శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందువులంతా చదవవలసినపోస్ట్

>> Sunday, May 22, 2011


ఏడాది పొడవునా అన్ని దేవాలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు. హుండీలు పొంగిపొర్లుతున్నాయి, భక్తులు చెల్లించుకున్న ముడుపులతోనూ, మ్రొక్కులతోనూ, తదితర కానుకలతోనూ ! దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఆ దేవాలయాలలో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవితాలు గడిపేస్తున్నారు. దేవాలయాల యాజమాన్యం క్రింద ఉన్న నానా విద్యా, వైద్యసంస్థల్లో వేలాదిమంది చేఱుతున్నారు.


అంతా బానే ఉన్నట్లు కనిపిస్తోంది కదూ ? నిజానికి వాస్తవ పరిస్థితి అంత ఆశావహంగా లేదు. హిందూమతం ఒక అత్యవసర పరిస్థితి (Emergency) వైపు, ఒక మానవ వనరుల సంక్షోభం (Human resources' crisis) వైపు అతివేగంగా పయనిస్తోంది. ఎక్కడో అమెరికాలో కాదు, ఇక్కడే ఈ సనాతన భూమిలోనే ! ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయ దృశ్యం కనీసం పదేళ్ళ తరువాత, లేదా గరిష్ఠంగా పాతికేళ్ళ తరువాత పూర్తిగా అదృశ్యం కాబోతున్నది. అటుపిమ్మట ఆ దేవాలయాల పరిస్థితేంటో, వాటిల్లోని దేవుళ్ళ పరిస్థితేంటో, ఆ దేవాలయాల క్రింద నడుస్తున్న సంస్థల పరిస్థితేంటో, అసలు టోకుగా హిందూమతం పరిస్థితేంటో అంతా అగమ్యగోచరం. ఎందుకంటే హిందూమతానికి తీవ్రమైన పూజారి-పురోహితుల కొఱత ముంచుకు రాబోతోంది. ఇది చాప కింద నీరులా ఇప్పటికే మొదలయింది, గత కొద్ది సంవత్సరాలుగా ! మొదట్లో ఒక పదీ-పదిహేనేళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ అర్చక బ్రాహ్మణుల కొఱత ఇప్పుడు నగరాలక్కూడా ప్రాకింది. రాష్ట్రంలో సుమారు ఇఱవై-పాతిక లక్షలమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వారిలో పౌరోహిత్యం చేసేవారి జనాభా దారుణంగా పడిపోవడంతో చిన్నచిన్న వేడుకలూ, కర్మలూ చేయడానికి సైతం ఎవఱూ దొఱక్క, ఆ దొఱికిన బ్రాహ్మణుడికే అనేక రెట్లు డబ్బు కుమ్మరించి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులో ఎంత చిన్న అర్చామూర్తిని ప్రతిష్ఠించాలన్నా యాభైవేలు డిమాండు చేస్తున్నారు. కాస్త పెద్ద విగ్రహాలకైతే లక్ష తప్పనిసరి. జనం "సరే"నని విధిలేక ఇస్తున్నారు, చందాలేసుకుని మఱీ !

అసలు విషయమేంటంటే - బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు. రాష్ట్రం నలుమూలలా వేదపాఠశాలలూ, అవీ నామమాత్రంగా ఉండడానికైతే ఉన్నాయి. కానీ అక్కడ శిక్షణ పొంది బయటికొస్తున్నవాళ్ళ సంఖ్య బొత్తిగా సరిపోదు ఈ ఏనుగుని ఎత్తడానికి ! ఉన్న పురోహితుల పిల్లలే అర్చక-పౌరోహిత్యంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. అథవా కొంతమంది ఇష్టపడినా ఇంట్లో ఆడవాళ్ళు "ఠాఠ్ ! వల్లకాదు. అర్చక-పౌరోహిత్యంలో ఏముంది ? నా కొడుకు ఇంజనీరో, డాక్టరో అవ్వాల్సిందే" నని ముక్కు చీదితే కాదనలేక అటు మళ్ళిస్తున్నారు. మిహతా బ్రాహ్మణ జనాభా అలవాటు చేసుకుంటున్న డబ్బువిలువలు ఈనాడు సాంప్రదాయిక అర్చక బ్రాహ్మణ కుటుంబాల్ని కూడా ఇతోఽధికంగా ప్రభావితం చేస్తున్నాయి. తమను తాము ఉద్యోగ వర్గపు బ్రాహ్మణులతో పోల్చుకుని "మనకేం తక్కువ ? ఇంగ్లీషు చదువుకుంటే ఆ మాత్రం ఉద్యోగాలు మనం చెయ్యలేమా ? సంపాదించలేమా ?" అని బయలుదేఱుతున్నారు, ధనసంపాదనా ప్రస్థానానికి ! ఆ విధంగా ఒకసారి మా దగ్గఱ పనిచేస్తున్న యువ పురోహితుడు కూడా HDFC బ్యాంకులో చేఱాడు. కానీ ఆ బ్యాంకువాళ్ళు పొద్దున్నే పూజ చేసుకోవడానిక్కూడా వీల్లేనంత బిజీ చేసేస్తున్నారని గమనించి ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ పౌరోహిత్యంలోకి వచ్చాడు. సరే, ఇది పురోహితుల సంగతి. ఇహ పూజారుల విషయానికొస్తే వాళ్ళని తప్పు పట్టలేం, వాళ్ళకి ఇస్తున్న జీతం ఒక మనిషిని పోషించడానిక్కూడా చాలని పరిస్థితుల్లో ! పూజారి, పురోహితుడంటే బ్రాహ్మణ అమ్మాయిలు ముందుకు రావడం లేదు పెళ్ళి చేసుకోవడానికి ! అందువల్ల కూడా చాలామంది బ్రాహ్మణులు ఈ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏ ఇతర మతంలోనూ లేదు. హిందూ పూజారులే దీనికి గుఱిచేయబడుతున్నారు.

ఈ పరిస్థితి హఠాత్తుగా తలెత్తినటువంటిది కాదని గమనించాలి. గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్ద ప్రక్రియ (silent process) లో ఉన్నదే ఈనాడు బహిరంగంగా విశ్వరూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఈ సామాజిక సంక్షోభం తలెత్తకుండా హిందువులూ, వారి నాయకులూ కొన్ని దశాబ్దాల క్రితమే కాస్త ముందుచూపుతో, ఈషణ్మానవత్వంతో వ్యవహరించి ఉంటే బావుండేది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ బ్రాహ్మణుల్ని అణచివేయడమూ, వారు తమకెన్నడూ చేయని అపకారాలకు వారిమీద కులకక్ష సాధించడమూ - ఇవే లక్ష్యంగా పెట్టుకున్నాయి అబ్రాహ్మణ హిందువుల నాయకత్వంలోని ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా చాలా హీనమైన పేదఱికానికి గుఱిచేశారు బ్రాహ్మణ కులాన్ని ! రిజర్వేషన్ల పేరుతో ఎంత చదువుకున్నా ఉద్యోగాలివ్వకుండా హింసించారు. ప్రమోషన్లు ఇవ్వకుండా హింసించారు. ఏ పాపమూ ఎఱుగని బ్రాహ్మణ ఉద్యోగులమీద తప్పుడు అవినీతి కేసులు బనాయించి మఱీ హింసించారు. భూపరిమితి చట్టాల పేరుతో, కమిటీల పేరుతో భూములు లాగేసుకుని హింసించారు. పూజారులకు జీతాలివ్వకుండా ఎగ్గొట్టి హింసించారు. ఓరియంటల్ కళాశాలల్లో చాలీచాలని జీతాలకు తెలుగూ, సంస్కృతమూ చెప్పుకుని బతుకుతూంటే "బ్రాహ్మణుడు ఆ మాత్రం కూడా ఎందుకు బతకా"లని ఏకంగా ఆ కళాశాలల్నే ఎత్తేశారు. అలా ఎక్కడెక్కడ బ్రాహ్మణుడు ఆశ్రయం పొంది ఒక ముద్ద అన్నం తింటున్నాడో కనిపెట్టి ఆయా వ్యవస్థల్నీ, సంస్థల్నీ క్రూరంగా కూలద్రోసుకుంటూ పోతూ అతన్ని దయాదాక్షిణ్య రహితంగా లేవగొట్టారు. ఏతావతా హిందువులకు తరతరాల గురువైన బ్రాహ్మణుడికి చివఱికి ఆ హిందూసమాజంలో మనుగడనే దుర్భరం చేశారు. బ్రాహ్మణుడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందనే పూర్వ నమ్మకాన్ని కాలరాచి బ్రాహ్మణుడి పొట్టగొడితే అభ్యుదయం అవుతుందనే ఒక నవీన కలికాలపు ధర్మశాస్త్రాన్ని రచించారు. బ్రాహ్మణుడి యొక్క తరతరాల సాంప్రదాయిక జీవన వనర్లన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు. ఇన్ని చేశాక, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా జీవించడానికి కావాల్సిన ప్రాపులూ, వాతావరణమూ సంపూర్ణంగా అదృశ్యమైనాక ఈ రోజు మీకు పూర్వపు బ్రాహ్మణుడే కావాలంటే ఎక్కడ దొఱుకుతాడు ?

అలా అబ్రాహ్మణులు ప్రభుత్వాల రూపంలో బ్రాహ్మణుల్ని బాధించడానికి పూనుకోవడం ఊరికే తమాషాగా జఱిగింది కాదు. సర్వే జనా స్సుఖినో భవన్తు అని ఆశీర్వదించే బ్రాహ్మణుడు లోకకంటకుడుగా, సంఘద్రోహిగా చిత్రించబడడం చిత్రమే అయినా ఆ విచిత్ర విద్వేష మనస్తత్త్వానికి నింపాదిగా పునాదులు వేసిన కుట్ర ఒకటుంది. దాని వెనుక ఒక కుహనా సైద్ధాంతిక ప్రాతిపదిక (ideological basis) ఉంది. గతశతాబ్దంలో సర్వేసర్వత్రా బ్రాహ్మణుల మీద విస్తృతంగా జఱిగిన విశృంఖలమైన దుష్ప్రచారమే ఆ ప్రాతిపదిక. ఈ దుష్ప్రచారంలో నాస్తికులూ, కమ్యూనిస్టులూ అయిన బ్రాహ్మణులు కూడా అమాయకంగా పాలుపంచుకున్నారు, దాని మూలమూ పర్యవసానాలూ ఊహించలేక ! ఈ కుట్రకు నాందీప్రస్తావన చేసినది క్రైస్తవ మిషనరీలు కాగా అమలు జఱిపింది బ్రిటీషు ప్రభుత్వం. బ్రాహ్మణులకు తరతరాలుగా సమాజంలో ఉన్న ప్రాచుర్యాన్నీ, జనాదరణనీ నాశనం చేస్తే తప్ప హిందూమతాన్ని నాశనం చేయలేమనే కీలకాన్ని వారు కనిపెట్టారు. ఈ కుట్రలో భాగంలో ప్రతిరాష్ట్రంలోనూ ఎక్కడెక్కడి బ్రహ్మద్వేషుల్నీ దగ్గఱికి తీసి, దువ్వి, తెఱ వెనుక ఆర్థికాది సహకారాలు అందించి రెచ్చగొట్టారు. నిజంగా బ్రాహ్మణులు వీళ్ళు ప్రచారం చేసినంత బలవంతులూ, విలన్లే అయితే వాళ్ళని శాల్తీల్ని లేపేసి మొగ్గలోనే తుంచి అవతల పారేసి ఉండేవాళ్ళు. బలహీనులూ, నిస్సహాయులు గనుకనే తమ మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఏమీ అనలేకా, ఏమీ చెయ్యలేకా దీనంగా చూస్తూ నిలబడ్డారు.

ఒక రకంగా చెప్పాలంటే - ఈనాడు తెలంగాణవాదులు ఆంధ్రా ఏరియావారి మీద చేస్తున్న దుష్ప్రచారం లాంటిదే చేశారు గత శతాబ్దంలో బ్రహ్మద్వేషులు. ఆ దుష్ప్రచారం చాలా ప్రతిభావంతంగా, సమర్థంగా జఱిగింది. బ్రాహ్మణులు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా దానికి కులగజ్జిపరమైన వక్రభాష్యాలు చెప్పారు. జాతికి బ్రాహ్మణులు చేసిన సేవలన్నీ వారి ఆధిపత్యానికి చిహ్నమని ప్రచారం చేశారు. బ్రాహ్మణులు తమ కులాచారం పాటిస్తే అది బ్రాహ్మణుల కులగజ్జి. దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఏ కులానికి ఆ కులాచారం ఉంది. ఆయా కులాలు ఆయా ఆచారాల్ని పాటిస్తే అది కులగజ్జి కాదు. బ్రాహ్మణులు తమ కులాచారాన్ని పాటించడం మాత్రమే కులగజ్జి. బ్రాహ్మణులు ధనికులైతే అది రాజుల దగ్గఱ వాళ్ళు చేసిన పైరవీల ఫలితం. వాళ్ళు పేదలైతే అది వాళ్ళ సోమరిపోతుతనం. ఈ దుష్ప్రచారంలో జాతికి వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు చేసిన ఉపకారాలూ, ఉపచర్యలూ, దేశం కోసం వివిధ చారిత్రిక ఘట్టాల్లో వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలూ, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన ఇక్కట్లూ, వాళ్ళతో పాటు వాళ్ళ ఆడవాళ్ళు పడ్డ బాధలూ అన్నీ మఱుగున పడవేయబడ్డాయి.

ఒక పేద, నిస్సహాయ, బడుగువర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దేశానికి విలన్‌లుగా చిత్రిస్తూ భారీ బడ్జెట్టుతో ప్రభుత్వస్థాయిలో అత్యంత వ్యవస్థీకృతంగా జఱిగిన ఈ తరహా బుఱదజల్లుడు ప్రచారం బహుశా ప్రపంచంలోనే న భూతో న భవిష్యతి. బహుశా ఇది కలియుగ లక్షణం. కలిపురుషుడి లీల. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలకూ మతగురువులున్నారు. కానీ తమ మతగురువుల్ని హిందువులు అణచివేసినట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఎక్కడా ఎవఱూ చేయడం లేదు. పైపెచ్చు నెత్తిన బెట్టుకుని పూజించుకుంటున్నారు. కానీ భారతదేశంలో బ్రాహ్మణుల స్థానమూ, చారిత్రిక భూమికా ఇతరమతాలలోని మతగురువుల కంటే ఎన్నో రెట్లు గొప్పవీ, వైవిధ్య భరితమైనవీను. బ్రాహ్మణులు ఈ జాతికి ఎప్పుడు అపకారం చేశారు ? వారు ఎల్లప్పుడూ చేతనైనంత మంచే చేశారు. మన రాష్ట్రమే తీసుకుంటే ప్రాచీన ఆంధ్ర బ్రాహ్మణుల మాతృభాష తెలుగు కాదు, సంస్కృతం. వాస్తవానికి వారు తెలుగువారు కారు. కానీ మనసా వాచా కర్మణా తెలుగుజాతిలో కలిసిపోయి తమ సంస్కృత నామాల్ని సైతం వర్జించి అచ్చతెలుగులో నన్నయ్య, తిక్కన్న, పోతన్న మొదలైన పేర్లు పెట్టుకుని ఇక్కడి జనసామాన్యంతో తాదాత్మ్యం చెందారు. వారు వచ్చి లిపిలేని తెలుగుభాషకు లిపి (బ్రాహ్మీలిపి) నిచ్చారు. వ్యాకరణం లేని తెలుగుభాషకు వ్యాకరణాన్నిచ్చారు. సాహిత్యం లేని భాషలో సాహిత్యాన్ని సృష్టించి ప్రపంచ భాషల సరసన దీని చరిత్రని సగర్వంగా, సుస్థిరంగా నిలబెట్టారు. రాష్ట్రం సంగతి పక్కన బెడితే బ్రాహ్మణులు లేకుండా భారతదేశం అనే పరిభావన (concept) అసలెక్కడుంది ? బ్రాహ్మణ వారసత్వం కాకుండా ఈ దేశానికి ఉన్న ఉమ్మడి వారసత్వం ఏంటి ?

దేసీ ప్రభుత్వాల చేతుల్లో తమ తల్లిదండ్రులు పడ్డ బాధలు గమనించి చాలామంది తెలుగు బ్రాహ్మణుల సంతానం ఇంగ్లీషు అభ్యసించి దశాబ్దాల క్రితమే ఉత్తర అమెరికాకి పారిపోవడం ప్రారంభించారు. ఇతరులకు విదేశీ ప్రయాణం ఒక హోదాచిహ్నం (Status symbol) కాగా బ్రాహ్మణులకు మాత్రం అదొక చావుబతుకుల సమస్యగా మారింది. ఏం చేసైనా సరే, పారిపోక తప్పని పరిస్థితిని అనుభూతి చెందారు. నిరంతర కృషీ, శ్రమా ఫలితంగా బ్రాహ్మణుల ఆర్థిక హోదా (Economic status) గత పాతికేళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పుకు లోనైంది. వారిలో కొంతమంది కోటీశ్వరులు కావడంతో అలాగే తానూ కోట్లకు పడగలెత్తాలనే దుగ్ధ ప్రతి బ్రాహ్మణుడిలోనూ పురివిప్పింది. ఏదేమైనా బ్రాహ్మణజాతి యావత్తూ ఉత్తర అమెరికాకు శాశ్వతంగా ఋణపడిపోయింది. స్వదేశంలో ద్వేషానికి బలై కూడు లేక ఆకలితో అలమటిస్తూ వచ్చిన బ్రాహ్మణ బిడ్డల్ని అమెరికామాత ప్రేమగా దగ్గఱికి తీసుకుని అన్నం పెట్టింది. కోట్లు ప్రసాదించింది. MNC లకు అధిపతుల్ని చేసింది. అధికారాన్ని సైతం అనుగ్రహించింది.

అబ్రాహ్మణ హిందూ ప్రభుత్వాల చేతుల్లో నిష్కారణంగా అణచివేతకు గుఱైన వర్గంగా బ్రాహ్మణుల హృదయాంతరాళాల్లో ఒక కసి గూడు కట్టుకుని ఉంది. ఆ కసిలో అది తనకు పూర్వం ఉన్న అనేక అభిమానాల్నీ, సెంటిమెంట్లనీ వదులుకుంది. ఏం చేద్దాం ? చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. మానవజాతి అంతా గుఱ్ఱుపెట్టి ఆదమఱచి గాఢనిద్ర పోతున్న యుగాల్లో కళ్ళు తెఱుచుకుని మేలుకుని అన్నీ ఆలోచించిన ప్రకాశమాన చరిత్ర గల బ్రాహ్మణులు తమ అణచివేతకు రియాక్ట్ అవ్వరని అనుకోవడం ప్రభుత్వాల అమాయకత్వం, మూర్ఖత్వం. ఆ రోజున ఆ అణచివేతల్ని నిరంకుశంగా పాశవిక రాజకీయ అధికార సహాయంతో అమలు జఱుపుతున్న కాలంలో బ్రాహ్మణులు నిస్సహాయులు. పేదవారు. అప్పటికే బ్రిటీషు ప్రభుత్వం చేతిలో దెబ్బదిని చప్పున కోలుకోలేక అప్పటి దాకా తాము పాల్గొంటూ వస్తున్న అన్ని రాజకీయ, సాంఘిక కార్యకలాపాల నుంచీ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వాలకు ఆనాడు ఒక మంచి అవకాశం లభించింది. తాత్కాలిక విజయం సిద్ధించింది.

అలా దేశం నుంచి పారిపోవడం వెనక బ్రాహ్మణుల్లో కూడా చారిత్రికంగా చోటు చేసుకున్న మనస్తత్త్వపరమైన లోపాలున్నాయి. బ్రాహ్మణులు మొదట్నుంచీ ప్రభుత్వ పోషణ మీదే ఇనుమిక్కిలిగా ఆధారపడి బతికారు. ప్రభుత్వాదరణ మీదే తమ సాంఘిక గౌరవ పునాదుల్ని కూడా నిర్మించుకున్నారు. వారిని ఆదరించిన ప్రభుత్వాలు పోయాయి. వాటి స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వాలు హఠాత్తుగా తమ మీద కక్ష సాధించడం మొదలుపెట్టడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ పరిస్థితి వస్తుందనుకోలేదు. అందుకు మానసికంగా సన్నద్ధులై లేరు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు.

బ్రాహ్మణులు ఈ మత పరిరక్షణకై నియమించబడ్డవారు. కానీ ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకని వారు ఇందులోంచి విరమించుకోక తప్పడం లేదు. కూడు కోసం, గుడ్డ కోసం, గౌరవం కోసం వారు ఈ హిందూసమాజంతో పోరాడి, పోరాడి పూర్తిగా అలిసిపోయారు. అయినా బ్రాహ్మణుల స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయలేం పూర్తిగా ! ఎందుకంటే ఒక పూజారి కొడుకు తన తండ్రి చేస్తున్నవన్నీ శ్రద్ధగా గమనిస్తూ తానూ పెద్దవాడై అలా చేయాలనుకుంటాడు. ఏ శిక్షణ ఇచ్చినా ఆ భావాన్ని కలిగించలేం. అదొక అమూల్యమైన వారసత్వం. ఒకసారి ఆ వారసత్వం లోంచి బయటపడ్డ కుటుంబాలు తిరిగి అందులోకి వెళ్ళడం చాలా కష్టం, మా కుటుంబం లాగే ! అయినా దేవాలయాల్లో నిత్యనైమిత్తికాలు నడవాల్సి ఉంది. అందుకు హిందువులే ఏదో ఒక ఏర్పాటు చూసుకోవాలి. ఏ ఏర్పాటైనప్పటికీ ఇప్పుడు బ్రాహ్మణుల్ని హింసించినట్లుగా కొత్తవారిని కూడా హింసించకుండా ప్రేమతో, గౌరవంతో, ఆదరంతో, అభిమానంతో చూసుకోవడం అవసరం.



3 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar May 23, 2011 at 1:57 AM  

హిందువులా...మొత్తం బ్రాహ్మణుల గురించి ఉన్నట్టుందీ వ్యాసం ! ఓహో హిందువులంటే కేవలం బ్రాహ్మణులనా...ఓకే ఒకే

durgeswara May 23, 2011 at 2:06 AM  

అయ్యా !
మీకలా అనిపించిందా ? మాకేమో జాతిని చీల్చి డానికి పన్నిన చారిత్రక కుయుక్తులు , ఇంకా సంజీవనిగా మిగిలిఉన్న ఈ జీవనధారను ధ్వంసంచేయాలనే కలి సేన యత్నాలు కనపడుతున్నాయి బాలసుబ్రహ్మణ్యం గారు వ్రాసిన ఈ వ్యాసంలో ఇప్పుడు ప్రత్యక్షంగానూ కూడా !

sharma May 23, 2011 at 8:14 AM  

kathi gaaru.. andulo chaala varaku nijamenandi,
raasinadi anthaa baahmanula gurinche ainappatiki vedaalu upanishatthulu etc.. vaatini ekkuva saatham chadivedi parirakshisthunnadi tharwaathi tharaalaki theliyajesthunnadi vaalle kada, so anichivetha aa maarpulu ela chotu chesukunnaayo hinduvulanthaa chadavalasina, thelusukovalasina vishayame!!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP