా యోగశిక్షణను పొందటాన్ని గూర్చి ఆలోచించావా? నీకు ఆ శిక్షణ పొందే అధికారం లేదు. నీవు ఉపాసనా మార్గంనకు తగినవాడివి. అందువలన ఉపాసనా మార్గమును స్వీకరించటానికి సంసిద్ధుడవై దానిని అనుసరించి నడుచుకో’’ అని అన్నారు. నేను వారి సలహాను స్వీకరించి ఉపదేశమిమ్మని కోరాను. అప్పుడువారు ‘ఈ పుష్యమాసంలో పుష్యమీ నక్షత్రం రోజు వచ్చే చంద్రగ్రహణంవరకు నీవు ఆగాలి. శరీరాన్ని మొదట పరిశుద్ధం చేయనిదే దీక్ష తీసుకోటానికి వీలు లేదు. ఆ చంద్రగ్రహణం నాటి రాత్రి నేను నీ శరీరాన్ని పరిశుద్ధం చేస్తాను’’ అన్నారు.
ఆ తర్వాత ఒక పదార్థం పేరు చెప్పి దానిని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చారు. ఆ పదార్థమును చంద్రగ్రహ సమయంలో ఒక సద్బ్రాహ్మణునికి దానం చేసి, ఒక ఆసనంమీద కూర్చొని ఒక మంత్రాన్ని జపించాలని చెప్పారు. దాని విధి విధానమును కూడా చెప్పారు.
కాశీలో దీక్షను గ్రహించే సమయంలో ఒక సద్బ్రాహ్మణుడు దొరకటం చాలా కష్టం. అందుచేత నేను స్వామితో ఇలా అన్నాను. ‘‘బాబా! ఇది నాకు కఠినమైన పరీక్ష. ఎందుకంటే కాశీలో దీక్షను గ్రహించే సమయంలో ఏ
బ్రాహ్మణుడు నా నుండి దానమును గ్రహింపడు. కనుక నేను ఎవరికి దానమివ్వాలో దయచేసి మీరే చెప్పండి’’ అని. అప్పుడు వారు నవ్వి ‘‘ఏ వ్యక్తయితే నేను చెప్పిన పదార్థాల పేర్లు ఉచ్ఛరిస్తూ భిక్షమెత్తుకొంటాడో అతనికి దానమివ్వు. దానివలన నీ కార్యం సిద్ధిస్తుంది’’ అని చెప్పారు.
స్వామివారే ఎవరినయినా బ్రాహ్మణులను పంపుతారని మనస్సులో అనుకొని దీక్షా సమయమైన గ్రహణం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాను. ప్రతిరోజు నియమానుసారం రెండు వేళలా ఆశ్రమానికి వచ్చిపోయేవాడిని. దీక్ష స్వీకరించే రోజు సమీపించింది. స్వామివారు చెప్పినట్లు ఒక బ్రాహ్మణుడు ఆ రోజున ఆ పదార్థముల పేర్లు చెబుతూ భిక్ష అడిగాడు. నేను భక్తిశ్రద్ధలతో దానం చేశాను. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. గ్రహణం తర్వాత వచ్చిన మాఘశుద్ధ చతుర్థినాడు నేను స్నానం చేసి, దేవతామూర్తులకు నమస్కరించి, స్వామివారికి నమస్కరించి వారి దగ్గర కూర్చున్నాను. అపుడు స్వామివారు, ‘‘నీ శరీరము పరిశుద్ధము అయింది’’ అంటూ గురుశిష్యుల సంబంధం ఏమిటో, శిష్యునిలో ఏయే గుణాలుండాలో వాటన్నింటిని వివరంగా చెప్పారు. ఆ తర్వాత ‘‘రేపు నీ దీక్ష ఉంటుంది. దీక్షకు ఏయే వస్తువులు కావాలో చెబుతాను తెచ్చుకో’’ అని చెప్పారు.
గురువుగారికి భోజనం పెట్టించాలనే కోరిక చాలా రోజులనుండి నా మనస్సులో దృఢంగా ఉండింది. నా కోరికను స్వామివారికి వెల్లడించాను. అది వినగానే స్వామివారు ‘‘నేను అన్నం తినాలి. అందుకు కొన్ని వంకాయలు తీసుకురా’’ అని అన్నారు. నేను వెంటనే సంతకు వెళ్లి ఐదు కిలోల వంకాయలు, మిఠాయి తెచ్చాను. వంకాయలను చూసి ఆయన చాలా సంతోషించారు. మంగళదాస్ తల్లి అయిన అంబాదేవిని పిల్చి వంకాయ కూర, అన్నము వండమని చెప్పారు. అందులోనుంచి నాలుగు వంకాయలు తీసి నా చేతికి ఇచ్చారు. మిఠాయిని చూసి అపరిమితమైన కోపంతో ‘‘నిన్ను మిఠాయి తెమ్మని నేను చెప్పలేదు. మరి ఎందుకు తెచ్చావు’’ అని అన్నారు. ఆయన ముఖకవళికలు చూసి నేను బెదిరిపోయాను. వెంటనే నేను వారి పాదములను పట్టుకొన్నాను. వారు ప్రసన్నులయి మిఠాయి తిన్నారు. దాదాపు అర కిలో మిఠాయి మిగిలింది. నన్ను మంగళదాసుని తినమని ఆజ్ఞాపించారు. మేమిద్దరం ప్రసాదం గ్రహించాము. తర్వాత నన్ను ఇంటికి వెళ్లమని చెప్పారు. కాని నేను ఇంటికి వెళ్లక అక్కడే కూర్చుని ఉన్నాను. వారి కొరకు వంకాయ కూర, అన్నము తయారుకాగానే ఆహారం తీసుకోవటానికి ఉపక్రమించారు.
స్వామివారు భోజనం చేస్తున్నారు. అదృష్టం ఉంటే నాకు కూడా ప్రసాదం లభిస్తుంది అనుకొన్నాను. కనీసం ఒక్క మెతుకయినా దొక్కపోతుందా అని అనుకొన్నాను.
- ఇంకాఉంది

[ఆంధ్ర భూమి దినపత్రికలో  సిరియల్ గా వస్తున్నా ఈ దివ్యచరితమును ఎక్కువమందికి అందాలనే సదుద్దేశ్యంతో ఇక్కడ ఉంచుతున్నాను .ఇది నా రచన కాదని మనవి చేసుకుంటున్నాను ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP