శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూర్వజన్మలో చేసిన పాపం పరిహారం

>> Friday, January 20, 2017

పూర్వజన్మలో చేసిన పాపం పరిహారం.....................!!

కొంతమంది పాపపు పనులు చేసి దాన్ని సమర్థించుకోవడానికి అదేదో లోకోపకారం కోసమో, మరో మంచి పనికోసమో చేస్తున్నామని, దానివల్ల తమకు పాపం అంటదని అంటుంటారు. కానీ అలా అనడం చేసిన తప్పును అప్పటికి కప్పిపుచ్చుతుందే తప్ప, దాని ఫలితాన్ని మాత్రం ఎవరైనా, ఎప్పటికైనా అనుభవించి తీరాల్సిందేనన్న సామాజిక సత్యాన్ని నిరూపించే కథ మత్స్య పురాణం ఇరవై అయిదో అధ్యాయంలో ఉంది.
పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. కురుక్షేత్రంలో ఆయనను మించిన ధర్మాత్ముడు లేడని ఆ రోజుల్లో అంతా అంటూ ఉండేవారు. అలాంటి మహర్షికి స్వనృపుడు, క్రోధనుడు, హింస్రుడు, పిసునుడు, కవి, వాగ్దుష్టుడు, పితృవర్తి అనే ఏడుగురు కుమారులుండేవారు. వారంతా సార్ధక నామధేయులు. మొదటివాడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండేవాడు. రెండోవాడు క్రోధ స్వభావంతో ఉండేవాడు. మూడోవాడు అకారణంగా ఎదుటివారికి బాధ కలిగిస్తుండేవాడు. నాలుగోవాడు చాడీలు చెపుతుండేవాడు. అయిదోవాడు ఉన్నవీ లేనివీ కల్పించి కవిత్వం అల్లుతుండేవాడు. ఆరోవాడికి నోరుతెరిస్తే చెడుమాటలే వచ్చేవి. ఏడోవాడు మాత్రం తండ్రి మీద భక్తితో నడుచుకుంటూ ఉండేవాడు. ఈ ఏడుగురిని గర్గమహాముని వద్ద విద్యాభ్యాసం చేయమని కౌశికుడు పంపాడు. అయితే ఆ ఏడుగురికి గురువు ఎంతగా విద్య నూరిపోస్తున్నా వారు తమ సహజమైన బుద్ధులను మాత్రం మానుకోలేదు. కానీ బుద్ధులెలా ఉన్నా వారు మంచి తపోధనులుగానే పేరుతెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఓ రోజున ఆ ఏడుగురూ గర్గమహాముని పాడి ఆవును, దూడను గురువు ఆజ్ఞను అనుసరించి అడవిలో మేపసాగారు. అలాంటి సమయంలో హింస్రుడు, క్రోధనుడు లాంటివారికి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆవును చంపి తింటే బాగుండునన్న దురాలోచన తట్టింది. దానికి ఏడుగురూ సిద్ధపడ్డారు. అయితే చివరివాడైన పితృవర్తి మాత్రం కొంత ధర్మబుద్ధితో ఆలోచించాడు. గోహత్యాపాపం అంటకుండా తమ కోర్కె తీరాలంటే ఆ గోవు మాంసాన్ని పితృదేవతలకు శ్రద్ధతో శ్రాద్ధంగా పెడితే సరిపోతుందన్నాడు. ఆ సూచన మిగిలిన అందరికీ నచ్చింది. అలా చేసిన తర్వాత సాయంత్రానికి ఒక్క దూడను మాత్రమే వెంటబెట్టుకుని ఏడుగురూ గురువు వద్దకు చేరారు. అడవిలో ఆవును, దూడను మేపుతుండగా ఓ పెద్దపులి వచ్చి ఆవును చంపి తిని వెళ్ళిందని అబద్ధం చెప్పారు. గురువు కూడా అదే నిజమని నమ్మాడు. కొంతకాలం అలా వారు విద్య నేర్చుకుంటూనే తమ బుద్ధులకు తగినట్లుగా దుర్మార్గపు పనులు చేశారు. వాటివల్ల వచ్చే పాపాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల పూజలలాంటివి చేసుకుంటూ పోసాగారు. అలా జీవితం గడిచి ఆ ఏడుగురూ మరణించారు. వారుచేసిన మహాపాపకార్యాల ఫలితం వారిని అంటిపెట్టుకునే వచ్చింది. గోహత్య చేసి పితృశ్రాద్ధం లాంటివి పెట్టి పాపం పోయిందిలే అనుకున్నా.. తపస్సు చేసి పాపం అంటదులే అని ధైర్యంగా ఉన్నా.. మరుసటి జన్మలో వారి పాపానికి తగినట్లుగా జంతువులను హింసించి తినే బోయవాడి కుమారులుగా జన్మించారు. మహాధార్మికులైన మహర్షి కుమారులు, గొప్ప పేరున్న గర్గముని శిష్యులు అంతో ఇంతో తపశ్శక్తి సంపన్నులు అయినప్పటికీ వారికి అలాంటి జన్మ లభించింది. వారుచేసిన కొద్దిపాటి పుణ్యంవల్ల పూర్వజన్మ స్మృతి మాత్రం నిలిచి ఉంది. ఒకప్పటి తమ ఉత్తమ జన్మను వృధా చేసుకుని ప్రస్తుతం అచ్చంగా హీనమైన జీవితాన్ని గడపాల్సి వచ్చినందుకు అనుభవించిన మనోవేదన అంతా ఇంతా కాదు. అప్పటికే వారిలో వైరాగ్యం చోటుచేసుకుంది. ఇకమీదటనైనా మంచి జన్మ ప్రాప్తించాలని నిరాహారవ్రతం చేసి పరమేశ్వరుడి సన్నిధిలో జ్ఞాన వైరాగ్యాలతో ధర్మమార్గంలో జీవించి కాలాంతరంలో మరణించారు.
ఆ తర్వాత పూర్వజన్మ స్మృతితోనే లేళ్ళుగా జన్మించారు. ఆ జన్మలోనూ నిరాహారవ్రతం చేసి దేహత్యాగం చేశాక అప్పుడు మానస సరోవరంలో చక్రవాక పక్షులుగా జన్మించి యోగమార్గాన్ని అనుసరించారు. అప్పటికి కానీ మళ్ళీ వారికి మానవ జన్మ లభించలేదు. ఒకరు రాజ కుమారునిగా జన్మించాడు.మిగిలిన వారు వేరు వేరుగా జన్మించి పూర్వజన్మ స్మృతి వల్ల అందరూ కలుసుకుని హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోయారు.(మత్స్య పురాణం) ఈ ఎంత మహోన్నతమైనదో తెలుసుకుని జాగ్రత్తగా అప్పుడు మసలసాగారు. కౌశిక మహర్షి కుమారుల ఈ కథ మానవ జన్మ ఔన్నత్యం తెలపడంతోపాటు, తప్పుచేసి దేవుడికి పరిహారం చెల్లించవచ్చనో, మరో మంచిపని చేసి పాపం పోగొట్టుకోవచ్చనో భ్రమించి పాప కార్యాలవైపు పరుగులు తీసేవారికి ఓ కనువిప్పులా కనిపిస్తుంది.
"ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు మాత్రం చేయవద్దు" అని పెద్దల వచనం. ఇలా అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపీడిస్తుందన్నారు.
అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాలని చెప్పారు. అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని ప్రశ్నిస్తుంటారు.
దీనికి పెద్దలు ఇలా చెప్పారు... పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ రోగమొస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దానిపని అది చేస్తూ వుంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.
అలాగే పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వ జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP