శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

📌శ్రీ రుద్రం విశిష్టత .....!!

>> Wednesday, January 4, 2017

శ్రీ రుద్రం విశిష్టత .....!!

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చే మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. నమకం
చమకం  చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||
నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
నమకం విశిష్టత :
నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చాలించి , తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారనణ కు కూడా చదువుతారు.
అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి  జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.
అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాజ్యాన్ని  సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం –9:
ఈ అనువా కంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తి ని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం – 10:
ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.
చమకం విశిష్టత:
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు . సమస్తం అతనినుండి  ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే ......✍

 లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .

1 వ్యాఖ్యలు:

అన్యగామి January 4, 2017 at 1:12 PM  

మంచి పోస్ట్ దుర్గేశ్వర గారు. మీరు చేసే కార్యక్రమాలు, మంచి పనులు అందరు ఆస్తికులు గమనిస్తున్నారు, ప్రేరణ పొందుతున్నారు. సదా ఆభగవానుడి అనుగ్రహం మీకు, మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP