శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జ్ఞాన శక్త్యాత్మ స్వరూపం సుబ్రహ్మణ్యస్వామి

>> Saturday, February 6, 2016

జ్ఞాన శక్త్యాత్మ స్వరూపం సుబ్రహ్మణ్యస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్త్ధిరం భజే! శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం!!‘‘ అని శివపురాణ వచనం.
వైదిక మతంలో శివ శక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యోపాసన గురించి చెప్పబడింది. షణ్మతాలలో- సౌర, శాక్త, గాణాపత్య, వైష్ణవ, శివమతాలతోపాటు కుమారోపాసన గురించి చెప్పినప్పటికీ, పంచదేవతారాధనలో స్థానం కల్పించలేదు. సుబ్రహ్మణ్యునికి ‘‘అగ్నిగర్భుడ’’ని నామం ఉంది. అయితే, సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే ప్రారంభం అవుతుందని తత్త్వజ్ఞుల అభిప్రాయం. ఏ పూజ మొదలెట్టినా దీపారాధనతోనే ప్రారంభం కావడం తెలియంది కాదు. ‘దీపారాధన’ అంటే అగ్నిగర్భుని ఉపాసించడమే! అలా సుబ్రహ్మణ్యారాధన ప్రారంభంలో లేని ఏ పూజయైనా నిష్ఫలమే!
పార్వతీ పరమేశ్వరుల తనయులు గణపతి, సుబ్రహ్మణ్యులు కుమారతత్త్వానికి ప్రతీకలు.
పంచభూతాత్మకమైన ఈ విశ్వానికి నాలుగు తత్త్వాలున్నాయని విజ్ఞులు చెబుతారు. అవి- అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం. అవ్యక్తం, వ్యక్తం శివ పార్వతుల పరంగాను, మహత్ తత్త్వానికి గణపతిని, అహంకారం అనుదానికి సుబ్రహ్మణ్యుని లేదా కుమారస్వామిని ప్రతీకలుగా చెబుతారు. ఈ నాలుగూ ఒకే పరతత్త్వానికి భిన్న రూపాలుగా ఉంటున్నాయి.
అహంకారమంటే ‘గర్వం’ అనే అర్థంలోకాక ‘నేను’ అనే స్పృహని కలిగి ఉండడం అని అర్థం చేసుకోవాలి. ఇది చైతన్యం యొక్క స్వరూపం. పరమాత్ముని పరంగానూ ఈ భావం ఉంటుంది. సృష్టిక్రమానికి నాంది ఇదే. ఈ చైతన్య స్వరూపం వ్యష్ఠిగాను, సమిష్ఠిగాను ప్రకటితవౌతుంది. ఈ చైతన్య స్వరూపానికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక. చైతన్యం ప్రతి హృదయ కుహరంలోను ఉంటుంది. కాని బాహ్యంగా కనుపించదు. హృదయ గుహలో ప్రకాశించే ఈ పరమాత్మ చైతన్యాన్ని ‘‘గుహః’’ అని చెప్పారు. చైతన్యం జ్ఞాన లక్షణం గల తత్త్వం. అంటే గురు తత్త్వం. అందుకే సుబ్రహ్మణ్యుని ‘గురుగుహ’ అని కీర్తించారు వాగ్గేయకారులు. ముఖ్యంగా శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని సాక్షాత్కారం పొంది, ఆతని అనుగ్రహంతో సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాద రహస్యాలను తెలుసుకున్నారు. తాను రచించిన సంకీర్తనలన్నీ ‘గురుగుహ’’ నామంతో ముద్రాంకితం చేశారు. కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షితుల కృతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
పరమాత్మ చైతన్య రూపుడైన సుబ్రహ్మణ్యుని అర్చిస్తే వ్యక్తావ్యక్త స్వరూపులైన శివభక్తులను కూడ ఆరాధించినట్లేనని స్కంద పురాణం చెబుతున్నది.
అనన్య శక్తిసంపన్నుడైన సుబ్రహ్మణ్యుడు శివశక్తిని తనదిగా చేసుకున్నాడు. ఆ శక్తే శక్త్యాయుధంగా చేత బుచ్చుకుని ‘శక్తి ధరుడు’గా ఉపాసింపబడుతున్నాడు. లోక రక్షణకు కంకణం కట్టుకున్నాడు.
పురాణాలలో సుబ్రహ్మణ్యునికి ఎన్నో నామాలున్నాయి. కుమారస్వామి, స్కందుడు, కార్తికేయుడు, శరవణభవుడు, దండాయుధపాణి ఇలా ఎన్నో ఉన్నాయి.
వ్యక్తావ్యక్త స్వరూపులైన శివపార్వతుల పరిణయమే ఒక విచిత్రమైన కథ. తారకాసుర సంహారానికై ప్రకృతీ పురుషుల ప్రతీకలైన వీరిరువురి వివాహం అవసరాన్ని గుర్తించిన దేవతల మొరనాలకించిన శ్రీమహావిష్ణువు మన్మథుని కార్యోన్ముఖునిగావించడం, సమాధి స్థితిలోనున్న శివునిలో కాదు ప్రవృత్తికి కలిగించడం, పార్వతి పట్ల ఆకర్షితుడు కావడం, ఆ ప్రణయంలో కుమార సంభవం కావడం అంతా ఒక విచిత్రమైన కథనం. ఈ ప్రణయ వృత్తాంతాన్ని తీసుకుని మహాకవి కాళిదాసు తన ‘కుమార సంభవం’ అను మహాకావ్యాన్ని ఆవిష్కరించాడు. వాల్మీకి రామాయణం బాలకాండలో విశ్వామిత్రుని వెంట వెళ్తున్న రామలక్ష్మణులకు మార్గాయాసం లేకుండా కుమారస్వామి జనన వృత్తాంతాన్ని చెబుతూ ‘‘కుమార సంభవశ్చైవ ధన్యం పుణ్యసె్తై్ధవచ’’ అను పాద ప్రయోగం చేశాడు ఆ పాదంలోని ‘‘కుమార సంభవం’’ అను పదాన్ని కాళిదాసు తీసుకుని ఒక మహాకావ్యానికి పేరుపెట్టాడు.
మహాభారతంలో కూడ సుబ్రహ్మణ్యుని జననం, తారకాసురుని సంహారం గురించి వర్ణనాత్మకంగా అత్యద్భుతంగా వేదవ్యాసులు రచించాడు.
కుమారస్వామి జననమే ప్రత్యేకతను కలిగి ఉంది. తాత్త్విక తత్వాలు నిబిడీకృతమై ఉన్నాయి. ‘‘పరతత్త్వం- అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకునే పరిణామ క్రమం’’ కుమారస్వామి జననం.
శివతేజస్సును పృథ్వి, జలం, అగ్ని భరించలేక ఆ తేజాన్ని రెల్లుగడ్డిపై విడిచిపెడితే షట్‌కృత్తికలు ఆ మహాతేజస్సు బాలునిగా రూపొందగా అందుకుని పెంచి పెద్దచేశారు. ఆ మహాతేజస్సు రెల్లుతుప్పలో బాలునిగా రూపొందడం చేత శరవణభవుడనీ, షట్ కృత్తికలు ఆలనాపాలనలో పెరగడం చేత షణ్ముఖుడని నామాలు ఏర్పడ్డాయి.
కాలాగ్ని రుద్రడైన షణ్ముఖునికి ఆరు ముఖాలు, పనె్నండు చేతులున్నాయి. దీని వెనుక తాత్త్వికత ఇమిడి ఉంది. ఆరు ముఖాలు- ఆరు ఋతువులు; పనె్నండు చేతులు- పనె్నండు మాసాలు. ఇది సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం ‘చిత్రాగ్ని’ అనే నెమలిని ఆసనంగా చేసుకున్నది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి రూపమే నెమలి!
సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు. తండ్రి ద్వారా సమస్త జ్ఞానాన్ని పొంది ‘స్కందుడు’గా కీర్తింపబడినాడు. ఒకానొక సందర్భంలో బ్రహ్మకు, తండ్రియైన శివునికి తత్త్వజ్ఞానాన్ని ప్రబోధించినట్లు, అదే స్కంద పురాణంగా ప్రసిద్ధి పొందినట్లు చెబుతారు. అష్టాదశ పురాణాలలో ఇది ప్రసిద్ధమైనది.
సుబ్రహ్మణ్యుని శక్తులు అనంతం. కుండలినీ శక్తి చలనానికి ప్రతీకగా వల్లి (తీగె), ఇంద్రియ శక్తులను ‘దేవసేన’గా - రెండు చైతన్యశక్తులను ఇంద్రుని తనయలుగా భావించి, సుబ్రహ్మణ్యుని భార్యలుగా స్థానాలను పొందారు. శివపార్వతుల తనయుడైన స్కందుడు ఈ యుగంలో జ్ఞాన సంచింధర్‌గా, వైదిక మతాన్ని సంరక్షించడానికి కుమారిల భట్టుగా అవతరించాడని చెబుతారు. అరుణాచలంలో నివసించిన భగవాన్ శ్రీ రమణమహర్షి స్కందావతారుడని కావ్యకంఠ శ్రీ వాశిష్ఠ గణపతి ముని పేర్కొన్నారు.
సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. ఇష్టకామ్యాలను ఈడేర్చే కరుణామూర్తి. సత్సంతాన ఫలప్రదాత. సుబ్రహ్మణ్యుని ఏ నామంలో ఆరాధించినా అనుగ్రహం పొందడంలో సంశయమక్కరలేదు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP