శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గురువంటేఎవరు? ఎవరిని గురువుగా భావించాలి?

>> Friday, November 21, 2008


గురువంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.
1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.
2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి

3 సర్వ సమర్ధత :- తాను శిష్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాడ నియమాలను సహితం మార్చగలిగేంతగా.

ఇటువంటి వారిని మనము పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.
అటువంటివారిని పరిశీలించి,పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు...గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికం గా పతన హేతువవుతుంది.

శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్డకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టేరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.
కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.
మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?
గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.
గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చేస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధిపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరిత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.
అందుకే నేను మనవిచేసుకుంటాను .నన్ను గురువుగారు పిలవద్దు. ఆపిలుపుకు తగిన అర్హత నాకులేదు.నన్ను పిలవాలనుకుంటే మాస్టర్ గారూ అనండిచాలు అని.

శ్రీగురు దత్తాత్రేయాయనమ:

1 వ్యాఖ్యలు:

Sandeep P July 18, 2016 at 7:24 PM  

గురువు అనే పదానికి ఉన్న గురుత్వాన్ని బాగా వర్ణించారు దుర్గేశ్వర గారు. మన అందరికీ గురువుల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను. నమస్సులు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP