శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇక ఈ దేశానికి నా అవసరం లేదనుకున్న ప్పుడు ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంత నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను

>> Thursday, April 19, 2018

#మోడీ "ఈ దేశానికి ఇంక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా ఎవరి సహాయం, అవసరం లేకుండా నిష్క్రమిస్తాను, నాకు చరిత్రలో స్థానం అక్కర్లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, 125 కోట్ల ప్రజలు తప్ప?" భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు పలకడానికి కూడా సాహసించలేని వాక్యాలు.

చరిత్రాత్మక వెల్లింగ్టన్ టౌన్ హాల్ సమావేశంలో మోడీ ప్రసంగం ఆద్యంతం ఆలోచనాత్మకంగా, వివరణాత్మకంగా ఆయన గుండెలోతుల్లోంచి భావ ధారగా బయటకి వచ్చింది, అనేకమంది అభిమానుల గుండెల్ని మెలిపెట్టింది. సామాన్య ప్రజలు కూడా మమేకం అయిపోయి ఆలోచింపచేసేలా చేసింది. ఓ స్వయం సేవకుడు ప్రధాన సేవకుడు అయితే ఎలా ఉంటుందో ఆవిష్కరించింది.

ప్రజలు అన్నిటికి మిమ్మల్ని నిందిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు అని అడిగితే. అవును అది వాళ్లకి నా మీద ఉన్న నమ్మకం. ఇంతకాలం ఈ వ్యవస్ధ ఇంతే ఇక మారదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు పరిస్థితులు మారాయి, నువ్వు చెయ్యాలి, నువ్వే చెయ్యగలవు అని నా మీద నమ్మకం ఉంచడం మంచిదేగా అని ఎదురు ప్రశ్నించి సకారాత్మక దృక్పధం అంటే ఏంటో తెలియచెప్పారు మోడీ.

ఇంతకు ముందు ఎక్కడికెళ్లినా ఈ భారతీయులు ఇంతే అనే ఆరోపణలు, అవమానాలు ఎదురయ్యేవి. మరి ఇప్పుడు?మోడీ ఇండియాలో. మోడీ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తప్ప భారత ప్రజల్ని ఎవ్వరూ ప్రశ్నించడంలేదు. అవమానించడం లేదు. ఆఖరికి ఎవరో అనామకులు దుర్మార్గంగా మాన భంగాలు చేసినా, అమయకులపై దాడులు చేసినా ప్రశ్నలు, దూషణలు కూడా మోడీ ఎదుర్కొంటున్నారు తప్ప వాళ్ళ పేర్లు,గుర్తింపు కూడా పట్టించుకోవడంలేదు. అంతలాగా ఆయన ప్రజల తరపున నిలబడి బయటినుండి, కొంతమంది ఇక్కడి స్వార్ధ పరుల చేతుల్లో, మాటల ద్వారా అవమానాలు ఎదుర్కొని కూడా దేశ ప్రజలకోసం  ఆనందంగా స్వీకరించే శిఖర సమానుడు మోడీ.

మనదంతా మనదగ్గరే ఉండాలి కానీ మోడీ కొత్తగా సృష్టించేసి అన్ని ఇచ్చేయాలి. అందుకే గెలిపించాం మోడీ ని అనే కొంతమంది స్వార్ధ పరుల పలుకుల్ని కూడా సహృదయంతో స్వీకరించి శిరసావహించే అత్యున్నత వ్యక్తిత్వం మోడీది.

చేసిందంతా సరే. ఇంకేమి ఇస్తావు? ఇంకేం చేస్తావ్? అనుక్షణం ఇవే ప్రశ్నలు దేశంలో కొన్ని వర్గాల ప్రజల ధోరణి. ఈ ప్రశ్న అడిగితే అవును మరి ఒక్క దగ్గరే ఆగిపోతే, సంతృప్తి పొందితే జీవితం స్తంభించిపోతుంది కదా అనగలిగే వ్యక్తిత్వం మోడీ.

సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ కి ఫోన్ చేసి మీ వాళ్ళ శవాలు తెచ్చుకోండి అని చెప్పేదాకా ఈ విషయం బయటకి చెప్పకూడదు అని భీష్మించుకుని కూర్చున్న ఉక్కు సంకల్పం మోడీ.

దానిగురించి మరింత విశ్లేషిస్తూ నా దేశం మీద దాడికి తెగబడితే ఇక్కడ ఉన్నది మోడీ అని చెప్పగలిగే అగ్ని గోళం మోడీ.

ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ట ని యోగ దినోత్సవం, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ని ప్రతిపాదించి నాయకత్వం వహించడం, ప్రతిష్టాత్మక భాగస్వామ్యాలు. అన్ని మోడీ ముద్ర తో వచ్చినవే. ఒక బ్రిటిష్ ఎంపీ మాటలలో మోడీ ని ప్రధాని చెయ్యడానికి మీకు ఎన్నిక కావలసి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు.

అయినా మోడీ ఇక్కడి కొచ్చేసరికి 125 కోట్ల మంది ప్రజలముందు నిలబడేటప్పుడు మాతృమూర్తి ముందు చిన్న పిల్లాడిలా అయిపోతాడు. ఆశగా చూస్తాడు మనవంక. తనని అర్దం చేసుకున్నామా అని. మన ప్రతిరూపంగానే తాను ఈ విజయాలు సాధించాను అంటాడు. అవి అన్ని మనవి. తప్పులు తనవి అని మీద వేసుకుంటాడు. సామాన్య కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి ఎదగడం మనవల్లేనని మన ప్రజాస్వామ్యం లో గొప్పతనం వల్లేనని మురిసిపోయి చెప్పుకుంటాడు. తిట్లే దీవెనలు అంటాడు.

కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరంగా పనిచేయడం తనకి మరింత ఉత్సాహం ఇస్తుంది ఇక అలుపెక్కడిది అంటాడు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడం అది తాను కల్పించడం అదృష్టం అని అనగలిగే, 7 కోట్ల పేద మహిళలకు గ్యాస్ సౌకర్యం కల్పించగలగడం తన బాధ్యత అని, 11 కోట్ల మందికి ముద్ర రుణాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చెయ్యడం,3 రేట్లు ఎక్కువ వేగంతో రోడ్లు వెయ్యడం,కోటిమందికి ఇల్లు కట్టించే ప్రక్రియ,లక్షలాది కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు, మహిళల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం నిర్మిస్తున్న మరుగుదొడ్లు, రైతులకు యూరియా కొరత లేకుండా చూడడం, ఫసల్ భీమా,50 కోట్లమందికి ఆరోగ్య భద్రత కల్పించే ఆయుష్మాన్ భారత్ ఇవన్ని తన బాధ్యత అని, చెయ్యగలగడం అదృష్టం అని ఆనంద పడిపోతాడు మోడీ.

అక్కడెక్కడో ఎవడో ఏదో తప్పు చేస్తే మీరేమి చేస్తున్నారు అంటే తప్పు ఎవరు ఎప్పుడు చేసినా తప్పే. దానికి పోలికలు, లెక్కలు, తూకాలు ఎందుకు అని దృఢంగా చెప్పే గొంతు మోడీది.

ఇన్ని చేసి నేనొక సామాన్యుడిని ఈ దేశానికి నా అవసరం లేదన్నపుడు నిశ్శబ్దంగా ఎవరి సహాయం,అవసరం లేకుండా నిష్క్రమణ చేస్తానన్న స్థిత ప్రజ్ఞుడు మోడీ.

ఆయాన ఏమి మారలేదు. మన పట్ల, దేశం పట్ల మరింత ప్రేమతో, సంకల్పంతో, ఆశావహ దృక్పథంతో ఇంకా ఏమి చెయ్యాలి అని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. మనమే ప్రతి చిన్నదానికి మోడీ ఏమి చేస్తున్నాడు అని చిన్న బుచ్చుతున్నాం. మారదాం. మరింత సంఘటితంగా నిలబడి ఆయన్ని మరింత శక్తివంతం చేద్దాం. దేశాన్ని మరో స్థాయికి తీసుకెళదాం. మోడీ కోసం కాదు, మన కోసం, మన బిడ్డలకోసం, మన దేశ భవిష్యత్తు కోసం.

ఎందుకంటే ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోతే మనకి మరో ప్రధాని వస్తాడేమో. కానీ మనమే ఉండం,మన ప్రతినిధి ఉండడు..మనకిక ఆశ ఉండదు..ఎదగాలి అన్న కసి ఉండదు. మోడీ అంటే నువ్వూ, నేనూ, దేశ౦.

జై హింద్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP