శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వరలక్ష్మీ వ్రతంతో శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం పొందండి!

>> Saturday, August 6, 2011

శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది. శ్రావణ పూర్ణిమ ముందువచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని 'వరలక్ష్మి' పేరుతో అర్చిస్తారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఈ వ్రతం ద్వారా కలశాన వరలక్ష్మిని ఆవాహనచేసి షోడశోపచారాలతో పూజించడం చేయాలి. కోరిన కోరికలన్నీ తీర్చే వరలక్ష్మి శ్రావణమాసంలో ఆవిర్భవించింది.

శ్రీమన్నారాయణమూర్తి శ్రవణం నక్షత్రంలో జన్మించారు. అందుకే శ్రావణ మాసానికి అంత వైశిష్ట్యం. ఈ నెల రోజులూ ముత్తయిదువులు, పేరంటాలు, మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలు, మంగళహారతులతో ఆనందోత్సహాలతో జరుపుకుంటారు. ఎన్నో పండుగల మంగళ ప్ర సమాహారం శ్రావణం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు 12) నాడు వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు.

వరలక్ష్మి వ్రత కధ (శ్రావణ శుక్రవారం కథ)
ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును.

దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. ఇంకా 'ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద' ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము" అని కధ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను.

వెంటనే ఆమె మేల్కొని, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశం ఏర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రం అయ్యా అధిక భక్తితో

లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం|
దాసీభూత సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర గంగాధరాం|
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం||

అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను.

కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను.

ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

వరలక్ష్మీ వ్రతాచరణ పద్ధతి:
ఈ వ్రతాతరణకు భక్తి శ్రద్ధలు ప్రధానం. ప్రాతఃకాలాన స్నానాదికాల కృత్యాలు తీర్చుకుని, పీతాంబరం ధరించి, పూజామాంటపాన్ని పాలవెల్లిలో అలంకరించి, మండపంపైన అష్టదశ పద్మం ముగ్గువేసి, మామిడి, మర్రి, రావి, జువ్వి, ఉత్తరేణి వంటి పత్రాలతో కలశంపెట్టి, అందులో టెంకాయను ఉంచి, అమ్మవారి స్వరూపం వచ్చే విధంగా పిండితో టెంకాయ మీద బొమ్మను చేసి ఆభరణాలు అమర్చి, పట్టువస్త్రం కట్టాలి. కలశం ముందు బంగారు లక్ష్మీ 'రూపు'ను ప్రతిష్టించాలి. దీపారాధన చేసి గణపతిని పూజించాలి.

అనంతరం కల్పోక్త ప్రకారంగా తేజోరూపిణి అమ్మవారికి ఆవాహన పలుకుతూ స్తోత్రం చేయాలి. షోడశోపచార పూజలు చేయాలి. పుష్పాక్షతలు దేవిపైన చల్లుతూ కరుణామయి అమ్మవారి అష్టోత్తర శతనామాలు పఠించాలి. తొమ్మిది సూత్రాలుగల తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. చారుమతి కథను చెప్పుకోవాలి.

ధూపదీపార్చన అనంతరం తొమ్మిది రకాల పిండివంటలతో వరలక్ష్మీదేవికి మహాన్న నివేదన చేయాలి. తాంబూలం, దక్షిణ, మంత్ర పుష్పం, మంగళహారతి తర్వాత, ప్రదక్షణ చేయాలి. సాయంత్రం పేరంటాలును పిలిచి పూలు, పండ్లు శనగలు తాంబూలంతో సత్కరించి పంపాలి.

[webdunia ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP