శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అభినవ హితహరివంశుడే ఈ రసయోగి

>> Tuesday, September 28, 2010

రసయోగి _ 15

19

ఒకసారి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు నెల్లూరులో రాధాతత్వం పై ఉపన్యసిస్తున్నారు. భక్త జన సందోహం అంతా పరవశులగుచున్నారు. ఆ భక్తులలో ఒక డ్రాయింగ్ మాష్టారు ఉండెను. అతని పేరు A.V. సుబ్బారావు. రాధికాప్రసాద్ మహారాజ్ గారి ఉపన్యాసాలకు ప్రభావితుడై రోజూ రాధికాప్రసాద్ గారిని దర్శించి వారి చేసే అనుగ్రహ భాషణకు పరవశమొందుచుండెడివారు. వారికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది _ రాధికాప్రసాద్ మహారాజ్ గారికి చెప్పగా _" నా పటం ఎందులకు ? రాధారాణి పటాన్ని చిత్రించు" అని పల్కిరి. కానీ వారు కాలాంతరమున ఏమియో పనులలో పడి విషయమును మరచెను. 10 సంవత్సరములు గడిచెను.

ఆ రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం గుంటూరులోని మందిరములో సంకీర్తన జరుగుతూ ఉండెను. ఆ రోజు సంకీర్తన ప్రారంభం కానున్న సమయంలో A.V. సుబ్బారావు గారు రాధారాణి నిలువెత్తు చిత్రాన్ని చిత్రీకరించి, రాధికాప్రసాద్ మహారాజ్ గారి చిత్రాన్ని కూడా చిత్రీకరించి రెండు పటాలను మందిరమునకు తీసుకొచ్చెను. నాన్నగారికి సమర్పించెను. రెండు పటములలో జీవకళ ఉట్టిపడుచుండెను. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు రాధారాణి పటమును నిత్యపూజలో ఉంచెదనని అతనికి మాట ఇచ్చెను.

ఇంతకు ముందరే రాధికాప్రసాద్ మహారాజ్ గారి ప్రత్యేక మందిరములో చిన్నారి చిత్రములు రెండు యున్నవి. ఇప్పుడిది మూడవది. అంతకు ముందరున్న రెండు పటములకి రోజూ వెండి గ్లాసులలో పాలు పోసి "భోగ్" పెట్టుచుండెడివారు. ఇప్పుడు "చిన్నారి"ది మూడవ పటము. స్టీలు గ్లాసులో పాలు పోసి "భోగ్" ను సమర్పించు చుండెను. వెండి గ్లాసు కొనవలెనని రాధికాప్రసాద్ మహారాజ్ గారు తలంచెను. కానీ ఇంతలో ఒక వ్యక్తి "వెండి గ్లాసు" ను పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారికి సమర్పిస్తూ "రాధారాణి" సేవకు అని పల్కెను. ఎంత ఆశ్చర్యకర సంఘటన " "చిన్నారికి" వెండి గ్లాసు లేదేయని ఆలోచన మనసున మెదిలినంతనే "చిన్నారి" వెండి గ్లాసు తెప్పించుకుంది. రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ వెండి గ్లాసులో మూడవ పటమునకు కూడా పాలను భోగ్ ను సమర్పించు చుండెడివారు. ఆ చిత్రము బృందావనములో మందిరములో ముఖ్య స్థానాన్ని ఆక్రమించి అందరి ఆరాధనలను అందుకొనుచున్నది. చిన్నారి రాధ ఆ విధముగా ఆ భక్తుని సేవను స్వీకరించి అతనిని కరుణించింది. ఆ భక్తుడు పరమానంద భరిత హృదయముతో గృహమునకు చేరెను.

ఒక రోజు శుక్రవారం గుంటూరు మందిరములో సంకీర్తన ప్రారంభమయ్యింది. రాధికాప్రసాద్ మహారాజ్ గారు ధ్యానంలో ఉన్నారు _ " 11 ,12 సంవత్సరముల వయస్సు గల చిన్నారి రాధ తెల్లని పరికిణి, దాని మీద బంగారు చుక్కల తెల్లటి పావడాతో అత్యంత శోభాయమానంగా, వయ్యారంగా సంకీర్తన సమయంలో మందిరములో నడయాడుతూ కానవచ్చెను. "అంతట రాధికాప్రసాద్ మహారాజ్ గారు అంజనీమాతను పిల్చి విషయమును తెలియజేసి రేపు చిన్నారికి తెల్లని చీర, దానిపై బంగారు చుక్కలు ఉండవలెనని పల్కి కొనమని ఆదేశించిరి. మరుసటి దినమున మాత అంజనీ దేవి కొట్లన్నీ తిరిగి చిన్నారికి ఎర్రని చుక్కలున్న తెల్లని చీర కొన్నది. ఆ చీరతో రాధారాణిని అలంకరించింది. సర్వాంగ సుందరముగా రాధారాణి ఆ చీరలో శోభిల్లెను. ఆ అందాన్ని దర్శించిన రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆనంద పారవశ్యంతో ధ్యానమగ్నులైరి.

43. రసయోగి నేతృత్వంలో రావలిలో రాధా జన్మోత్సవము

1999, ప్రమాది నామ సంవత్సరము భాద్రపద మాసం దక్షినాయనం, వర్షరుతువు శనివారం, శుక్ల పక్షం అష్టమి శుభ తిథిన రావలి గ్రామములో రాధాజన్మోత్సవ మహోత్సవమును చేయ రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు సంకల్పించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుండి అనేక ప్రాంతాలనుండి వందల సంఖ్యలో భక్తులు ఆ ఉత్సవానికి హాజరు అయినారు. ఢిల్లీలోని పప్పుశర్మ గారు, హేమంత్ గారు, శ్రీ రాజగోపాలాచారి గారు మరియు వైజాగ్ నుండి శేఖర్, గుంటూరు నుండి పి.వి.కె రామారావు గారు, హైదరాబాదు వాస్తవ్యులు కొంతమంది ఒక వారం ముందరగానే బృందావనం చేరి రాధామహోత్సవానికి అన్ని ఏర్పాట్లు గావించారు. మాత అంజనీదేవి పర్యవేక్షణలో ఉత్సవమునకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. బృందావనం నుండి మూడు ప్రత్యేక బస్సులలో, కార్లలో అందరూ రాధాష్టమి దినమున తెల్లవారు ఝామున 4 గంటలలోపు రావలి గ్రామానికి చేరుకున్నారు. దేవాలయ ప్రాంగణం ముందర ఖాళీ స్థలంలో పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. మందిరమునకు దగ్గరగా ఉన్న ఒక పాఠశాలను విడిదిగా తీసుకున్నారు. ఉదయం 4 గంటలకల్లా అందరూ రాధానామ సంకీర్తనతో మందిరములో ప్రవేశించారు. ఉదయం 5 గంటలకు రాధా ఆవిర్భావం. ఉదయం 5 గంటలకు అయింది. పెద్ద ఎత్తున భక్త జనం "రాధే రాధే" అని కీర్తన చేయనారంభించారు. భక్త జనులలో ఉత్సాహంపెల్లుబికింది. కొందరు నృత్యం చేయనారంభించారు. కొంతమంది రాధా గానం, మరికొంతమంది ధ్యానం అటువంటి ఆనందమయ స్థితిలో రాధా ఆవిర్భావం, రసరాణి దివ్యసీమల నుండి భువికి దిగి వచ్చింది. అనంత భావ స్వరూపిణి అయిన రాధ ఆవిర్భవించింది. ఆ దివ్య మనోహర మూర్తిని యోగులు, తత్వవేత్తలుమ్ భక్తులు దర్శించారు. ఆ మహోత్సవాన్ని ఆ కోలాహల భరిత వాతావరణాన్ని చూస్తుంటే వృషభాను మహారాజ్ బహుశ ఈ విధముగానే ఉత్సవాన్ని ఆ రోజులలో జరిపి ఉంటాడు. ఆనందంలో ఆ తల్లిని తన "బారసానా" పురమునకు తీసుకొని వెళ్ళి ఉంటాడు అని అన్పించింది. రాధా ఆవిర్భావం తర్వాత రాధారాణికి పంచామృత స్నానం చేయించారు. ఆ రోజు రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు "రావలి చిన్నారి రాధ్" చిత్ర పటమును ఆవిష్కరించిరి. ఆలయము ముందు ఏర్పాటు చేయబడిన వేదికపై మధ్య భాగమున "రావలి చిన్నారి రాధ" చిత్రపటమును ఎత్తైన సింహాసనమున కూర్చుండబెట్టి సర్వాలంకారములు గావించారు. సాక్షాత్ రాధారాణి స్వరూపంలో అక్కడకు వచ్చి స్వయంగా ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నదా అన్పిస్తున్నది. ఆ రాధారాణి చుట్టూ అష్టసఖీ రూపధారణతో కన్నె కామణులు ఆ తల్లి సేవకు సంసిద్ధులై యున్నారు. అద్భుతముగా ఉంది సన్నివేశం. భక్త జన బృందమంతా వేదిక ముందర కూర్చొని ఉండగా లీలా విలాసాలను వివరించారు. అంజనీమాత తన సుమధుర గాత్రంతో రాధారాణికి కీర్తన సేవ గావించారు. ఆ సభలో మహాకవి డా| | ప్రసాదరాయకులపతి గారు రసరాణి రాధ శక్తిని, గురువులు రాధికాప్రసాద్ గారి అనితర సేవా భావాన్ని కొనియాడారు. పళ్ళె నాగమణి గారు, శ్రీ పి.యస్. ఆర్. ఆంజనేయప్రసా ప్రభృతులు ప్రసంగించారు. అటు తర్వాత రాధారాణి చిత్రపటమును దివ్యాలంకారములతో పుష్పమాలాదులతో అలంకరింపబడిన రధముపై కూర్చుండబెట్టారు. ఆ చిర్తపటము ముందర ఐదు సంవత్సరముల ఒక చిన్నారి పాపను "రాధారాణి" వలెను అలంకరణ గావించి కూర్చుండ బెట్టిరి. రాధారాణి అధిరోహించిన ఆ "పూలరధం" రావలి గ్రామంలో పర్యటించింది. రావలి గ్రామ వాసులు తండోపతండములుగా ఆ ఊరేగింపు దృశ్యాన్ని చూచి ఆనంద పరవశులైనారు. ఆ రోజు మరొక విశేషం _ పూజ్యులు, రసయోగి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి రావలి గ్రామ వాసులందరికీ భోజనాదులు ఏర్పాటు చేశారు. ఎందుకని ఈ ఏర్పాటు చేశారని అడిగితే _ "నా తల్లి రాధ ఆ గ్రామంలో ఆవిర్భవించింది. దివ్యసీమనుండి భూతలమునకు వచ్చిన ఆ శుభ సమయం వృషభాను మహారాజ్ జీవితాన్నే మార్చి వేసింది. ఆ తల్లిని మేళతాళాదులతో, ఊరేగింపుతో తన పురమునకు తీసుకెళ్ళి అతిశయ ఆనందాన్ని ఆయన పొందారు. ఎంత అదృష్టశాలి అతను.ఎంత పుణ్యము ఆ రావలి గ్రామం చేసుకుందో, ఎంత పవిత్రత అక్కడి వాతావరణంలో ఉందో. అక్కడి ప్రజలు ఎంత నిష్కల్మష చరితులు కాకపోతే తల్లి అక్కడ ఆవిర్భవిస్తుంది. మరి ఆ ఊరి వారిని నేను ఏ విధముగా సత్కరించాలి, అమ్మకు అన్నం పెట్టడమంటే ఇష్టం. అమ్మకు ఇష్టమైన పనిని నేను చేస్తాను. ప్రతి సంవత్సరం అక్కడ "జన్మోత్సవం" జరుపుతాను. అకడ అందరికీ భోజనాదులు ఏర్పాటు చేస్తాను." అని భక్తి భావ పూరిత హృదయముతో వారు పలికిన పలుకులు ఆ ఉత్సవానికి హాజరైన యువకుని హృదయాన్ని కదిలించాయి. ఆ ఉత్సవములో పాల్గొన్నందుకు తన జీవితం ధన్యమైనదని భావించాడు. రాధికాప్రసాద్ మహారాజ్ కు, రావలి రాణికి, రావలి గ్రామానికి సాష్టాంగ నమస్కారం గావించాడు.

44. అది చిత్రపటమా లేక ప్రత్యక్షమైన సజీవ మూర్తియా ?

పూజ్యులు, రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారి పూజా మందిరములో రావలి చిన్నారి రాధ చిత్రపటము ఉంది. ఎంతో ముగ్దమోహనంగాఉండే ఆ పటమును చూచిన వారు తమ కళ్ళను పక్కకు తిప్పలేరు. అంతగాఅ మూర్తీభవించిన సౌందర్యముతో ఆ చిత్రపటము తేజరిల్లుతున్నది. ఆ చిత్రపటము ఏర్పడుటకు ముందర ఒక కథ ఉన్నది. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని ఆ చిత్ర పటము గురించి ప్రశ్నించగా _ మానవ సృష్టికి సంబంధించిన విగ్రహాలను, చిత్రపటములను నేను ఆరాధించును" గర్గ సంహిత అనే గ్రంధంలో గర్గముని ఇలావ్రాశాడు _ "మాన సృష్టిలో, మానవ కల్పితమైన దేవతా విగ్రహాల్లో, చిత్రపటల్లో కానీ దివ్యతత్వం ఉండదు". ఈ కారణం చేత నేను కొన్ని రోజులు దీక్షగా అమ్మని ప్రార్థించి నీవు ఐదు వేల సంవత్సరములకు పూర్వం ఈ భూలోకానికి వచ్చావు తల్లీ ! అప్పుడు ఏ రూపంలో వచ్చితివో అదే రూపంలో నాకు దర్శన భాగ్యం ప్రసాదించు. ఆ దివ్య రూపాన్ని నేను "చిత్రవంతం" చేయవలెననెడి నా కోర్కెను నెరవేర్చు తల్లీ ! గొప్ప పటముగా చిత్రించునట్లు చేయుము. నాకు నీ దివ్య దర్శనం ఇచ్చావంటే ఆ చిత్ర పటానికి ఎటువంటి లోపాలు లేకుండా నేను మార్పులు చేస్తాను." అని ప్రార్థించాడు. అమ్మ దివ్య దర్శనం లభించింది. అమ్మ చిత్ర పటము తయారయింది. ఈ చిత్ర పటానికి దివ్యత్వం ఉంది అనటానికి రుజువుగా అనేక లీలలు జరిగాయి. ఒక్కొక్కప్పుడు ఈ చిత్రపటమును ఊయలలో కూర్చుండబెట్టినప్పుడు అది ఎవరి ప్రమేయం లేకుండా ఊగుతూ ఉండేది. అప్పుడప్పుడూ ఆ ఊయలనుండి, అమ్మను పరుండబెట్టే మంచమునుండి, అద్భుతమైన సుగంధవీచికలు వీస్తూ ఉండేవి. కాబట్టి ఆ చిత్రపటం సామాన్యమైనది కాదు, బజారులో లభించే శక్తి రహితమైన విగ్రహం కాదు. కొంత మంది భక్తులకు ఆ చిత్ర పటమునుండి యే మురళి ధరించిన ద్విభుజగోపాలుని దర్శనం కూడా అయ్యింది.

45. రాధాజీ ఉపాసన

రాధారాణి కృపను దయచూరగొన్న జీవుని మించిన భాగ్యశాలి ఇంకొకరు సృష్టిలో ఉండరు. ఆ రాధాజీ ఉపాసనా లక్షణములను గూర్చి రాధాజీ సఖీ జనులే రసయోగి ఎందుట ప్రకటించారు. ఆ సంఘటన బృందావనంలో రావలి గ్రామంలో జరిగింది. రాత్రి 11 గంటలకు సఖీజనులతో రసయోగి గారికి సంభాషణ జరిగింది. రాధారాణిని రసయోగి అలంకరణ గావించమనినారు. మందిరవాసులు ఎన్నో విధములు రాధారాణిని అలంకరణ గావించారు. కానీ ఆమె ఎందుకనో ప్రసన్నతనొందలేదు. దనికి సమాధానం రావలి గ్రామంలో సఖీ గణము తెలిపారు _ " మీరు చేసింది స్థూలదేహ అలంకరణ మాత్రమే. రాధాజీకి కావలసింది మానసిక సౌందర్యం కాని స్థూలదేహ సౌందర్యం కాదు. స్థూల దేహాత్మ భావము మాత్రమున్ననూ రాధాజీని చేరుటకు అది గొప్ప ఆటంకమే అగును. ఆమె ప్రసన్న మగుతున్నది స్థూలదేహ అలంకరణ వల్ల కాదు. ఈ మానసిక సౌందర్యమును ప్రతి జీవుడు తనకి తాను చేసుకోవలయును. అదియే తపస్సు. అదితే రాధాజీని చేరుటకు మార్గము. ఈ మానసిక సౌందర్యమును ఏ విధానాల ద్వారా జీవుడు సిద్ధించుకోగలడో అందులో మొదటిది _"త్ తల సుఖేన సుఖిత్వం" అమ్మకు సుఖం ఇవ్వటానికి భక్తుడు తన జీవితాన్ని ధార పొయ్యాలి. ఆమె "భక్తానుగ్రహకాతరాం" అని మహాత్ములచేత వర్ణింపబడింది. అనగా భక్తులను అనుగ్రహించవలెనని అమ్మ ఎంతయో సదా ఆత్రుతతో ఉంటుంది. ఎట్టి లక్షణములు కలవారిని రాధాజీ అనుగ్రహిస్తుందో తెలుసుకోవాలి. అమ్మ యొక్క లక్శణము తత్సుఖీన సుఖీత్వం" ఏకారణమ్ చేతనైనా గాని ఒక జీవుడు శాంత రహితుడై దు:ఖముతో నిండియున్నచో వాని దు:ఖమును పోగొట్టి వానికి పూర్ణ శాంతిని ఇవ్వటం నీ కర్తవ్యం. ఇదియే అమ్మ మనకు ఇచ్చే సందేశం.

బృందావనంలో ఒక బెంగాలీ సాధువు ఒక చెట్టు క్రింద కూర్చొని బిగ్గరగా ఏడ్చుచుండెను. యాత్రార్ధమై వచ్చిన వందలాది భక్తులలో ఎవరికినీ వాని దు:ఖమును గురించి తెలుసుకొనవలెననెడి అభిలాష లేకుండెను. ఆ జనుల వలె "అమ్మ" లేదు. ఆ సాధువు దు:ఖాన్ని చూచి 8, 9 సంవత్సరముల గల బాలికగా ఆవొర్భవించి ఆ సాధువు వద్దకు వచ్చి మృదు కంఠముతో ఆ సాధువునిట్లు ప్రశ్నించెను _ "బాబా ! ఎందుకు ఇట్లు విలపించుచున్నావు ? నీకేమి కష్టము వచ్చినది ? " అంతట ఆ సాధువు _ "అమ్మాజీ ! ఇంత పిన్న వయసులో కూడ నీవు మనోశాంతి లేని నాబోటి వాని వద్దకు వచ్చి కష్టసుఖములను విచారించటం బట్టి ఎవరో మహాదేవతవని నాకు తోచుచున్నది. నాది వంగ దేశం నా తల్లి దండ్రులు ధనికులే వారు తమకు తాము సుఖపడుటయే జీవితపరమావధిమని తలంచి జీవయాత్ర సాగించుచున్నారు. అట్టి ఆడంఅబర్ జీవితం నాకు సరిపడక చిన్ననాడే ఇల్లు విడిచి పవిత్రమగు బృందావనమునకు వచ్చినాను. కానీ ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళిననూ గోధుమ రొట్టెలే పెట్టెదరు. అవి తినుటచే నాకు రక్త విరోచనములయి ఆరోగ్యము దెబ తిన్నది. మా వంగ దేసములో మేము నిత్యమూ అన్నము తినెదము. బృందావనమును విడిచిపోయెదమన నా కన్న తల్లిని విడిచిపోవునట్లనిపొంచుచున్నది. అమ్మను వదిలి ఎన్ని విధములగు లౌకిక సుఖములను చేర్చిననూ,అవి అంతగా అమ్మకు మనలను దూరము చేయుట సత్యము _ ఇక్కడ ఈ ఆహారమును తినుచు జీవించుట నాకు కష్టముగా నున్నది. విడిచి నాదేశమునకు పోయిన ఆహారము లభించును గానీ నా తల్లికి దూరమై దు:ఖప్రాప్తియే కలుగును. ఇక్కడ ఉండలేను. అక్కడకు పోలేను. కానీ నా ఆశయం ఒక్కటే_ "పరమకృపానిధి నా చిన్నారి తల్లి రాధ ఎప్పటికైనా నన్ను చూడకపోవునా ? అదియే నా ఆశ. ఆ ఆశతో జీవిచుచున్నానమ్మా" అని పల్కగా ఆ పిల్ల _ "బాబా ! నీవు నాతో రా" అని పల్కి "అదిగో !అక్కడ మూడు గృహములు ఉన్నవి. అందులో మధ్య ఉన్న గృహమునాది. ఆ గృహములో మా అమ్మా, నాన్న ఉంటారు. నీవు అక్కడకు పోయి తలుపు తట్టి నీ కుమార్తె నన్ను ఇక్కడకు పంపితే వచ్చానమ్మా యని చెప్పుము. మీ బిడ్డ మీకు ఒక విషయము చెప్పమన్నది. _ "మీరు ఈ రోజు ఉదయమే "ఖీర్" వండి మధ్యాహ్నం తినవచ్చునని వంట ఇంటిలోని అల్మారా మూడవ అంతస్థులో దాచిరట" అని పల్కుము అతనిని ఆ ఇంటికి పంపి తను అంతర్ధానమయ్యెను. తలుపు తట్టగా యజమానులు వచ్చిరి. మొదట చాలా విసుక్కొనిరి, తర్వాత "ఖీర్" విషయము చెప్పిన వెంటనే వీధుల వెంట తిరిగే ఈ సాధువునకు మన "ఖీర్" విషయము ఎట్లు తెలియును ? ఇక్కడకు ఈయనను పంపినది సర్వాంతర్యామి యగు మన బిడ్డయే. మనకు సంతానము లేనందున అమ్మనే మన బిడ్డగా భావించుకొనుచున్నాము. అమ్మ దర్శనం అయింది మహానీయునకు. అంతట వారు ఆ సాధువుతో "నీవు యావర్జీవితము ఇక్కడే ఉండుము నీకు అన్నమునే పెట్టెదము అని పల్కిరి. ఇదియే అమ్మ లక్షణం. ఈ లక్షణమే అమ్మ సౌందర్యం, ఇట్టి సౌందర్యమునే మనము కలిగియుండవలెను. అమ్మను చేరు సాధనా విధానము ఇదియే. ఆనాడు కన్నయ్య శిరో వేదనతో బాధపడుచుండెనని నారదును ద్వారా విన్న గోపికలు నారదుడు కోరిన విధముగా తము నరకమునకు పోవుటకు సిద్ధపడియు తము పాద తీర్థమును కోరిన విధమున తము నరకమునకు పోవుటకు సిద్ధపడియు తమ పాదతీర్థమును కన్నయ్యకు ఇవ్వుటకు సిద్ధపడిరి. ఇతరుల భాధలను తొలగించి వారికి శాంతిని చేకూర్చుటయే నిజమైన సాధన్. అటి సాధనచే మనో సౌందర్యము చేకూరును. రెండవది అనన్య నిష్ఠ : అనన్య నిష్ఠ అనగా ఈ బ్రహ్మాండము నిండా అంతా అమ్మ నిండి యున్నది. అనే భావన కల్గి అంతటనూ అమ్మనే చూచుచూ, అమ్మనే చింతన చేయుచూ జీవించుట. ఇది రెండో మెట్టు. ఇక మూడవది ఆనాడు కళ్యాణము అయిన పిదప శ్రీ రాముడు రధమెక్కెను. అప్పుడు సీత రాముని అనుసరించి "పతికి దాసిగా ఉండుటయే సతీ ధర్మమని" మా అమ్మ నాకు చెప్పినది అని పల్కెను. అంతట రాముడు "సహచరీవ్రతమునకు మించిన వ్రతము లేదు సీతా ! నీవు నాదాసివి కాదు, నా సహచారిణివి" అని పల్కెను. "నిన్ను విడిచి నేను ఉండలేను, బ్రతకలేను" ఇదియే సహచారీ వ్రతనిష్ఠ అనగా మన ఇష్ట దేవతను విడిచి ఒక్క లిప్త కాలమైననూ కీవింపలేకుండా ఉండవలెనని ఇది మూడవ సూత్రం ఇక నాలుగవ సూత్రము _ అమ్మ స్వరూపము సాకారము, నిరాకారము రెండునూ ఉన్నవి. వాటి సమన్వయించుకుంటూ జీవించవలెను.

ఒక్ లిప్తకాలమైననూ రసయోగి అమ్మను విడిచి యుండరు. ప్రతి జీవియూ అట్లే ఉండవలయును. ఇది రసయోగి ఆశయం. అమ్మ తాలూకు లక్షణములన్నియూ భోధించుటకు 8 భాగాలు అవసరం. అందుకొరకు 8 భాగాల రాధాగాధామృతానికి నాంది పలికి 6 భాగాలు పూర్తి చేసెను. ఈ ఎనిమిది భాగాలు వ్రాయటానికి అమ్మ కూడా తనకు అనుమతినిచ్చెను.

46. అకారణ కరుణామయి శ్రీ రాధ

శ్రీ రాధదేవి సర్వేశ్వరిగా, సురేశ్వరిగా, కృష్ణప్రాణ సఖిగా, కృష్ణమంత్రాధి దేవతగా భక్తులచే ఆరాధింపబడుతున్నది. అట్టి శ్రీ రాధాదేవి లీలలను, మహిమలను తెలుగు వారికి అందించాలని రసయోగి సంకల్పించెను. ఇది " అమ్మకు నేను సమర్పించే అలంకరణ" అని అంటూ ఉంటారు. "యోగము" అంటే కలయిక అని అర్ధము, యోగ సాధన అంటే "జీవుడు నిరంతరమూ భగవంతుడు నాతో, నాలో ఉన్నాడను ఆత్మ విశ్వాసముతో మెలుగుటయే". ఇదియే దివ్యసాధన్. ఎవరైతే నిరంతరం అమ్మ చింతనలో ఉంటారో అటి వారి యోగక్షేమాదులు తల్లియే వహిస్తుంది. వారికి ఎప్పుడు ఏది అవసరమో అది వారికి అప్పుడు సమకూరుస్తూ ఉంటుంది.

ఒకసారి రసయోగి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు తన మందిరం ( రాధాకృష్ణమందిరం _ గుంటూరు) లో ఒక కుర్చీలో కూర్చొని "బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి" అనే పుస్తకమును వ్రాయుచుండెను. వేసవి కాలము. ఎండలు బాగా ఉన్నాయి. వేడి వడగాల్పులు వీస్తున్నాయి. అయిన వారు పట్టుదలతో అల్ల్గే కూర్చొని గ్రంథరచన కొనసాగించుచుండిరి. ఇంతలో అక్కడకు గుంటూరులోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు శ్రీ రాయపాటి సుబ్బారావు గారు రసయోగి దర్శనార్ధమై అక్కడకు విచ్చేశారు. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు రసయోగి అనిన అమిత భక్తి, ప్రేమ. వారు రసయోగిని చూచు "నానాగారూ ! ఏమి వ్రాయుచున్నారు ?" యని అడిగెను. అంతట రసయోగి "అమ్మ భక్తుల దివ్య గాథలు" వ్రాస్తున్నాను. నా తల్లి లీలలను లిపి బద్దం చేస్తున్నాను" అని పల్కిరి. గాలి లేక చెమటలు కారుచున్ననూ, ఎండ వేడికి శరీరము కందిపోతున్ననూ లెక్క చేయక వారు అమ్మ సేవలో నిమగ్నమయ్యెను, అక్కడ పరిస్థితి చూసిన శ్రీ రాయపాటి సుబ్బారావు గారు " వెంటనే నాన్న గారు ఉన్న గదిని ఎ.సి. గదిగా మార్పించిరి. వలదని వారించినా " నాన్నగారూ మీరు అమ్మ సేవ చేస్తున్నారు. మీరు భక్తులు, యోగులు. మేమే మీ సేవ చేసి తద్వారా ఆ తల్లికి ఆనందం కలిగిస్తాము. మీరు కాదనకూడదు. అమ్మకు తన సేవకంటే తన భక్తుల సేవ అంటే ఎంతో ఇష్టం" అని ఎంతో నిరాడంబరముగా పల్కిన నిగర్వి శ్రీ రాయపాటి సుబ్బారావు గారు.

ఒకసారి నాన్నగారిని దర్శించాలని "మలేషియా" నుండి శ్రీ రామానుజం గారు విచ్చేశారు. వారు గొప్ప యోగసాధకులు కొన్ని దివ్య శక్తులను కూడా సాధించినవారు. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని దర్శించి, గుంటూరు రాధాకృష్ణ మందిరంలో కొన్ని రోజులు బస చేశారు. వారు "ఈ రాధాకృష్ణ మందిరం గొప్ప ఆధ్యాత్మిక శక్తి గల్గిన కేంద్రము. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు గొప్ప సిద్ధయోగులు వారి దర్శనం నాకు ఎంతో ఆనందాన్ని కల్గించింది అని పల్కారు. వారు రసయోగుల సేవార్ధం " ఆ మందిరానికి క ఇన్వర్టర్" బహుమతిగా ఇచ్చారు. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు 8 నెలలు బృందావనంలో 4 నెలలు గుంటూరులో ఉంటారు. గుంటూరులో ఉన్న సమయంలో కరెంటు కోత వల్ల అనేక ఇబ్బందులు మందిరవాసులు పడుతుండేవారు. ఇది చూచిన రామానుజం గారు ఈ ఇబ్బంది ఉండకూడదు. పూజ్యులు, జ్ఞానవృద్ధులు రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారికి ఏ మాత్రం ఇబ్బంది ఉండకూడదు. ఆయనకు బాధ కలిగితే అది అమ్మకు కష్టం కలిగినట్లే" అని భావించేవారు. అటువంటి సున్నిత మనస్వి శ్రీ రామానుజం గారు.

రాధారాణి యే తన సర్వస్వం, ఆమె సేవయే తన జీవిత పరమార్ధం అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వారు శ్రీ రసయోగి. "యే యథామాం ప్రపద్యంతే తాంతథైవ భజామ్యహాం" అని అమ్మ వాక్కు. ఎవరు నన్ను ఎలా తలుస్తారో, వారిని నేను అలానే భావిస్తాను అని దాని అర్థం అమ్మ నిరంతర సేవయే తన భాగ్యం, తన ధ్యేయం అని భావించే వారు శ్రీ రసయోగులు. మరి వారి క్షేమసమాచారాలు, బాగోగులు ఆ తల్లియే స్వయంగా చూస్తుంది. ఆ తల్లియే శ్రీ రాయపాటి సుబ్బారావుగారిలో, శ్రీ రామానుజం గారిలో ప్రేరణ కల్గించి తద్వారా తన తనయునికి అన్ని వసతులూ ఏర్పాటు చేసింది. రసయోగి చేయి చాచి ఎవ్వరినీ ఏదీ ఏనాడు అడిగి ఎరుగరు. ఆఖరికి తన ఆరాధించే తల్లిని కూడా "అమ్మకు తెలియదా తన బిడ్డకు ఏమి ఇవ్వాలో" అని నవ్వుతూ పల్కుతారు రసయోగి. ఆ తల్లి పట్ల ఆయనకున్న ధృఢవిశ్వాసం, బలీయమైన ప్రేమ, నమ్మకం అటువంటిది. ఆ తల్లికి ఈ బిడ్డ పట్ల అంతే వాత్సల్యం ప్రేమ. వారి ప్రేమానుబంధం వర్ణనాతీతం. మాటలకు అందనిది. వర్ణించనలవికానిది.

47. అభినవ హితహరివంశుడే ఆంధ్ర రసయోగి

పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారి ఆజ్ఞ పై యువకుడు అనేకమంది మహాత్ముల చరిత్రలను హిందీ నుండి తెలుగులోనికి అనువాదం చేశారు. ఒకసారి రాధికాప్రసాద్ మహారాజ్ గారు యువకుని పిలిచి బృందావనంలో నివసించిన మహాత్ములలో "హితహరివంశుడు" మహోన్నతుడు. ఆయన చరిత్రను నాటక రూపంలో నేను తెనుగున వ్రాశాను. ది నీవు హిందీలోకి అనువదించాలి. అది నేను ఇక్కడ వ్రజ వాసులందరికి పుస్తక రూపంలో పంచిపెడతాను. ఆ నాటకాన్ని వాడవాడలా ప్రదర్శిస్తాను. ఆ మహాత్ముని భావాలని చక్కగా అర్థం చేసుకొని ఆ మార్గంలో అందరూ నడవాలి. ఈ కార్య భారం నీ మీద ఉంచుతున్నానని పలికారు. రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు చెప్పిన ఆ పనిని ఎంతో భక్తితో, ఉత్సాహంతో యువకుడు నెరవేర్చాడు. హిందీలోని హితహరి వంశ నాటకాన్ని విని రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఎంతో ఆనందించారు. ఆ నాటకాన్ని రంగస్థలం మీద ఆడించేందుకు ఏర్పాటు గావించారు. అది రాధాష్టమి మహోత్సవ సందర్భంలో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని పల్కారు.

యువకునికి పుస్తకం వ్రాస్తున్నంత సేపూ హితహరి వంశునికి, రాధికాప్రసాద్ మహారాజ్ గారికి ఎన్నో విషయాలలో సామ్యం ఉండటం గమనించాడు. అలనాటి హితహరి వంశయే మరల ఈ రూపంలో మరొకసారి జనావళి నెల్ల రాధా భావ తరంగాలలో స్నానమాడించుటకై అవతరించెనా అని అన్పించింది. యువకుని మనోవీధిలో హితహరివంశ ఆయన స్థానంలో పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు కదలాడసాగిరి.

వ్రజము యొక్క ఉపాసన రసోపాసన _ ప్రేమోపాసన. ఆ ఉపాసనా లక్ష్యము భగవంతుడు కాదు భగవంతుని ప్రేమ. ఆ ఉపాసనా మార్గం అనెడి ఆధ్యాత్మికాకశంలో ఉదయించిన జ్యోతిర్మయి నక్షత్రములలో శ్రీ హితహరి వంశజీ ముఖ్యులు. ఆయన వలెనె రసోపాసనే తన జీవిత లక్ష్యముగా మార్చుకొని, దానిని సాధించి ఆ ఆనంద రసాంబుధిలో ఓలలాడుతూ బద్ద జీవులను ఆ మార్గగాములుగా మారుస్తున్న మహానుభావులు మన శ్రీ నాన్నగారు.

శ్రీ హితహరి వంశుడు _ శ్రీ కృష్ణుని వేణువు అంశయని విద్వాంసులు తెలిపారు. నిత్యము ఆనందకందుని సుందర రమణీయ కరకమలములలో ఇమిడిపోయి శ్యామసుందరుని అధరామృతఝరిలో మునిగిపోయి ఆనంద పారవశ్యంతో మోహన రాగాలు వర్షించే ఆ వేణువు హరివంశజీగా అవతరించి శ్రీ కృష్ణుని గూర్చి ఉపాసించలేదు. రాసలీలలో ప్రవేశమునకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా ఎవరి కృపా దృష్టి కావాలో అట్టి రాసేశ్వరి శ్రీ రాధాదేవిని ఉపాసించారు. అట్టి మార్గంలోనే శ్రీ రాధాజీనే సర్వశ్రేష్ఠగా తెలుసుకొని తన సర్వస్వము ఆమెయేనని భావించి ఆమె ఉపాసనలో తన జీవితాన్నొక పుష్పము చేసి సమర్పించుకున్న మహనీయుడు మన నాన్నగారు. అదే శ్రీ రాధికాప్రసాద్ లోకసిద్ధులైన శ్రీ రాధా రాధకులు.

శ్రీ హరి వంశజీ తన ఉపాసనలో శ్రీ రాధాదేవిని ఆరాధిస్తూనే తనకు తాను శ్రీ రాధాజీకి సఖిగా భావము పొంది, ఆమెకు సేవ చేస్తున్నట్లు అనుభూతులు ప్రత్యక్షముగా పొందేవారు. శ్రీ రాధాదేవి కూడా ఆయనను "హితసఖీ" అని పిలెచేదని మహాగ్రంథాలు ఆధారంగా తెలుస్తుంది. ఇదే విధంగా నాన్నగారి ప్రియ శిష్యురాలు, అనుగామి అయిన మాతా అంజనీదేవికి ఒకరోజు రావలిలో శ్రీ నాన్నగారు సఖీ రూపం దాల్చి లికుంజలో శ్రీ రాధాజీకి గంధము పూయుచున్నట్లు దృశ్యము కనబడింది. అదే సమయంలో ఆ గదిలో ఉన్న వారందరికి సుందర సుగంధ పరిమళం వచ్చింది. శ్రీ నాన్న గారు కూడా తన్మయస్థితిలో శ్రీ రాధాజీని "సఖి" గానే ఉపాసిస్తారు. "శ్రీ హిత హరి వంశ మాదిరిగానే శ్రీ నాన్నగారు కూడా తన ప్రియ సఖియే" అని శ్రీ రాధారాణి, పై సంఘటన ద్వారా చెప్పకనే చెప్పింది.

బాల్యమున శ్రీ హరివంశజీ తల్లిదండ్రులు రాధా గోవిందుల ఊయల ఉత్సవము చేయదలచి రాధాగోవిందుల మూర్తులను ఊయలలో కూర్చుండబెట్టి హరివంశునితో ఊపమని చెప్పి తామేవో పూజా పనులు చేసుకోసాగిరి. కొంత సేపటికి బాలికా స్వరముతో ఎవరో అత్యంత మధురముగా గానము చేయుచూ ఊయల ఊపుతున్నట్లు వారికి వినిపించెను. వచ్చి చూడగా తమ బాలుడే _బాలిక కాదు. ఈ విధముగా పలు మారులు హరి వంశుని బాల రూపము బాలిక గాను _ బాలికా రూపముగా మారుచుండెను. అనగా హరివంశుని బాహ్య రూపము పురుష రూపమైననూ అంతరంగికంగా భావదేహంతో స్త్రీగా రాధారాణి సఖిగా రాధా గోవిందుల సేవ చేసిరని విశదమగుచున్నది. నాన్నగారి శిష్యులలో అనేకమందికి నాన్నగారు స్త్రీ రూపంలో కనిపించారు. కొంతమందికి స్వప్నంలో, కొంతమందికి ధ్యానంలో, కొంతమందికి ప్రత్యక్షంగాను ఈ అనుభూతి కలిగింది. నవవ్రత బ్రహ్మచారి అను బెంగాలీ స్వామీజీ తన శిష్య బృందంతో శ్రీ నాన్నగారి దర్శనార్ధం వచ్చారు. వారి శిష్యులలో 70 సంవత్సరాల శిష్యురాలికి శ్రీ నాన్నగారు రాధా సఖిగా స్త్రీ రూప అనుభూతి కలిగింది. దానికి పరవశురాలై ఆమె ఒక చీర కొని శ్రీ నాన్నగారికి అలంకరించి దివ్యానుభూతికి లోనయింది. అంతే కాక శ్రీ నాన్నగారికి ముక్కుకు ముక్కెర పెట్టుకొనే చోట స్త్రీ ల మాదిరిగానే రంధ్రము ఉంటుంది. అది ఆయనకు పుటుకతో వచ్చినది. కనుక ఆయన భౌతిక దేహము పురుష రూపమే అయినా మానసికంగా, భావత్మకంగా స్త్రీ రూపం దాల్చిన రాధాసఖి.

లోకంలో దుష్కర్మలు చేసే జీవులను శిక్షించడానికి శ్రీ మహవిష్ణువు అవతరిస్తాడు. ఆయన వారిని సంహరిస్తాడే గాని వారిలోన దుష్టత్వాన్ని రూపుమాపడు. కాని శ్రీ రాధాజీ మార్గము వేరు ఆమె తన హ్లాదినీ శక్తి తరంగాలతో దుష్టులలోని దుష్టత్వాన్ని పోగొడుతుంది. దానికై ఆమె అనేకమంది వ్యక్తులను త్న ప్రతినిధులుగా ఎన్నుకొని తన కృపా సింధుత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. వారిలో హరి వంశుడు ముఖ్యుడు. శ్రీ రాధాజీ ఆయనకు స్వయంగా వచ్చి తన మంత్రోపదేశం చేసింది. దాని ప్రభావంతో జీవుల నుద్దరించమని చెప్పింది. అదే విధంగా శ్రీ నాన్నగారికి కూడా శ్రీ రాధాజీ మరొకదేవత దుర్గాదేవి స్వయంగా షడాక్షరీ మంత్రాన్ని, శ్రీ రాధాజీ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేసించారు. తరువాత శ్రీ రాధాజీయే స్వయంగా తనకు ఇష్టమైన ధ్యాన మార్గాన్ని ఉపదేశించింది. ఆ మార్గంలో తపస్సు చేసి నాన్నగారు తన ప్రభావంతో ఈ లోకంలో జీవులకే కాదు, ఊర్ధ్వ లోకాలలో అశాంతితో మగ్గుతున్న అనేక ఆత్మలకు, యింకా కొంతమంది దేవతలకు కూడా రాధా ప్రేమరసాన్ని పంచి వారికి శాంతి ప్రదానం చేసి శ్రీ రాధాభక్తి మార్గంలో నడిపిస్తున్న కారణజన్ములు.

శ్రీ హరివంశుడు తన జీవితంలో నిరూపించిన సత్యమొకటున్నది. నిజమైన భక్తునకు గృహస్థు జీవితం అడ్డుకాదు. భగవంతుని కోసం సన్న్యాసులు కానవసరం లేదు. సంసారంలో ఉంటూనే మనసుతో సన్యసించాలని ఆయన ఉద్దేశ్యం. గృహస్థునిగా తన సంసారాన్ని మొత్తం శ్రీ రాధాజీకి అర్పించి శ్రీ రాధాజీ సంసారంగా మార్చుకొని అమ్మను సేవించిన ఆదర్శమూర్తి. శ్రీ నాన్నగారు గృహస్థుగా ఉంటూనే ధ్యానమార్గంలో ఉత్తుంగ శిఖరాలను అందుకున్నారు. భర్తగా తండ్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే జగదీశ్వరికి త్రికరణ శుద్ధిగా అంకితమైన అవతామూర్తి. తన సంసార సభ్యులను కూడా శ్రీ రాధా మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మికంగా కూడా ఇంటి యజమానిగా తన బాధ్యత నిర్వహించారు. అమ్మ ఆదేశంతో చిన్న వయసులోనే (భార్యతో ఉంటూనే ) బ్రహ్మచర్యలం అవలభించిన తపస్వి శ్రీ నాన్నగారు. కాషాయం కట్టని సిసలైన సన్యాసి.

రాసలీలలో ప్రవేశానికైనా, శ్రీ రాధాజీ కృప పొందడానికైనా మొట్టమొదటి సోపానం బృందావన నివాసం. శ్రీ హరివంశుడు కూడా రాజాస్థాన పదవి వలదని వ్రజ ధామానికి వచ్చి బృందావనంలో వ్రజ వాసుల ద్వారా శ్రీ రాధాజీ ఇప్పించిన భూమిలో ఆశ్రమం నిర్మించుకొని శ్రీ రాధా గోవిందుల సేవను చేసుకున్నారు.

శ్రీ నాన్నగారు కూడా తన స్వస్థలాన్ని, భోగభాగ్యాలను, పేరు ప్రతిష్ఠలను వదులుకొని బృందావనంలో తన నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఇల్లు కొనటం కష్టసాధ్యమైనప్పటికినీ అమ్మ సంకల్పంతో ఇల్లు ఏర్పరుచుకున్నారు. ఈ రోజుకీ నాన్నగారు బృందావనమే నా "స్వగ్రామము" అంటారు.

శ్రీహిత హరి వంశజీ తన ఆశ్రమంలో గంగ, యమునల వంటి అనేక దీన దు:ఖితులకు ఆశ్రమం కల్పించారు. గంగ, యమునలు తమ మాన సంరక్షణకై ఎంతో దూరంలో ఉన్నప్పటికీ హరి వంశుని స్మరించగానే వారిని తన శక్తి తరంగాల ద్వారా కాపాడారు. శ్రీ నాన్నగారు కూడా బృందావనం వెళ్ళకముందే అనాధులకోసం వసతి గృహం నిర్వహించారు. శ్రీ నాన్నగారు తన ఆశ్రమంలోనే దొంగతనం చేసిన వ్యక్తులను వారెవరో తెల్సి కూడా క్షమించారు. తన ప్రభావంతో వారు తమ తప్పులను తాము తెల్సుసుకునేటట్లు చేసారు. ఇప్పటికీ తన ఆశ్రమంలో అనేక దీన దు:ఖితులకు ఆశ్రమం కల్పిస్తున్నారు. వారికే కాక ఆర్తితో త్న వద్దకు వచ్చిన ఏ జీవికైనా ప్రేమతో తన శక్తి తరంగాలతో హస్త సంసొఅర్శ వారి బాధలను నివారించే ప్రేమమూర్తి, ఆశ్రిత రక్షకులు శ్రీ నాన్నగారు. మానవులకే కాదు అనేక ఆత్మలకు, దేవతలకు కూడా తన తపోశక్తితో దు:ఖ నివృత్తి గావించిన అమృతమూర్తి.

శ్రీ హరి వంశజీ తన దైనందిన చర్యలు అన్ని రాధా భావంతో శ్రీ రాధాజీ సంతోషం కోసం, త్రికరణ శుద్ధిగా అర్పితమై చేసేవారు. ఉదాహరణకు అమ్మ తాను స్వయంగా తయారు చేసే భోగ్ వండినంత సేపు ఎవరితోనూ మాట్లాడే వారు కాదు. మనసా, వాచా, కర్మణా అమ్మ చింతనలోనే దైనందిన చర్యలు చేపట్టేవారు.

శ్రీ నాన్నగారు కూడా సాధనలో ముఖ్యంగా అవలంభించ వలసినది శ్రీ రాధా భావమనే _ అని చెబుతారు. తాను చేసే ప్రతి పని అమ్మ చూస్తున్నది అనే భావనతో చేయాలంటారు. ఆయన ఏ పనైనా శ్రీ రాధాజీకి ఇష్టమా ! కాదా ! అని ఆలోచించి చేస్తారు. అమ్మ పని అంటే ఎంత కష్టమైననూ ఇష్టంగా చేస్తారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా అమ్మ గురించి ఎవరైనా అడిగితే నిద్రాహారాలు మానేసి అనర్గళంగా ఉపన్యసిస్తూనే ఉంటారు

తనకి హాని తలపెట్టిన నరవాహనుడు మొదలైన వారిని క్షమించి, అమ్మ అనుగ్రహంతో వారిని తపోమూర్తులుగా తీర్చిదిద్దిన క్షమామూర్తి శ్రీ హరివంశుడు.

శ్రీ నాన్నగారిని విమర్శించిన వారెందరో తరువాత ఆయన ప్రేమశక్తికి తలవంచి ఆయన పాదాల మీద పడ్డారు. జీవులను భౌతికంగా శిక్షించడం వలన కాకుండా ప్రేమతో వారి మనసులను మార్చడం నాన్నగారి మార్గం. అదే హిత హరి వంశుని ద్వారా ఆనాడు శ్రీ రాధాజీ చూపించిన మార్గం, ఈనాడు కూడా శ్రీ రాధాజీ నాన్నగారి ద్వారా మనకు చూపిస్తున్న మార్గము.

శ్రీహిత హరివంశజీ అమ్మ అనుగ్రహంతో తనకు లభించిన దివ్యానుభూతుల ఆధారంగా "హితచౌరసీ" అనే గ్రంథరాజాన్ని రచించారు. ఆ గ్రంథం నేటికీ వ్రజ రసికాచార్యులకు శిరోధార్యం, ఆ గ్రంథ పఠనం వలన దివ్యానుభూతులకు లోనైన అదృష్టవంతులు నేటికీ వ్రజములో కనిపిస్తారు.

శ్రీరాధాజీ ఆదేశంతో అమ్మ లీలలను సామాన్య జనావలికి అందించాలనే బృహత్తర భగవత్సేనా దృక్పథంతో శ్రీ నాన్నగారు "బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి" అనే ఎనిమిది గ్రంథ రాజాలను శ్రీ రాధాదేవికి అలంకారములుగా సమర్పించుతున్నారు. వాటిని పఠించి లౌకికంగాను, పారమార్థికంగాను ఉన్నతులైన సామాన్యజనులను మనం చూడవచ్చు.

ఈ విధంగా శ్రీ కృష్ణుని వేణువు అంశయైన శ్రీ రాధాజీ కృపావీక్షణాంశమై భూమి పై అవతరించి హితసఖిగా తరించిన శ్రీ హిత హరి వంశునితో అనేక సామ్యాలు కలిగి ఆయనకు ప్రతిరూపముగా ఆయన ఆదర్శములను ఆచరిస్తున్న ఆధునిక హితహరి వంశుడు అని మనం పిలుచుకోవలసిన శ్రీ రాధాజీ ప్రియ సఖి, శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు.

20

48. రసయోగి కథ పుస్తక ఆవిర్భావము

కాలం గడుస్తున్నది. కాల ప్రభావానికి ఎవరైనా లొంగవలసిందే. ఏదో కొద్దిమంది సిద్ధయోగులు తప్ప. రాధికాప్రసాద్ మహారాజ్ గారు వంటి వారు కాలాన్ని నిర్దేశించగల శక్తి గలవారు. కనుకనే వారు కాలంలో వచ్చే మార్పులను చూచి చలించరు. సుఖాన్ని, దు:ఖాన్ని సమంగా చూసే వాడే యోగి. నిరంతరమూ రాధామాధవ చింతనలో మధురానందాన్ని గ్రోలేవాడే రసయోగి. రసయోగులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు. రాధాతత్వాన్ని దశదిశలా ప్రచారం చేస్తూ భక్త జనానికి మార్గ దర్శనం కావిస్తున్నారు.

యువకునికి ఇరువురు స్నేహితులున్నారు. ఒకరు శ్రీధర్. మరొకరు శ్యామల. ఇరివిరూ మంచి ఆధ్యాత్మిక చింతన కల్గినవారు. ఒకరోజు వారిరువురూ యువకునితో _"నీవి వ్రజ ధామానికి చెందిన అనేక మంది భక్తుల గాథలని హిందీ లోనుంచి తెలుగులోనికి అనువదించావు. మన ఎప్పుడు కలుసుకున్నా రాధికాప్రసాద్ మహారాజ్ గారి గొప్పతనము గురించే చెబుతూ ఉన్నావు. నీకు ప్రేరణ ఇచ్చి, నీ చేత ఆ మహానీయుల గాథలను రచింపచేసి, నీకు, రాధారాణి సేవా భాగ్యాన్ని కల్గించిన పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి జీవన గాథను నీవెందుకు రాయకూడదు" అని ప్రశ్నించెను. "నిజమే ! ఎంతోమంది భక్తుల మహనీయుల గాథలు చదివాను, వ్రాశాను. పూజ్యులు, యోగీశ్వరులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి జీవన గాథను ఎందుకు వ్రాయకూడదు" అనే ఆలోచన, వ్రాయాలనే సంకల్పం యువకుని మనసున స్థిరపడింది. తన ఆలోచనను తన బాబాయి గారికి తెలిపెను. ఆయన ఆనందించి ప్రోత్సాహించెను. అయితే యువకునికి ధైర్యము చాలదయ్యెను. కారణం మహాశక్తి సంపన్నులు, నిరుపమాన భక్తి సంపన్నులు, నిరంతర రాధా చింతన తత్పరులు, రసికాచార్యులైన శ్రీశ్రీశ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి విరాడ్రూపాన్ని మాటల్లో చిత్రీకరించటమంటే ఒక చెంచా తీసుకొని సముద్రంలో నీటిని కొలవటం వంటి పనే, అలాగే ఒక చిన్న అగ్గిపుల్లను వెలిగించి సూర్యతేజాన్ని వివరించటం లాంటిదే. ఇది సాహసిక కార్యము. కానీ యువకుని మనోభావాలకు, మాత అంజనీదేవి ఆశీర్వాదం, అండదండలు, అవ్యాజమైన ప్రేమ ఎంతో బలాన్ని చేకూర్చి పెట్టాయి. ధైర్యం చేసి యువకుడు రచనా వ్యాసంగం ప్రారంభించాడు. తను బృందావన యాత్ర బయలుదేరినది మొదలుగా ఇప్పటి వరకు తను చూచిన, విన్న, అవగాహన చేసుకున్న బృందావన విషయాలన్నీ క్రోడీకరించి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని కేంద్రంగా తీసుకొని భక్తి భావ భరితమైన తన భావాలకు ఒక రూపం కల్పించాడు. గ్రంథం తయారయింది. ఇక నామకరణం చేయాలి. "ఏం పేరు పెట్టాలి ?" అనే మీమాంసలో యువకుడుండెను. ఆ రోజు శుక్రవారం. యువకుడు మందిరానికి వెళ్ళెను. "సంకీర్తన" జరుగుతున్నది. మాత అంజనీదేవి రాధికాప్రసాద్ మహారాజ్ గారిచే రచింపబడిన గీతాన్ని అత్యంత మధురంగా ఆలాపిస్తున్నది. యువకుడు కన్నులు మూసుకొని పాటను వినసాగెను _

గీతం

చరణం : నను మరువబోకమ్మ నాతల్లి రాధరో

ఓ..........భవతారిణి శుభలీలామణి || నను||

1. భవ జలధిలో పడి అవనిలో నిన్నేకోరి

అన్నియు మరిచి నే నిన్నే నమ్మితినమ్మ || నను ||

2. నా స్వప్నమందైన నీ ప్రేమనే కోరి

నా భావ పూలచే నిన్నే పూజించెద

నా ప్రేమ పూలచే నిన్నే సేవించెద || నను ||

3. నీ పద సేవయే నా సంపదయని

మది నమ్మినానమ్మ నాకన్న తల్లిరో || నను ||

4. మాధవ ప్రీతిచే ముక్తి మాత్రమె కల్గు

నీ కృప కల్గిన పొందెదరు మాధవుని

నీకృప కల్గిన పొందెదరు నీ రాస || నను ||

భక్త జనమంతా ఆనంద పారవశ్యంతో మాత అంజనీదేవి గొంతుతో గొంతు కలిపి గీతమును ఆలాపించిరి. యువకుడు తన గురుదేవులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పాదముల చెంత కూర్చొని ధ్యానమగ్నుడయెను. _" మహానీయుని గ్రథం వ్రాశాడు. కానీ ఇందులో గొప్పతనమేమియు లేదు. అతను ఒక సామాన్యుడు. నిమిత్తమాత్రుడు. అంతా రాధారాణి లీలయే". రాధారాణి ఎటు నడిపిస్తే అటు నడిచే ఆమె చేతిలోని కీలుబొమ్మయే తను. ఆమెయే ఆతని స్నేహితుల రూపాన ప్రేరణ కల్గించింది. ఆమెయే అంజనీమాత రూపాన అండగా నిలిచి గ్రంథం ఒక పరిపూర్ణ రూపాన్ని పొందటానికి కారణమ్యింది. ఆమెయే అతని బాబాయి రూపాన బృందావన దర్శనం చేయించింది. ఆమెయే ఈ గ్రంథం వ్రాయటానికి కావలసిన శక్తిని ఇచ్చిందన్న విషయం యువకునికి తెలుసు. ధ్యానమగ్న స్థితిలోనే యువకుని మనసున తను వ్రాసిన ఈ గ్రంథానికి ఏ నామం పెట్టాలో తట్టింది. అదీ రాధారాణి కృపావిశేషంగానే యువకుడు భావించాడు. సంకీర్తన పూర్తి అయినది. ప్రసాదాలు స్వీకరించాడు. పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పాద పద్మములకు నమస్కరించాడు. మాత అంజనీదేవికి నమస్కరించాడు. యువకుని మనస్సులో ఎంతో తృప్తి, ఆనందం చోటు చేసుకున్నాయి. ఇంటికి వచ్చి తను వ్రాసిన గ్రంథాన్ని ఒక్కసారి అమూలాగ్రం పరికించాడు. రాసేశ్వరి రాధాదేవిని మనస్సున ధ్యానం చేసి పుస్తకానికి నామకరణం గావించాడు. ఆ నామమే "రసయోగి , ( or ) The sperituval way to Sri Radha ".



********


రసయోగి జీవితంలో మలుపులు

శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి చిన్నతనము నుండియే వారి ఆధ్యాత్మిక జీవన యాత్రలో అనేక మలుపులు జరుగుతూ చివరకు అసలైన "రసోపాసన"ను అందుకొన్నారు.ఒకప్పుడు శ్రీ రామకృష్ణ పరమహంస ఇట్లు ప్రకటించెను _ " భగవదనుగ్రహమును, పొందిన జీవుడు ఒకే జీవితమునందే అనేక జన్మల సంస్కారములను దాటుకొని ముందుకు పోవును". రసయోగి (నాన్నగారు) జీవితము నందు కూడా అట్లే జరిగినది. అనేక చిల్లర దేవుళ్ళను, చిన్న చిన్న ఫలములనే ఆశ్రయించి వాటినెల్ల దాటుకొని అనేక ఫలములతో కూడిన మహావృక్షమగు, మూలతత్వమగు శ్రీ రాధా రసోపాసనలో ప్రవేసించారు. రసయోగి మరిడమ్మ సాధన చేసినా, గాయత్రీ, శివాక్షరీ, కామగాయత్రీ, రాధాస్వామీ దయాల్ బాగ్ మార్గము, కుసుమహరనాధుల తత్వ ప్రచారము _ ఏ మార్గములో ఉన్నా ఆయనది అంతర్లీనముగా ప్రేమమార్గము. మధుర మార్గము అయిన రసోపాసనయే చెప్పేవారు.

హరనాథ్ బాబా వారు ఒకసారి తన లేఖలో ఇట్లు ఉదహరించారు _ నేను శ్రీ కృష్ణ మహావృక్షమునకు చెందిన ఒకానొక అనామధేయమైన ఫలము మాత్రమే. సృష్టిలోని అన్ని నామములోనూ మధురాతి మధురమైనది శ్రీ కృష్ణ నామము. బాబా వారు తన లేఖల ద్వారా భక్తులకు, తల్లులకు, శ్రీ కృష్ణ మహిమను గురించి ఎంతగానో వర్ణించారు. బృందావనము అందరికీ శాంతినిచ్చు ధామము. ఎవరికి బాధ కల్గినా, ఏ కష్టము వచ్చినా బృందావనము వెళ్ళి శాంతిని పొందండి అని చెప్పారు. రసయోగి సుమారు మూడు దశాబ్దములు కుసుమ హరనాధుల మార్గములో ఉండి హరనాధబాబా వారు బోధించిన శ్రీ కృష్ణ ప్రేమతత్వాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆ మూడు దశాబ్దాల కాలంలో రసయోగి ద్వారా జరిగిన, పొందిన అనుభూతులు, జరిగిన విభూతులు ఆనాటి వారికి ఇప్పటికినీ చిరస్మరణీయులే. 1952 లో నాన్నగారు రాధా ఉపాసకురాలైన జనని శ్రీ రాధామహాలక్షి వారితో కలిసి రసోపాసనా మార్గములో ప్రవేశించి వ్రజభూమి వాసమే రసయోగ మార్గమని బృందావనంలో ఆశ్రమ స్థాపన చేసి రసోపాసన గావిస్తూరాధాప్రేమ వీచికలను వెదజల్లుచున్నారు.

*****************************

పూజ్యుశ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి 100 వ జన్మదినోత్సవము

సువర్ణ సుమమాల

డా || ప్రసాదరాయకులపతి [ప్రస్తుతము కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానందభారతి]

జీవలిపిన్ లలాటముల చెక్కెడి విశ్వ విధాత బ్రహ్మయే

రావలిరాణి దర్శనము రాక తపించె సహస్రవర్షముల్

జీవులలోన నొక్కడు విచిత్రముగా ప్రతిరోజు రాధికా

దేవుని చూచు _ పల్కును _ నుతించు _ ఇతండెటువంటి సృష్టియో

సాధిత కృష్ణదేవ పదసారస మంజు మరంద మాధురీ

సౌధకు ప్రేమభక్తి వివశత్వ విధాన విశిష్ట బోధకున్

రాధకు, నెయ్య్పున్ సఖిగ రంజిల బోవుచున్న తత్పదా

రాధకు నాన్నగారనగ రాజిలు యోగిని సంస్తుతించెదన్

నూరవయేడు వచ్చెనటె ! నూతన శక్తి సర: ప్రపుల్లక

ల్హారు నకున్, ధరామర శిలాశ్కటాన్వయ భద్రమూర్తికిన్

హోరలు పట్టినట్టి రసయోగికి అమ్మ కృపా విశేషమా

హారము ప్రాణముల్ సకలమైన మహాత్ముడు నాన్నగారికిన్

ముఖ్యము మాకు నెల్లరక పూర్వ మహత్వము రాధికాప్రసా

దాఖ్యతపో నిధానము, తదించిత భౌతిక భవ్యరూపమున్

లేఖ్యము గాని వెల్గున విలీనము గక నిరంతరమ్ము చిత్

సఖ్య మహస్సుతో నయన జాలము ముందర నిల్వగోరెదన్

లీనము నీదు నాదమురళిన్ హృదయమ్మిది కృష్ణచంద్ర ! సం

లీనము నీదుపాద యుగళిన్ శిరమో రసదేవి ! రాధికా

రాణి ! త్వదీయ ధామమున వ్రలగ గోరుచునున్న యీ మహా

ధ్యానిని మాకు నెల్లపుడు దక్కగనీయరె ! అంజలించెదన్

************

Read more...

ఆత్మలతో మాట్లాడే ఆంధ్రాయోగి { ఓపత్రికకథనం] రసయోగి 14

>> Saturday, September 25, 2010


రసయోగి _ 14

40. సఖీ భావనకు ప్రతీక _ ఉషాబహన్ (గురుబహన్)

సఖీ భావనతో రాధామాధవ యుగళ స్వరూపాన్ని ఆరాధన చేసే ఒక యోగిని బృందావనంలో నివసించుచుండెను. రాధామహాలక్ష్మి ఆశ్రమం ప్రక్కనే ఆవిడ ఆశ్రమం ఉంది. ఆవిడ పేరు "ఉషాబహన్" కానీ అందరూ ఆమెను "గురుబహన్ జీ" అని పిలుస్తూ ఉంటారు. ఆవిడ బృందావనం రాక మునుపు అంబాలా కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తూ ఉండేది. చిన్నతనం నుండి రాధాకృష్ణుల పట్ల అనన్య నిష్ఠ కల్గి ఉండేది. వివాహం కూడా చేసుకొనక, ప్రిన్సిపాల్ పదవికి సైతం రాజీనామా సమర్పించి, బృందావనం వచ్చి అక్కడే ఒక ఆశ్రమం నిర్మించుకొని సఖీభావనతో ధామనిష్ఠ కల్గి రాధాకృష్ణులను సేవించసాగింది. ఒకరోజు ఆవిడ తన ఆశ్రమంలో కూర్చొని శ్యామాశ్యాములను ధ్యానించసాగింది. ఇంతలో ఏదో అద్భుత కాంతి కిరణములు ప్రక్కనున్న రాధమహాలక్ష్మి ఆశ్రమం నుండి నలువైపులా ప్రసరింపసాగినవి. ఆవిడ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపడి ప్రక్కన ఉన్నవారు ఎవరో గొప్ప మహాత్ముడై ఉంటాడని గ్రహించి, ఆ ఆశ్రమం గురించి, అందున్న మహాత్ముని గురించి వివరాలు సేకరించింది. అటు తర్వాత రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది.

అటు తర్వాత ఆవిడ బృందావనంలో "భాగవత సప్తాహం" ఏర్పాటు చేసింది. బృందావనంలో ముగ్గురు మహాత్ములకు గొప్పగా సన్మానం చేసింది. వారిలో ఒకరు బృందావనంలోని వేణు వినోద్ కుంజ్ లోని బాలకృష్ణ మహారాజ్, అయోధ్య ప్రాంతం జనక్ పూరిలోని సీతారామదాసు బాబా, మూడవ వ్యక్తి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు.

అటువంటి ధామనిష్ఠ కల్గిన, సఖీ భావనలో, రసోపాసనా మార్గమున పయనిస్తున్న ఆ యోగినిని దర్శించటానికి యువకుడు అంజనీమాతతో, తన బాబాయి గారితో కలిసి వెళ్ళాడు. "ఆవిడ ఆశ్రమం" ఎంతో ప్రశాంతంగా వుంది. ఆవిడ వీళ్ళను చూసి నవ్వుతూఅ ఎదురొచ్చి సాదరంగా లోపల్కు ఆహ్వానించింది. యువకుడు స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్రశాంతత నిండి ఉన్న ఆమెను దర్శించాడు. ఆవిడ శరీరం పై ఎటువంటి అలంకారమూ లేదు. సాదా తెల్లని దుస్తులు ధరించి యున్నది. చూచుటకు ఒక అవధూత వలె యున్నది. ఆమె ముఖ మండలము దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్నది. పూజామందిరాన్ని యువకుడు చూశాడు. పూజా మందిరంలో ఒక సింహాసనం ఉంది. దాని మీద రాధాకృష్ణ యుగళ మూర్తులు ఉన్నారు. ఆ మూర్తులను వాళ్ళు వంశపారంపర్యంగా సేవిస్తూ ఉన్నారు. ఆవిడ అంజనీమాతతో చాలాసేపు భక్తి, జ్ఞాన సంబంధిత విషయాలను గూర్చి మాట్లాడింది. అంతట అంజనీమాత యువకుని వైపు చూస్తూ _ "నీకు హిందీ భాష తెలుసు కదా ! ఆమెను ఏదైనా ప్రశ్నించదలుచుకుంటే అడుగు" అని పల్కెను. అంతట ఆ యువకుడు ఆమెతో సంభాషణ గావించాడు. కొలది సమయంలోనే ఆ యోగిని ముందర తన చదువు, విజ్ఞానం దేనికీ కొరగావని తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు.

యువకుడు యోగినిని ప్రశ్నించెను _"మీరు ఆరాధించే ఆ మూర్తులు అందంగా యున్నాయి" మాట పూర్తి కాకుండానే ఆమె సమాధానం ఇచ్చింది _"రసస్వరూపులు రాధామాధవులు. వారిది దివ్య సౌందర్యం".

యువకుడు _ "మీరు వారిని ఎలా సేవిస్తారు ?

యోగిని _ నేను ఒక సఖిని,పరిచారికని,. సఖీ భావనతోనే వారిని సేవిస్తాను. అవసరమైనప్పుడు ఒక తల్లి బిడ్డలకు

సేవ చేసినట్లు వారిని లాలిస్తాను".

యువకుడు _ "మీరు వారితో మాట్లాడుతారా ? మీకు వారు కనబడుతున్నారా ?"

యోగిని _ "వారు ఎక్కడికి వెళ్ళారు కనబడకపోవటానికి ? నేను రోజూ వాళ్ళతో మాట్లాడతాను".

యువకుడు _ "మరి నేనూ వాళ్ళను చూడాలనుకుంటున్నాను. వారు కనబడాలంటే నేనేం చేయాలి?"

యోగిని _ "పిలు. బిగ్గరగా గొంతెత్తి పిలు"

యువకుడు _ "రోజూ పిలుస్తూనే ఉన్నాను. కానీ పలకటం లేదు. ఎన్ని సార్లు పిలవాలి ?"

యోగిని _ ( "ఎన్నిసార్లు" అనే మాటకు నవ్వింది ) ఎన్నిసార్లా !ఒక్కసారి పిలు. కానీ ఆ పిలుపు నీహృదయాంతరాళా

లలో నుంచి రావాలి. ఆ పిలుపు నీ ఆత్మ నుంచి రావాలి. అప్పుడు ఆ పరమాత్మ పలుకుతాడు".

యువకుడు _ "మరి పిలిచే పిలుపులన్నీ నా ఆత్మ నుంచి వచ్చినవి కావా ?"

యోగిని _ "నీవు పిలిచే పిలుపు నీ ఆత్మ నుండి వెలువడినదే అయితే పరమాత్మ పలికి ఉండేవాడు కదా ! "

యువకుడు _ "మరి ఇన్నాళ్ళూ పిలిచిన పిలుపులు వృధా అయినట్లేనా ? "

యోగిని _ "కాదు. ఈపిలుపులన్నీ నీ ఆత్మ పిలిచే పిలుపుకు ముందు నీవు చేసే రిహార్సల్స్ ".

ఇలా వచ్చిన వారితో సంభాషణ గావిస్తూనే యున్నది. ఇంతలో ప్రక్కనే ఉన్నవారిని _ "కన్నయ్యకు "భోహ్" పెట్టాలి. వాడు నిద్ర లేచే వేళయింది. నిద్ర లేవగానే ఆకలి అంటాడు" అని భోగ్ తీసుకురమ్మని పురమాయించింది. వాడికి భోగ్ పెట్టింది. ఈ దృశ్యం చూస్తుంటే యువకునికి అనిపించింది _ " కన్నతల్లి తను ఎన్ని పనులలో సతమతమగుచున్నా పిల్లవాని మీద ధ్యాస ఎలా ఉంచుతుందో, ఎలా ఏ వేళకి ఆ వేళ వాడికి వసతులు సమకూరుస్తుందో అదే విధంగా ఈవిడ కూడా ఆ రాధాకృష్ణ మూర్తులను తన పిల్లలుగా భావించి వారిని సేవించటం, లాలించటం, వారి చింతనలో జీవనం గడపటం ఇది ఒక అద్భుత ఘట్టం. ఇన్నాళ్ళూ మాటలు చెప్పే వారిని చూశాను గాని, ఆ మాటలను ఈ బృందావనంలో ఆచరణలో పెడుతున్న వారిని దర్శించగలుగుతున్నాను." ఈ భావనతో ఆ యువకుడు ఆ యోగిని పాదాలకు నమస్కరించి _ "మిమ్మల్ని చూసే భాగ్యం కల్గింది. మీతో మాట్లాడే అదృష్టం కలిగింది" యని పల్కెను. దానికి ఆ యోగిని "మీరంతా చాలా అదృష్టవంతులు నాయనా ! దానికి కారణం. పూజ్యులు రాధికాప్రసాద్ గారి ఆశీర్వాదం మీకు లభించటం. బాబా సామాన్యులు కారు. వారు నిరంతర రాధాతత్పరులు. ఆ యుగళస్వరూప సేవకు తమ జీవితం అంకితం చేసిన మహాత్ములు. వారు పిలిస్తే రాధాకృష్ణులుపలుకుతారు. శ్యామాశ్యాములు తమ సేవకై ఎన్నుకున్న "ఇష్టసఖీ" రూపమే రాధికాప్రసాద్ మహారాజ్ గారు. వారి సాంగత్యం మీకు శుభప్రదం అని పల్కింది.

ఆ యోగిని వద్ద సెలవు తీసుకొని యువకుడు తన బాబాయి గారితో, అంజనీమాతతో కలిసి రంగజీ మందిరానికి వెళ్ళాడు. రంజజీ మందిర ఆచార్యులు శ్రీ బాలాజీ స్వామి వారు. తెలుగువారు. వారు వీరందరిని సాదరంగా లోనికి ఆహ్వానించి మందిరమంతా దగ్గరుండి దర్శింపచేశారు. మందిర విశేషాల గురించి వివరించారు. వారు కూడా _ "ఎక్కడో కోటికి ఒక్కరుంటారేమో సిద్ధ పురుషులు. అందులోనూ అరుదుగా ఉంటారు. రసయోగులు. వారిలోనూ అరుదు రసికాచార్యులు. రసికాచార్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు. వారి కృప మీ యందున్నది. మీరు ధన్యులు" అని పలికారు.

శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు గుంటూరు వాస్తవ్యులు. అక్కడ రాధాకృష్ణ మందిరమును నిర్మించి మూడు నెలలు గుంటూరులో, మిగిలిన నెలలు బృందావనంలో ఉంటూ జనులను భక్తి మార్గగాములను గావించుచుండిరి. యువకుడు తను గుంటూరు వాస్తవ్యుడై ఉండి కూడా ఆయన గొప్పతనాన్ని తను పది మందికి చెప్పవలసింది పోయి, "ఆయన మీ గుంటూరు వారే కదా ! ఆయన గురించి తెలియదా ? " అని ప్రశ్నించినప్పుడు యువకునికి చాలా సిగ్గనిపించింది. ఆ మహాపురుషుని సాంగత్యం ఇంత ఆలస్యంగా లభించినందుకు బాధపడెను. అది సహజం. దీపం ఎక్కడైతే ఉంటుందో దానిని ఆవరించి దగ్గరలో చీకటి ఉంటుంది. వెలుగు దూరంగా పడుతూ ఉంటుంది. దీపం దగ్గరగానున్నా చీకటిలో ఉండటం వల్ల ఆ దీపము యొక్క మహత్మ్యమును చీకటిలో ఉన్నవారు గుర్తింప జాలరు. ఆ వెలుగును చూడలేరు. అలాగే గుంటూరులో ఉండి, గుంటూరు వాస్తవ్యులైన ఆ మహాపురుషుని మహత్యాన్ని తెలుసుకొనజాలక,ఎక్కడో ఉన్న బృందావనం వచ్చి అక్కడి యోగులు, భక్తులు వారి గొప్పతనమును గురించి చెబుతూ ఉంటే విని ఆయన సాంగత్యం కోరుకోవట, ఇది కూడా ఒక అదృష్టమే. కనీసం ఇప్పుడైనా ఆ మహాపురుషుని సాంగత్యం లభించింది అని యువకుడు ఆనందించెను.

10

సెలవులు గడిచిపోతున్నాయి. బృందావనంలో చూడవలసిన, దర్శింపవల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ రోజు సుమారు 30 కిలోమీటర్లు నడిచి యువకుడు తన బాబాయితో కలిసి బృందావన దేవాలయాలను దర్శించాడు. ఎక్కడకు పోయినా "రాధానామం" వీనుల విందుగా వినబడుతూ ఉంది. అలా బృందావన మందిరాలను దర్శిస్తూ తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. యువకును మనస్సులో ఒక ప్రశ్న, ఒక సందేహం కలిగింది _ "బృందావనంలో ఎక్కడకు వెళ్ళినా "రాధానామం" వినబడుతున్నది. కృష్ణుని కంటే కూడా "రాధా నామం" ఎక్కువగా వినబడుతున్నది. "రాధా" అనే నామం వింటుంటేనే వారంతా పరవశులగుచున్నారు. ఎవరు మర్కరిని కలిసినా "రాధే _ రాధే" యని పలకరించుకుంటున్నారు. ఇక్కడ ఇంత గొప్పగా, ఆది శక్తిగా, హ్లాదినీశక్తిగా కీర్తింపబడే రాధను, మరి మన తెలుగు కవులు కేవలం ఒక గోపికగా మాత్రమే చూశారు. అంతకు మించి వారు ఆ శక్తిని ఎందుకు దర్శించలేక పోయిరి" ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఆ యువకుని మనస్సును తొలిచివేస్తున్నాయి. ఇంతలో సంకీర్తన సమయం అయింది. యువకుడు కూడా సంకీర్తనలో పాల్గొన్నాడు. అంజనీమాత రాధికాప్రసాద్ మహారాజ్ గారిచే రచింపబడిన గీతాన్ని భక్తి తన్మయత్వంతో గానం చేయసాగింది _

గీతము :

చరణం : చిన్నారి రాధలో శ్రీదేవి రావమ్మా

మమ్మేలు కోవమ్మా నిను నమ్మి యున్నాము || చిన్నారి ||

1. నా హృదయ వీధిలో నీ మధుర ధ్యానము నే

నిరంతరంబు నే చేయ వరమీయ రావా జననీ || చిన్నారి ||

2. ఏ లోకమందునా ఏ కాలమందైనా

కానంగలేము నినుబోలు పరదేవతను || చిన్నారి ||

3. ఆత్మేశు శ్రీ హరికి ఆరాధ్య దేవతవై

పరదేవి నిన్ పొగడ హరిహరులకైన తరమా || చిన్నారి ||

4. భావ చింతామణి పరమాత్మ శ్రీ రాధా

బృందావనేశ్వరి అందాలు చిలికే రాణి || చిన్నారి ||

సంకీర్తన పూర్తి అయిన తరువాత శ్రీ రాధికాప్రసాద్ గారు రాధాతత్వం పై అనుగ్రహ భాషణ గావించారు.

"అన్యోదయం పురుషు ఏక ఏ వాస్తి తదేకం రూపం

ద్విధా విధాయ సర్వాన్ రసాన్ సమా హారతి

స్వయమేవ నాయికా రూపం విధాయ సమారాధన తత్పరోభూత్

తస్మాత్ తాం రాధాం రసికానందాం వేదవిదోవదంతి

( సామ వేద రహస్యం )

అనాది పురుషుడొకడే. సర్వ రసములను ప్రకాశింప చేయుటకై తనే నాయికా స్వరూపాన్ని ధరించాడు. ఆ రూపాన్నే వేదవిదులు "రాధ"యని సంబోధించారు.

"రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తితా "

సమస్త కామములను రాధించునది యనగా సిద్ధింపచేయునది కనుకనే ఆమె "రాధ" అయ్యెను.

తన నుంచి వేరైన ఆ నాయికా స్వరూపాన్ని ( తన రూపాన్ని ) తనే ఆరాధించ సాగెను ఆ పురుషోత్తముడు. అతను శ్రీ కృష్ణుడు. ఆమె రాధ. ఇరువురూ ఒకరినొకరు ఆరాధించుకొను చుందురు. కనుకనే ఆమె రాధ అయ్యెను _

" కృష్ణేన ఆరాధ్యత ఇతి రాధా

కృష్ణం సమారాధయతి సదేతి రాధికా"

( రాధికోపనిషత్ )

"రాధా" నామాన్ని స్మరించనిచో "కృష్ణ" అనుగ్రహము దుర్లభము. స్వయముగా శ్రీ కృష్ణుడే నారద మునితో పల్కినాడు _

"సత్యం సత్యం పున: సత్యం సత్యమేవ పున: పున:

రాధా నామ్నా వినాలోకే మత్ర్పసాదోన విద్యతే"

( నారద పాంచరాత్రము )

రాధాకృష్ణుల నిరువురిలో అనంత భావ స్వరూపిణి రాధ కనుకనే ఆవిడ బృందావన వాసులకు అత్యంత ప్రీతి పాత్రమైనది.

తయోరిప్యు భయోర్మధ్యే రాధికా సర్వాధికా

మహాభావ స్వరూపేయం గుణైరతి గరీయసి"

( ఉజ్జ్వల నీలమణి )

మన దక్షిణాది వారు, తెలుగు కవులు ఈ రాసేశ్వరీ తత్వాన్ని సరిగా అర్ధం చేసుకొనలేకపోయిరి. ఆ తల్లి గురించి తెలుసుకోవాలన్నా ఆవిడ అనుగ్రహం కల్గాలి" అని శాస్త్ర ప్రమాణ సూక్తులతో రాధికాప్రసాద్ గారు రాధాతత్వాన్ని విశదీకరించారు. యువకునికి సందేహ నివృత్తి అయినది. రాధానామాన్ని, రాధా సంకీర్తనను వారందరూ ఎందుకంత శ్రద్ధా, భక్తులతో చేస్తున్నారో అర్ధం అయింది. అటువంటి రసకిశోరి రాధారాణి జన్మస్థలం "పురాణగోకుల్" ను, రాధారాణి నివాస ధామం "బరసానా" ను దర్శించాలని యువకునిలో జిజ్ఞాస బయలుదేరింది. అంజనీమాత పురాణ గోకుల్, బరసానా ప్రదేశాల మహత్మ్యాన్ని విశదీకరించి "రేపు నిన్ను ఆ ప్రదేశాలకు తీసికెళ్తానని" పల్కింది. రాత్రి అయింది. ఆ యువకుడు ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఆ పవిత్ర ధామాన్ని దర్శిస్థానో యని ఎదురు చూడసాగెను.

తెల్లవారింది. నిన్నంతా 30 కిలోమీటర్లు నడిచిన కారణంగా కాళ్ళు బాగా వాచాయి యువకునికి. అడుగు తీసి అడుగు వేయాలన్న చాలా కష్టంగా ఉంది". ఆ యువకుడు తన బాబాయి గారితో పల్కెను. _" ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను. నన్ను ఎవరైనా డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళండి. రాధారాణి ఆవిర్భవించిన ఆ పవిత్ర ప్రదేశానికి వెళ్ళాలని అనుకున్నాను. బహుశ ఈ సారికి ఆ తల్లిని దర్శించే అదృష్టం లేదేమో. " ఆ తల్లి అనుజ్ఞ ఇంకా కాలేదోమో యని మనస్సున బాధ పడసాగెను. ఇంతలో ఎవరో ఆ యువకునితో _ "మహారాజ్ గారు పిలుస్తున్నారు వెళ్ళు" యని చెప్పిరి. యువకుడు రాధికాప్రసాద్ గారి వద్దకు వెళ్ళాడు. రాధికాప్రసాద్ గారు యువకుని ప్రశ్నించారు_" కాలు బాగా నొప్పి చేసిందా నాయనా" యని, యువకునిదగ్గరకు రమ్మని పిలిచి అతని తలపై చేయి ఉంచి ఆశీర్వదించి పల్కారు _ " నాయనా ! బరసానాకు వెళ్ళు. అమ్మను దర్శించు. ప్రేమమూర్తి చిన్నారి రాధ తన దగ్గరకు వచ్చిన వారిని ఆదరిస్తుంది" అని బరసానాకు అందరినీ బయలుదేరదీశారు. యువకుడు, మరికొంత మందిభక్తజనం అంజనీమాతతో కలసి ముందుగా "రావలి"కి బయలుదేరారు. అక్కడ రాధారాణి ఆవిర్భవించిన ఆ ప్రదేశాన్ని దర్శించాడు, అటు తర్వాత అంజనీమాత శ్యామకుండ్, రాధాకుండ్, గోవర్ధన గిరి మొదలగు ప్రదేశములను స్వయముగా యువకుని దగ్గరుండి చూపించి, ఆయా స్థల విశేషములను వివరించారు. చివరగా బరసానా కు బయలుదేరారు. కాలు నొప్పి అలాగే ఉన్నది. వాపు ఇంకా తగ్గలేదు. అయినా ఆ ప్రదేశాలను చూడాలనే ఉత్సాహంతో ఆ యువకుడు తాత్కాలికంగా ఆ కాలి నొప్పి మరచాడు.

బరసానా వృషభాను మహారాజ్ మందిరం. రాధారాణి ఆలనా పాలనా అక్కడే జరిగాయి. ఎత్తైన కొండ మీద ఉంది రాధారాణి మందిరం. వాచిన ఆ కాళ్ళతోనే ఆ యువకుడు కొండనెక్కి రసస్వరూపిణి రాధారాణి మందిరాన్ని దర్శించాడు. యువకుడు వెళ్ళేసరికి రాధారాణికి పవళింపు సేవ చేస్తున్నారు. యువకుడు కూడా "రాధారాణి" పవళింపు సేవలో పాల్గొన్నాడు. ఆ కొండ ఎలా ఎక్కాడో అతనికి తెలియదు. రాధారాణికి నమస్కరించి ఆ మందిర ఆవరణలో కూర్చున్నాడు. మాత అంజనీదేవి మందిర విశేషతను గురించి యువకునితో _

"రాధాష్టమి" పర్వదినాన కొన్ని లక్షలమంది మందిరాన్ని దర్శిస్తారు. "రాధే రాధే"యను నామంతో కొండంతా ప్రతిధ్వనిస్తుంది. ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేము. చూచి తీరవలసిందే"నని పల్కెను. ఆశ్చర్యకరంగా యువకుని కాలు నొప్పి తగ్గింది. యువకుడు కాళ్ళ వంక చూడగా కాలు వాపు కూడా తగ్గింది. యువకుడు లేచి నిలబడి అటునిటు నడిచి చూశాడు. హాయిగా నడగలుగుతున్నాడు. ఆశ్రమంలో బరసానా కు బయలుదేరే ముందు రాధికాప్రసాద్ మహారాజ్ గారి పల్కులు గుర్తుకు వచ్చాయి _ "తన వద్దకు కోరి చేరి వారిని "చిన్నారి" ఎప్పుడూ నిరాశపరచదు" యువకునికి ఆనందంతో కన్నుల నీరు తిరిగింది. మరల మందిరంలోకి వెళ్ళి రాధారాణికి సాష్టాంగ నమస్కారం చ్శాడు.

అటు తర్వాత అంజనీమాత భక్త జనాన్ని, యువకునితో సహా బరసానా కొందపై గల గేహారి వన్ కు తీసుకెళ్ళింది. గేహారివన్ లో ఒక కుటీరంలో రాధాకృష్ణ భక్తుడొకరు నివసించుచుండెను. అందరూ అతనిని "రమేష్ బాబా "యనుచు పిలుచుచుందురు. ఆయన బాల్యావస్థలోనే సర్వమూ పరిత్యజించి కేవలము కౌపీయమును ధరించి నిరంతరమూ రాధారాణిని దర్శనము చేయుచుండును. తన వద్దకు వచ్చిన వారికి "రాధారాణి లీలలను" అద్భుతముగా వివరించుచుండును. ముఖ్యముగా పర్వదినములలో ఆయన కుటీరము భక్తులతో కిట కిట లాడుచుండును. బాబా తన అనుగ్రహ భాషణచే ఎంతో మందిని ప్రభావితము చేసినాడు. అటువంటి ఆయన కూడా రాధికాప్రసాద్ మహారాజ్ గారు వ్రాసిన "రసమయ చంద్ర కిశోరీ _ కరుణా రస సింధో" యను కరుణరస భరితమగు పాటను విని ఆనందంతో కన్నీరు కార్చుచూ భావ సమాధిలో మునిగిపోయునాడు. రమేష్ బాబా కళ్ళు తెరిచి అంజనీమాతకు నమస్కరించాడు. రాధికాప్రసాద్ మహారాజ్ గారి యోగ క్షేమములను విచారించారు. అటు తర్వాత బృందావన విశేషములను, ధామ నిష్ఠలోని గొప్పతనమును గూర్చి వివరించారు. యువకుడు ఆ రాత్రి _" ఆ రోజు జరిగిన సంఘటనలన్నింటిని మననం చేసుకుంటూ నిదురలోకి జారిపోయెను".

11

బృందావనంలోని ముఖ్య ప్రదేశాలన్నీ యువకుడు దర్శించాడు. అదే విషయం రాధికాప్రసాద్ మహారాజ్ గారితో చెప్పినప్పుడు ఆయన నవ్వుతో "బృందావనంలో ముఖ్యమైనవి, ముఖ్యము కానివి అంటూ ఏదీ లేదు. అక్కడి అణువణువూ పరమపవిత్రం అని పల్కారు.

సెలవులు అయిపోయినాయి. యువకుడు తన బాబాయితో కలిసి ఇంటికి బయలుదేర సిద్ధమయ్యెను. అప్పుడు ఆ యువకుని రాధికాప్రసాద్ గారు పిలిచి _ "ఊరికి బయలుదేరుతున్నావా ? మరి నా చిన్నారి రాధకు సేవ చేస్తావా" యని ప్రశ్నించెను. అంతట ఆ యువకుడు _ " నాకు అంతట అదృష్టం ఉందా. కల్గుతుందా" యని ఆశ్చర్యపడెను. అప్పుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారు "ఎందుకు కల్గదు. తప్పక కల్గుతుంది" అని పల్కెను. అంతట యువకుడు _"నేనేం చేయగలను ? నా వల్ల ఏమి అవుతుంది ? రోజూ పూజ చేయాలా ? సంకీర్తన చేయాలా ?" అని ప్రశ్నించెను. అంతట బాబా "అది అందరూ చేసే పనియే. కానీ నీ నుండి చిన్నారి అది ఆశించటం లేదు. చిన్నారిని ( రాధను ) ఉపాసించి వ్రజభూమిని కేంద్రంగా చేసుకొని తరించిన భక్తులెందరో ఉన్నారు. ఆ మహాత్ముల జీవితాలు మానవాళికి మార్గ దర్శకాలు. మానవునిలో నిద్రాణమై యున్న భక్తిని జాగృతం చేస్తాయి. అయితే ఆ మహాత్ముల గాధలు, వారు రచించిన పుస్తకాలు హిందీ భాషలో నిక్షిప్తమై యున్నాయి. వాటిని తెలుగు భాషలోనికి అనువదించి మన తెలుగు వారికి ఆ రాధారసాన్ని అందించాలి. "చిన్నారి చరిత్రను, చిన్నారి మహిమను" మన తెలుగు వారికి వివరించాలి. ఇది చిన్నారికి నీవు చేసే సేవ. చిన్నారి నీ నుంచి అదియే ఆశిస్తున్నది. ఆ పనికి చిన్నారి నిన్ను ఎన్నుకున్నదని" పల్కెను.

బాబా యొక్క గంభీర వాక్కులకు ఆ యువకుడు ఆశ్చర్యపడెను. ఆనందించెను. మనసులో _ "లోకంలో ఎంతో మంది పండితులున్నారు. కవులున్నారు. భాషా తత్వవేత్తలున్నారు. కానీ "చిన్నారి" ఒక సామాన్యుడిని నన్ను ఎన్నుకున్నదంటే పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యం చేసి ఉంటాను. భగవంతుడైన శ్రీ రామునికి ఒక "ఉడుత" సేవించింది. అదే విధంగానే పూజ్యులు, మహామనిషి రాధికాప్రసాద్ మహారాజ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో నేనూ నా సేవనందిస్తాను. ఇది అదృష్టం కొద్దీ లభించిన అవకాశం. దీన్ని చేజార్చుకోకూడదు" అని నుకొని బాబాతో _ "మీరు చేయమన్న సేవ తప్పక చేస్తాను. అయితే దానికి తగిన శక్తిని, దీక్షను మీరు నాకు ప్రసాదిస్తే ఆ కార్యాన్ని నేను నెరవేర్చగలను" అని పల్కెను. రాధికాప్రసాద్ మహారాజ్ గారు యువకుని ఆశీర్వదించి "ప్రణామవల్లరి" , మరియూ "వ్రజ్ కేరసికాచార్య" అను పుస్తకములను యువకునికి అందిస్తూ _ "ఇందులో "ప్రణామవల్లరి"యను పుస్తకమును గోరఖ్ పూర్ కి చెందిన మహాత్ముడు "రాధాబాబా" రచించెను. రెండవ పుస్తకము బృందావనమును, వ్రజధామమును కేంద్రం చేసుకొని వసించిన రసికాచార్యుల దివ్య గాధలు. వీటిని నీవు హిందీ లోనుంచి తెలుగులోనికి అనువదించు. ఇది రాధారాణికి నీవు సమర్పించే సేవ" అని పల్కెను. యువకుడు "మహద్భాగ్యంగా" భావించి వాటిని స్వీకరించెను. అంతట ఆ యువకుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారికి, మాత అంజనీదేవికి నస్కరించి _ "ఇక్కడికి వచ్చి చాలా రోజులయింది. ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తుంటుంది. ఇక బయలుదేరుతాను" యని పల్కెను. అప్పుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారు యువకుని ఆశీర్వదించి "ఇది కూడా నీ ఇల్లే. ఇక్కడ కూడా అమ్మ (రాధ) ఉంది. నీవు ఎలాగైతే ఎంత దూరంలో ఉన్నా అమ్మను చూడాలని అనుకుంటున్నావో అలాగే ఈ అమ్మ ఈ అమ్మను కూడా చూచుటకు రావాలి" యని పల్కారు. ఆ ప్రేమాస్పద భరితమైన వాక్కులు ఆ యువకుని హృదయంలో నిలిచిపోయాయి. ఆ మధుర భావాలను హృదయంలో పదిలపరుచుకొని తన ఊరికి పయనమయ్యెను.

12

ఊరికి తిరిగి వచ్చి పది రోజులై పోయింది. నిరంతరం బృందావన సంకీర్తన, అక్కడి వాతావరణం, గలగల పారుతున్న యమున. యమున ఒడ్డున ఆశ్రమం. ఆశ్రమంలో శ్యామాశ్యాములతో కొలువుతీరియున్న రాధికాప్రసాద్ మహారాజ్ గారు, మాత అంజనీదేవి ఈ దృశ్యాలు యువకుని హృదయ ఫలకము పై బలంగా నాటుకున్నాయి. వ్రజ భక్తుల గాధలను తెలుగులోకి అనువదించసాగెను. మరి దానికి కావలసిన శక్తిని ఆ రాహారాణియే ఇచ్చిందో లేక పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారి అనుగ్రహ బలం వల్ల కల్గిందో తెలియదు గాని ఆ యువకుడు ఒక వైపు తన కళాశాల బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే రోజుకు 10, 11 గంటలు ఈ అనువాద కార్యక్రమానికి కేటాయించేవాడు.

ఒక రోజు రాధికాప్రసాద్ గారు గుంటూరు ఆశ్రమానికి వస్తున్నట్లు కబురు అందింది. వారు వేంచేశారు. గుంటూరులో మూడు నెలలు ఉన్నారు. యువకుడు రోజూ ఒక భక్తుని కథను హిందీలో నుండి తెలుగులోకి అనువదించి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారికి చదివి వినిపించేవాడు. ఆయన ఆ కథలను విని ఆనందించేవారు. ఆయన ఆనందాన్ని చూచి యువకుడూ ఆనందపడేవాడు. మాత అంజనీదేవి కూడా యువకుని పుత్రవాత్సల్యంతో పలుకరించేది. ఆశీర్వదించేది. మూడూ నెలలలో బృందావన రసికాచార్యుల గాధలను హిందీ లోనుండి తెలుగులోనికి యువకుడు అనువదించెను. ఆ అనువదిత విషయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది పుస్తక రూపాన్నిచ్చారు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు. "బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి" అను పేర ఆ పుస్తకన్ని విడుదల చేసి నిత్యమూ పారాయణ చేసుకొనమని ఆ పుస్తకాన్ని ఉచితంగా అందరికీ పంచి పెట్టారు. పుస్తకాన్ని భక్త మహాశయులకు ఇస్తూ _ "నా చిన్నారిని ఇస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోవాలి" అని పల్కేవారు. చిన్నారి పట్ల, ఆ పుస్తకం పట్ల ఆయనకున్న ప్రేమ అటువంటిది. ఆ పుస్తకం అనేకమంది గృహములలో నిత్య పారాయణకు నోచుకుంది. అటువంటి మహత్తర పుస్తకాన్ని అనువదించగల భాగ్యం తనకు ప్రసాదించినందుకు యువకుడు భక్తితో గురుదేవులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పాద పద్మములకు నమస్కరించెను. గురువు గారు మరికొన్ని పుస్తకములను యువకునికి అందజేసి వాటిని అనువదించమని ఆదేశించిరి _

1. రాధాబాబా చే రచింప బడిన "ప్రణామ వల్లరి " ( రాధారాణి వైభవోతపేత శృంగారమునకు సంబంధించిన

పుస్తకం )

2. ప్రభోదానంద సరస్వతీ పాదుల వారిచే రచింపబడిన "బృందావన మహిమా మృతం " (బృందావన

వైశిష్ట్యము, శ్యామాశ్యాముల మహత్వమును తెల్పునది )

3. ధ్రువదాస్ చే రచింపబడిన "ప్రేమ సరితా " (రాధారాణి కృపా వెశేషమును, వ్రజభూమి యొక్క మాధుర్యం

ను వివరించునది)

ఈ పుస్తకములను కూడా యువకుడు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలుగునకు అనువదించి తన గురుదేవులగు రాధికాప్రసాద్ మహారాజ్ గారికి భక్తితో సమర్పించెను.

"బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి" పుస్తకం అనువాదం పూర్తి అయిన రోజున ఒక విచిత్రం జరిగింది. ఆ రోజు యువకుడు ఎక్కడైతే " యమ్.ఏ." చదివెనో ఆ యూనివర్సిటీ నుండి ఉత్తరం వచ్చెను. అందులో ఈ విధముగా వ్రాసి యుండెను _ "నీ "యమ్.ఏ." పేపర్స్ "రీవాల్యూ" చేయబడ్డాయి. నీకు మార్కులు కలిశాయి. నీవు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడవైనావు. అంతేకాక యూనివర్సిటీలో ఐదవ రాంకును కూడా సాధించావు. కనుక నీవు యూనివర్సిటీకి వచ్చి "నీ రాంక్ సర్టిఫికెట్" తీసుకొనవలసినది. ఈ వార్తను చదివి యువకుడు ఆశ్చర్యపడెను _ "ఇది కలా ? నిజమా ?" మరల మరల ఉత్తరము చదివెను. ఇది నిజమే. ఇది ఎలా సాధ్యం అయింది. యమ్.ఏ. చదివి ఒక సంవత్సరం అయింది. పేపర్లౌ రీ వాల్యూ చేయమని అప్లికేషన్ పెట్టి సంవత్సరం అయింది దాని కొరకై ఎంతో ప్రయత్నము కూడ చేసినాడు . కానీ ప్రయోజనం లేక పోయింది. విసిగిపోయి ఆ విషయాన్ని మరచి ఉన్న ఈ సమయంలో ఈ వార్త రావటం చాలా ఆశ్చర్యముగ నుండెను" అని మనసున అనుకుంటున్నప్పుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారు బృందావనంలో పల్కిన పల్కులు గుర్తు వచ్చాయి _ "నీవు అమ్మను మరువకు, అమ్మ నిన్ను మరువదు. అదియే కృష్ణ భగవనుడు గీతలో అర్జునితో పల్కినాడు _ "యే యథా మాం ప్రపద్యంతే తాం తధైవ భజామ్యహాం" (నీవు ఏ విధంగా నన్ను తలుచుచుందువో నేను నిన్ను ఆ విధముగానే తలంచుచుందును).

యువకుని కళ్ళు చెమర్చాయి. అతని ఇంటిలోని వారందరూ ఎంతో ఆనందించారు. కానీ ఆ యువకుని మనసు మనసులో లేదు _ "ఈ ఆనందానికి కారణం గురువులు రాధికాప్రసాద్ మహరాజ్ గారే. వారి వల్లనే రాధారాణికి సేవ చేసే భాగ్యం కల్గింది. ఈ ఆనందం ఆ తల్లి ప్రసాదించిందే" అని భావించి మందిరమునకు పరుగెత్తి గురువు రాధికాప్రసాద్ గారికి విషయమును చెప్పి వారి పాదములకు నమస్కరించెను. రాధికాప్రసాద్ ఆ యువకుని ఆశీర్వదించెను.

ఒక రోజు యువకుడు "బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి" పుస్తకమును పారాయణ చేస్తూ చేస్తూ ఏదో పని మీద ప్రక్కన యున్న ఒక బల్ల పై ఉంచి బయటకు వెళ్ళెను. ఇంతలో ఆ ఇంటికి కొంతమంది బంధువులొచ్చిరి. వారిలో ఒకతను సిగరెట్ త్రాగి, సిగరెట్ పెట్టెను ఆ పుస్తకము పై ఉంచెను. యువకుడు పని ముగించుకొని ఇంటికి చేరెను. పుస్తకము పై సిగరెట్ పెట్టెను చూచిన యువకునికి చాలా బాధ కల్గెను. వచ్చిన బంధువులపై చాలా కోపము వచ్చెను. కానీ ఆ కోపాన్ని దిగమ్రింగి ఆ పెట్టెను ప్రక్కన పడవేసి ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా తన అలమరలో దాచెను. రోజంతా ఆ యువకుడు అన్యమనస్కుడై యుండెను. గురువులు రాధికాప్రసాద్ గారి మాటలు చెవులలో గింగురుమనుచుండెను _ "నాయనా "చిన్నారి"ని ఇస్తున్నాను. ఇది పుస్తకమని భావించక చిన్నారిగానే భావించి జాగ్రత్త పరచుకో".

"గురువు గారు ఎంతో నమ్మకంతో "చిన్నారి" ని అందించారు. నా నిర్లక్ష్యం వల్ల కదా ఇంత పొరపాటు జరిగింది. దీనికి కారణం వచ్చిన బంధువు కాదు నేనే కారణం" అని భావించిన ఆ యువకుడు ఆ రోజు భోజనం మానివేసెను. ఆ యువకుని తల్లి _ "ఏమిరా ! భోజనానికి రావా ?"యని పిలువగా "ఆకలి లేదు"యని అబద్ధం చెప్పి అక్కడి నుండి మందిరానికి వెళ్ళి రాధాకృష్ణులకు నమస్కరించి తను చేసిన తప్పును క్షమించమని ప్రార్థించెను. సాయంకాలమున అక్కడ సంకీర్తన జరిగెను. యువకుడు కూడ సంకీర్తనలో పాల్గొనెను. కొంతసేపటికి యువకుని మనసు కుదుట పడెను. రాధారాణికి మరల నమస్కరించి ఇంటికి చేరెను.

13

సంవత్సరం గడిచింది. రాధికాప్రసాద్ మహారాజ్ గారు బృందావనంలో ఉన్నారు. మరల ఎండాకాలపు సెలవులు వచ్చాయి. యువకుడు ఈ సారి తన సోదరులతో, స్నేహితులతో కలసి బృందావన యాత్రకు బయలుదేరెను. బృండావనం చేరారు. ఆ రోజు చాలా పవిత్రమైన రోజు శ్రీ కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తిన రోజు. మాత అంజనీదేవితో పాటు భక్త బృందం అంతా గోవర్ధన గిరిని పరిక్రమణ చేయుటకు బయలు దేరారు. యువకుడు కూడా తన స్నేహితులతో, తమ్ముళ్ళతో పరిక్రమణకు బయలుదేరారు. పరిక్రమణ రాధాకుండ్ లో స్నానం చేసి, అక్కడ నుంచి ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు పరిక్రమణ ప్రారంభమయింది. తెల్లవారు జామున 6 గంటలకు పరిక్రమణ ముగిసింది. 22 కిలోమీటర్లు వ్యాపించియున్న గోవర్ధనగిరిని ఆ రోజు కొన్ని లక్షలమంది పరిక్రమణ చేశారు. పిల్లలు,పెద్దలు, ముదుసలి వారు, యువకులు అందరూ తన్మయత్వంతో "రాధే రాధే" యని గానం చేస్తూ,కీర్తనలు చేస్తూ పరిక్రమణ గావిస్తున్నారు. నేల ఈనినట్లు జన సందోహం. ఒక వైపు నుండి "రాధే రాధే"యను నినాదం, మరొక వైపు శ్యామ్ మిలాదే" యను నాదం పెను హోరులో కొండంతా ప్రతిధ్వనిస్తుంది. చిన్న పిల్లలను భుజానికెత్తుకొని పరుగులు తీస్తూ,కీర్తన చేస్తూ కొంతమంది పరిక్రమణ చేస్తున్నారు. దప్పిక గొన్నవారికి,పానీయమును అందించ కొంతమంది అక్కడక్కడ కుండలలో చల్లటి పానీయములతో సిద్ధముగా నుండి, భక్తులకు పానీయమును ఇచ్చుచున్నారు. ఆ జన సందోహం చూచిన యువకునికి నోట మాట రాలేదు. యువకుని తమ్ములు ఆ ప్రజా సంద్రాన్ని, వారు భక్తి పారవశ్యంతో చేస్తున్న రాధా నినాదాన్ని తిలకించి ఆశ్చర్యపడ్డారు. వారు అనుకున్నారు _ " ఎవరైనా కొండ పైన ఆకాశంలో నుండి కొండను ఫోటో తీస్తే కొండ చుట్టూ ఉన్న ఈ జన సందోహం, మధ్యలో కొండ" బహుశ కొండ చుట్టూ ఒక మాల వేసినట్లుంది. యువకుడూ, అతని తమ్ముళ్ళూ, స్నేహితులూ ఆ ఆనందోత్సవాన్ని తిలకించి పరవశులైనారు. యువకుడు తను అంతకు ముందర దర్శించిన ప్రదేశాలన్నీ తన తమ్ములకు కూడా చూపించెను. అందరూ ఆనంద భరితులైరి.

బృందావన యాత్ర ముగించుకొని యువకుడు, అతని సోదరులు, మరికొంతమంది భక్త బృందం గుంటూరుకు బయలుదేర టికెట్లు రిజర్వేషన్ గావించుకొన్నారు. అనుకోకుండా ఆ సమయంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. భారత ప్రధాని రాజీవ్ గాంధీ దుర్మరణం. ఎవరో మద్రాసీయులు వారిని చంపారను వార్త దేశం అంతా ప్రచారమయింది. దేశ వ్యాప్తంగా బంద్ జరుగుతున్నది. కొన్ని ముఖ్యమైన రైళ్ళు మాత్రము కదులుతున్నాయి. కానీ అవి ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. దేశం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఊరు ప్రయాణం చేయటం చాలా ప్రమాదం. అదియునూ కాక బృందావనం నుండి మధురకు వెళ్ళి అక్కడ రైలు ఎక్కాలి. బృందావనం నుంచి టాంగాలో గాని, టెంపో లో గాని మధురకు వెళ్ళాలి. బంద్ కారణంగా వాహనాలన్నీ నిలిచిపోయినాయి. మరి ముందర మధుర చేరటము కూడా ఒక సమస్యయే. ఒక వేళ ఊరు ప్రయాణము మానుకుందామాయని అనుకుంటే కొన్ని వేల రూపాయలు నష్టం. టికెట్ క్యాన్సిల్ చేయించుకోవాలన్నా మధురకు వెళ్ళవలసిందే. ఏమి చెయ్యవలెను ?" అమే ఆలోచనతో అందరూ సతమతమగుచున్నారు. వారి సమస్యను మాత అంజనీదేవి రాధుకాప్రసాద్ గారికి విన్నవించింది. అంతట వారు కొద్దిసేపు కన్నులు మూసుకొని, మరల కన్నులు తెరిచి "గాబరా పడవలసిన పని లేదు. చక్కగా ప్రయాణం చేయగలరు. మీరు ప్రయాణానికి సిద్ధంకండి" యని పల్కారు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి మినీ వాన్ తీసుకొని ఆశ్రమం ముందర వారి ఇంటికి వచ్చి వెళ్తూ ఆశ్రమానికి వచ్చి "అమ్మా ! వాన్ మధుర వెళ్తున్నది. ఎవరైనా వచ్చేవారున్నారా ?"యని అడిగెను. వెదకబోయిన తీగె కాలికి తగిలినట్లయ్యెను. అందరూ రాధికాప్రసాద్ గారికి, మాత అంజనీదేవికి నమస్కరించి, వారి ఆశీర్వాదం తీసుకొని వాన్లో మధురకు బయలుదేరిరి. దారిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. మధుర స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో రైలు వచ్చింది. రైలులో భోగీలన్నీ ఖాళీగా వున్నాయి. "బంద్" కారణంగా ఏమైనా గొడవలు జరగవచ్చని భయంతో అందరూ పయాణం మానుకొని ఉంటారు. అందుకనే భోగీలన్నీ ఖాళీగా ఉన్నాయని టికెట్ కలెక్టర్ పల్కెను. అందరూ రైలు ఎక్కిరి. ప్రశాంతంగా, ఆనందంగా స్వగ్రామానికి చేరిరి. అంతట ఆ యువకుడు _"మహాత్ముల వాక్కుకు అమోఘ శక్తి ఉంటుంది. రాధికాప్రసాద్ మహారాజ్ వల్ల, వారి ఆశీర్వాద ప్రభావం వల్లనే అందరూ క్షేమంగా,ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎన్నడూ చేయనంత ఆనందంగా ప్రయాణం చేసి ఇంటికి చేరాము" అని భావించి మనస్సున వారికి వందనములు సమర్పించెను. అదియే మాట తన తమ్ములతోను, భక్త బృందముతో పలుకగా వారు కూడా ఇది నిజమే యని పలికి రాధికాప్రసాద్ మహారాజ్ గారికి మనసున కృతజ్ఞతలు సమరించిరి.

14

రాధికాప్రసాద్ మహారాజ్ గారు గుంటూరు విచ్చేశారు. యువకునకు హైదరబాద్ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన జరుపుకొనుటకు అవకాశం లభించింది. అక్కడకు వెళ్ళే ముందర రాధికాప్రసాద్ మహారాజ్ గారికి నమస్కరించి యువకుడు "నాన్నగారూ ! నాకు "పి.హెచ్.డి." (Ph.D.) లో సీటు వచ్చింది. ఇప్పుడు నా మనస్సు మరే ఇతర పుస్తకాలు చదవటానికి సుముఖతగా లేదు. వీలుంటే ప్రొఫెసర్స్ ఒప్పుకుంటే వ్రజభూమికి చెందిన భక్తుల మీద "పి.హెచ్.డి." చేయాలని ఉంది. నా అభిరుచులను సమర్ధించి నన్ను అటు వైపు మళ్ళించే ప్రొఫెసర్ కూడా లభించాలి. ఇక మరి రాధారాణి సంకల్పం, మీ ఆశీర్వాదం నా యందు ఎలా ఉందో మరి" యని పల్కాడు. అంతట రాధికాప్రసాద్ గారు యువకుని ఆశీర్వదిస్తూ _"అమ్మను నమ్మిన వారికి ఎన్నడూ బాధ కల్గదు. అంతా అమ్మ చూసుకుంటుంది. నీవు నిశ్చింతగా వెళ్ళు" అని పల్కారు. యువకుడు యూనివర్సిటీకి వెళ్ళాడు. అతని అభిరుచులకు తగిన విషయం లభించింది. అతని అభిరుచులను మన:స్పూర్తిగా మెచ్చుకొని అతనిని ముందుకు నడిపించే ప్రొఫెసర్ దొరికెను. ఆయన పేరు డాక్టర్ రాములు గారు. వ్రజధామమునకు చెందిన ఒక కవిని సూచించి ఆయన గ్రంధాలపై "పరిశోధన" జరుపమని సలహా ఇచ్చి యువకునిలో స్పూర్తిని, ఉత్సాహాన్ని కల్గించెను. ఐదు సంవత్సరములు, ఆరు సంవత్సరములు అయినా కూడా పరిశోధన పూర్తి కాక సతమతమవుతూ దానితో కుస్తీ పట్టే విద్యార్ధులెందరో ఉన్నారు. కానీ యువకుడు కేవలం రెండు సంవత్సరములలో పరిశోధన పూర్తి చేసిన అత్యున్నతమైన డాక్టరేట్ డిగ్రీని పొందెను. ఆ రెండు సంవత్సరములు రాధికాప్రసాద్ మహారాజ్ గారి ఆశీర్వాదం, గురువులు మన్ననలు, అన్నింటినీ మించి "రాధికా రాణి" కృప ఆ యువకుని ముందుకు నడిపించి విజయాన్ని చేకూర్చి పెట్టాయి.

15

యువకునికి ఒక ప్రాణ స్నేహితుడున్నాడు. అతని పేరు శ్రీధర్. శ్రీధర్ కూడా చిన్నతనం నుంచి భగవంతుని పట్ల భక్తిభావాలు ఉన్నవాడు. ఒక రోజు యువకుడు శ్రీధర్ ని తీసుకొని "రాధికాప్రసాద్ మహారాజ్" గారి సన్నిధికి తీసుకొని వచ్చెను. రాధికాప్రసాద్ మహారాజ్ గారు శ్రీధర్ కు "బృందావనేశ్వరీ శ్రీ రాధాదేవి" పుస్తకాన్ని ఇచ్చి పారాయణం చేసుకొమ్మని ఆదేశించారు. శ్రీధర్ వ్రజ భక్తుల గాథలతో ఉన్న ఆ పుస్తకాన్ని చదివి రాధాకృష్ణ భక్తుడైనాడు. బృందావ్నం కూడా వెళ్ళి అక్కడి మందిరాలు, రాధారాణీ విలాస సౌందర్యాలను తిలకించి ముగ్ధుడైనాడు. శ్రీధర్ అక్కగారు ఆ పుస్తకాన్ని చదువి ఆనంద పారవశ్యురాలైంది. ఆమెకు ఒక కుమారుడు పుట్టి పోయాడు. అటువంటి అశాంతి స్థితిలో ఆమెకు ఊరడింపు, మానసిక శాంతి ఆ పుస్తక పఠనం వల్ల లభించింది.

శ్రీధర్ తనకు మనసులో ఏ బాధ కల్గినా ఆ యువకునికి చెప్పుకునే వాడు. కారణం ఆ యువకుడంటే అతనికి ప్రాణం. శ్రీధర్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని ఆ యువకుడు వాంఛించే వాడు. శ్రీధర్ ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టాడు. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైనాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఒక రోజు యువకుని దగ్గర్కు వచ్చి _ "ఎల్లుండి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది. కానీ వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళినా ఫలితం కన్పడదు" అని బాధ పడెను.

యువకుడు స్నేహితుడు చెప్పినది విని స్నేహితునితో _ " నీవు హైదరాబాద్ వెళ్తున్నావు. నేను చెబుతున్నాను. నీకు తప్పక ఉద్యోగం వస్తుంది. అయితే నీవు ఒక పని చెయ్యాలి. హైదరాబాద్ వెళ్ళే ముందర మా ఇంటికి రా. ఇద్దరం రాధాకృష్ణ మందిరానికి వెళ్దాము. అక్కడ రాధాకృష్ణులకు నమస్కారం చేసుకొని, రాధికాప్రసాద్ మహారాజ్ గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్దువుగాని" అని పల్కెను. శ్రీధర్ మరుసటి రోజు హైదరాబాద్ వెళ్ళే ముందు స్నేహితునితో కలసి మందిరానికి వచ్చి రాధాకృష్ణులకు, రాధికాప్రసాద్ మహారాజ్ గారి పటమునకు నమస్కరించెను. బృందావనంలో ఉన్న రాధికాప్రసాద్ మహారాజ్ గారు తనను ఆశీర్వదించినట్లు అనుభూతి పొందెను. ఆనందంతో మరునాడు ఇంట్వ్యూకి హాజరైనాడు. ఉద్యోగం వచ్చింది. ఆనందంతో పరుగు పరుగున యువకుని దగ్గరకు వచ్చి _"నీ మాట నిజమైనది" అని పల్కెను. అంతట యువకుడు _ " ఇందులోనా గొప్పతనమేమియు లేదు. ఇది మహారాజ్ ఆశీర్వాద ఫలం, నీలోని నిష్కల్మష భక్తి, ఆ పై రాధారాణి కృప" ఇవి నీ్కు విజయాన్ని చేకూర్చి పెట్టాయని" పల్కెను. ఆ రోజు నుంచి శ్రీధర్ రోజూ రాధారాణిని అర్చిస్తూ, నామ సంకీర్తన చేస్తూ గురువులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని సదా మనసులో స్మరిస్తూ భక్తి మార్గంలో పయనించుచుండెను.

ఈ విధంగా పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి అనుగ్రహానికి పాత్రులైన వారు ఎందరో. యువకునికి మరొక స్నేహితుడు. అతని పేరు కె. అప్పారావు. అతను సాంప్రదాయ బద్ధమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. భగవంతుని పట్ల అపారమైన నమ్మకము ఉన్నవాడు. అతను C.A చదువుతున్నాడు. C.A లో "చివరి భాగము" వ్రాస్తున్నాడు. ఎన్నో సార్లు వ్రాశాడు. కానీ కొద్ది మార్కుల తేడాతో ఉత్తీర్ణుడు కాలేక నిరుత్సాహపడి యున్నాడు. చివరి పరీక్ష వ్రాస్తూ "ఇక ఈ సారి ఉత్తీత్ణుడిని కాకపోతే ఇక ఈ చదువు ఆపివేసి ఏదేని ఉద్యోగం చూసుకోవటం మంచిది" అని అనుకున్నాడు. పరీక్షలు వ్రాసి గుంటూరు వచ్చాడు.

ఒక రోజు యువకుడు ఆ మిత్రుని తీసుకొని రాధాకృష్ణ మందిరానికి వచ్చి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారితో _ "నాన్నగారూ ! ఇతను నా స్నేహితుడు. పరీక్షలు వ్రాశాడు. మీరు ఇతను మంచి మార్కులతో ఉత్తీర్ణుడవ్వాలని దీవించండి" అని పల్కెను. దానికి రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ యువకుని స్నేహితునితో ప్రశ్నించారు _ " పరీక్షలు బాగా వ్రాfశావా నాయనా ? " అంతట అప్పారావు "బాగా వ్రాశానండి" కానీ మార్కులు వచ్చేదాకా ఉత్తీర్ణుడిని అయ్యేదాకా మరి చెప్పలేను. ఇప్పటికి చాలా సార్లు వ్రాశాను. ఎప్పటికప్పుడు బాగా వ్రాశానని అనుకునే వాడిని. మరి ఫలితం మటుకు శూన్యం. కనుక మార్కులు వచ్చేదాక నేనేమి చెప్పలేను" అని పల్కాడు.

అంతట రాధికాప్రసాద్ మహారాజ్ గారు _ "నీ ఈ సారి ఉత్తీర్ణుడవు అవుతావు. నేను చెబుతున్నాను. అయితే నీవు మరి అమ్మకు (రాధారాణికి) ఏ సేవ చేస్తావు ?" అని ప్రశ్నించెను. అంతట అతను _ "మీరు ఏం చెబితే అది చేస్తాను" అని పల్కెను. " ఈ మందిరానికి సంబంధించిన ఆడిట్ పని నీవు చూసుకోవాలి. అది నీవు అమ్మకు సమర్పించే సేవ" యని రాధికాప్రసాద్ మహారాజ్ గారు అప్పారావును ఆదేశించి దీవించెను. అంతట అతను తప్పక అమ్మ సేవ చేస్తాను" అని పల్కెను. తన సొంత ఊరు హైదరాబాదుకి ప్రయాణమయ్యెను ఆనందోత్సాహంతో.

C.A రిజల్స్ వచ్చాయి. అప్పారావు ఆతృతతో రిజల్ట్ చూసెను. ఆశ్చర్యం వేసింది. మరల మరల చూసెను. చూస్తున్నది నిజమే. కలకాదు తను C.A పాస్ అయినాడు. పరుగున వెళ్ళి తన తల్లిదండ్రులకు వార్త తెలియజేసెను. తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. పుత్రుని ఆనందం చూసి వారు మరింత ఆనంద పడ్డారు. అప్పుడు అతని మనసులో పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు మెదిలారు. వెంటనే గుంటూరు ఫోన్ చేశాడు. తన స్నేహితునితో ఫోన్ లో _ " నీ వు వెంటనే మందిరానికి వెళ్ళి "మహారాజ్ గారికి " నేను ఉత్తీర్ణుడైన విషయం తెలియజేయి. నేను ఒక వారంలో గుంటూరు వస్తాను. నాన్నగారి ఆశీర్వాదం తీసుకుంటాను" అని పల్కాడు. యువకునికి తన స్నేహితుడు ఉత్తీర్ణుడైనందుకు ఆనందం వేసింది. మందిరానికి వెళ్ళి విషయం మహారాజ్ గారికి తెలియజేశాడు. మందిర సంకీర్తనకు వచ్చిన జనానికి "మిఠాయిలి" పంచి పెట్టాడు. వారం తర్వాత అప్పారావు హైదరాబాదు నుంచి వచ్చాడు. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ దర్శనం చేసుకున్నాడు.

41. కవిసార్వభౌముడు శ్రీ కులపతి దృష్టిలో రసయోగి

యువకుని పెదనాన్న గారు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు. గంటకు నూరు పద్యములు అఖండిత వీర మహాశుధారతో పల్కు మహాకవి. పండిత శ్రేష్టులు. కవి సార్వభౌములు. దేశవిదేశాలలో తెలుగు పద్య విద్యా వైభవమును చాటిన మేటి కవీశ్వరులు. గొప్ప మంత్ర శాస్త్ర వేత్త సిద్ధసాధకులు. తాంత్రిక విద్యా నిపుణులు, ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరులో శ్రీనాధ పీఠ కార్యనిర్వహణాధ్యక్షులు. వారు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారినిగురువుగా భావించేవారు. యోగ మంత్ర శాస్త్ర సంబంధిత విషయాలను కులపతి గారు, రాధికాప్రసాద్ గారిఓ కలిసి కొన్ని గంటల పాటు చర్చిస్తూ ఉండేవారు.

ఒకసారి ఒక "నాగయక్షణి" ఆవహించిన వ్యక్తిని వారి బంధువులు తాళ్ళతో కట్టివేసి రాధికాప్రసాద్ మహారాజ్ గారి వద్దకు తెచ్చారు. ఆ సమయంలో కులపతి గారు కూడా అక్కడే ఉన్నారు. నాగయక్షణి ఆవహించి యున్న వ్యక్తి కూర్చొని యుండెను. అతని నడుము పై భాగము వరకు గంటకు కొన్ని వందలసార్లు అటినిటు పాము వలె కదలాడించుచుండెన్ను. అప్పుడు రాధికాప్రసాద్ గారు అక్కడ యున్న వారితో _ " మీరు ఎవరైనా అతనిని కదలకుండా ఆపగలరా ?" యని ప్రశ్నించెను. అందరూ ప్రయత్నించారు. ఎందరు పట్టుకున్నా అతని కదలికలను ఆపలేకపోయిరి. అప్పుడు రాధికాప్రసాద్ గారు కేవలము తన చేతిని ఆ నాగయక్షణి ఆవహించి యున్న వ్యక్తి శిరమునకు తాకించెను. ఏదో మంత్రం వేసినట్లు ఆ వ్యక్తి ఠక్కున తన కదలికలను ఆపి వేసెను. అందరూ ఆశ్చర్యచకితులైరి. ఇటువంటి అద్భుతాలను రాధికాప్రసాద్ గారు కేవలం హస్త సంస్పర్శ మాత్రముననే ప్రదర్శించేవారు. కులపతి గారు శ్రీ రాధికాప్రసాద్ గారి మహత్వాన్ని ప్రస్తుతిస్తూ పల్కిన పద్య రాజం _

"జ్ఞానప్రసూనాంబ స్థానాన నెవ్వాడు దివ్యానుభవము సాధించె మొదట

దుర్గాంబ ఉపదేశ మార్గాన నెవ్వాడు శ్రీ రాధికా మంత్ర సిద్ధి నొందె

బృందావనేశ్వరీ కృప చేత నెవ్వాడు ఘన యోగశక్తులు కాంచగలిగె

యక్షరక్ష: పిశాచావళి నెవ్వాడు శాసించె తన సిద్ధ శక్తివలన

హస్త సంస్పర్శ మాత్రాన వ్యధలు వ్యాధు

లెందరికొ పారద్రోలిన రుషి యెవండు

ఆ మహాయోగి నద్భుత ధ్యాన సిద్ధు

అనషు రాధా ప్రసాద యోగిని నుతించు

శ్రీ కులపతి గారు కూదా పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ నడచిన బాటలోనే పయనిస్తున్న మహనీయులు. వారు కూడా ఇంద్రకీలాద్రి పై తపమాచరించి దుర్గాంబ ద్వారా రాధామంత్రమును పొంది, మంత్రసిద్ధి గావించుకున్న సిద్ధ పురుషులు, నిగర్వి.

ఒకసారి కులపతి గారు అమెరికాలో తెలుగు మహాసభలు జరుగుతుంటే అందులో పాల్గొనేందుకు వెళ్ళారు. అక్కడ ఒక రోజు ఒక సంఘటన జరిగింది. కులపతి గారి ప్రసంగాన్ని అక్కడి తెలుగువారు ఒక రాధాకృష్ణ మందిరంలో ఏర్పరిచినారు. అయితే రెండు రోజులుగా కులపతి గారి ఆరోగ్యం బాగాలేదు. అనారోగ్యంతో పరుండిరి. "రేపు మందిరంలో ప్రసంగించవలెను. ఇలా ఉంటే ఎలా ప్రసంగించగలను ? " అనే అలోచనలో పడిరి. ఆ రోజు రాత్రి వారికి స్వప్నంలో రాధికాప్రసాద్ మహారాజ్ గారు కులపతి గారు పరుండిన మంచం దగ్గరకు వచ్చారు. ఏమీ భయం లేదు" యని పల్కి ఆశిర్వదించిరి". ఈ విధముగా అనుభూతిని పొందిరి. మరునాడు కులపతి నిదురలేచి చూసుకొనేసరికి ఏదో నూతన ఉత్సాహం మనసుకు కల్గింది. అనారోగ్యం దూరమయింది. నూతనోత్సాహంతో ప్రసంగాన్ని గావించారు.

ఇలాగే మరియొక సంఘటన వారి జీవితంలో జరిగింది. ఒకసారి కులపతి గారు కాశీ విశ్వేశ్వరుని దర్శించి తన తల్లిగారు అస్థికలు గంగానదిలో నిమజ్జనం గావించి రైలులో తిరిగి స్వగ్రామమునకు పయనమయిరి. జ్వరము వచ్చెను. జ్వర తీవ్రత వల్ల కదలలేని స్థితిలో పరుండిరి. అప్పుడు వారికి ఒక అనుభూతి కల్గెను _"గుంటూరు రాధాకృష్ణమందిరం. మందిరములో శ్యామాశ్యాముల అందమైన విగ్రహాలు. ఇంతలో రాధారాణి విగ్రహం నుండి 11, 12 సంవత్సరముల ఒక బాలిక వెలువడి బయటకు వచ్చి అదృశ్యమయ్యెను. ఆ బాలిక రైలులో ప్రయాణించుచున్న కులపతిగారి వద్దకు వచ్చెను. కులప్తి గారు జ్వరములో కనులు మూసుకొని యుండిరి. ఆ బాలిక కులపతి గారి వద్దకు వచ్చి ఆయన తలను నిమిరి, ఆయన తలను తన ఒళ్ళో పెట్టుకొని పాలగ్లాసును చేతిలోకి తీసుకొని కులపతి గారిచే త్రాగించెను"ఇంతలో కులపతి గారికి మెలుకువ వచ్చెను. ఎవరూ కనపడలేదు. జ్వరంలేదు. మనసున ఆయన రాధారాణిని ధ్యానము చేసెను. ధ్యానంలో చిరునవ్వులు చిందిస్తూ భవ్యరూపంలో "చిన్నారి రాధ" దర్శనమిచ్చింది.

హ్లాదినీశక్తి రాధ. అత్యంత కరుణామయి.ఆ తల్లి ఎప్పుడు,ఎవరిని ఎలా, ఏ రూపాన కరిణిస్తుందో ఎవరు చెప్పగలరు ? ఎవరు ఊహించగలరు ?

శ్రీలంకలో గాయత్రీ పీఠం ఉంది. ఆ పీఠాధిపతి స్వామి మురుగేశ్. గొప్ప తప:సంపన్నుడు. ఆయనకు ఏనాటి నుంచో ఒక కోరిక శ్రీలంకలో గాయత్రి హోమం చేయాలి. తద్వారా శ్రీ లంకలో "శాంతి" వెలుస్తుంది అని ఆయన భావన. ఎవరో ఒక భక్తుని ద్వారా బృందావనంలోని పూజ్య గురువు రాధికాప్రసాద్ గురించి విన్నారు. వెంటనే ఆయన శ్రీలంక నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చి, అక్కడ నుంచి బృందావనానికి వచ్చి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ ను దర్శించారు. ఆయన సాన్నిధ్యంలో ధ్యాన మగ్నులై పరమానంద భరిత హృదయంతో _"ఇక బృందావనంలో నేను మరే ఇతర ప్రదేశాలను దర్శింపవలసిన అవసరంలేదు. తీర్థయాత్రలు చెయ్యవలసిన పనిలేదు. ఒక యోగిని, మహానీయుని, గొప్ప సిద్ధుని చూశాను. బృందావన భక్తి భావనలో గొప్ప విశేషమున్నది అని నాకు అర్థమయింది. నేను మొదటి సారిగా నా దేశం శ్రీ లంకలో రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠ చేస్తాను. నేను గాయిత్రీ యజ్ఞం తలపెట్టాను. మీరు స్వయంగా మా దేశం వచ్చి ఆ యజ్ఞాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించాలని అని పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని ప్రార్థించారు......... SRI LANAKATHEESWARAR TEMPLE

&

SRI GAYATHRI PEETAM

(YOGASHRAM)

Founder President Sri Nagar

Swami R.K.Murgesu 82,Lady Mc Calluma Drive

Nuwara _ Eliya

Sri Lanka.

Shri Radhika Prasadji Maharaj 07_09_1996

(Nanna Garu)

Sri Radha Mahalakshmi Ashram

Badi kunj

Gopeswara Mahadev Temple Road

Vrindavan _281121, U.P.

India.

Respectedand Poojya Swamiji

Pranama to your Lotus Feet.

I take great pleasure in writing to your Holiness on my return to Sri Lanka. I was overjoyed to travel in the campany of Radha and Krishna and their presence gave me the strength and courage to travel in my poor state of health and Iam very certain that without their presence, I would have not been able to reach Sri lanka, because of the state of health mentioned above.

Simplary, it was without my knowledge, directed by some divine power I came to you Holiness and I shall treasure the great experience, I had waith your Holiness. This was the great opportunity I have been looking farward to, but had been wondering as I have not got the direction from the almighty at that time.

I throughly enjoyed the divine blessing that your Holiness bestowed upon me and I shall be ever greteful to you Holiness throught my life period.

I also wish to sincerly thank your children for the warm welcome that they gave me and the love, devotion, dedication and respect they gave me has no parallel. I have already expressed to my devotees the wonderful exprerience I had with your Holiness and the great spiritual learnings I was able to gather from your Holiness Swamiji.

I now feel your Holiness presence within me and everywhere and this makes it more important for your Blessing to conduct the Yagna and the maha Kumababishegam is a very spiritual manner. I also take great pleasure in informing your Holiness that the status of Radha and Krishna waill be installed on the Maha Kumbabishegam day, on 24 th October 1996.

I also take pleasure in informing your Holiness that we have invited Rev. Dr. Prasadaraya Kulapathi go Guntur to attend the Maha Kumbabishegam. Kindly send your Holiness,s God Wishes and Blessings through him to conduct the Maha Kumbabishegam successfully.

I once again express my Pranama to your Holiness Lotus Feet and look forward to your continued good wishes and blessing for us to successfully conduct our affairs.

Om shanthi

Thy Humble sevak

Swami R.K. Murugesu

దానికి నాన్నగారు _ " ఈ 97 సంవత్సరాల వయస్సులో నేను ఆ యజ్ఞాన్ని చూచుటకు నీతో రాగల శక్తి లేదు. అయినా నా సూక్ష్మ శరీరంతో యజ్ఞాన్ని పర్యవేక్షిస్తాను. అయినా నా తరుపున మరొకరిని నా ప్రతినిధిగా పంపుతాను. ఆయన యజ్ఞ నిర్వహణ చేస్తారు" అని పల్కెను. ఆ యజ్ఞ నిర్వహణ బాధ్యత రాధికాప్రసాద్ మహారాజ్ గారు శ్రీ కులపతి గారికి అప్పగించారు. ఇదంతా రాధారాణి ఆడుతున్న అద్భుత లీలయని రాధికాప్రసాద్ మహారాజ్ గారికి,శ్రీ కులపతి గారికి తెలుసు. తల్లి ఆడే లీలలో భాగస్వామి అయిన వారు శ్రీ కులపతి గారు. శ్రీలంకలో అద్భుతాలు జరిగాయి. శ్రీలంకలో శ్రీ కులపతి గారు అద్భుత రీతిలో గాయత్రి యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞ దర్శినార్ధమై దేశ విదేశాలనుంచి సిద్ధులు, యోగులు, మహిమాన్విత వ్యక్తులెందరో వచ్చారు. శ్రీలంక విద్యాధికారి మంత్రి తొండమాన్ వినమ్రతతో శ్రీ కులపతి గారి పాదాల చెంత ప్రణమిల్లెను. ఒక్క మంత్రి ఏమిటి, అక్కడ ప్రజలు యావన్మందీ, దేశ విదేశాల నుంచి వచ్చిన సాధకులు, మాంత్రికులు, సిద్ధులందరూ కులపతి పాదాలకు మ్రొక్కారు. శ్రీలంక ప్రజలు, ప్రభుత్వం శ్రీ కులపతి గారిని ఒక యోగిగా, స్వామిగా, మహాత్మునిగా దర్శించారు. రాసనాయిక రాధ ఆడే ఈ వింత లీలకు కులపతి ఆశ్చర్యభరితులైనారు, పారవశ్య భరితులై ఆ తల్లి అవ్యాజ కరుణను కొనియాడుతూ _

స్వామినైతిని యోగినైతిని సాధువుగ నే మారితిన్

నీ మన:సంకల్ప ముండిన ఏమి కాను సురేశ్వరీ !

కొండలెక్కును కుంటి వాడును, గ్రుడ్డివాడను చూచెడున్

బండనాలుక మూగవాడును వాగ్విలాసిగ మారెడున్

గుండెలో నీవొక్క నిమిషము కూరుచుండిన చాలులే

పండు వెన్నెల వంటి తల్లీ ! బ్రతుకు సర్వము మారెడున్"

గాయత్రీ హోమ ప్రారంభమున గాయత్రీ పీఠాధిపతి స్వామి మురుగేశ్ తను బృందావనము నుంచి తెచ్చిన రాధాకృష్ణుల మూర్తులను తొలిసారిగా శ్రీలంక భూమి పై యజ్ఞశాలలో ప్రతిష్ఠించెను. శ్రీ కులపతి పర్యవేక్షణలో గాయత్రి హోమ పరిసమాప్తి అయింది. పూర్ణాహుతి సమయమున గాయత్రి మాత సాక్షాత్కరించింది. శ్వేత వర్ణములో భాసిల్లుతున్న

ఆ తల్లిని శ్రీ కులపతితో యోగులు, మహిమాన్వితులెందరో దర్శించారు. బంగారు వర్ణమున భాసిల్లుటకు కారణం _ అది శాంతి హోమము గనుక, అదియునూ కాక రాధాదేవి శ్వేత చంపక వర్ణము గలది. రాధాదేవి ప్రభావము యజ్ఞవాటికపై ఉన్నది. పూర్ణాహుతి సమయమున పూజ్యులు శ్రీ రాధికప్రసాద్ మహారాజ్ గారు తన సూక్ష్మ రూపముతో యజ్ఞమును పర్యవేక్షించుట కులపతి గారికి, మరికొంతమంది యోగుల దివ్యచక్షువులకు గోచరించింది. ఆ యజ్ఞశాలలో రాధాదేవి 11, 12 సంవత్సరముల పిల్లలా శ్రీ కులపతి గారికి దర్శనమిచ్చింది. ఆ ఆనంద పారవశ్యంలో శ్రీ కులపతి పులకించి పోయారు. ఆయన కంఠం గద్గమైంది. కన్నుల ఆనందాశ్రువులు రాలాయి. చాలాసేపటికి ఆయన అలాగే తన్మయావస్థలో ఉండిపోయారు. చాలాసేపటికి గాని మామూలు స్థితికి రాలేకపోయారు. ఈ ఉత్సవ ఘట్టాన్ని వివరిస్తూ _

"శంకరుడు, గాయత్రి మాతయు సాక్షులై పులకింపగా

లంక లోపల మొదటిసారిగా రాధ పాదము మోపెను

శంక లేదిక ద్వీపమందున శాంతియును సౌభాగ్యమున్

పంకజాక్షుని తల్లి కరుణను ప్రబలమై అలరారుతన్

అనఘుడౌ రాధా ప్రసాద్ మహామునీంద్రుని మాటకై

జనని రాధిక రాసనాయిక మనసు పెట్టెను లంకపై

వినుతుడాతని సూక్ష్మదేహము విద్యుదుజ్జ్వల కాంతితో

అనితరంబుగ యజ్ఞశాలా ప్రాంతమందున రాజిలెన్"

అని శ్రీ కులపతి గారు శ్రీలంకలో రాధారాణి విలాసమును, లీలలను ఎంతో గొప్పగా కొనియాడారు. పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి కోర్కె మీద ఆ కరుణామయి తొలిసారిగా శ్రీలంక భూమిపై తన పాదము మోపిందని భక్తుల కోర్కెలను నెరవేర్చే కామిత వరదాయిని రాధయని రాధాస్వరూపాన్ని వర్ణించారు. శ్రీలంక గాయత్రి పీఠాధిపతి శ్రీ మురుగేశ్ కూడా దివ్యానంద భరితుడై ఏదో ఒక దివ్య శక్తి తనను ప్రేరేపించి బృందావనమునకు తనను నడిపించిందని ఈ మహా యజ్ఞమును నిర్వహించునట్లు చేసిందనియు పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారికి లిఖితపూర్వకముగా వ్రాస్తూ _ without my knowledge I came to you in Brundavan impled by some devine power" రాధికాప్రసాద్ గారి పట్ల అత్యంత భక్తి విశ్వాసములను కనబరిచారు.

ఫిబ్రవరి రెండవ తారీఖు 1995 గుంటూరు నందు శ్రీ కులపతి గారు "దివ్య సాహితోత్సవాలు " ఏర్పాటు చేశారు. ఆ రోజు పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారి చేత ఆ అనుగ్రహ భాషణ గావించి వారిని ఘనంగా సన్మానించారు. ఆ రోజు సభలో శ్రీ కులపతి గారు పలికిన పలుకులు భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి _

"మంత్ర పరాణాం వచసి వసంతీ

ధ్యా పరాణాం మనసి లసంతీ

భక్తి పరాణాం హృది విహరంతీ

భాతి పరాంబా నభసి చరంతీ"

మంత్ర సాధన చేయు వారి వాక్కునందు, ధ్యానము చేయు వారి మనస్సు నందు భక్తుల హృదయము నందు ఆ పరమ శక్తి దాగి యుండును. కానీ త్రివిధములైన ఈ తత్వములు ఒకటిగా భాసిల్లే శరీరం పరమేశ్వరీ స్వరూపమై భాసిల్లుతుంది. త్రివిధములైన ఈ మూడు తత్వముల సమ్మిళిత స్వరూపమే పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు. మీరెవ్వరూ అన్యథా భావించకపోతే నేను ఒక విషయము చెబుతాను. నేను ఈ నగరంలో సాష్టాంగ నమస్కారం చేసేది నాన్నగారికి ఒక్కరికి మాత్రమే". భక్తి భావ భరితమైన ఆయన వచనములు పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పట్ల ఆయన్కున్న భక్తిని, ప్రేమని చాటాయి. "దైవీశక్తి" యను గ్రంధములో శ్రీ కులపతి గారు పూజ్యులు శ్రీ రాధామహాలక్ష్మి గారి మరియు శ్రీ రాధికాప్రసాద్ గారి యొక్క మహత్వమును, శక్తిని వేనోళ్ళ చాటారు.

ఈ విధముగా శ్రీ కులపతి గారు, పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పట్ల ఎనలేని భక్తి విశ్వాసం కల్గి, వారు పయనిస్తున్న మార్గముననే పయనించుచున్న మహామనీషి, రాధారాణి ప్రేమకు పాత్రుడైన ధన్యజీవి శ్రీ కులపతి.

16

ఒకసారి యువకుని తల్లి "గిరిబాల" గారికి అనారోగ్య ము చేసెను. ఆమె ఎక్కడకు వెళ్ళవలయునన్ననూ "భయము " అనెడిది. ఎన్ని మందులు వాడిననూ ఆరోగ్యము కుదుట పడ్లేదు. అప్పుడు యువకుడు తన తల్లిగారిని రాధికాప్రసాద్ మహారాజ్ గారి వద్దకు తీసుకెళ్ళి విషయమును వివరించెను. అంతట రాధికాప్రసాద్ గారు ధ్యానంలో చూసి "ఇది గ్రహ సంబంధమైన దోషము. అయిననూ విచారించవలసిన పనిలేదు. మూడు వారములు నీ తల్లిగారిని తీసుకురా. ఆరోగ్యము కుదుట పడునని పల్కెను. రోజూ యువకుడు తన తల్లి గారిని తీసుకొని మందిరమునకు వచ్చెడి వాడు. రాధికాప్రసాద్ గారు ఆ యువకుని తల్లి శిరమును తన హస్తముతో తాకిఉ కొలదిసేపు కనులు మూసుకొని ధ్యానము చేసెడివారు. తరువాత ఇంటికి తీసుకొని వెళ్ళమని యువకునితో చెప్పేవారు. మూడవవారమున ఆమెలో ఏదో తెలియని తేజస్సు గోచరించెను. ఆమెను ఆవరించిన "భయము" పోయెను. ఆమె ఆరోగ్యముతో అన్ని పనులు సక్రమముగా చేసుకొనసాగెను.

ఒక సారి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ భార్య రాధికాప్రసాద్ మహారాజ్ గరి వద్దకు వచ్చి _ " నా కుమారుని ఎవరో ఎత్తుకెళ్ళారు. బడికి వెళ్ళిన కుర్రవాడు తిరిగి రాలేదని " కన్నీరు మున్నీరుగా విలపించెను. అంతట రాధికాప్రసాద్ గారు ధ్యానమున విషయమును గ్రహించి ఆమెతో _ "నీవు దిగులు చెందకుము. ధైర్యముగా నుండుము. నీ పిల్లవాడు క్షేమముగానే ఉన్నాడు. నీవు ఏ ప్రయత్నము చేయకనే నీకు లభించును" అని పల్కిరి. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ కుర్రవాడు అన్నపానీయములు లేక ఒక చోట పడి వుంటే ఎవరో ఆ దంపతులకు ఫోన్ చేయగా వారు ఆ ప్రదేశమునకు చేరి సొమ్మసిల్లి నేలపై పడియున్న కుమారుని ఆతురతతో గుండెలకు హత్తుకొని ఆనందంతో కన్నీరు పెట్టుకొనిరి. తరువాత వారు పిల్లవానిని తీసుకొని రాధికాప్రసాద్ మహారాజ్ గారిని దర్శించి శ్రద్ధాభక్తులతో వారికి నమస్కరించిరి. ఈ విధముగా రాధికాప్రసాద్ మహారాజ్ గారి అనుగ్రహానికి, అవ్యాజప్రేమకు పాత్రులై జీవితలను సుఖమయం చేసుకున్న ధన్యజీవులెందరో ఉన్నారు.

17

రాధికాప్రసాద్ మహారజ్ గారిచే నిర్మింపబడిన గుంటూరులోని రాధాకృష్ణ మందిరం, బృందావనంలోని రాధా మహాలక్ష్మి ఆశ్రమం రెండూ శ్యామాశ్యాముల లీలావిలాస కేంద్రాలు. శ్యామాశ్యాములు ఆ ప్రదేశాలలో అద్భుత లీలలను ప్రదర్శిస్తూ, ఆ ప్రదేశాలను దర్శించటానికి వచ్చిన భక్త జనులను దివ్యానుభూతులకు లోను చేస్తూ వినోదిస్తూ ఉంటారు.

ఒకసారి యువకుని తండ్రిగారు, పెదనాయన్ శ్రీ కులపతి గారు, కొంతమంది కవులు ఢిల్లీలో కవి సమ్మేళనార్ధమై బయలుదేరి దారి మధ్యలో బృందావనంలో దిగి అక్కడి ప్రదేశాలను తిలకించి వెళ్దామని బయలుదేరారు. బృందావనంలో దిగారు. రాధామహాలక్ష్మి ఆశ్రమానికి వెళ్ళారు. వారు అక్కడ మూడు రోజులు ఉన్నారు. ఈ మూడు రోజులలో మాత అంజనీ దేవి వారందరికీ దగ్గరుండి బృందావన ధామాన్ని, అక్కడి మహాత్ములను దర్శింప జేసింది. అందరూ బృందావన ధామాన్ని దర్శించి ఆనందపరవశులైనారు. ఆ కవులలో ప్రఖ్యాతి గాంచిన కరుణ కవి కరుణ శ్రీ గారి కుమారుడు జంజ్యాల జయకృష్ణ బాపూజీ గారు కూడా ఉన్నారు. రోజంతా వివిధ ప్రదేశాలను దర్శించి ఆ మధురానుభూతులను మననం చేసుకుంటూ నిదురలోకి జారారు. వారికి స్వప్నంలో _ "ఒక నల్లని పిల్లవాడు, మోకాళా పై ప్రాకుతూ, చేతిలోని వెన్నముద్ద తింటూ ఆశ్రమ ప్రాంగణంలో తిరిగాడుట కనిపించెను. వారు ఆనందపరవశులైరి. ఇంతలో తెల్లవారింది. వారి స్వప్నం చెదిరింది. కన్నులు తెరిచారు. కళ్ళముందర చిన్ని కృష్ణుడు ఇంకను కదలాడుతున్న అనుభూతియే కల్గసాగెను. ఆ తియ్యని అనుభూతిని హృదయము పదిలపరుచుకొని రాధికాప్రసాద్ మహారాజ్ గారి పాదములకు నమస్కరించి "ఢిల్లీ" కి పయనమైరి.

యువకుని తండ్రి గారు ఆంజనేయప్రసాద్ గారు అన్నగారి అడుగుజాడలలో నడిచేకవి.బృందావనమును దర్శించి ఇంటికి వచ్చిరి. యువకుడు తన తండ్రి గారిని బృందావనమును గురించి ప్రశ్నించగా _" అది అద్భుత ధామం. అద్భుత ప్రదేసం. ఇన్నాళ్ళూ ఇంతవరకు ఎందుకు చూడలేకపోయాన ? " అని బాధపడ్డానని పల్కిరి. వారు ఒక రోజు గుంటూరులోని రాధాకృష్ణ మందిరములో సంకీర్తనలో పాల్గొనిరి. సంకీర్తన చేస్తూనే "ధ్యానం" లోకి వెళ్ళిరి. ధ్యానంలో ఆయనకు "వేణుగానం" వినిపించింది. ఆ గాన మాధుర్యంలో చాలా సేపు ఉండిపోయిరి. తరువాత కొలది సేపటికి కన్నులు తెరిచిరి. కన్నుల ఆనంద భాష్పాలు వర్షించాయి. తండ్రి గారి కన్నుల నీరు చూసి యువకుడు గాబరా పడి కారణమడుగగా _"వేణునాదం వినబడిందిరా " అని ఆనంద పారవశ్యంతో మాటలు రాక అలాగే కొలది సేపు మౌనండి ఉండిర్. తండ్రిగారి పారవశ్యాన్ని చీచిన యువకునికి ఎంతో ఆనందం కలిగింది. యువకుని తండ్రి గారికి రాధికాప్రసాద్ గారంటే ఎంతో భక్తి, ప్రేమ. వారిని "నాన్నగారూ" యని ఆప్యాయతతో సంబోధిస్తూ ఉంటారు. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారి మహానీయతను కొనియాడుతూ "కృష్ణాష్టమి" పర్వదినాన గుంటూరు రాధాకృష్ణ మందిరములో వారు పల్కిన పద్యం రాధికాప్రసాద్ గారి పట్ల ఆయనకున్న భక్తి విశ్వాసాలకు నిదర్శనం _

"బృదావనేశ్వరి కందోయిలో వెల్గు

కారుణ్య మందిర కల్పకమ్ము

రాధా మహాదేవి రమ్య గాధావీధి

పులకించి పోయెడి పుణ్యమూర్తి

నిత్యరాసేశ్వరీ నృత్యలీలలు కాంచ

సార్ధక జన్ముడౌ సత్యయోగి

వ్రజభూమి వాసమే రసయోగి మార్గమై

చరియించు రాధాప్రసాదయోగి

రమ్యగోలోక నాయిక రాధ యొక్క

ఇష్టసఖి పుట్టి ఈ రూపునెత్తి భూమి

శత వసంతో దయమ్ములు చాటుచుండె

రండి సేవించి పుణ్యము దండుకొనుడు"

రాధికాప్రసాద్ మహారాజ్ గారి బాల్య మిత్రులు, శిష్యులు, సన్నిహితులు, అంతరంగిక సఖుడు శ్రీ సుబన్న గారు. రాధికాప్రసాద్ మహారాజ్ గారితోనే తన జీవితం ముడి పడి ఉందని నమ్మి వారితో కలిసి జీవనయానం చేస్తున్న నిగర్వి. గుంటూరులోని రాధాకృష్ణమందిర సేవ నిర్వహిస్తూ ఉన్నారు. తన జీవితాన్ని మందిర సేవలో, శ్యామాశ్యాముల సేవకు అంకితం చేసిన వ్యక్తి. పూజ్యులు రాధికాప్రసాద్ మహారజ్ గారు రచించిన గీతాలన్నీ దాదాపు ఆయన కంఠస్థం చేశారు. స్వయంగా అనేక గీతాలు వ్రాశారు. భక్తి పారవశ్యంతో కూడిన ఆర్ధ్రత, ఒక రకమైన ఆర్తి ఆయన కంఠంలో ప్రతిధ్వనిస్తూ గీతానికి మరింత మధురతను సంతరించి పెట్టాయి. మంత్ర సాధకులు, సిద్ధ సాధకులు, రసికాచార్య శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ ను వారు దైవంగా భావిస్తూ ఉంటారు.

1960 ఆగష్టు 9 న శ్రీ సుబన్నయ్యగారి తండ్రిగారు దివంగతులైనారు. తండ్రి జ్ఞాపకాలు సుబ్బన్నయ్య గారిని వేదించేవి. సుబ్బన్నయ్య గారి తండ్రి మంచి పాండురంగ భక్తుడు. ఒక రోజు సుబ్బన్నయ్య గారు తండ్రి గారు తనకు చేసిన అనేక ఉపచర్యలు గుర్తుకు రాగా ఆయన వియోగాన్ని తలచుకొని దు:ఖించసాగెను. విషయము తెలుసుకున్న శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు సుబ్బన్నయ్య గారిని పిలిపించిరి. అంతట సుబ్బన్నయ్య గారు _" నాన్నగారూ ! నాకు ఒక కోర్కె ఉన్నది. నాకు మణులు, మాణిక్యాలు అక్కరలేదు. నాకు జన్మనిచ్చిన తండ్రి గారిని ఒక్కసారి చూడాలి, మాట్లాడాల్ని ఉంది" మీరు సిద్ధ పురుషులు, దయ చేసి నా కోర్కె నెరవేర్చండి అని ప్రాధేయ పడిరి. రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు సుబ్బన్నయ్య గారి విన్నపాన్ని మన్నించారు.సుబ్బన్నయ్య గారికి వాళ్ళ నాన్న గారు దర్శనమిచ్చారు. తండ్రిగారు కన్పడిన వెంటనే సుబ్బన్నయ్యగారు పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టారు. ఆశ్రమవాసులందరూ ఆయనను చుట్టుముట్టగా తండ్రిగారు కన్పడినట్లు తన్తో " అన్ని విధములుగా నీకు గురువుగా ఉండిన రాధికాప్రసాద్ మహారాజ్ గారి ఆశ్రమంలో ఉండటం నాకు సంతోషం కల్గించింది. ఎన్ని పరిస్థితులు మారిననూ మన అందరైకీ గురుతుల్యుగా ఉండిన రసయోగిని విడువవద్దు. లోక కళ్యాణ మూర్తులైన రాధాకృష్ణులను విడువకుము" అని చెప్పి అదృశ్యమైనట్లు చెప్పిరి. ఊర్ధ్వలోకల నుండి పితృదేవతలను భూలోకమునకు దిగివచ్చినట్లు చేసి తనక్లు దర్శనమిప్పించిన శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారంటే సుబ్బన్నయ్య గారికి ప్రేమ, భక్తి. గౌరవం ఉండటంతో ఆశ్చర్యమేమీ లేదు. ఆ గురువుగారి సేవలో తన జీవితాన్ని పండిచుకుంటున్న మహోన్నత వ్యక్తి శ్రీ సుబ్బన్నయ్యగారు.

ఒకసారి శ్రీ సుబ్బన్నయ్య గారు బృందావనంలో ధ్యానమగ్నులై ఉన్నారు. ధ్యానంలో వారికి ఒక్ అనుభూతి కలిగింది _"పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు సుబ్బన్న గారిని సమీపించి ఒక మంత్రాన్ని ఇచ్చి ధ్యానం చేయమని పల్కారు." స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తనకు రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఇచ్చిన మంత్రాన్ని భక్త జనులకు వినిపించారు.అది రాధా "అష్టాక్షరీ మంత్రం ". మంత్ర ధ్యానం చేస్తూ సుబ్బన్న గారు రాధారాణి సేవకు అంకితమై ఉన్నారు. రాధికాప్రసాద్ మహారాజ్ గారు వారికి ఆ విధంగా రాధారాణి అనుగ్రహాన్ని పొందుటకు మార్గాన్ని నిర్దేశించారు. సూచించారు.

సుబ్బన్న గారి వలె మందిర సేవకు అంకితమైన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఆదిలక్ష్మి గారు, ఆండాళమ్మ గారు, శాంతమ్మ గారు ముఖ్యులు. వీరు బృందావనంలో ఉంటూ రాధికాప్రసాద్ మహారాజ్ గారిని దర్శించటానికి వచ్చే వారికి, బృందావనమును దర్శించ ఆశ్రమంలో బస చేసిన వారికి భోజన వసతులు సమకూరుస్తూ ఉంటారు. విసుగుదల గానీ, చికాకు గానీ, అలసట గానీ వారిలో కన్పడదు. వారిని యువకుడు ఒకసారి ప్రశ్నించాడు _ " నిరంతరం ఎంతో మంది ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటారు. వారందరికి భోజన వసతులు ఓపిగ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు సమకూరుస్తున్నారు. మీకు విసుగుదల కానీ, కోపం గానీ కలుగవా ?"

దానికి వారు _"ఇది రాధారాణి సేవ.నాన్నగారు రాధికాప్రసాద్ మహారాజ్ గారు మాకు ఈ సేవ అప్పగించారు. ఇది మాకో వరం. ఇక్కడకు వచ్చే వారందరూ రాధారాణి బిడ్డలే. తన బిడ్డలకి అన్నం పెడితే, ఆ బిడ్డలు కడుపునిండా అన్నం తిని సంతృప్తి చెందితే ఆ తల్లి రాధారాణి సంతోషిస్తుంది. ఆమెకు ఆనందం కల్గించే పని చేయటంలో మాకు ఎంతో ఆనందం ఉంటుంది" అని సమాధానమిచ్చారు. వారి మాటలు యువకుని మనసును పరవశింప చేశాయి. భక్తులకు ఆకలి తీర్చుటయే ఆ తల్లికి వారు సమర్పించే సేవ. ఆ విధమైన సేవా మార్గాన్ని కల్పించారు వారికి రాధికాప్రసాద్ మహారాజ్ గారు. మహారాజ్ గారంటే వారికి ఎంతో భక్తి, ప్రేమ. వారందరూ ఎంతో ఆప్యాయతతో "నాన్నగారూ" అని వారిని సంబోధిస్తూ ఉంటారు.

అలాగే అంజనీమాత దగ్గర రాధికాప్రసాద్ మహారాజ్ గారిచే రచింపబడిన పాటలను ఎలా గానం చేయాలో రాధికారాణి, గంగాభవానీ, రమాదేవి, పద్మజ, భారతి మొదలగు వారు అభ్యసిస్తూ, అంజనీమాతతో కలిసి సంకీర్తన చేస్తూ నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ రాధారాణి సేవలో తామూ భాగస్వాములై రాధికాప్రసాద్ మహారాజ్ గారు చూపించిన బాటలో ముందుకు పయనించుచున్నారు.

ఈ విధముగా పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆబాలగోపాలాన్ని ప్రభావితం గావిస్తూ, వారిలో స్పూర్తిని కల్గించి రాధామాధవ సేవా మార్గాన్ని నిర్దేశించి వారిని ఆ మార్గంలో పయనింప చేస్తూ వారి జన్మ సార్ధకమగునట్లు చేయుచున్నారు.

ఎంతోమంది భక్తులు బృందావన ఆశ్రమానికి, గుంటూరులోని రాధాకృష్ణ మందిరానికి దూరదూర ప్రాంతాలనుండి వచ్చి బస చేస్తూ ఉంటారు. రాధికాప్రసాద్ మహారాజ్ గారి అనుగ్రహాన్ని పొందుతూ పారవశ్యంతో ఇంటికి వెళ్తూ ఉంటారు. వచ్చిన భక్తులందరికీ ఆశ్రమం ఆహార వసతులన్నీ సమకూర్చేది. వచ్చిన భక్తుల దగ్గర ఒక్క పైసా కూడా ఆశ్రమ వాసులు ఆశించే వారు కారు. ఉచితంగా వారందరికీ భోజన వసతులు సమకూర్చేవారు. ధనం గురుంచి గాని, "రేపు ఎలా ?" అనే దిగులు గాని, అటువంటి సందేహానికి గాని వారు ఏమాత్రం తావివ్వరు. "అన్నీ రాధారాణియే చూసుకుంటుంది" అనే భావన, నమ్మకం అక్కడ ప్రతివారిలో బలంగా కన్పడుతుంది. వారి నమ్మకానికి తగినట్లుగానే రాధారాణి, రాధికాప్రసాద్ మహారాజ్ రూపాన వారికి కావలసిన అన్ని వసతులు సమకూర్చేది. వారు సంకల్పించిన మాత్రానే అన్నీ వాటంతట అవే సమకూరేవి. అది వారి మనోబలానికి నిదర్శనం.

పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారి వలన రాధాశక్తి భక్తి మార్గగాములై తమ జీవితాలను సార్ధకపరుచుకున్న వారెందరో ఉన్నారు. వారిలో శ్రీ బి. పాండురంగారావు గారు ఒకరు. విజయవాడ వాస్తవ్యులు విత్తిరీత్యా ఇంజనీయర్. కానీ రసయోగి సాంగత్యం వల్ల వారు కల్గించిన స్పూర్తి వల్ల ఆయన, ఆయన పరివారం అంతా రాధారాణి సేవకులైనారు. అమ్మ యొక్క హ్లాదినీ శక్తి తరంగము ఎట్టి వారిలోనైనా మార్పు తెచ్చును కదా ! ఆయనకు ఇరువురు ఆడపిల్లలు _ అఖిల మరియు హేమ. ఇరువురూ రాధారాణి సేవ చేయాలనే పట్టుదల కలవారు. రాధికా సఖిగా మారాలని వారి ధ్యేయం, పట్టుదల. అదే విషయమును ఆయన ఉత్తరము ద్వారా రసయోగికి తెలియపరచుచూ "రాధారాణి హ్లాదినీ శక్తి ప్రభావము వల్ల, మీ దివ్యనుగ్రహం ప్రభావమువల్ల మా కుటుంబము ఆధ్యాత్మిక చింతనా మార్గములో మరింతగా పురోగమిస్తుందని నా నమ్మకం. దానికి మీ ఆశీర్వాదం కావాలి. " అమ్మక్ను ఏదీ అడుగకు, అమ్మకు తెలుసు నీకు ఎప్పుడు ఏది సమకూర్చాలో" అన్న మీ మాటలు నా హృదయంలో చిరస్థాయిగా నిలిచాయి. ఆ భావనను ఎల్లవేళలా కల్గి ఉండుటకు ప్రయత్నిస్తున్నాను" అనుచూ తన మనోగత భావాలను ఒక ఉత్తరం ద్వారా ప్రకటించారు _ ఉత్తరం _

Dear Nannagaaru, my saadhana is progressing with your blessing. I see my mother Radha Ranis hlodlini shakti filling not only my life, but also that of my family. It is your Holiness who brought mother into our lives. I sall be ever grate full also to your holy feet for bestowing your grace onces you have also placed before me a great and wonderful ideal never to ask any thing from mother. Never to present any of my problems to mother. I am proactising it with a lot of difficulty. please bless me that I will for ever be able to uphold that ideal in my life.

జీవితం విలువైనది. కాలం అమూల్యమైనది. కాలాన్ని సద్వినియోగ పరచుకుంటూ జీవితాన్ని సార్ధక పరచుకోవాలి. జీవితం సార్ధకం ఎప్పుడవుతుందంటే మనము కూడా మహాత్ముల మార్గంలో పయనించి ఆ పరమేశ్వరుని దర్శించటం వల్ల అది సత్సంగం వల్ల సాధ్యమౌతుంది. శ్రీ పాండురంగారావు గారు కూడా రసయ్యోగుల సాంగత్యం వల్ల తన జీవితాన్ని దివ్యపథం వైపు నడిపించుకోవటానికి కృషి చేస్తున్న సాధకులు. తప్పక తన గమ్యాన్ని ఏదో ఒక రోజు సాధించుకోగలడు. ఆత్మ విశ్వాసం, పట్టుదల గురుకృప వల్ల ఆయనలో స్వయసిద్ధంగా ఉన్నాయి.


18

42. ఆత్మలతో మాట్లాడే ఆంధ్ర యోగీశ్వరుడు :

పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి విన్న మిత్రులు శ్రీ వై. వి వివేకానంద్ గారు ఒకసారి రాధికాప్రసాద్ గారిని కలిసి ఇంటర్వ్యూ చేశారు. వారి సంభాషణలో ఆత్మల గురించి, పునర్జన్మల గురించి, గ్రహ సంబంధ బాధల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వారి సంభాషణ " ఆత్మలతో మాట్లాడే ఆంధ్ర యోగీశ్వరుడు " అనే శీర్షికన ఆంధ్రప్రభ వీక్లీలో డిశంబర్ ఆరు 1994 లో రాధికాప్రసాద్ గారి కలర్ ఫోటోతో ప్రచురితమయింది.

అది ప్రచురించబడిన తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల నుండి గ్రహ సంబంధిత, రోగ గ్రస్తులైన వారు రాధికాప్రసాద్ గారిని శరణుజొచ్చి వారి అనుగ్రహానికి పాత్రులై మహదానంద భరితులై తమ తమ గృహములకు చేరిరి.

Read more...

శరన్నవరాత్రి సాధనా శిబిరం లో పాల్గొనండి .. అమ్మ అనుగ్రహం పొందండి

>> Friday, September 24, 2010


శరన్నవరాత్రులలో సాధనా శిబిరానికి ఆహ్వానం
8-10 -2010 to 17-10-2010

సాధకులకు శరన్నవరాత్రుల సమయం ఒక ద్భుతమైన అవకాశం . దుష్ట శిక్షన చేసి లోకాన్ని రక్షించిన జగజ్జనని దివ్యానుగ్రహం పరిపూర్ణం గా వర్షించే సమయమిది. సాధకులు తమ జీవితం లో అన్ని విషయాలలో వివిధ ఆటం కాలను తొలగించుకుంటూ జయాన్ని పొందటానికై చాలా మంచి సమయం . కనుకనే అనాదిగా ఈ శరన్నవరాత్రులకాలం లో మంత్రజపధ్యానాదులద్వారాను,వివిధ రీతుల అమ్మను అర్చించుటద్వారాను యజ్ఞయాగాదులద్వారా వివిధ సాంప్రదాయకులు సాధనలు సాగిస్తారు. ఇక మనబోటి సామాన్య భక్తులు అమ్మా! అని ఆర్తితో పిలిస్తే చాలు ఆప్రేమకు కరిగిపోయి కదలివచ్చి కాపాడే దయామయి అమ్మ .
జీవితం లో వివిధ సమస్యలతో విసిగి వేసారుతున్నవారు , తమ కార్యరంగాలలో విజయాన్ని కాంక్షించేవారు ఈనవరాత్రులలో భక్తిగా అమ్మను సేవించుకునేందుకు సాధనా శిబిరాన్ని" శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం " లో నిర్వహించటం జరుగుతున్నది . హరిహరసమేతంగా అమ్మవారు కొలువైన ఈ సిధ్ధపీఠం లో వివిధ సాంప్రదాయకులంతా సాధనలకు నిర్విఘ్నంగా కొనసాగించుకొనవచ్చు . అనేకమంది భక్తులు పీఠం లో నవరాత్రులలో సాధన జరుపుకుని తమ సమస్యలనుండి విముక్తులయ్యారు. జాతకకారణాలరీత్యా వివాహం ఆలస్యమయినవారు .ఉద్యోగ వృత్తులలో ను కుటుంబజీవనం లోనూ సమస్యలను అమ్మ అనుగ్రహాన్ని పొందటం ద్వారా పరిష్కరించుకున్నవాళ్ళు ఉన్నారు. స్త్రీలకు కూడా సాధనకు ఇబ్బమ్దులేమీ లేవు . మాకుటుంబసభ్యులతో కలసిఉండటం వలన వాల్లకు సాధనకు గాని ఇక్కడ ఉండటానికి గాని ఇబ్బందులు ఉండవు .
కాకుంటే సాధనకు వచ్చేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి . సాధకులు ఇక్కడ పీఠం లో వివిధ సేవాకార్యక్రమాలలో తమ సేవలనందించాలి. ఉదాహరణకు ఇక్కడకొచ్చి వెళ్ళే భక్తులకు భోజనం వడ్డించడం విస్తర్లు తీసివేయడం శుభ్రపరచడం లో భేషజాలకు పోకుండా పాల్గోవాలి . ఇలాచేయటం మనకు సాధనరీత్యాకూడా మేలు కలిగిస్తుంది .అలాగే తమ స్వంతపనులు తామే చేసుకోవాలి. భోజనం చేసిన పాత్రలు అవీ స్వంతగా శుభ్రపరచాలి . సాధ్యమైనంతవరకు మనం ఒకరికి సేవచేయాలే గాని ఇతరుల సేవలు పొందటానికి ప్రయత్నించరాదు .

అలాగే మాతో పాటే సామాన్య భోజనం మాత్రమే భుజించవలసి ఉంటుంది . తప్పనిసరిగా నేలమీదే నిద్రించవలసి ఉంటుంది . అందుకొరకు రెండు దుప్పట్లు తెచ్చుకొనవలసి ఉంటుంది . ఆరోగ్యసమస్యలు చలిగాలి పడనివారు , తప్పనిసరిగా ఔషధములు సేవించవలసినవారు రాకుంటేనే మేలు . ఎందుకంటే వైద్యసేవలకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వాహన సౌకర్యం లేదు .అలాగే మననుంచి మిగతావారి సాధనకు భగం కలిగించరాదు . భగవత్ సేవ ధ్యానం .మిగతా సమయం పారాయణాదులో లేక మౌనంగా ఉండటమే చేయాలి . అనవసరంగా ముచ్చట్లవలన మీకు ,ఇతరులకు సాధనకు భంగం కలుగుతుంది అని గమనించాలి. మీ వెంట మీ రేషన్ కార్డు గాని ఓటర్ గుర్తింపు కార్డుగాని ఫోటో స్టాట్ కాపీ తీసుకురావాలి .

సాధన తొమ్మిదిరోజులుగాని ఐదురోజులుగా గానీ .ముఖ్యమైన చివరి మూడురోజులుగాని సాధనకు రాదలచినవారు ముందుగా తెలియజేయవలసి ఉంటుంది . ఇందుకొరకు మీరేమీ చెల్లించవలసిన అవసరం లేదు . ఆడపిల్లలు వారి కుటుంబసభ్యులింకెవరినైనా వెంటతెచ్చుకున్నా అభ్యంతరం లేదు . చిన్నపిల్లలతో ఒక్కరోజు వచ్చి పూజలో పాల్గొని వెళ్లటానికి తో ఇబ్బందిలేదుకానీ సాధనలో పాల్గొనటానికి మీకు ఇబ్బంది . . ఈ సాధనా శిబిరం లో పాల్గొనటానికి మీరెవరికీ ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు . కాకుంటే మీరు పాల్గొనదలచుకున్న పూజలకు కావలసిన పూజా ద్రవ్యములు మీరే తెప్పించుకొనవలసి ఉంటుంది.

ఇక ఇక్కడ అమ్మకు జరిగే అభిషేకములు , పుష్పాలంకారములు , యజ్ఞములు ,అన్నదానములలో తమతరపున సేవలు జరిపించకొనదలసినవారు వారి గోత్రనామాలు పంపినచో వారి కోరికమేరకు వారి పేరుపై ఆయా సేవాకార్యక్రమములు జరుపబడుతాయి.

మనసు నిర్మలంగా ఉంచుకుని ఎదుటివారంతా అమ్మ ప్రతిబింబాలని భావిస్తూ సేవచేస్తే ఆనందసాగరమైన అమ్మ మనసు బిడ్దలమైన మనపై ప్రేమవర్షాన్ని కురిపిస్తుంది . మనసమస్యలన్నీ పెనుగాలికి మేఘాలు చెల్లాచెదరైనట్లు తొలగిపోతాయి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని నమ్మండి .
సంప్రదించవలసిన నంబర్ ; 9948235641

సాధనా శిబిరంలో ఉదయం నాలుగున్నరకు నిద్రలేవాలి . స్నానాదులు పూర్తిచేసుకుని అమ్మవారి అభిషేకసేవలోను ,పూజలలోను .కుంకుమాది అర్చనలలోనూ ,పారాయణాదులలో పాల్గొనవచ్చు . లేదా ధ్యానయోగులైతే ఆవరణలోని వృక్షముల నీడలోనో ధ్యానం చేసుకొనవచ్చు . అమ్మవారి కి ప్రథమ పూజజరిపి నివేదన జరిపినదాకా సాధకులెవరూ పచ్చిమంచినీళ్ళుకూడా ముట్టరాదు .ఆతరువాత మీ ఆరోగ్యస్థితి ననుసరించి అల్పాహారమో, టీ నో తీసుకుని మిగతా పూజలలో పాల్గొనవచ్చు . మేము మాత్రం [నేను నాతో పాటు ఉండే కుర్రాళ్ళు ]పూజపూర్తయ్యినదాకా ఏమీ తీసుకోము అది మా అలవాటు.

Read more...

అమెరికాలో ఉండే మనవాళ్ళు సంకల్పం ఎలా చెప్పుకోవాలి ? [ఓ చర్చ ]

>> Saturday, September 18, 2010

చర్చ: అమెరికాలో నివాసముంటున్నా మన సాంప్రదాయాలు,ఆచారాలు పాటిస్తున్న మన
కుర్రాల్లు కొందరికి ఒక సందేహం వచ్చింది . అక్కడ
నిత్యపూజాదికములలో ,సంధ్యావందనాదులలో సంకల్పం ఎలా చెప్పుకోవాలి ?
ముఖ్యంగా నదీమతల్లులను ఉదహరించేప్పుడు . ఈ సంకల్పాన్ని తెలియజేయాలని
వారు కోరుతున్నారు. పెద్దలంతా మీ అభిప్రాయాలను తెలపాలని మనవి .

------------------------------------------------------------------------

ఇక్కడ సంకల్పంలో--

"అస్మిన్ వర్తమాన
చాంద్రమానేన....నామసంవత్సరే...అయనే....ఋతౌ....మాసే...పక్షే....ఏవం
విధగుణవిశిష్టాయాం...తిథౌ....వాసరే శుభయోగే శుభనక్షత్త్రే శుభకరణే
భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణదిగ్భాగే కృష్ణాగోదావర్యోర్ మధ్యదేశే... "
గట్రా గట్రా చెప్తాం.

సప్తద్వీపాలని మహాభాగవతంలో వర్ణించబడిన జంబూద్వీపాదులలో అమెరికా
సంయుక్తరాష్ట్రావళి ఏ ద్వీపం కిందకొస్తుందనేది ఆలోచించాల్సి ఉంది.
ఒక్కొక్క ద్వీపమూ మళ్లీ వర్షాలుగా విభజించబడింది. ఒక్కొక్క వర్షమూ మళ్లీ
ఖండాలుగా విభజించబడింది. కనుక భరతవర్షమూ, భరతఖండమూ ఒకటి కాదు. ఈ విషయం
మనకు బ్రహ్మాండపురాణం ద్వారా తెలియవస్తున్నది.

మేరుపర్వతానికీ, కృష్ణాగోదావరులకూ బదులు ఇహ అక్కడ స్థానికంగా ఏ పర్వతాలూ,
నదులూ ఉంటే వాటి పేర్లు చెప్పుకోవడం సముచితం. వాటి ఆంగ్లనామధేయాలు మనకు
సమ్మతం కాకపోతే వాటికి సంస్కృతంలో సృజనాత్మక ప్రతిభతో సరికొత్తగా నామకరణం
చేసి వ్యవహరించుకోవడం ఉత్తమం. ఈ మధ్య కొంతమంది పురోహితులు Apple ని
నైవేద్యంగా సమర్పించేటప్పుడు "కాశ్మీరఫలం సమర్పయామి" అని చదువుతున్నారు.

-----------------------------------------------------------------------

నేననుకుంటున్నాను - మన పూర్వీకులు భౌగోళిక విశేషాల్ని సంకల్పంలో
స్మరించడానిక్కారణం - ఆ రోజుల్లో రాజ్యాలకు నిర్దిష్టమైన శాశ్వతమైన
సరిహద్దులుండేవి కావు. తఱచుగా దండయాత్రల మూలాన సరిహద్దులు మారిపోతూండేవి.
అందుచేత మానవకల్పితమైన రాజ్యసీమల మీద ఎక్కువ ఆధారపడదల్చుకోక వారు మనకీ
భౌగోళిక విశేషాల పఠనాన్ని అలవాటు చేశారు. కానీ నా దృష్టిలో మన
నివాసప్రాంతాల యొక్క ఆధునిక నామధేయాల్ని సంకల్పంలో నిరభ్యంతరంగా
వాడుకోవచ్చు. పాతకాలపు డొంకతిరుగుడు మానేసి "ఆంధ్రదేశే/ తమిళదేశే/
అమెరికాదేశే" అని చదువుకుంటే నష్టమేమీ లేదు. అసలు అన్నింటికన్నా మన పేరూ,
గోత్రమూ చాలా ముఖ్యం మిహతావి గౌణం .
---------------------------------------------------

krauncha dveepam- USA


--------------------------------------------------------------
eemadyana americalo TTD mariyua marikonni dhaarmika saMsthala aadhvaryaMlO
konni kaaryakramaalu, yaagaau jarigaayi. daani veediyolu unnavaaru
aasamayaMlO saMkalpaM elaa cheppukunnaarO choosi telapagalaru

--------------------------------------------------------------------------------------
నేను వినినంతలో అమెరికాలకు క్రౌంచద్వీపం అని వాడుతున్నారండీ

-----------------------------------------------------------------------------------

చాలా మంచి ప్రశ్న. నాకూ చాలాకాలంగా ఇదే సందేహం. సంస్కృత పండితులు ఎవరైనా ఈ
సమస్యను తీరిస్తే చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. అసలు మన ఖండాలను పూర్వం ఎలా
పిలిచేవారు? నేడు అమెరికా,ఆఫ్రికా వంటి వాటిని మనం సంస్కృత నామాలతో పిలవాలంటే
ఎలా పిలుచుకోవచ్చు?
ఇక మామూలు సంకల్పానికే తెలియటంలేదు, మహా సంకల్పము మాటేమిటి?

--------------------------------------------------------------------------------------
ఇప్పటి యూఎస్ ఏ - జంబూద్వీపంలోని రమ్యక, అరణ్యక, కురువర్షాలలో, సిద్ధపురి
అనే పట్టణానికి దక్షిణాన వ్యాపించి ఉన్నదని కోట వెంకటాచలం గారు
పేర్కొన్నారు.
కెనడా దక్షిణభాగము, అమెరికా ఉత్తరభాగము - రమ్యక , అరణ్యక వర్షాలు, నీల
పర్వతం, శ్వేతపర్వతాలకు సమీపంగా.అమెరికా దక్షిణ భాగము - కురువర్షము, శృంగవాన్ పర్వత సమీపంగా.

-----------------------------------------------------------------------------------

అమెరికా మనకి పాతాళ లోకం కింద లెక్క ...మన సాహిత్యం లొ ని పాతాళ లోక
ప్రస్తావనలన్ని అమెరికా కి వర్తిస్తాయి


-----------------------------------------------------------------------------------
ఈ విషయంపై నేను అమెరికాలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లోని పూజారిని
అడిగితే వారు ఈ విధంగా చెప్పుకోమన్నారు..
క్రౌంచద్వీపే .. ఐంద్రేయ వర్షే.. మరింకేదో ఉంది .. పూర్తిగా తెలుసుకుని
వ్రాస్తాను. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, ద్వీపాల గురంచి జరుగుతున్న
విషయంలో నేను కూడా క్రౌంచ ద్వీపానికే ఓటు వేస్తాను అని చెప్పడానికి

------------------------------------------------------------------------------------
క్రౌంచద్వీపం అమెరికాయే అనడానికి ప్రమాణం ?

అసలు ఈ ద్వీపాలూ, పర్వతాలూ, నదుల డొంకతిరుగుడంతా అవసరం లేదనుకుంటా. ఆయా
దేశాల, ప్రదేశాల యొక్క వర్తమాన వ్యవహారనామాలతో సంకల్పం చెప్పుకోవచ్చును.
తప్పేంటి ?

"......పృథివ్యాః పశ్చిమార్థగోళే ఉత్తర అమెరికాఖండే సంయుక్తరాజ్యేషు
మేరీలాండ్ రాజ్యే...." ఇత్యాదిగా చెప్పుకోవచ్చును.


-------------------------------------------------------------------------

"అస్మిన్ వర్తమాన వ్యావహారిక ..." అనుకుంటున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా
అమెరికాఖండే ఇత్యాదిగా చెప్పుకోవటం అన్న ఆలోచన కూడా బాగుందండీ.

-------------------------------------------------------------------------

typing my explonation will take mch time,so iam planing a audio file to
xplain this soon sir..iam in a hurry of changing my residence tomorrow.so
iam a bit busy till 5th of september.pl.bear wth me sir......


------------------------------------------------------------------------------

ఇవి మా మితృల మధ్య జరిగిన చర్చలో కొన్ని అభిప్రాయములు ..మీ ఆలోచనకూడా చెప్పండి [అనవసర వివాదాలకోసం కాకుండా ]



Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP