శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరిత్ర -- 26

>> Saturday, May 26, 2012

నీకు ఏదైనా బాధ కలిగినప్పుడో రోగం వచ్చినప్పుడో వైద్యుని అవసరం కలుగుతుంది. లేకపోతే అతని అవసరం ఉండదు. ఈ జన్మలో నీకు ప్రాప్తించిన రూపాన్ని, విద్యను, బుద్ధిని, స్వభావాన్నీ పరిశీలిస్తే పూర్వజన్మలో నీవెట్లా ఉండేవాడివో నీకే తెలుస్తుంది. అట్లాగే ప్రస్తుత జీవితాన్ని నీవు చూస్తూనే ఉన్నావు. ఈ జీవితంలో నీవు ఏమి మంచి చేశావో, ఏమి చెడు చేశావో నీకు బాగా తెలుసు. మంచి చేస్తే మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు జరుగుతుంది. పూర్వజన్మ సుకృతంవలన ఈ జన్మలో బ్రాహ్మణ వంశంలో పుట్టినావు. నీవు బ్రాహ్మణోచితమైన పనులు చేసి, సన్మార్గాన్ని అవలంభిస్తే ఆత్మోన్నతిని పొందుతావు. అట్లాకాక, అన్యాయాలు పాపాలు చేస్తే అధోగతి పాలవుతావు. కావున ఈ జన్మలో నీవు చేసే మంచి చెడులను బట్టే పునర్జన్మ వుంటుంది. అందువలన పునర్జన్మను నీకు నీవే స్వయంగా నిర్ణయించుకోగలవు. నీవు దీని విషయంలో ఇంకొకరిని అడుగవలసిన అవసరం లేదు. దీనిని గురించి నీకు తరువాత వివరిస్తాను. ఇప్పుడు నామీద నమ్మకం కలగటానికి కొంత వివరిస్తాను’’ అన్నారు.
నేను ఏమీ చెప్పకుండానే స్వామివారు నా మనస్సులోని మాటలను ఎట్లా గ్రహించగలిగారని నిస్తబ్ధుడనయినాను. స్వామివారు అంతర్యామి అని, ఆత్మజ్ఞానం కల యోగి అని తెలుసుకొన్నాను. నాకు ఈ జ్ఞానం కలగగానే వారిపై నాకు విశ్వాసం పెరిగింది. స్వామివారు చెప్పినది కఠోర సత్యమనటంలో సందేహం లేదు. నా ఆనందానికి హద్దులు లేవు. స్వామివారు నా కోసం ఇంత శ్రమపడతారని కూడా నేను ఊహించలేదు.
స్వామివారు మళ్లీ చెప్పటం ప్రారంభించారు. ‘‘నీ పేరు ఇది. నీ తండ్రి పేరు ఇది. నీవు ఫలానా గ్రామస్థుడవు. నీ ఇంట్లో ఇన్ని గదులున్నాయి. ఇంటికి ఫలానా దిక్కున ఒక చెరువున్నది. ఆ చెరువు ఒడ్డున ఫలానా ఫలానా చెట్లున్నాయి. నీ ఇంట్లో ఫలానావారు నివసిస్తూ ఉంటారు’’ అంటూ స్వామివారు నా విషయం అంతా తెలిసిన వ్యక్తిలాగా చెబుతూ ఉంటే విని ఆశ్చర్యపోయాను.
స్వామివారు మళ్లీ ఇట్లా చెప్పసాగారు. ‘‘పూర్వజన్మలో మీరు బ్రాహ్మణులు. ఫలానా గ్రామంలో, ఫలానా పేరుగల జమీందారుగా ఉండేవారు. నీవు చాలా మంచివాడివి. నీ మేడ రెండవ అంతస్తులో నీ శయనం మందిరం ఉన్నది. ఆ ద్వారం పైన నీవు స్వయంగా చేతితో వ్రాసిన మూడు శ్లోకాలు ఇప్పటికీ ఉన్నాయి. వెళ్లి చూసుకో!’’ అన్నారు.
ఆ తరువాత స్వామివారు మళ్లీ ఇట్లా చెప్పసాగారు. ‘‘్ఫలానా గ్రామంలో ఫలానా పేరుగల ఒక వ్యక్తి వున్నాడు. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తాడు. నీవు కూడా ఆయనను ఎంతో ప్రేమిస్తావు. స్నేహంతో ఉంటావు. ఎందుకో తెలుసా? అతడు పూర్వజన్మలో నీ తండ్రి. తండ్రీ కొడుకులు కనుక మీ ఇద్దరిమధ్య అంత ప్రేమ ఉన్నది. కానీ శరీరంలో మార్పువచ్చింది. అందుచేత ఒకరినొకరు గుర్తించలేరు. మీ పినతండ్రి ముంగేరులోనే ఉన్నాడు. అతని పేరు ఫలానా. అతడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. అతడు తొమ్మిది గంటలవరకూ నీ వద్దనే ఉంటాడు. నిన్ను చూడనిదే అతనికి ప్రశాంతత లేదు. నీవు కూడా ఆయనను భక్తితో చూస్తావు. దానికి కారణం తెలుసా? పూర్వజన్మ సంబంధమే! అప్పటి స్నేహం అట్లాగే ఉన్నది. కాని శరీరాలు మాత్రం పరివర్తనం చెందాయి.’’
చివరకు స్వామి ఇట్లా అన్నారు. ‘‘ఉమాచరణ్! నీ పూర్వజన్మ సుకృతం వల్ల సెలవు పెట్టుకొని కాశీకి వచ్చావు. అందువలన బ్రాహ్మణోచిత సత్కర్మలు చేసి, అనుష్టాన మాచరించి, జన్మజన్మలలో నీకు కష్టం కలగకుండా చూసుకో! నీవు జన్మను సరిగా ఉపయోగించుకొన్నావా వచ్చే జన్మలో ముక్తి లభిస్తుంది. వాసనలు త్యజించటమే ముక్తికి సోపానం. వాసనలు త్యజించకపోతే ముక్తి ఆశే లేదు’’.
స్వామివారు పల్కిన ఈ అలౌకికపు పలుకులు విని నేను నిస్తబ్ధుడనై పోయాను. జన్మజన్మల విషయాలలో నా సందేహం తొలగిపోయింది. శాస్త్రానుకూలమైన నమ్మకం కుదిరింది.
- ఇంకాఉంది

1 వ్యాఖ్యలు:

sri May 26, 2012 at 8:33 AM  

thanks for sharing. a wonderful discussion and crystal clear answer
which is increasing our faith.
I read books on karma, life after death, etc.,The above discussion is simply the essence of all.
srinivasaraov 9441481014

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP