శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగమన్నామస్మరణం

>> Sunday, April 13, 2014

undefinedమారణాయుధం ఉపయోగించిన కొద్దీ ఉపయోగించే వాడి శక్తి తగ్గుతుంది. అందువల్ల త్వరగా నాశనమవుతాడు. కానీ దైవశక్తి (మంత్ర శక్తి) ఉపయోగించిన కొద్దీ ఉపయోగించే వాడి శక్తి పెరుగుతూనే ఉంటుంది. అందువలన చెడు నశిస్తుంది. ఇతని శక్తి రెట్టింపవుతుంది. మొదటిది హింస, రెండోది అహింస. ఆధ్యాత్మికత వలన సమాజము, వ్యక్తి కూడా ఉద్ధరింపబడతారు. సాధన వలన సాధ్యంకానిది లేదు. ఎటువంటి సాధనలు (పనిముట్లు) అవసరం లేకుండానే ఎంతో ఎత్తుకు ఎదగడమే ఆధ్యాత్మికత రహస్యం. శ్రద్ధతో చేసే సాధన వలన మాత్రమే విజయాన్ని పొందగలము.
సాధన : భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని చేసే ప్రయత్నాన్నే సాధన అంటాము. అనగా సంస్కారాల మార్పుకు చేసే తీవ్రమైన ప్రయత్నము భగవంతునికి దగ్గర చేస్తుంది. మానవజన్మ సర్వశ్రేష్ఠమైన సంపద. భగవంతుడిచ్చిన అమూల్యమైన కానుక. మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది, అమూల్యమైనది.

ప్రాణము కొనలేనిది, కొలువలేనిది. కర్మతో జన్మ ఎత్తివచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము. పాప, పుణ్యములే సుఖ, దు:ఖములకు మూలము. తెలుసుకుని చేస్తే సాధన. లేదంటే యాతన.కులము అనగా సమూహము. సామూహిక ప్రయత్నం ప్రధానంగా సాధన చేయడం ఆనందదాయకం. అంత:కరణాన్ని శుద్ధం చేసేది సత్సంగమే. ఒంటరిగా కూడా సాధన చేయడం మంచిది. కర్మలలో శ్రేష్ఠమైనది భగవత్కార్యము.
మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది. అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది. కొలువలేనిది. కర్మతో జన్మనెత్తి వచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము.
భగవత్కార్యము : కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున నామముల వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది. కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది భగవన్నామస్మరణ. దైవం నామాన్ని పదే పదే ఉచ్ఛరించడాన్ని నామ జపము అంటారు.

అసలు ఏ నామాన్ని జపించాలి? భగవంతుడి రూపము ఏది? భగవంతుని నామము ఏది? ఇంతమంది దేవుళ్లలో ఎవరికి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఇంతమందికీ చేయకపోతే ఏమౌతుందో, ఎవరేమనుకుంటారో యిన్ని సందిగ్ధాలతో అయోమయంలో పడిపోయి ఇటూ అటూ పరిగెడుతూ, కాలాన్ని వ్యర్థం చేయనవసరం లేదు. తెలుసుకుంటూ చేసేది సాధన. ప్రయత్నము. మన కోసం మనం చేసేదే ఈ కార్యసాధన. నిశ్చయంగా సత్యస్వరూపుడు, పరమాత్ముడు. భగవంతుడు శ్రీ మహావిష్ణువు. సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలనెడి ఐదు విధములుగా వేంచేసియున్నాడు.

వైష్ణవ అవతారతత్త్వము
1. పరస్వరూపము : శుద్ధ సత్త్వమయమగుటచే కోటి సూర్య ప్రకాశమానమై, వైకుంఠ లోకాలను కల్పవృక్షం కింద రత్న ఖచిత సింహాసనంపై శ్రీ, భూ, నీలా సమేతుడై, నిత్య ముక్తానుభావ్యుడై, నిరతిశయానంద యుక్తుడై వేంచేసియుండు స్వామి -పరస్వరూపము.
2. వ్యూహ స్వరూపము : క్షీరసాగరాన, జగత్సృష్టికి మూలకందమై, జ్ఞానశక్తి, బలైశ్వర్య వీర్య తేజస్సులతో కూడుకొనియుండు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవాది నామాలచే వ్యవహరించబడే భగవత్స్వరూపం -వ్యూహ స్వరూపము.
3. విభవ స్వరూపం : దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ధర్మసంస్థాపన అప్రాకృత దివ్యమంగళ స్వరూపం తోడనే, ఈ లీలా విభూతికి విచ్చేసి, సకల మనుజనయన విషయాలై యుండు శ్రీరామ కృష్ణాద్యవతారాలు -విభవ స్వరూపం.
4. అంతర్యామి స్వరూపం : నిఖిల ప్రవృత్తి కారకుడై సకల జీవాత్మలయందును పరమాత్మయై అంతర్యామిగా వేంచేసియుండి, సత్కర్మానుష్ఠానాన్ని అనుమతించు స్వరూపమే -అంతర్యామి స్వరూపం.
5.అర్చావతారం : భగవశ్శాస్త్రోక్త ప్రకారం శ్రీమూర్తులగల్పించి, యధాశాస్త్రంగా ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో వానిని ఆరాధించే భక్తాగ్రేసరులచే పూజింపబడే భగవానుని దివ్యమంగళ విగ్రహం -అర్చావతారం.

ఇది ఆలయార్చన, గృహార్చన అని రెండు విధాలుగా ఉన్నది. సర్వజనుల సౌకర్యార్థమేర్పర్చబడింది ఆలయార్చన. గృహాలలో ప్రతిరోజూ పూజించుకొనుటకై ప్రతిష్ఠితాలగు విగ్రహాలు గృహార్చ. అర్చా స్వరూపం సర్వప్రాణి సులభమై సర్వప్రాణి శరణ్యమై యున్నది. అర్చా స్వరూపము అందరికీ అందుబాటులో ఉంటుంది. అర్చా విగ్రహాలు స్వయం వ్యక్తాలు. పురాణ ప్రసిద్ధాలు, ప్రతిష్ఠితాలు అని మూడు రకాలు. శ్రీ మహావిష్ణువు ఈ కలియుగములో పద్మావతీ రమణుడగు వేంకట రమణుడై వైకుంఠాన్ని విడిచి భక్తుల పాలిటి కల్పవృక్షమై, నమ్మిన వారికి కొంగుబంగారమై, భక్త జన సులభుడుగా, "కో" అంటే "ఓ" అనే తత్త్వముతో (అనగా ఒకే పిలుపు పిలిచినా పలికే దైవం) అర్చాస్వరూపముతో స్వయం భూగా వేంచేసి యున్నాడు. ఈ కలియుగ వైకుంఠమును, ఆ శ్రీనివాసుని (మహావిష్ణువు) నామమును, పాదములను ఆశ్రయించని భక్తులెవ్వరు. ఆ వైకుంఠ నాధుడే ఈ వేంకట నాధుడు. అనంతములైన నామములతో కొలువబడే, అసంఖ్యాకములైన పేర్లతో పిలువబడే స్వామిని ఒక్క నామమును స్వీకరించి నామజపము చేయుట వలన గాని, సహస్ర నామములతో కీర్తించుట, స్తుతించుటతో గాని ప్రసన్నుణ్ణి చేసుకోగలుగుతున్నాము.

భగవదనుగ్రహాన్ని శ్రద్ధతో, సాధనతో స్వప్రయత్నంతోనే పొందగలుగుతాడు సాధకుడు. తద్వారా జ్ఞానాన్ని, శీలాన్ని, ధర్మాన్ని పొందుతాడు. అసాధ్యమైన సత్యాన్ని గ్రహిస్తాడు. నిర్గుణ, నిరాకారం ఆది పరబ్రహ్మమని, సగుణ, సాకారం శ్రీ మహావిష్ణువని పెద్దలు చెప్పుచున్నారు. భక్తికి నామమే ఆధారం. నామమే భగవత్‌స్వరూపము. ఎవరైతే నామమును జపిస్తారో వారు తరిస్తారు.
 శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలోయజ్ఞానాం జపయజ్ఞోస్మిఅన్ని ప్రకారములైన యజ్ఞములలోనూ జపయజ్ఞమును నేను -గీతాచార్యుడు.
(పదవ అధ్యాయం - విభూతి యోగము)
చిత్తశుద్ధికి నామజపము కంటే సులభమైన సాధనము లేదు. భక్తి, శ్రద్ధ, అణకువ, ప్రేమ, ఓర్పు, విశ్వాసం(నమ్మకం)లతో జపిస్తే సర్వదా భగవంతుని రక్ష ఉంటుంది. అంత:కరణాన్ని శుద్ధిచేసేది, శరీరాన్ని, మనసును కూడా ఉత్తేజపరచి నిర్మలంగా చేసేది సత్సంగమే. ఉత్తమ గతి పొందాలంటే పావనమైన మార్గం నామజపం. దీంతో శీఘ్రంగా సత్ఫలితాలను పొందగలుగుతాము. నిరంతరము హరిభజన, గోవింద నామ సంకీర్తన, విష్ణుసమస్రనామ స్తోత్రములతో జన్మ చరితార్ధం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ... 

- సత్య గాయత్రి   [సూర్య డైలీ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP