శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నిస్వార్ధ సేవకు మారుపేరు ఆర్ ఎస్ ఎస్ – జాఫర్ ఇర్షాద్

>> Wednesday, June 13, 2018

నిస్వార్ధ సేవకు మారుపేరు ఆర్ ఎస్ ఎస్
– జాఫర్ ఇర్షాద్
*******************************
నేను జర్నలిస్ట్ గా అనేక ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలకు వెళ్ళాను, రిపోర్ట్ తయారు చేశాను. కానీ నాకు ఆర్ ఎస్ ఎస్ అంటే ఏమిటో ఏమాత్రం తెలియదు. ఇటీవల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి హాజరుకావడంపై వచ్చిన విమర్శలు, వాదోపవాదాలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ విమర్శలు చేసినవారెవరు ఆర్ ఎస్ ఎస్ చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎప్పుడు చూసినవారుకాదు, తెలుసుకున్నవారుకాదు. కానీ ఒక జర్నలిస్ట్ గా నేను వారి సేవాకార్యక్రమాలను దగ్గరగా చూశాను. అందుకే ఇప్పుడు వాటి గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఆర్ ఎస్ ఎస్ ముస్లిములకు వ్యతిరేకమా, హిందువులకు అనుకూలమా అంటే నేను చెప్పలేనుకానీ అది మానవత్వానికి విరుద్ధంకాదని మాత్రం చెప్పగలను. నా 24 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక సందర్భాల్లో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎలాంటి పేరు, గుర్తింపు కోరుకోకుండా ప్రజలకు సహాయపడ్డం చూశాను కానీ ఏ మత ఘర్షణలో, దొమ్మిలో పాల్గొన్నట్లు చూడలేదు. అలాగే ఇతర జర్నలిస్ట్ లు లేదా నాయకులు కూడా మత ఘర్షణల్లో వారి పాత్ర ఉందని చెప్పగలరని నేను అనుకోవడం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నాకు ఆర్ ఎస్ ఎస్ తో గాని, బిజెపితోగాని ఎలాంటి సంబంధం లేదు.

అది 2011 జులై 10. నేను కాన్పూర్ లో ఒక న్యూస్ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్నాను. ఆదివారం కావడంతో కాస్త విశ్రాంతిగా ఉన్నాను. హఠాత్తుగా మా ఎడిటర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫతేపూర్ దగ్గర మాల్వాలో రైలు ప్రమాదం జరిగిందని, వెంటనే వివరాలు సేకరించమని చెప్పారు. నేను వెంటనే రైల్వే అధికారులకు ఫోన్ చేసి విషయం అడిగాను. వాళ్ళు రైలుప్రమాదం జరిగిందని, అదికూడా పెద్ద ప్రమాదమేనని చెప్పారు. నేను వెంటనే ప్రమాద స్థలానికి బయలుదేరాను. గంట ప్రయాణం తరువాత ఘటన స్థలానికి చేరాను. మాల్వాకు 10-12 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చుట్టుపక్కల ఎక్కడా జనవాసాలు లేవు. అక్కడికి చేరాలంటే దాదాపు 4కి.మీ లు పొలాల్లో నడిచి వెళ్ళాలి.

అక్కడికి చేరుకోగానే నేను పని ప్రారంభించాను. ప్రమాదం గురించి డిల్లీలోని మా ఎడిటర్ కు, న్యూస్ డెస్క్ కు సమాచారం అందించడం మొదలుపెట్టాను. పూర్తిగా దెబ్బతిన్న బోగీల నుంచి శవాలను బయటకు తీస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. దగ్గరవారిని కోల్పోయిన వారి ఏడ్పులు, గాయాల మూలంగా బాధితులు పెడుతున్న  పెడబొబ్బలు ఆ ప్రదేశాన్ని భయానకంగా మార్చాయి. శవాలను దగ్గర ఉన్న పొలాల్లోకి చేర్చారు. బాగా ఛిద్రమైన వాటితోపాటు ఇతర శవాలపై కొందరు తెల్లబట్ట కప్పుతూ కనిపించారు. వాళ్ళంతా ఖాకీ నిక్కర్లు వేసుకుని ఉన్నారు.

తమవారిని కోల్పోయి బాధలో ఉన్నవారు కూర్చున్న చోటికి వెళ్ళాను. వారిని ఆకలి, దప్పిక కూడా బాధిస్తోంది. అప్పుడే కొద్దిమంది అక్కడికి వచ్చి బాధితులకు టి, బిస్కట్ లు ఇవ్వడం చూశాను. నాతోపాటు మరో 24మంది జర్నలిస్ట్ లు అక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి నాకు కప్పు టీ, రెండు బిస్కట్ లు తెచ్చి ఇచ్చాడు. ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో నాలుగు గంటలుగా పనిచేస్తున్న మాకు ఆ టీ అమృతప్రాయంగా అనిపించింది. అప్పుడే నాకు ఒక సందేహం వచ్చింది. ఇంత నిర్మానుష్య ప్రదేశంలో టీ, బిస్కట్ లు ఉచితంగా ఇస్తున్న వీళ్ళు ఎవరు? వీళ్ళు ప్రభుత్వోద్యోగులా? వెంటనే వాళ్ళలో ఒకరిని అడిగాను -`భాయిసాబ్ మీరు ఎందుకు ఇవి పంచుతున్నారు? ఎవరి తరఫున పనిచేస్తున్నారు?’ అందుకు ఆ వ్యక్తి `మీకు మరికొంత టీ కావాలంటే ఆ చెట్టు దగ్గరకి రండి’ అన్నాడు. నా సందేహం తీర్చుకునేందుకు నేను అతను చెప్పినట్లే చెట్టు దగ్గరకి వెళ్ళాను. అక్కడకి వెళితే నాకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. కొద్దిమంది మహిళలు అక్కడ కూర్చుని కూరగాయలు తరుగుతున్నారు. రొట్టెలకు పిండి తయారుచేస్తున్నారు. ఆ పక్కనే కట్టెల పొయ్యి మండుతోంది. దానిపై టీ మరుగుతోంది. అక్కడే కొన్ని వందల బిస్కట్ ప్యాకెట్ లు ఉన్నాయి.  మరోపక్క కొందరు బాధితులకు అందించడం కోసం మంచినీటిని కవర్ లలో నింపుతున్నారు.

కుర్తా, పైజమా వేసుకున్న ఒక వ్యక్తి పని త్వరగా చేయాలంటూ అందరికీ సూచనలు ఇస్తూ కనిపించాడు. నేను అతని దగ్గరకు వెళ్ళి `మీ పేరేమిటి’ అని అడిగాను. అతను నవ్వాడుగానీ సమాధానం చెప్పలేదు. నన్ను నేను పరిచయం చేసుకుని ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారని అడిగాను. బాధితులకు అందిస్తున్న సేవ గురించి నేను రాస్తానని చెప్పాను. ఎప్పుడైతే నేను జర్నలిస్ట్ నని చెప్పానో వెంటనే అతను అక్కడ నుంచి వెళిపోయి బాధితులకు టీ అందించడంలో నిమగ్నమయ్యాడు. టీ అందిస్తూ అతను ఎవరిని నీ మతం ఏది? నీ కులం ఏది అని అడగలేదు. నేను కూడా చనిపోయినవారు ఎంతమంది, గాయపడినవారు ఎంతమంది అని తెలుసుకుని, సహాయ కార్యక్రమాల గురించి మా ఆఫీస్ కు సమాచారం అందించడంలో పడిపోయాను.

అది అర్ధరాత్రి సమయం. శవాలను బోగీల నుండి తీసే పని కొనసాగుతోంది. అప్పుడే మధ్యాహ్నం నేను కలిసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నాకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. `ఇందులో నాలుగు రొట్టెలు, కొద్దిగా కూర ఉన్నాయి. మీరు మధ్యాహ్నం నుంచి పని చేస్తూ అలిసిపోయి ఉంటారు. ఆకలిగా ఉండిఉంటుంది. తినండి’’అన్నాడు. నాకు నిజంగానే బాగా ఆకలిగా ఉంది. అయినా మీ పేరు, మీరు ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారో చెపితేనే ప్యాకెట్ తీసుకుంటానని షరతు పెట్టాను. అప్పుడు అతను తాము రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలమని చెప్పాడు. రైలు ప్రమాద బాధితులకు సహాయం అందించడానికి వచ్చామని చెప్పాడు. వెంటనే నా జర్నలిస్ట్ బుర్రకు ఇది చాలా మంచి స్టోరీ అవుతుందనిపించింది. అతని పేరు చెప్పమని పదేపదే అడిగాను. అయినా అతను తన పేరు మాత్రం చెప్పలేదు. పైగా ఇది ఎక్కడ ప్రచురించనని నేను అంతకుముందే చేసిన వాగ్దానాన్ని గుర్తుచేశాడు. అప్పుడు రోజంతా అక్కడే ఉండి, అందరికీ టీ, టిఫిన్ తయారుచేసిన మహిళల గురించి అడిగాను. వాళ్ళంతా తమ కార్యకర్తల కుటుంబాల నుంచి వచ్చినవారు అని చెప్పాడు. శవాలపై కప్పిన తెల్ల బట్ట గురించి అడిగితే అది బట్టల దుకాణం ఉన్న స్వయంసేవకులు స్వచ్ఛందంగా ఇచ్చిన బట్ట అని చెప్పాడు. రొట్టెల పిండి, నూనె కిరాణా దుకాణం ఉన్న వాళ్ళు ఉచితంగా ఇచ్చారని చెప్పాడు. ఆర్ ఎస్ ఎస్ హిందూ సంస్థ కదా, మీరు ఇతరులకు కూడా సహాయం అందిస్తున్నారేమిటని అడిగాను. అందుకు అతను `భాయిసాబ్, ఇక్కడ బాధితులందరికి మేము సహాయం అందిస్తున్నాము. సహాయం అందించడంలో కులం, మతం చూడకూడదని మా సంస్థ భావిస్తుంది’ అని సమాధానమిచ్చాడు. శవాలపై బట్ట కప్పుతున్నప్పుడు కూడా చనిపోయినవారి మతం ఏమిటో, కులం ఏమిటో తమకు తెలియదని, అది పట్టించుకోమని చెప్పాడతను. ఈ మాటలు చెప్పి ఆ నిజాయతీపరుడైన `భగవంతుని సేవకుడు’ తన పేరు చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. నేను ప్రమాద స్థలంలో 36 గంటలపాటు ఉన్నాను. అంతసేపూ వాళ్ళు బాధితులకు, జర్నలిస్ట్ లకు, డ్యూటీలో ఉన్న ప్రభుత్వాధికారులకు కావలసినవి అందిస్తూ కనిపించారు. ఆ మర్నాడు ప్రమాద వార్తను పత్రికలన్నింటిలో చూసిన నాకు బాధితులకు నిస్వార్ధంగా సేవ చేసిన ఆ కార్యకర్తల పేర్లు గానీ, ప్రస్తావన గానీ ఎక్కడ కనిపించలేదు.

(అర్గానైజర్ సౌజన్యం తో)

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP