శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సనాతన ధర్మవారథి భీష్మాచార్యులు

>> Monday, February 15, 2016

సనాతన భారతీయ ధర్మం కాలాన్ని భగవత్స్వరూపంగా భావించింది. అందుకే సహస్ర నామావళిలో ‘‘కాలస్వరూపాయ నమః’’ అని స్తోత్రం చేస్తుంటాము. అలాగే కాలచక్రంలో వచ్చే తిథులకు ధార్మికతతో కూడిన విశిష్టతను స్మరించుకుంటూ ఉంటాము. అలాంటివే మాఘ మాసంలో భీష్మాష్టమి- భీష్మైకాదశి తిథులు. మాఘశుద్ధ అష్టమినాడు భీష్మాచార్యుడు తనువు చాలించి ముక్తినొందిన రోజు. అది భీష్మాష్టమిగా లోకప్రసిద్ధి. అలాగే ఆయన పంచక దినంనాడు ఏకాదశి తిథి వచ్చింది. కాబట్టి దానిని భీష్మైకాదశి అన్నారు.
భీష్మాచార్యునిది విశిష్ట వ్యక్తిత్వం. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. గంగా శంతనుల పుత్రుడు. దేవనదియైన గంగాదేవి పుత్రుడు కావడంవల్ల పావనత్వాన్ని సంతరించుకున్నాడు. అష్టవసువులలో అష్టమ వసువైన ప్రభాసుడే గాంగేయుడుగా జన్మించాడు. కాబట్టి దైవాంశపరుడు. దేవవ్రతుని బాల్యావస్థ దేవలోకంలో తల్లి ఒడిలోనే సాగింది. వశిష్ఠ మహర్షివద్ద నాలుగు వేదాలను, షట్ శాస్తమ్రులను కూలంకషంగా అభ్యాసము చేసి, వేదశాస్త్ర పారంగతుడైనాడు. పరశురాముని వద్ద అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుకొని నిష్ణాతుడైనాడు. బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారుని పోలియున్న ఆత్మ విజ్ఞానమును సంపాదించాడు. అలాగే శాస్త్ర పరిజ్ఞానములోను బుద్ధిలోను బృహస్పతికి సదృశుడై ఉన్నాడు. ఇంతటి ఆధ్యాత్మిక, ధార్మిక లౌకిక జ్ఞాన సంపన్నుడు. భీష్ముడు శ్రీరామచంద్రుని వలె పుత్ర ధర్మాన్ని నిర్వర్తించిన అనుష్ఠాన వేదాంతి. తండ్రి సత్యవతిని వివాహం చేసుకోవాలనుకొన్నప్పుడు ఆమె సంతానానికి రాజ్యాధికారం దక్కాలని ఆమె తండ్రి దాశరాజు నియమం పెట్టాడు. రాజ్యాధికారం, రాజ్యసుఖాలు వదులుకుంటానని దేవవ్రతుడు శపథం చేశాడు. రాజ్యాన్ని పరిత్యజించాడు. నీ సంతానం కోరుతుందేమోనని సందేహం వెలిబుచ్చినప్పుడు జీవన పర్యంతం బ్రహ్మచారినే ఉంటానని భీష్మప్రతిజ్ఞ చేశాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆనాటి నుండి భీష్ముడుగా జగద్విఖ్యాతి చెందాడు. పుత్రుని త్యాగాన్ని చూసి అతడు ఇచ్ఛా మరణము పొందునట్లుగా వరాన్ని ప్రసాదించాడు.
హస్తినాపుర సామ్రాజ్య పరిరక్షణా భారాన్ని భుజస్కంధములపై వేసుకొని కురు పాండవులను సంరక్షించుకుంటూ వచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధ ధర్మానికనుగుణంగా ఒక సర్వసైన్యాధిపతి బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభుభక్తి పరాయణుడై పాండవులతో ఆగర్భ శత్రువుతో పోరాడినట్లే యుద్ధ నైపుణ్యాన్ని చూపించాడు. యుద్ధంలో భీష్ముడు నేలకొరిగాడు. అర్జునుడు ఏర్పాటుచేసిన అంపశయ్యపై మేను వాల్చాడు. దాహార్తిని తీర్చుకోడానికి శుద్ధ గంగాజలాన్ని అర్జునుడు పాతాళం నుండి తెప్పించాడు. అందుకే నేటి కాలంలో తులసి జలాన్ని గంగా జలాన్ని మరణశయ్యపైనున్న వారికి నోట్లో పోస్తుంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంవరకు ప్రతీక్షించాడు. భీష్ముడు పడుకున్నది అంపశయ్య. బాణాగ్రములు బాగా తీక్షణంగా, సూక్ష్మంగా ఉంటాయి. అవి శరీరములోని ఆయుపట్టుగల స్థావరాలలో గుచ్చుకుంటూ ఒత్తిడిని కలిగిస్తూ ప్రాణములను నిలబెడుతుంటాయి. దీనినే నేటి కాలంలో ఆక్యుప్రెషర్ అని, ఆక్యుపంక్చర్ అని పిలుస్తుంటారు. వెంటిలేటర్లు పెడుతుంటారు. గుండె మీద ఒత్తుతూ చేస్తూ ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా మాఘశుద్ధ అష్టమి తిథి వచ్చాక ప్రాణాలు విడిచిపెట్టాడు. అటువంటి పుణ్యాత్ముడు తనువు చాలించిన రోజు కాబట్టి అది భీష్మాష్టమి అయింది. అయితే అష్టమికి ముందురోజు వచ్చే సప్తమి నాడే సూర్యుడు తన రథాన్ని పూర్తిగా ఉత్తర దిశవైపు తిప్పి ప్రయాణం సాగిస్తాడు. అందుకే అది రథ సప్తమి అయింది. ఆయన చనిపోయిన అయిదవనాడు ఏకాదశి తిథి కావడంవల్ల దానిని భీష్మ ఏకాదశి అన్నారు. ఈ రెండు రోజులలోను భీష్ముడిని స్మరించాలి. పూజించాలి. ఆయన ఈ లోకానికి ప్రసాదించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఆ రెండు రోజుల్లోను తప్పనిసరిగా పారాయణం చేయాలని శాస్త్ర వచనం. భీష్ముడు కురుపితామహుడు. జ్ఞాననిధి. సకల ధర్మాసూక్ష్మాలు ఆయనకు కరతలామలకాలు. బ్రహ్మర్షులు కూడ ఆయన ఉపదేశాలను గౌరవిస్తారు. మహాభారతంలో భగవద్గీతలాగానే విష్ణు సహస్ర నామస్తోత్రం కూడ ఒక విశిష్ట ఘట్టం. అయితే గీతా సారాంశానే్న యిది ప్రతిపాదించింది. అంపశయ్యపై నున్న భీష్ముని వద్దకు శ్రీ కృష్ణుడు యుధిష్ఠిరుడిని తీసుకువెళ్లాడు. ఆ మహానుభావుని ద్వారా సకల ధర్మాలను గ్రహించడం నీ కర్తవ్యం అని ధర్మరాజుకు చెప్పాడు. అలాగే భీష్మునితో గూడ నీవు ధర్మమయ జీవనం గడిపిన వాడవు. మానవశ్రేష్ఠుడవు. అనేక మంది బ్రహ్మవేత్తలను సేవించినవాడవు. జీవన పర్యంతము బ్రహ్మచర్యము పాటించావు. తపోధ్యానాదులతో అనుష్ఠాన బలంతో అగ్నిపుంజం లాగ ప్రకాశిస్తున్నావు.
అటువంటి నీవు ధర్మోపదేశం చేయడం సముచితంగా ఉంటుంది. ఒక తరం నుండి మరో తరానికి ధర్మము పరంపరగా సంక్రమించాలి. చక్రవర్తిగా రాజ్యపాలన చేయబోతున్న ధర్మరాజుకు ధార్మిక జ్ఞాన సంపదనందచేయడం నీ కర్తవ్యం. కాబట్టి ధర్మోపదేశం చేయమన్నాడు శ్రీకృష్ణుడు. ఇది శ్రీకృష్ణుని ఆజ్ఞ. అంటే పరమాత్ముని ఆజ్ఞ. శ్రీకృష్ణునికి నమస్కరించి ఆయన అనుగ్రహ బలంతో బ్రహ్మర్షులు పరివేష్టించి యుండగా లౌకిక, వ్యావహారిక రాజనీతులను, వర్ణాశ్రమ ధర్మాలను, మోక్ష ధర్మాలను పుంఖాను పుంఖాలుగా బోధించి చిట్టచివరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు. అంతటి ఉత్తముడు, ధార్మికుడైన భీష్ముని స్మరించడం జలాంజలి సమర్పించడం భారతీయుల కర్తవ్యం.
అలాగే పద్మ పురాణంలో ‘‘మాఘమాసే సీతాష్టమ్యాం సలిలం భీష్మ తర్పణం
శ్రద్ధంచ యేనరాః కుర్యుః తేస్యుః సంతతి భాగినః॥
అంటే బ్రహ్మచారి, సంతాన రహితుడైన భీష్మునికి భీష్మాష్టమి రోజున శ్రాద్ధకర్మలు చేసిన వారికి తర్పణలు విడిచిన వారికి సంతానం కలుగుతుందని చెప్పబడింది. అలాగే ‘‘శుక్లాష్టమ్యాంతు మాఘస్య దద్యాత్ భీష్మాయ యోజలం’’ అని కనీసం జల తర్పణం అయినా విడిచిపెట్టాలి. ఆ మహాపురుషుడికి అన్ని కులాల వాళ్లు ఇలా
‘‘్భష్మః శాంతనవో వీర. సత్యావాదీ జితేంద్రియః
అభివృద్ధి రవాప్నోతి పుత్ర పౌత్రో చితాం క్రియాం
వైయాఘ్ర పాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ
అపుత్రాయ దదామ్యేత జ్జలం భీష్మాయ వర్మణే॥ శ్లోకాన్ని పఠిస్తూ తర్పణ విడిచిపెట్టాలి. ఋషి ఋణం తీర్చుకోవడం అంటే యిదే.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP