శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివలింగాలు- సాలగ్రామాలు

>> Wednesday, January 27, 2016

శివలింగాలు- సాలగ్రామాలు 




" శివమ్ " అంటే ’ శుభం ’ అని అర్థము. " శివ లింగము " అంటే " శుభచిహ్నము " అని అర్థము.
" లింగ పురాణము " ప్రకారము , ఒకసారి విష్ణువు , బ్రహ్మ ఇద్దరూ మాయలో పడి " నేను గొప్ప " అంటే " నేను గొప్ప " అని అహంకరించుతుండగా , శివుడు వారి ముందు ఒక అనంతమైన పొడవు గల అగ్నిస్థంభమై ప్రత్యక్షమై , ’ ఈ స్థంభపు కొనలేవో తెలుసుకున్నవారే గొప్ప ’ అంటాడు. బ్రహ్మ విష్ణువులు అది కనుగొనుటలో విఫలులై , శివుడే తమ ఇద్దరికన్నా గొప్ప అని అంగీకరిస్తారు. ఆ అగ్ని స్థంభమే " లింగము " గా పిలవబడింది. ఎందుకంటే , సర్వ ప్రాణులూ ప్రళయకాలములో ఆ స్థంభములోనే లయించి పోతాయి [ లీయతే అస్మిన్ , లేక లయం గఛ్చంతి ] 


లింగాలు ముఖ్యముగా రెండు రకాలు. అకృత్రిమ లింగాలు-- ఇవే స్వయంభూ లింగాలు , బాణ లింగాలు. అవి ప్రకృతిలో సహజ సిద్ధముగా ఏర్పడతాయి.
 రెండో రకము , " కృత్రిమమైనవి " అనగా మానవ నిర్మితమైనవి. 
ఇంకోవిధమైన విభాగము , " చల " మరియు " అచల " లింగాలు. కదిలేవి , కదలనివి. అనగా ఇళ్ళలోనూ ఉత్సవాల్లోనూ పూజించేవీ , గుళ్ళలో ప్రతిష్ఠింపబడినవీ...

ఈ లింగాలు రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి పీఠము లేక యోని... దీన్నే సోమసూత్రము అంటారు. రెండు , దానిపైన ఉన్న లింగము. శివలింగములోని అధో భాగాన్ని " బ్రహ్మ భాగము " అనీ , మధ్య భాగాన్ని " విష్ణు భాగము " అనీ , ఊర్ధ్వ భాగాన్ని " రుద్ర భాగము " అనీ అంటారు. సాధారణముగా బ్రహ్మభాగము భూమిలో పాతిపెట్టబడి ఉంటుంది.
నిర్ణయ సింధువు ప్రకారము , 
శివలింగాన్ని మనకు కావలసిన ఫలితాలను బట్టి ఎంచుకోవాలి . చర శివలింగము , అంటే ఒకేచోట స్థాపితము కానిది--మరియూ మానవ నిర్మితమైనది:-- పన్నెండు అంగుళాలకన్నా పెద్దదిగా ఉండరాదు.  రత్నము , బంగారము , వెండి , రాగి, ఇత్తడి , ఇనుము, రాతిది , కర్రది మరియూ మట్టిది-- ఇవన్నీ అదే క్రమములోనే ఒకదానికన్నా ఒకటి అధమమైనది.. అనగా రత్నముతో చేసినది అత్యుత్తమమైనది.. తర్వాత బంగారము... అలాగ. 

వీటిని తొమ్మిది నుండీ ఏడు అంగుళాల పొడవుగా చేయించుకొనుట ఉత్తమము. ఆరు , ఐదు, నాలుగు అంగుళములవి మధ్యరకాలు.  అంతకన్నా చిన్నవి అధమము. బొటనవేలికన్నా చిన్నది ఎప్పుడూ చేయించరాదు. 
వీటి ఎత్తూ , లావూ సమానముగా ఉండి , పీఠము తప్పనిసరిగా ఉండవలెను. పీఠపు ఎత్తు , లింగపు ఎత్తుకు రెట్టింపు ఉండాలి. లింగపు పైభాగపు విస్తీర్ణము ,[ లేదా వ్యాసము , లేదా కర్ణము]  లింగపు ఎత్తుతో సమానముగా ఉండాలి.ఇవి స్థూలముగా , మానవ నిర్మితమైన లింగాల కొలతలు. 

మట్టి , భస్మము , ఆవుపేడ , పిండి , రాగి, కంచు-- వీటిలో దేనితోనైనా లింగము చేయించి ఒకసారి పూజిస్తే , దేవలోకములో పదివేల కల్పములు నివసించుటకు అర్హత , యోగ్యతా సిద్ధిస్తాయి. 

కర్రతో చేసినదాన్ని ధనప్రాప్తికి పూజిస్తారు. వీటిని ఎర్ర చందనము , తుమ్మ ,బిల్వ చెక్కలతో చేస్తారు.  స్ఫటిక లింగాన్ని అన్నిరకాల కోరికలు తీరుటకు మరియూ చిత్తనైర్మల్యానికీ పూజిస్తారు. ముత్యపు లింగము పాపాలను హరిస్తుంది. 

బ్రాహ్మణులు నాలుగు లింగాలనూ , క్షత్రియులు మూడు లింగాలను , వైశ్యులు రెంటినీ , శూద్రులు ఒక లింగాన్నీ పూజించాలి. ఇంటిలో రెండు లింగాలను బ్రాహ్మణులు ఎన్నటికీ పూజించరాదు. శివ , సూర్య అర్చన లలో శంఖమును వాడకూడదు.

పగిలిన , దగ్ధమైన లింగాలను పూజింపరాదు. 

ఇక పార్థివ లింగాలు--అనగా మట్టితో కానీ బంకమట్టితో కానీ చేసిన లింగాలు. 

పార్థివ లింగపూజతో సర్వ కార్యములనూ సాధించవచ్చును. పార్థివలింగాన్ని పూజించేవాడు ఆయుష్మంతుడూ ,బలవంతుడు , శ్రీమంతుడు , పుత్రవంతుడు , ధనవంతుడు , సుఖి ఔతాడు. 

అలాగే , పేడతోను , బంగారముతోను , పట్టు వస్త్రముతోనూ చేసిన లింగాలు కూడా సర్వ కార్యాలనూ సాధించి ఇస్తాయి. 

పార్థివ లింగానికై మట్టిని తెచ్చేటప్పుడు " ఓం హరాయ నమః " అనే మంత్రాన్ని పఠించాలి.
మట్టిని కలుపుతూ లింగాన్ని చేసేటప్పుడు " మహేశ్వరాయ నమః " అని ధ్యానిస్తుండాలి. 
" శూలపాణయే నమః " అంటూ ప్రతిష్ఠ చేయాలి. 
" పినాక ధృతయే నమః " అంటూ ఆవాహన చేయాలి.
" శివాయ నమః " అంటూ స్నానము చేయించాలి.
" పశుపతయే నమః " అంటూ పూలతోను , బిల్వ పత్రాలతోను పూజించాలి.
" మహా దేవాయ నమః " అంటూ విసర్జన చేయవలెను. 
బిల్వపత్రాలు ఎండినవైననూ శుభమే. వాడినవైననూ " నమశ్శివాయ " అంటూ నీటితో కడిగి మళ్ళీ వాడవచ్చు. 
పార్థివ లింగాన్ని ఉమ్మెత్త పూలతో పూజించుట అతి శుభప్రదము. లక్ష గోవులను దానము చేసినంత ఫలాన్ని పొందుతాము. ఒకసారి తీసివేసిన రుద్రుని నిర్మాల్యాన్ని [ నిన్నటి పూజ తర్వాత వాడిన పూలను , పత్రాలను ] ముట్టుకోరాదు , తొక్కరాదు , తినరాదు. అట్లా చేస్తే వెంటనే వస్త్రాలతోపాటూ స్నానము చేయాలి. పూలను , మధ్యవేలు మరియు ఉంగరపు వేళ్ల మధ్యలో పట్టుకొని పూజించాలి. బొటన వేలు , చూపుడు వేళ్ళతో నిర్మాల్యము తీసేయాలి. నుదుట భస్మము , మెడలో రుద్రాక్షలూ లేకుండా శివపూజ చేయరాదు. పార్థివ లింగాన్ని ఎడమచేతిలో ఉంచుకొని , కుడిచేత్తో ప్రోక్షణ , పూజ చేసే వాడుక కర్నాటకలో ఉంది.  ఆంధ్రలో కూడా ఉండి ఉండవచ్చు. 

ఇక , మానవ నిర్మితము కాని--అనగా ప్రకృతిలో వాటంతట అవే సిద్ధముగా దొరికే కొన్ని లింగాల విషయము:-

సాలగ్రామములు, బాణ లింగాలు 



బాణలింగాలు పాలరాతినిపోలి ఉంటాయి. వాటిని పూజించుట వలన ఆత్మ జ్ఞానము , చిత్త నైర్మల్యము కలుగుతాయి. బాణ లింగాల విశేషత ఏమంటే వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయకనే నేరుగా పూజించి అభిషేకము చేయవచ్చును. ఇవి ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము. 

కానీ ముట్టుకోకుండా ఎవరైనా పూజ చేయవచ్చును. ఇది సాలగ్రామములకు మాత్రమే వర్తిస్తుంది. మానవ నిర్మితమైన శివలింగాలకు కాదు. మణులతో చేసిన లింగాలను కూడా సర్వులూ పూజించవచ్చు. పాదరసపు లింగాలను కూడా అందరూ పూజింప వచ్చు. 

" సాలగ్రామము " అనేది నిజానికి నేపాల్ లో గండకీ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామము పేరు. అక్కడ ’ సాల ’ వృక్షాలు అధికము కాబట్టి ఆ పేరు. సాలగ్రామములనే రాతి చిహ్నాలు కూడా గండకీ నది ఒడ్డున దొరకుతాయి కాబట్టి వాటిని కూడా సాలగ్రామములు అనే అంటారు. 
వాటంతట అవే సహజ సిద్ధముగా ఏర్పడి దొరికే లింగాలలో బాణ లింగాలు , సాలగ్రామములు ముఖ్యమైనవి. బాణ లింగాలు నర్మదా , గండకీ నదిలోనూ ఒడ్డునా దొరుకుతాయి. 

సాలగ్రామములో నారాయణుడే ప్రతిష్ఠింపబడి ఉంటాడని ప్రతీతి. 

బదరీనాథ్ లోని నారాయణ విగ్రహము , ఉడుపిలోని కృష్ణ విగ్రహమూ సాలగ్రామ శిలతోనే మలచినట్టు గాథలున్నాయి. 

ఇతర విగ్రహాలలో పూజకు ముందు ఆయా దేవతలను మంత్రోక్తముగా ప్రతిష్ఠ , ఆవాహన చేయవలెను, కానీ సాలగ్రామములలో అహజముగానే , ఎల్లపుడూ నారాయణుడి అస్తిత్వము కలిగి ఉంటాయి. 
సాలగ్రామాలను పూజించటానికి మంత్రాలూ , ఉపదేశాలూ అవసరము లేదు.
 స్వచ్చమైన మనసు , అహంకారము లేని చిత్తము , మంచి నడవడిక , ప్రాపంచిక విషయాలపై అనాసక్తి మాత్రము చాలును. సాలగ్రామాలను పూజించుతకు అతి సరళమార్గము ఏదంటే , సాలగ్రామాన్ని నీటితోగానీ పాలతో కానీ కడిగి [ స్నానము చేయించి ] దానిపై ఒక తులసీ దళమునుంచి , ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నివేదించుటే. 

సాలగ్రామాలు కూడా గండకీ మరియూ ఇతర నదులలోనూ దొరుకుతాయి. సాలగ్రామములంటే రాళ్ళు కాదు.  అవి జీవముతో కూడుకున్నవి. ఒకానొక పురుగు తనచుట్టూ ఏర్పరచుకొన్న కోశమే [శిలాజము ]  గట్టిగా , రాతిలాగా కనపడుతుంది. వీటిని అభిషేకిస్తున్నపుడు ఒక్కోసారి అవి ప్రాణము వచ్చిన వాటిలా నీటిలో ఈదుతూ కదలుతాయి. ఇవి కూడా ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము.

ఇంటిలో రెండు సాలగ్రామములను పూజింపరాదు. అయితే మిగిలిన సమ సంఖ్యలో [అనగా నాలుగు , ఆరు , ఎనిమిది .... అలాగ]  సాలగ్రామములను ఉంచుకొని పూజించవచ్చు. సాలగ్రామములు ఇంటిలో ఉంటే ప్రతిరోజూ తప్పక అభిషేకమూ నైవేద్యమూ చేసి పూజించాలి. అలాగే బేసిసంఖ్యలో [ మూడు , అయిదు, ఏడు... అలాగ]సాలగ్రామములను ఇంటిలో పూజించరాదు. కానీ ఒక్క సాలగ్రామమును పూజింప వచ్చు. 

సాలగ్రామ శిల , భగ్నమైనా కూడా [ పగిలినా కూడా ] , చక్రము కలదైతే పూజించవచ్చు. సాలగ్రామములపై చక్రాలు ఏర్పడి ఉంటాయి. అవి తెలిసినవారు గుర్తిస్తారు. వారాహ పురాణము  , " సాలగ్రామ శిలను , కొద్దిపాటి బంగారముతో అయినా సరే , దానము చేసిన నరుడు భూదానము చేసిన ఫలాన్ని పొందుతాడు , మరియూ భక్తితో నూరు సాలగ్రామములను పూజించిన వాడికి కలిగే గొప్ప ఫలితాన్ని నూరు సంవత్సరములు వర్ణించినా సరిపోదు." అంటుంది. 

ఈ సాలగ్రామాలు దానముగా ఇచ్చినవే ఉత్తమము , శుభదమూ అయినవి. డబ్బులిచ్చి కొన్నవి మధ్యమములు , యాచించి తెచ్చుకున్నవి అధమములు. 

సాలగ్రామాన్ని ఉపనీతుడు [ ఉపనయనము అయినవాడు ] మాత్రమే ముట్టుకొని పూజించుటకు అర్హుడు. ఉపనయనము కానివారు , స్త్రీలు ముట్టుకొనరాదు. అలాగ ముట్టుకుంటే నరకదోషము కలుగును అని ’విష్ణు ధర్మము’ గ్రంధములో ఉన్నది.

౧ సాలగ్రామాన్ని , శంఖాన్నీ , తులసీ దళాన్నీ ఒక పళ్ళెములో ఒకే చోట ఉంచినంతనే శుభాలు కలుగుతాయి.
౨. దానము , వ్రతము , పూజ లేక శ్రాద్ధములు సాలగ్రామపు సమక్షములో చేస్తే ఎక్కువ ఫలితాన్నిస్తాయి.
౩. సాలగ్రామాన్ని అభిషేకించిన తీర్థము తాగితే సర్వ పాపాలూ నశిస్తాయి.
౪. గ్రహణాదులలో చేసే జపతపాలు సాలగ్రామపు సమక్షములో చేస్తే అధిక ఫలాన్నిస్తాయి. 
౫. భక్తిలేకున్నా , సాలగ్రామాన్ని పూజిస్తేనే ఫలము దొరకుతుంది.
౬. సాలగ్రామము దానము చేయుట అత్యంత శుభమైన కర్మ. 


శివరాత్రికి అందరూ తమ తమ ఇష్టమైన శివలింగాలను , సాలగ్రామాలనూ పూజించి ధన్యులు అయ్యెదరని ఆకాంక్షిస్తూ.. 

శుభం భూయాత్ || 

--janardhana sharma gaaru

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP