శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎంతో గొప్ప కార్యక్రమం చేపట్టే పెద్దలకు కూడా ...ఇంత చిన్నతనం పనులు అవసరమా?

>> Friday, March 6, 2015

కొందరు ఎంతో గొప్ప సంకల్పంతో మహత్తర కార్యక్రమములు చేపడతారు. నిర్వహణ
దగ్గరకొచ్చేసరికి తెలిసి  చేస్తారోలేక తెలియకచేస్తారో గాని వారి సంకల్పాన్ని వారే చిన్నబుచ్చుకునే చే్ష్టలు  చేస్తుంటారు. అత్యంత అభిమానంతో అక్కడకు వెళ్ళిన మాలాంటివారికి బాధకలుగుతుంది.  కొన్నిసార్లు నేను చేసేవిమర్శలు  బాధకలిగిస్తాయని తెలిసినా ధర్మం పట్ల జరిగే అపచారం  కడుపులోదాచుకోలేక వెళ్లగక్కుతుంటాను.   జనం చేత లోలోపలైనా తిట్టించుకుంటూ ఉంటాను.

ఈమధ్య ఒకపట్టణం  లో జరిగిన ఓ మహత్తర ఆథ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లాను. నాతోపాటు మా బృందం అంతా వచ్చారు.  ఎంతో గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటిదాకా ఎవరూ నిర్వహించనంత గొప్పగా జరిగిందనిపించినది. నిర్వాహకులకు అవసరమైన నిధులుకూడా స్వామి అనుగ్రహం వలన  సమకూరాయన్నారు.  హనుమత్ప్రభో!అని పిలిస్తే చాలు  ఆయన కార్యక్రమానికి కావలసినవన్నీ అసాధ్యమనుకున్నవన్నీ  సాధ్యమయి అక్కడ చేరి తీరుతాయి. ఇక భక్తకోటిలో  అంతర్లీనంగా జీర్ణించుకుని ఉన్న హనుమద్భక్తి  కార్యక్రమం గూర్చి తెలిస్తే చాలు  లక్షలాదిగా తరలివెళ్ళేలా  చేస్తుంది. ఇదంతా సత్సంకల్పబలం. భగవత్ కృప.

ఇక అద్భుతంగా జరుగుతున్నది కార్యక్రమం. మధ్యలో ఈకార్యక్రమానికిస్వల్పవిరామమిచ్చి ,ఈకార్యక్రమాన్ని ఎవరో !  గుర్తించి ఇచ్చే సర్టిఫికెట్లు అందుకోవటం..ఆపై ప్రశంసలు...పొగడ్తలు   ... ఇవి కాస్త బాధనిపించాయి నాకు. ఎందుకంటే  పారాయణాదులు,పూజసాగేప్పుడు మనసు చిన్నగా లయమవుతూ పయనిస్తుంటుంది భక్తులకు.ఈసమయంలో దాన్ని డిస్టర్బ్  చేస్తే మరలా దారికెక్కదు. అందుకనే పూజమధ్యలో మాట్లాడకూడదు అని నియమం. పోనీ సామూహిక కార్యక్రమాలలో మాట్లాడటం తప్పనిసరైనా అది  మనసుకు మరింతగా ఏకాగ్రతనుపెంచే భగవ్ద్విషయమై ఉండాలి. అలాకాక భౌతికవిషయాలవైపు మల్లటం అంటే ఆకార్యక్రమం పట్ల అవమానకరంగా ప్రవర్తించటమే. అదీ మాహత్ముల ప్రత్యక్షపర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమంలో జరగటం నాకు బాధకలిగించినది.

ఇక కార్యక్రమం జరుగుతుండగానే    కొందరు కార్యకర్తలు హుండీలు చేతబట్టి  ఆవరణ అంతా కలియదిరుగుతున్నారు. అంతటితో ఆగారా !? ప్రతివ్యక్తిదగ్గరకొచ్చి అడుక్కున్నేవాళ్లలాగా డబ్బాలు ఊపటం. అసహ్యమేసింది. ఇంతకార్యక్రమంలో తమ వంతుసమర్పణ చేయాలనుకునే వాళ్లకు కనపడేలా హుండీలు పెట్టవచ్చు. తప్పులేదు. సమర్పణచేయాలనుకునేవారు చేస్తారు. లేదంటే లేదు. ఈ కార్యక్రమాల కోసం ఈ  సమీకరణ ముందే జరుగుతుంది కదా!

ఇక అన్నీపూర్తయ్యాక  ఇంతటి మహత్తరకార్యక్రమాన్ని చేపట్టాడని ఎంతగానో మేము అభిమానించిన ఆపెద్దాయన స్వయంగా మైకు చేతబట్టి  స్వామి వారికి సమర్పించబడిన పేద్ద..లడ్డు.. అదీ సద్గురువుల చేత  స్వామికి సమర్పించబడినది... ఇది  వేలంపాట లో దక్కించుకోండి........ ఎవరు దీన్ని దక్కించుకుంటారో ... వాళ్ల ఇంట లక్ష్మీదేవి  స్థిరమై పోతుంది... ఇలా.... పరమదౌర్భాగ్యంగా    పాట మొదలెట్టాడు.
 ఇక డబ్బుజబ్బు ఉన్న వారంతా పోటిపడటం మామూలే.. మధ్యలో ఈయన   ... అదిగో ఈ లడ్డు పలానా ఊరు  ...వెంకయ్య గారు పాడారు...మరో ఊరు సుబ్బయ్యగారు పాడారు.... మనవూరుదాటెళ్లిపోతుంది.. పాడండి.... పాడండి... అంటూ  రేటూ పెంచుతూ పరమచండాలంగా   వేలంపాట.సాగిస్తున్నాడు.
ఈమధ్య ఎక్కడ చూసినా వినాయక చవితి పందిళ్లలో  ఈ దిక్కుమాలిన అచారం  మొదలైంది . దానికి తోడు న్యూస్పేపర్లలో  ఆవూర్లో.. లడ్డు అంతపలికింది.... ఈ వూర్లో ఇంతపలికింది  అనే వార్తలు..
ఎప్పుడో తయారుచేసిన పాచి లడ్డులను నివేదించటమే తప్పు. దానికి తోడు  వేలంపాట. పరమ అనాచారపు పనులు ఆచారాలై కూర్చుంటున్నాయి  కలిప్రభావం వలన.
ఇక మళ్ళీమొదటికొద్దాం
ఇప్పటిదాకా    ఎంతో ఉన్నతంగా కనపడిన ఆయన పట్ల మనసులో చులకనభావన ప్రవేశించింది నాకు.
మీకు నిజంగా సత్సంకల్పం ఉంటే  మీకు కావలసినవన్నీ  భగవత్ శక్తి అనుగ్రహం చేత సమకూరుతాయి.  ఎంత అట్టహాసంగా చేశామని కాదు. ఎంత భక్తిగా చేశామనేదే  ప్రధానం కావాలి భక్తులకు. అదిమాత్రమే పరమాత్మకు ప్రీతికలిగి సద్యోఫలితములనిస్తుంది ,



ఇది స్వయంగా చెప్పలేక చదువుతారు అని ఇక్కడ వ్రాస్తున్నాను . హనుమత్ప్రభువు నావాచాలత్వాన్ని మన్నించుగాక.
జైశ్రీరాం




0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP