శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విశ్వసిస్తేనే భగవద్దర్శనం

>> Tuesday, April 15, 2014


భగవంతుడు సాధు రక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థం ఏ రూపంలోనైనా గోచరించగలడు. అదే భగవంతుని అవతార విశిష్టత. ఆయనను సంపూర్ణంగా విశ్వసించకపోతే బాధపడక తప్పదు. విశ్వసిస్తే ఆత్మగత సంబంధం ఏర్పడుతుంది. దేవుడి శక్తి మనలో నిండి ఉంటుంది. కనుక అప్పుడు ఎవరిలోనైనా దైవత్వం కనపడుతుంది.ఇలాంటి భావం అందరిలో ఏర్పడకపోవడానికి కారణం, దేవుడు లేడని కాదు మనకు దేవుడు కనపడాలన్న కోరిక బలంగా లేకపోవడం. కోరికలు మహారాజును కూడా కటిక పేదవాడిగా మార్చగలవు. కనుక భక్తులు కోరికలకు దూరంగా భగవంతుడికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనకు అవసరమైనవన్నీ భగవంతుడే అడక్కుండా సమకూరుస్తాడు. మనం కోరుకున్న కోరికలలో ఏవైనా తీరలేదంటే అవి మనకు మేలు చేయనివని దేవునికి అనిపించి ఉండాలి. అందుకే పరమాత్మ మనకు అనుగ్రహించలేదని తెలుసుకోవాలి.

ఈనాడు భగవంతుని గురించి వినడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అయినా వారిలోని అశాంతిని పారదోలుకోలేకుండా వున్నారు. ఎన్నో ఉపదేశాలు వింటున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాలు వ్యక్తిగతంగా, సామాజిక పరంగా చేస్తున్నారు. అయినా వారిలో శాంతి లేదు. వినడమొక్కటే సరిపోదు. భక్తితో భగవంతుడిని సేవించినప్పుడే బ్రతుకు పునీతమవుతుంది. మనఃపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానించే వారికి అసంతౄఎప్తి అనేది వుండదు. తన గురించి మనకెంత తెలుసునని ఆయన ఆలోచించడు, ఆయనకోసం మనమెంత తపిస్తున్నామనేదే ఆయన వీక్షణ. దేవుడు మన భక్తి విషయంలో సదా మేల్కొనేట్టుగా మన పూజలు వుండాలి. అంతేగానీ ఉన్నాడో లేడోనని పదిమందిని పోగేసి మీమాంసలు చేయవద్దు.

సంశయాత్ములకు భగవంతుడు సందేహాస్పదుడే! దైవ కార్యాలకు వచ్చే విఘ్నాలను దైవమే పోగొట్టాలి. తన శక్తి పైన గాక పరమాత్మ శక్తి పైన ఆధారపడి జీవించే వాడు భక్తుడు. మూడవ నేత్రం ముక్కంటికే గాదు, మనుష్యులందరికీ ఉంది. అదే జ్ఞాన నేత్రం. ఎవరికి జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో వారు గర్వాన్ని దగ్ధం చెయ్యగలరు. ‘సర్వం జ్ఞాన ప్లవే నైవ వృజినం సంతరిష్యసి’ జ్ఞానమనే తెప్పచే పాపరాశిని దాటగలవని శ్రీకృష్ణుడు గీతలో బోధించాడు. భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసం వుంచిన వాడికి జగమంతా వెలుగులే!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP