శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పితృకార్యంతో అన్ని ఫలితాలు అందుతాయి

>> Tuesday, September 29, 2015

* మా తండ్రిగారు వినాయక చవితినాడు గతించారు. ఆనాడు నే వినాయక చవితి ఎలా చేయాలి? - నీరజ
పితృదేవతలకు, స్వర్గలోక నివాసులైన ఇతర దేవతలకూ మధ్య ఒకప్పుడు ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం- ఏ వ్యక్తికయినా సరే తన తల్లిదండ్రులు ఆబ్దిక దినాలలో, ఆ పితృకార్యంవల్లనే ఆ వ్యక్తికి ఆ రోజు చేయవలసిన ఇతర దేవతాపూజ ఫలితాలన్నీ నూటికి నూరు శాతమూ అంది తీరుతాయి. అందువల్ల ఆ రోజున ఇతర దేవతలు వారింటికి రారు. అందుకే ఆనాడు వినాయక చవితి వంటి మహాపర్వాలు వస్తే, ఆ కర్త పితృకార్యానికే ప్రాముఖ్యం ఇవ్వాలి. దానివల్ల వినాయక చవితి వ్రత ఫలంగూడా వచ్చి తీరుతుంది. ఇంట్లో పిల్లలు వగైరాలకు వ్రతం సరదా వుంటే, వారు మాత్రం గుళ్ళో పూజలు చేయించుకోవచ్చు.
* మాతా పిత్రాదుల శ్రాద్ధదినంనాడు నిత్యదేవతార్చన ఎలా చేయాలి? - టి.రాఘవేంద్రగుప్త, అనంతపురం
ఆరోజు గంట మ్రోగించకుండా, కొబ్బరికాయ కొట్టకుండా, నిత్య దేవతార్చన లఘువుగా పూర్తిచేసి, పూర్తి శ్రద్ధను పితృకార్యం మీదనే లగ్నం చేయాలి.
* నా గతించిన తల్లిదండ్రులకు ఇంతవరకు పిండ ప్రదానం చేయలేదు. ఇప్పుడు నేనేమి చేయాలి? ఎక్కడ చేయాలి? - కె.వి.సుబ్బారావు, సికింద్రాబాదు
తప్పు జరిగిపోయింది. దాన్ని వీలయినంత త్వరలో దిద్దుకోవటం మంచిది. మీకు సరియైన పురోహితులు, సహాయకులు ఎక్కడ దొరుకుతారో అక్కడే చేయండి. దీనికోసం పెద్ద క్షేత్రాలకు పోవలసిన పని లేదు.
* పిండ ప్రదానదినం పంచాంగం ప్రకారం ఆచరించాలా? ఇంగ్లీషు తేదీ ప్రకారమా? - లక్ష్మి, మనుబోలు
పంచాంగం ప్రకారమే.

* ప్రతి సంవత్సరమూ పిండ ప్రదానం చేయమంటారా? అసలు పిండప్రదానాలు ఎన్ని సంవత్సరాలు చేయాల్సి ఉంటుందో తెలుపగలరు? - కె.వి.సుబ్బారావు, సికింద్రాబాదు
కర్త జీవించి వున్నంతవరకు తల్లిదండ్రుల పిండ ప్రదానం ప్రతి సంవత్సరమూ తప్పక చేయాలి.
* మగవారు గూడా ఉపవాసాలు వుండవచ్చా? ఉంటే ఎప్పుడుండాలి? ఫలితమేమిటి? - యన్.సురేంద్ర, కొత్తగాజువాక
ఉపవాసాది నియమాలు ప్రధానంగా పురుషులకే విధింపబడినాయి. ఏకాదశి, మాస శివరాత్రి, ఇష్టదేవతలకు సంబంధించిన పర్వదినాలు వంటి దినాలలో ఉపవాసాలు ప్రశస్తం. ఈ ఉపవాసాలవల్ల ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తి, ఆరోగ్యవృద్ధి, కోరిన కోర్కెలుతీరటం వంటి సత్ఫలితాలుంటాయి.
* తద్దినాలు తిథిబట్టి చేస్తారు. జయంతి (పుట్టినరోజు) తిథినిబట్టి చేయరెందుకు? - బి.సీతారాం, హరిపురం
సాంప్రదాయికులు వారి పుట్టినరోజు పండుగలను తిథులనుబట్టే చేసుకుంటున్నారు. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి వంటివి జయంతులే. అవి తిథుల ప్రకారమే జరుగుతున్నాయి. గాంధీ జయంతి వంటి రాజకీయ జయంతులు తేదీల ప్రకారం జరుగుతున్నాయి.
* కాకి ఇంట్లోకి వచ్చి వెళితే శాంతి వుందా? - జి.పుల్లయ్యగుప్త, నేరడుచర్ల
అవును, శాంతి వుంది. శాంతి కమలాకరమనే గ్రంథంలో ఆ వివరాలున్నాయి. మీదగ్గర వున్న పురోహితుల ద్వారా వాటిని తెలుసుకొని ఆచరించవచ్చు.
ప్ర: అనేకరకాల సమస్యలకు వివిధ దేవతల ఆరాధన చేయమని కొందరు బోధిస్తున్నారు. అందరు దేవతలకు కలిపి పరమాత్మకు ఓంకార రూపమైన ప్రార్థన చేస్తే బాగుండదా?
- నీరజ, ఆమన్‌గల్లు
ఓంకారోపాసన, కేవల పరమాత్మ మీద దృష్టి కేంద్రీకరణ- అనేవి సామాన్య జనంలో చాలామందికి కుదరవు. కుదరని వారికోసం వివిధ దేవతారాధనను బోధించక తప్పదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP