శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరిత్ర -37,38, 39

>> Sunday, June 10, 2012

వార్తాపత్రికలు ఆమెను తీవ్రంగా విమర్శించాయి. ఆ తరువాత బ్లావట్‌స్కీ యొక్క యోగసిద్ధులను గురించిన ఆ ప్రస్తావనే ఎక్కడా లేదు. స్వామివారి దివ్య దృష్టి తత్త్వ జ్ఞానములు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించినాయి. ముంగేరు తిరిగి వచ్చిన తరువాత నేను అందరినీ కలిశాను. శ్రీయుతులు యదునాథ్ భాగ్చీగారితోను, పరివ్రాజక శ్రీకృష్ణ ప్రసన్న సేన్‌గారితోను (ముంగేరు ఆర్య ధర్మ ప్రచార సభా ప్రతినిధులు) శ్రీ స్వామివారి అలౌకిక శక్తులను గురించి, వారి ఉపన్యాసములను గురించి చెప్పి, వారు నా చేత ఉపదేశ పూర్వకంగా వ్రాయించిన రెండు పుస్తకాలను చూపించాను. ఆ మాటలు విని వారు ఆశ్చర్యపడ్డారు. కాశీకి తీసుకొని వెళ్లి స్మామివారి దర్శనం చేయించమని పదే పదే ప్రాధేయపడ్డారు. స్వామివారు నాకు చేసిన ఉపదేశాన్ని ఎవ్వరితోనూ చెప్పవద్దని వారు చెప్పినా, ఆ ఇద్దరితోనూ చెప్పకుండా ఉండలేకపోయాను. అందుకు కారణం వారు నాకు చాలా సన్నిహితులు, నన్ను బాగా ప్రేమించేవారు కావటమే! క్రమక్రమంగా నా మాటలు అంతటా వ్యాపించసాగినాయి. నేను చాలా భయపడసాగాను.
ఒక సంవత్సరం తరువాత నేను శ్రీకృష్ణప్రసన్న సేన్ మహాశయులతో కలిసి కాశీకి వెళ్లాను. సంధ్యాసమయం అయ్యాక స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు అందరూ వెళ్లిపోయిన తరువాత, అసురసంధ్య వేళ ఆశ్రమానికి వెళ్లాము. ఆశ్రమంలోని దేవతామూర్తులకు, స్వామివారికి నమస్కరించి మేము స్వామివారి దగ్గర కూర్చున్నాము. స్వామివారు కొంతసేపటికి మావైపు చూసి ఇట్లా అన్నారు. ‘‘ఓరుూ శ్రీకృష్ణా! నీ మనసులో ఎంతో అహంకారం ఉన్నది. శ్రీకృష్ణుడు అవతారమెత్తినట్లే నీవు కూడా అవతారమెత్తానని భావిస్తూ ఉంటావు. అందరూ నీ పూజ చేయాలని భావిస్తూ ఉంటావు. నీ పాదధూళిని బ్రాహ్మణులకు ఇవ్వటానికి కూడా సంకోచించవు. నీ భవిష్యత్తు చాలా విచారకరంగా ఉన్నది. నీవు సామాన్య మానవుడివి. కాని కొంత మాట్లాడగల శక్తి నీకు ఉన్నది. పిండిని పూరీలాగా ఒత్తి సలసల మరిగే నూనెలో పడవేసినపుడు, అందులో వచ్చి ఉన్నంతవరకూ శబ్దం చేస్తూంది. పూరీ అయిన తరువాత అది శబ్దం చెయ్యదు. అంతేకాక నూనె మీద తేలియాడుతూ ఉంటుంది. అలాగే నీలోని అహంకారం పోయి నమ్రత వస్తే నీవు ధర్మానికి చేరువవుతావు. ప్రస్తుతం నీవు ధర్మానికి ఎంతో దూరంలో ఉన్నావు’’ అని అన్నారు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణప్రసన్న సేన్ మహాశయుడు ఏమీ జవాబు చెప్పకపోగా, ఏ రకమైన కుతూహలమును ప్రదర్శించలేదు. కొద్దిసేపటికి స్వామివారు మమ్ములను వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశారు. మేము బయటకు వచ్చేశాము. శ్రీసేన్ మహాశయుడు మిసిర్ పోఖరాలో ఆర్యధర్మ ప్రచారక సభను స్థాపించటానికి అక్కడే ఉండిపోయాడు. కాని నేను అక్కడ ఉండటం స్వామివారికి ఇష్టంలేదు. కావున మూడు రోజులు కాశీలో ఉండి ముంగేరుకు తిరిగి వచ్చాను. గురుదేవులను గురించి ప్రచారం చేసినందుకు స్వామివారికి నాపైన కోపం వచ్చినట్లుంది. అందుకే వారు నన్ను తిరస్కారభావంతో చూశారు. నా తప్పును క్షమించమని వారిని నేను వేడుకొన్నాను. మీ అలౌకిక శక్తులను, అసాధారణ గుణగణాలను గురించి నా దగ్గరి స్నేహితులొకరిద్దరితో చెప్పకుండా ఉండలేకపోయాను అని విన్నవించుకొన్నాను.
సేన్ మహాశయుడు కొన్ని రోజులు మిసిర్ పోఖరాలో ఉండి, హూజ్ కటారాలో ఒక ఇంటిని కొన్నారు. అక్కడ శ్రీ అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించి, ఆ ఇంటికి యోగాశ్రమమని పేరు పెట్టి అక్కడే ధర్మప్రచారం చేస్తూ ఉండిపోయారు. అప్పటినుండి ఆయన పేరు కృష్ణానంద స్వామి అయింది. ఒక సంవత్సరం తరువాత బాబా యదునాథ్ భాగ్చీ మహాశయులు, ఆశ్వీయుజ మాసం వచ్చే దేవీ నవరాత్రుల సందర్భంగా ఇచ్చే శెలవులలో నాతోపాటు కాశీకి వచ్చారు. సంధ్యా సమయంలో మేమిద్దరమూ శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్లి, అక్కడ ఉన్న దేవతామూర్తులకు, స్వామివారికి నమస్కరించి, స్వామివారి సన్నిధిలో కూర్చున్నాము.
-స్వామీజీ మిమ్మల్ని చూసి ‘‘ఓ యదునాథ్ బాబూ! నీవు అనేక శాస్త్ర గ్రంథాలను చదివి చెడిపోయినావు. ఇప్పటికీ నీ మనస్సు స్థిమితపడలేదు. మొదట నీవు నీ మనస్సును అధీనంలో పెట్టుకో! తరువాత నీకు ముక్తి లభిస్తుంది. నీకు నా నుండి దీక్ష స్వీకరించాలనే కోరిక ఉన్నది కాని ఇప్పటివరకూ నేను ఐదుగురిని శిష్యులుగా గ్రహించాను. ఇంక ఎవ్వరికీ దీక్ష ఇవ్వను. దీక్ష ఇవ్వటం కూడా మహాపాపమే. ఎందుకంటే దీక్ష ఇచ్చిన తరువాత శిష్యుడు గురూపదేశం ప్రకారం కర్మ చెయ్యాలి. ఒక వేళ ఆ కర్మ శిష్యుడు చెయ్యకపోతే గురువే చెయ్యాలి.
గురువు కూడా చేయకపోతే మహాపాపం చుట్టుకొంటుంది. శిష్యుడిని ఎలా ఉద్ధరించాలా అనే గురువు ఆలోచిస్తూ ఉంటాడు. అందుచేత నేను మహాపాతకములలో మునిగిపోతాను. కావున నాతో సమానమైన నా రెండో శిష్యుడు మహాత్మా కాళీచరణ్ స్వామి నీకు దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చే ముందు నీ శరీరం పవిత్రం కావలసి ఉన్నది. అందుకు నీకు ఒక ఉపాయం చెబుతాను. వైశాఖ పూర్ణిమ రోజన కాశీకి వచ్చి ఒక సద్‌బ్రాహ్మణుని చేత ఆపని చేయించుకో’’ అని చెప్పి ఇంకా ఇలా అన్నారు. ‘‘నీవు నీ కార్యాలయంలో ఉన్నత పదవిలో ఉన్నవాడివి. కనుక నీవు ఆ కార్యాలయాన్ని గురించి ఎంతో ఆలోచించాలి. నీవు గత 20-22 సంవత్సరాల నుంచీ శాకాహారివి. కొన్ని రోజుల తరువాత నీకు భయంకరమైన గొంతునొప్పి వస్తుంది. కావున నీవు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చేపల ఆహారం తీసుకోవాలి. అయితే నీవు ఉద్యోగం వదలిపెట్టదలిస్తే అలా చెయ్యనవసరం లేదు. యదునాథ్! నీవు అంత నియమ నిష్ఠాగరిష్టుడైన హిందువు కావలసిన అవసరం లేదు.
ఒక రోజున నీవు నీ దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణ ఉద్యోగి లఘుశంక తీర్చుకొనే సమయంలో తన యజ్ఞోపవీతాన్ని చెవిపైన వేసుకోని కారణంగా, క్రోధవివశుడవై అతనికి పదోన్నతి కలుగకుండా చేశావు. దానిని బట్టి నీకు యజ్ఞోపవీతాన్ని చెవిపైన వేసుకోవటంలోని ఆంతర్యం తెలియదని అర్థమవుతున్నది. యజ్ఞోపవీతము అతి పవిత్రమైనది. అల్పాచమానము అపవిత్రమైనది. అల్పాచమానము యజ్ఞోపవీతం మీద పడకుండా ఉండటానికి దానిని చెవికి చుట్టుకుంటారు’’ అని అన్నారు. భాగ్చీమహాశయుడు స్వామివారి మాటలు విని ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ సమయంలో భాగ్చీమహాశయుని జ్యేష్ఠపుత్రుడు సరోజ్‌నాథ్‌కు ఉపనయనము చేయాలని సంకల్పించి సుముహూర్తం కొరకు ఎదురుచూస్తున్నాడు. సరోజ్‌నాథ్ ఒక సద్బ్రాహ్మణుడు కావాలనే కోరికతో స్వామివారిని ఒక శుభలగ్నం నిర్ణయించమని కోరాడు. స్వామివారు శుభముహూర్తం నిర్ణయించి మమ్మల్ని వెళ్లమని ఆదేశించారు. మేమిద్దరమూ స్వామివారికి నమస్కరించి వెళ్లిపోయాము.
మరునాటి ప్రొద్దున ఆశ్రమానికి వెళ్లేటప్పుడు మణికర్ణికాఘాట్‌లో మహాత్మా భోళానాధ్ స్వామి సాక్షాత్కరించారు. వారి చెంత మేము కూర్చున్నాము. అందరూ వచ్చిపోవడం తగ్గిన తరువాత నాతో స్వామివారు ‘‘మీరు ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఎవరినీ వెంట తీసుకొనిరావద్దు. ఒకవేళ ఆశ్రమానికి రావలసివస్తే ఒంటరిగానే రావాలి. లేదా, రానే వద్దు’’ అని చెప్పి భోళానాథ్ స్వామి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పారు. మేము వెళ్లాము. స్వామివారి వద్ద గుమికూడటం మంచిది కాదని భోళానాథస్వామి నాతో చెప్పారు. వారు మొదటినుంచీ నాతో చాలా స్నేహంగా ఉండేవారు. ముంగేరులో ఉన్నప్పుడు వారు నా దగ్గరకు మూడుసార్లు వచ్చారు. ఏడు రోజులు కాశీలో ఉండి భాగ్చీమహాశయుడు, నేను ముంగేరుకు తిరిగి వెళ్లాము.
ముంగేరుకు వెళ్లిన తరువాత భాగ్చీమహాశయుడు శరీరశుద్ధికొరకు దానం చేయదలచి సద్బ్రాహ్మణుడైన శశిధర తర్కచూడామణిని కోరాడు. కాని దానికి వారు అంగీకరించలేదు. అప్పుడు భాగ్చీ మహాశయుడు ఎంతో ఆలోచించి, నవద్వీపంలోను, భాట్‌పాడాలోను వెదకి ఒక సద్బ్రాహ్మణుని పట్టుకొన్నాడు.

కాని కాశిలో దానం తీసుకోవటానికి ఎవ్వరూ అంగీకరించలేదు. దానం తీసుకొనే బ్రాహ్మణుడు దొరకనందున భాగ్చీ మహాశయుడు ఎంతో విచారించాడు. క్రమక్రమంగా పుణ్యకాలం సమీపిస్తూ ఉండింది. రోజులు గడుస్తున్నాయి. కానీ సమస్యకు సమాధానం దొరకలేదు. అందువలన ఒకరోజున అదే విషయం ఆలోచిస్తూ కళ్ళనీళ్లపర్యంతం అయ్యాడు.
శ్రీ స్వామివారు నిర్దేశించిన సమయం ఇంకా నాలుగు రోజులు ఉన్నదనగా, మహాత్మా భోళానాథ స్వామి అక్కడికి వచ్చారు. త్రైలింగస్వామి వారు మమ్మల్ని కాశీకి తీసుకొని రమ్మన్నారని, మమ్మల్ని పరిశుద్ధుల్ని చెయ్యటానికి కాశీలో ఒక సద్బ్రాహ్మణుని వెతకమని మా వద్దకు పంపారని చెప్పారు. రెండవ రోజు యదునాథ్ భాగ్చీ, భోలానాథస్వామి వెంట కాశీకి వెళ్లారు. అక్కడ త్రైలింగస్వామి వారు నియమించిన ఒక నిత్యాగ్నిహోత్రి అయిన బ్రాహ్మణుని చేత శరీర శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయించి, ఏడు రోజులలో ముంగేరుకు పంపించారు. ఆ రోజునుంచీ శ్రీ స్వామివారి అలౌకిక శక్తులను గురించి నాకూ భాగ్చీ మహాశయునికి ప్రతిరోజూ చర్చలు జరిగేవి.
దాని తరువాత ఐదారు సంవత్సరములకు మహాత్మా త్రైలింగస్వామివారి శిష్యుడైన మహాత్మా కాళీచరణ్ స్వామి, భాగ్చీ మహాశయుని ఇంటికి వచ్చి దీక్ష ఇచ్చారు. దీక్ష తీసుకొన్న తరువాత ఒక సంవత్సరానికి భాగ్చీ మహాశయులు తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యారు. ఆ సమయంలో నేను డార్జిలింగ్‌లో ఉండేవాడిని. ఆయన మూడు నెలలు సెలవు పెట్టి నా దగ్గరకు వచ్చి నాతో గడిపారు. ఆ తరువాత ఆయనకు స్వస్థత చేకూరింది.
కొన్ని రోజుల తరువాత నేను పనిచేసే వైద్యశాలలోనే మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీ మహేంద్రలాల్‌ఘోష్ (ఈయన ఒక పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేసేవారు. అందువల్ల అందరూ ఆయనను మాస్టర్ సాహెబ్ అని పిలిచేవారు). ‘‘ఉమాచరణ్! ఖాతాలో ఆరు వందల రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఆ రూపాయలు ఎవరికైనా ఇచ్చిరేమో జ్ఞాపం చేసుకొని చెప్పండి’’ అన్నారు. నేను ఎంత జ్ఞాపకం చేసుకొన్నప్పటికీ ఆ రూపాయలు ఎవ్వరికీ ఇచ్చినట్లు జ్ఞాపకం రాలేదు. వైద్యశాలలో రెండు ఇనుప పెట్టెలు ఉండేవి. వాటికి నాల్గు తాళం చెవులు ఉండేవి. అందులో రెండునా దగ్గర రెండు మాస్టర్‌గారి దగ్గర ఉండేవి. ఇనుప పెట్టెలుండే గదిలోనే నేను నిద్రించేవాడిని. మేమిద్దరం కలిసి ఎన్ని లెక్కలు వేసినా, తప్పు ఎక్కడా దొరకలేదు. అప్పుడు మా ఇద్దరిలో ఎవరో ఒకరు దొంగ కావాలి గదా అని మేము ఆలోచించసాగాము. అంతకుమించి మూడవవ్యక్తిని అనుమానించటానికి ఆస్కారం లేదు. మాస్టర్‌గారు దొంగ కావటానికి వీలు లేదు.
అందరి దృష్టిలోనూ నేనే దొంగను అయ్యే ఆస్కారం వున్నది. క్రమక్రమంగా ఈ అనుమానం వ్యాపించసాగింది. ఆ విధంగా మూడు నెలలు గడిచింది. కాని డబ్బు సంగతి తేలలేదు. ఒకవేళ న్యాయం నిర్ణయించవలసి వస్తే అందరూ ననే్న దొంగగా నిర్ణయిస్తారు. అన్ని విధాలా ఆలోచించి, భగవంతునిపైన భారం వేసి, ఒకసారి స్వామివారిని దర్శించవలెనని నిర్ణయిచుకొన్నాను. ఎవరికీ చెప్పకుండా కాశీకి వెళ్లాను. స్వామివారికి నమస్కరించి వారి దగ్గర కూర్చున్నాను. వారు నా వైపు దృష్టి మరల్చి నవ్వి ‘‘ఏం నాయనా! డబ్బు అదృశ్యం కావటంవలన నా దగ్గరకు వచ్చావా?’’ అన్నారు. అందుకు నేను అవునన్నాను. అప్పుడు స్వామీజీ- ‘‘నీలాగానే నీ మాస్టరు గారు కూడా అయోమయంలో పడ్డారు. ఫలానా నెలలో ఫలానా రోజున 500 రూపాయలు కలకత్తాకు పంపించారు. అందులో 300 రూపాయలు నరసింహప్రసాద దత్తుకు, 200 రూపాయలు ఫలానా కంపెనీకి పంపారు. నీవే స్వయంగా పంపించి వచ్చావుకదా! దాని రశీదులు ఫలానా విభాగంలో ఉన్నాయి. రూపాయిలు ముట్టినట్లు రశీదులుకూడా వచ్చినాయి. అయినా మీరు కండ్లు తెరువలేదు.
- ఇంకాఉంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP