శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కర్మ ప్రక్రియ గొప్పది

>> Saturday, February 16, 2013


మానవజీవన విధానంలో ప్రతిజీవి కర్మలు ఆచరించవలసినదే. కర్మలేని జీవనం వ్యర్థము. అర్థము లేనిది. కర్మాచరణము పవిత్రమైనది. దీనికి మూలం కృష్ణపరమాత్మ బోధించిన భగవద్గీతయే. ఏమి చేయవలెనో గీత బోధించదు. ఎట్లు చేయవలెనో అదియే బోధిస్తుంది. ఈ సూత్రంననుసరించి ఆశ్రమముల వారు, సంప్రదాయపరులు వారి వారి విద్యుక్త ధర్మములను, కర్మములను ఆచరించవచ్చును. గృహస్థులు తమ నిత్య కార్యములను, దైనందిన వ్యవహారములను, వ్యాపారి వ్యాపారములను, ఉద్యోగి ఉద్యోగమును, రైతు వ్యవసాయమును, పాకీవాడు పాకీపనిని, పురోహితుడు పౌరోహిత్యమును, క్షత్రియుడు యుద్ధము చేయవచ్చును. దైవదృష్టి కలిగి దైవమును స్మరించుచూపులాపేక్ష లేక ఈశ్వరార్పణబుద్ధితో చేయాలి. ఇదియే గీత శాసించునది. ఆవిధంగా ఆచరించు క్రియ కర్మయందలి విషము అనగా బంధజనకత్వము తొలగి సామాన్యమైనదైననూ మహాపవిత్ర క్రియగా మారిపోతుంది.
వ్యవహారమందు పరమార్థ ప్రయోగము అను నీ ప్రక్రియ గీతలో విశేషంగా కన్పిస్తుంది. గీతకు విశ్వ వ్యాపకత్వము కలుగజేసిన ధర్మము ఇదియే. జ్ఞానం పొందిన పిదప నివృత్తి అనివార్యముగాదు. అజ్ఞానమనే మోహము తొలగినా అర్జునుడు ప్రవృత్తిని వీడలేదు. ప్రపంచాన్నీ వదలలేకపోయినాడు.
పూర్ణ ప్రయోజన సిద్ధి కొరకు భగవద్గీత నాశ్రయింపవలయును. జ్ఞానం లేకున్న మోక్షం సిద్ధింపదు. చిత్తశుద్ధి లేకున్న జ్ఞానము కల్గదు. నిష్కామ కర్మ నాచరింపనిచో చిత్తశుద్ధి కలగదు. కావ్ఞన సాధకులందరికీ కర్మయోగమే అత్యావశ్యకము. అన్నింటికీ కర్మకారణభూతమైయున్నది. ఈ విషయాన్నే కృష్ణ భగవానుడు ఆరవ అధ్యాయం ఆత్మసంయమయోగంలో మూడవశ్లోకం ద్వారా
శ్లోII ఆరురుక్షోర్మునేర్యోగం-కర్మకారణముచ్యతే
       యోగారూఢస్య తస్యైవ-శమఃకారణముచ్యతేII

అంటూ జ్ఞాన సౌధాన్ని ఎక్కదలచిన వారు ముందుగా కర్మసాధన చేయాలనీ, దీనిని బాగుగా ఎక్కినట్టి వారికి కర్మ నివృత్తి సాధనమన్నారు. స్థిరత్వానికీ నిలుకడకు శాంతి-చిత్త ఉపరతి సాధనంగా తెలిపారు. కర్మలను పూర్తిగా వదలి ఎవరును ఉండజాలరు. కర్మలను పవిత్ర మొనర్చుకొను పద్ధతి నేర్చుకోవాలి. భగవానుడు ఫలాపేక్షను వదలి కర్మలను చేయుటయే పవిత్రమని ఉపాయం తెల్పినాడు. అటు అర్జునునికీ, ఇటు సమాజానికీ చక్కని కర్మయోగాన్ని బోధించినాడు. కర్మలను చేయుచూ, ఫలమును కోరువారు అనగా ప్రాపంచిక సంస్కారం కలవారు, కర్మలను పూర్తిగ వదలినవారు సన్యాసులు, తాపసులు రెండు రకాల వారున్నారు. గీత మూడవ తరగతి వారిని కూడా తెలిపింది. కర్మలను చేయుచూ ఫలమునపేక్షించపనివారు. కర్మలనాచరించినను అట్టివారిని కర్మబంధింపదని తెల్పినది. ఇది పవిత్రమైనది. ఈ పద్ధతి ద్వారా జనులు తమ కర్మరంగమును శుద్ధము గావించుకొని తద్వారా తమ హృదయాలను పునీతం చేసుకోవాలి. జ్ఞానావిర్భావముచే పరమా నందముననుభవించుచుందురు. కర్మాచరణానికి సమత్వ బుద్ధి కావాలి. నేర్పరితనం కావాలి. సమత్వ బుద్ధితో కర్మలనాచరించినచో పాపపుణ్యాలు అంటవు. ఆత్మోన్నతికి ఇదియే పవిత్రమార్గం. కర్మాచరణంలో వివేకం కావాలి. ప్రజ్ఞాశీలురు కావాలి. అంటే కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి జీవి తన లక్ష్యాన్ని పొందే ప్రయత్నంలో కర్మలనాచరించాలి. జీవ్ఞని లక్ష్యం మోహం దాటి ఆవలకు పోవ్ఞటయే. గమ్యం చేరుటయే.
ప్రతి జీవి తన్ను తానే ఉద్ధరించుకోవాలనీ, గురువులు, శాస్త్రగ్రంథము, దైవము దారిచూపుదురే గాని నడవవలసినది తానే గదా! తమ్ముతాము ఉద్ధరించుకొనుటకు ప్రయత్నించు వారికి భగవంతుడు సహాయము చేయును.
శ్లోII ఉద్ధరేదాత్మనాత్మానం-నాత్మానమవసాధయేత్‌ అని తెలిపారు గీతలో కర్మాచరణమునకు స్థితప్రజ్ఞ కావాలన్నారు. అనగా బుద్ధిని ఆత్మ యందు స్థిరముగ నెలకొల్పుటయే. విజ్ఞుడైనవాడు స్థితప్రజ్ఞుని లక్షణముల నెఱింగి వాటి ఆచరణ యందు ధైర్యమునవలంబించాలి. భవబంధముల నుండి విముక్తిని పొందాలి అని గీత బోధిస్తున్నది. ఆధ్యాత్మిక సత్యాలనెఱిగి కర్మలనాచరించాలి. కర్మలను వదలరాదు. మానరాదు. కర్మల విలువలనెరిగి ప్రవర్తించాలి. కర్మలు చేయు విధానంలో దైవభావం ఉంటే ఆధ్యాత్మికాభివృద్ధి కల్గుతుంది. శాంతి సుఖమును, జ్ఞానమోక్షాలను అందిస్తుంది. జీవులు చేయు కర్మలు సత్కర్మలు. దైవకార్యాలుగా మలచుకోవాలి. తద్వారా నైతికాభివృద్ధిని సాధించవచ్చును. భగవత్‌ ప్రీతికరమైన పరోపకారార్థమైన కర్మలు బంధనాన్ని కలుగజేయవు. కర్మలో దోషాలుండవు. దానిని చేయు పద్ధతిలో దోషాలుంటాయి గాన కర్మసంగులు గాక ముక్త సంగులు కావాలన్నారు పరమాత్మ. కర్మరహస్యము కర్మకీలకము తెలుసుకుని కర్మలనాచరించాలని ఉపదేశించారు. ప్రబోధించారు. కర్మాచరణలో సంగరహితులు కావాలన్నారు. కర్మచేయు విధానం కర్మ కన్నా గొప్పదనీ గొప్ప జ్ఞానాన్ని బోధించారు. ఇదే కర్మ తత్త్వము. పరమాత్మ తత్వము.  - పి.సి. సీతారామమూర్తి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP