శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆచార్యుడు_ గురువు [ పరమాచార్యుల అద్భుత ఉపదేశం]

>> Tuesday, March 12, 2013

శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ శరవణభవాయ నమః
శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
శ్రీ సీతారామాభ్యాం నమః
శ్రీ హనుమతే నమః
గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!
పెద్దలందరికీ నమస్కారము,

పూజ్యులు ప్రాతఃస్మరణీయులు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు,నడిచే దేవుడు, పరమాచార్య, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి వారు తమిళంలో చేసిన ప్రవచనములలో, "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" అనే అంశముపై చేసిన ప్రవచనముల యొక్క తెలుగు అనువాదము, కామకోటి వారి సైట్ లో లభిస్తే, దానినే యథాతథంగా, మరొక సారి పునశ్చరణ చేసినట్లు అవుతుందనీ, ఇలా వ్రాయడం వల్ల, జగద్గురువుల అనుగ్రహం లభిస్తుందనీ ఆర్తితో, నేను నేర్చుకోవడం కొరకు, నా ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసమై, ఇక్కడ వ్రాసుకుంటూ, అందరితోనూ పంచుకుంటున్నాను. తప్ప ఇక్కడున్న పెద్దలకు తెలియనివి కావు.


1. గురువు - ఆచార్యుడు
మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు ఈ రెండిటినీ కాస్త భిన్న దృక్పథంలోనే చూస్తారు. ఆ పదాలే "గురువు", "ఆచార్యుడు".

ఆచార్యుడు అనే పదం - ఆచరణ, ఆచార అనే పదములకు సంబంధించినది. చర అంటే నడుచుత, చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశములో ఏమేమి జరిగినదో తెలిపే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహములోని వాడుకలు, నడవడికలు.

ఆచార్యుడు అంటే మనం జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తన శిష్టాచారములను అనుసరించాలో చూపే మార్గ దర్శకుడు. అహింస, సత్యము లాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతములో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. ఆచారాలున్నాయి. ఒక్కో సాంప్రదాయానికి వేర్వేరు శాస్త్రాలున్నవి, వైష్ణవులది ఒక ఆచారము, మాధ్వులకు మరొక ఆచారం. ఒక్క శైవ సాంప్రదాయములోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీరశైవం, పాశుపతం, సిద్ధాంతము ఇత్యాదివి.

ఆచార్య పదం వివరించే ఒక శ్లోకం ఉన్నది ... "అచినోతిః శాస్త్రార్ధాన్ ఆచారే స్థాపయత్యపి - స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్య ప్రచక్షతే".
ఎవడైతే శాస్త్రార్ధములను చక్కగా విచారిస్తున్నాడో (ఇతరులకు వాటిని బోధిస్తున్నాడని గర్భితం), ఆ ఆచారములను తాను స్వయముగా అనుష్టిస్తున్నాడో, అంతటితో వదలక, ఆ ఆచారములను ఇతరులచే అనుష్టింపచేస్తున్నాడో... అతడే ఆచార్యుడు. ఇతరులకు బోధ చేయడం, తాను స్వయంగా ఆచరించడం. ఈ రెండూ చేసేవాడే నిజమైన ఆచార్యుడు.

మనం ఆచారం, అనుష్టానం అంటూ ఉంటాము. అవి రెండూ పరస్పర సంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారములను అనుసరించేవే సంప్రదాయాలు. శాస్త్రములనేవి విధి, నిషేధాలను నిర్ణయించే గ్రంధాలు. సంప్రదాయాలు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదిక మతము ఆధారముగా ఏర్పడినవే శాంకర, రామానుజ ఇతర వైదిక సాంప్రదాయాలు. శాస్త్రములు సామాన్యముగా ఉన్నా సాంప్రదాయములు వేరుగా ఉండవచ్చు. ఈ విధంగా ఒక నియమ జీవనం చేస్తూ శాస్త్రోక్తమైన ఆచార అనుష్టానాలను పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ, వారిచే వాటిని అనుష్టింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా ధర్మమూర్తిగా ఉన్నవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సాంప్రదాయ ధర్మములను బోధించి అనుష్టింపచేయాలి. అతడు విద్వాంసుడిగా ఉండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకి ఏమి బోధ చేయగలడు? తన అనుచరుల ధర్మ సందేహాలకు అతడు జవాబు చెప్పాలి. తన సాంప్రదాయానికి ప్రతి పక్షంవారికి యుక్తి యుక్తముగా జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడు అనిపించుకొంటాడు.

ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలో ఉండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో కానీ ఏ విధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులు ఉండే వారు. ద్రోణాచార్య, కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వారు వారి కళలలోనే కాక సాంప్రదాయములోనూ ధర్మములోనూ కుశలులు. వారి యొక్క అనుష్టానాలకే వారు గౌరవింపబడినారు.

2. గురు లక్షణం
ఆచార్యుని సమక్షంలోనే ఉంటూ విద్యాభ్యాసం చేయడం గురుకులవాసం. కానీ దానిని "ఆచార్య-కుల వాసము" అని మనం అనడం లేదు. అందుచేత గురువు-ఆచార్యుడు ఒక్కరే అని ఆర్ధం అవుతుంది. జగద్గురు శంకారాచార్య అని వ్యవహరించినప్పుడు, ఒకే వ్యక్తి గురువుగా, ఆచార్యుడిగా ఉన్నారని అర్ధం.

గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు దేనిలో పెద్ద?? మీరందరూ నన్ను పెరియావా, పెరియావర్ అని పిలుస్తారు. (ఈ మాటలు పరమాచార్య స్వామి వారు ప్రవచనాంతర్గతముగా భక్తులతో అన్నవి....). నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడు అని పేరు ఉండడం వలన మీరందరూ ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్ను పెరియావా అనీ, మహాన్ అనీ పిలుస్తున్నారు.

మొత్తం మీద గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క నడతా, విద్వతూ అతనిని ఆచార్యునిగా నిర్దేశిస్తుంది. అతని ఆచార అనుష్టానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద చేతనూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.

ఇక గురువు మాట ఏమిటి? అతను బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఞానమో విద్వత్తో ఉండనక్కర్లేదు. ఆచార్యుని వలె అతను సాంప్రదాయ, ఆచార అనుష్టానాలకు మార్గదర్శిగా ఉండనవసరమూ లేదు. అతను నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఉపదేశాలు ఇవ్వనక్కర్లేదు. ఎంతో మంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు ఉంటారన్న విషయం మనకి తెలిసనదే.

తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా ఉంటే అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.

ఏ శాస్త్రాచారమూ పాటించని ఇలాంటి గురువులెందరో ఉన్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.

ఒక మార్గాన్ని అనుసరించి పోయేవాడు ఆచార్యుడు. ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ, అతడు శాస్త్ర నిష్ణాతగా ఉండడమే కాక, శాస్త్ర విధులను తాను అనుష్టిస్తూ ఇతరులకు బోధచేస్తూ, వారిచేత వానిని అనుష్టింపచేస్తూ
విధివిధానముగా మార్గదర్శకముగా ఉండేవాడే ఆచార్యుడు. గురువు అట్లా కాదు.  అతనిని మహాత్ముడు అంటారు, అతని ఆత్మానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం చేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారికి శీలానుష్టానాల అవసరం లేదు. వారికి శాస్త్ర విజ్ఞానం ఉండాలన్న నియమం లేదు. వారు జ్ఞానులు, వారెప్పుడూ బ్రహ్మ నిష్టలో ఉండేవారు. వారెప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే ఆనందోన్మత్తులగానో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధి స్థితిలో ఉండే యోగులగానో ఉంటారు.

ఒక గురువు స్వయంగా "గురుత్వం" ఒప్పుకోకపోయినా, "నేను నీ శిష్యుడను" అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్టుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహం వల్లనే. గురువు అంటే ఘనమైన వాడు అని చెప్పాము. ఒకరికి అంతరంగిక ఘనత ఉంటుంది. కానీ అతనికి బహిర్ప్రపంచముపైన ఏ కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ట, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశ శబ్దానికి ప్రకాశరూపి అని అర్ధం. "తమసోమాజ్యోర్గమయ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. అజ్ఞానం అంటే చీకటి, వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ చీకటి పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న శిష్యునికి జ్ఞానబోధ చేయగలిగినది ప్రకాశరూపియైన గురువు ఒక్కడే.

ఒక మహాత్ముడుంటాడు, అతనికి శాస్త్ర విజ్ఞానం లేదు, అతని అనుష్టానమూ శాస్త్రీయము కాదు. శాస్త్రబోధ అతనికి కానిపని. అయినపటికి అతనిని ఎవరైనా 'గురువు'గా ఆశ్రయిస్తే, అతను ఆశ్రయితుడి అంతర్ధ్వాంతాన్ని అనయాసంగా పోగొట్టగలడు. అతని అనుగ్రహం చేత అనధీతమైన శాస్త్రాలన్నీ ఆశ్రితునికి అవగతాలౌతాయి.

గురువంటే చీకటిని పోగొట్టేవాడు. అతని ఆత్మశక్తి బహిర్ముఖంగా పనిచేస్తుంది. అతను వాగ్రూపముగా వరదానము చేయడంలేదు. మార్గదర్శకముగా ఉండాలన్న కోరికా అతనికి లేదు. అనుగ్రహం చేద్దామన్న ఇఛ్చయూ లేదు. కేవలం ఈశ్వర శక్తి, శిష్యుని గురుభక్తి మెఱుపువలే వరప్రదానం చేస్తుంది. అతను అల్పమైన ప్రాపంచిక విషయాభిలాయగానైనా ఉండవచ్చు. లేదా అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి అయినా ఉండవచ్చు.

ఒక కర్తవ్యం జరగాలంటే గురు-శిష్య సంబంధం ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించాలంటే, విద్యుఛ్చక్తికీ దీపానికీ మధ్య లంకె ఉండాలి. ఆ లంకె తంతి ద్వారా ఏర్పడుతుంది. జలాశయాలనుంచి ఇంట్లో కొళాయిలోకి నీళ్ళు రావాలంటే, పెద్దజలాశయము నుండి నగరానికి మధ్య పైపులు వేయాలి. అప్పుడే కొళాయి నుంచి నీళ్ళు రాగలవు. గురువు వాగ్రూపముగా ఉపదేశము చేస్తూ ఉంటే, గురుశిష్యుల మధ్య సంబంధం గురువు వాక్కులే. లేదా గురువు జీవితములోని ఆచార వ్యవహారాలే శిష్యుడికి ఉపదేశ ప్రాయముగా ఉంటాయి. గురువు మౌనముగా ఉంటూ ఒక సంకల్పము చేస్తే, అదే శిష్యునికి ఉపదేశమవుతుంది. గురువు ఉపన్యాసాల చేతనే ఉపదేశం చేయాలన్న నియమమేమీ లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద ఉపదేశం. ఉపదేశ విధానము స్థూలమే కాదు, సూక్ష్మము కూడా.

ఒక గురువు వాగ్రూపముగానూ, తన ఆచార, అనుష్టానము చేతనూ శిష్యునికి బోధిస్తే, అతనిని ఆచార్యుడని అంటారు. ఒకడు ఉపదేశమూ చేయకపోవచ్చు. మార్గదర్శకంగా ఉండకుండా పోవచ్చు. కానీ అతని అనుగ్రహమే గురుశిష్యుల మధ్య ఏర్పడిన అవ్యక్త సంబంధమని ఇదివరకే చెప్పాను.. (పరమాచార్య వారి మాటగా దీనిని చదవగలరు..). ఆ అనుగ్రహమే అతడిచ్చే ఉపదేశము.

ఇట్లా ఉండే గురువులలో కొందరూ ఆచార్యులుగా ఉండడమూ కద్దు. శిష్యులకు బోధిస్తూ, శాస్త్రానుష్టానాలను స్వయంగా ఆచరిస్తూ అంతరంగములో సమాధి అవస్థలో ఉండగల గురువులూ ఉన్నారు. శంకర భగవత్పాదులు ఇటువంటి గురువులు. ఇతర సాంప్రదాయలలోనూ ఒకే వ్యక్తి గురువుగా ఆచార్యునిగా ఉన్నవారు ఉన్నారు.

పూర్వకాలములోని విద్యాగురువులు గొప్ప శీలమూ నిష్టా కలిగినవారు. ఆత్మానుభూతి కానీ, సమాధి అవస్థ కానీ వారు ఎరుగకపోవచ్చును. కానీ ఆచార అనుష్టానాల బలం చేత వారు గురుకులములను నడుపుతూ శిష్యకోటికి విద్యాదానం చేసేవారు. మరికొందరు స్వయంగానో, లేక శాస్త్ర సమ్మతమైన దానినో ఆశ్రితులకు ఉపదేశం చేసేవారు ఉండేవారు. అట్లు ఉపదేశం చేసిన వారి జీవిత కాలంలో వారి బోధనా విధానం శాస్త్ర విధానంగా పరిగణింపబడకపోయినా వారి అనంతరం వారి విధానం, వారి పేరిట చెలామణీ అయి వ్యాప్తి చెందేది. అట్టి గురువులు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నవారే. ఏ విధానానికి సంబంధించని గురువులూ ఎంతో మంది ఉన్నారు.

(సశేషం...)

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

---------------------------------------------------

 3. గురువు - ప్రపంచము
ఒక గురువు క్రమపద్ధతిలో బోధ చేయడానికి ఇష్టపడక పోవచ్చును. కానీ శిష్యులను ఆశీర్వదించాలని కోరుకోవచ్చును. ఇంకో మహాత్ముడు ఆశ్రితుల విషయంలో ఈ ఆశీర్వాద బాధ్యత కూడా మనకెందుకని ఊరుకోవచ్చును. అలాంటప్పుడు ఆ ఆశ్రితులను ఈశ్వరుడే రక్షిస్తాడు. వరప్రదానం చేస్తాడు. అనన్యంగా నమ్ముకున్న ఆ ఆశ్రితులకు దేవుని చేయూత ఎప్పుడూ ఉంటుంది.

అంధకారాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించే ఏ సంభవమైనా ఉపదేశమే.

సాధారణంగా ఒక గురువే శిష్యుని మంత్రోపదేశం ద్వారా అనుగ్రహించి అతనికి శక్తిపాతం కలిగిస్తాడు. కొందరు మహాత్ములు శాస్త్రోపన్యాసములు ఇవ్వకపోయినా వారి శిష్యులకు మాత్రం మంత్రోపదేశం చేస్తారు. మనం ఎన్ని కథలు చదివి ఉన్నాం. ఒక మహాత్ముని ముందు ఒకడు ఎంతో కాలం పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఒక్కరోజు హఠాత్తుగా ఆ మహాత్ముడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ క్షణం నుంచీ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. గురుమూలకంగా మంత్రోపదేశం పొందాలని తపస్సు చేసిన శిష్యులూ, యుక్తి చాతుర్యం ప్రకటన చేసిన శిష్యులూ ఉన్నారు.

ఇక్కడ కబీరు కథ చెప్పాలి. రామానందులనే ఒక మహాత్ముని వద్ద కబీరు రామ మంత్రోపదేశం పొందాలని పరితపించేవాడు. కానీ అతడు ముస్లిము. అతడు హిందువే అనీ ముస్లిములచేత పెంచబడ్డాడనీ కొందరంటారు. రామానందులు తనకి మంత్రోపదేశం ఇవ్వరేమో అని అతనికి తోచింది. ఎట్లాగైనా ఆయన వద్ద మంత్రోపదేశం పొందాలని ఒక ఎత్తు వేశాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తములో రామానందులు గంగా స్నానానికి వచ్చారు. కబీరు గంగా నది స్నాన ఘట్టంలో మెట్లమీద పడుకొని ఉన్నాడు. చీకటిగా ఉన్నందున రామానందుల వారు పడుకుని ఉన్న కబీరు మీద పాదములు మోపారు. కబీరు దానినే 'పాదదీక్ష'గా స్వీకరించాడు. (దీక్ష గురించి తర్వాత చెబుతాను..) ఎవరినో త్రొక్కినట్లు తోచగానే ఆయన రామరామ అని పాదాఘాతానికి ప్రాయశ్చిత్తముగా గట్టిగా ఉఛ్చరించారు. కబీరుకు అదే ఉపదేశమైనది. తారకమంత్రాన్ని ఏ విధంగానైనా రామానందుల వారి నుండి పొందాలని కబీరు ఈ పన్నాగం పన్నినాడు.

ఇంతకూ ఈ కథ ఎందుకు చెప్పానంటే రామానందుల వారు ఉద్దేశ పూర్వకముగా కబీరుకు మంత్రోపదేశము చేయలేదు. కానీ ఆయన రామరామ అనగానే, శిష్యుని సంకల్పం వలన, వారి అనుద్దేశపూర్వకమైన ఉఛ్చారణవలనా "గురుశిష్య సంబంధం" ఏర్పడినది అని చెప్పుటకు ఈ ఉదాహరణ.

మంత్రోపదేశం చేసిన వానిని గురువంటారు. ఈ మంత్రోపదేశం చేత గురుశిష్యుల మధ్య ఒక లంకె ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని వివరించవలసిన అవసరమూ లేదు. అది ఆచార్యుని పని. అకస్మాత్తుగా అనుద్దేశపూర్వకముగా ఒక మంత్రము ఉఛ్చరించినా గురువు అనుగ్రహం మంత్రం ద్వారా శిష్యుడిని సంక్రమిస్తుంది. లేదా ఆ మంత్ర శక్తి గురువు అనుగ్రహానికి మూలము అని కూడా చెప్పవచ్చును.

గురువు ఒక సిద్ధ గురువు అయితే, శిష్యుడు పరిపక్వమున్నవాడు అయితే, వాగ్రూపక మంత్రోపదేశమే అక్కర్లేదు. కానీ గురుశిష్యుల మధ్య ఒక సంబంధం మాత్రం ఏర్పడాలి. అది ఎట్లా సాధ్యం? గురువు శిష్యుని వంక ఒక మారు చూస్తే చాలు. అదే కటాక్ష దీక్ష అవుతుంది. వలసిన సంబంధం ఆ కటాక్షమే కలిగిస్తుంది. కటాక్షమాత్రాన శిష్యునికి జ్ఞానోపలబ్ధి ఏర్పడుతున్నది. గురువు శిశ్యుని శిరస్సుని స్పృశించడం కూడా దీక్షయే. దీనిని హస్త మస్తక దీక్ష అని అంటారు. కొన్ని సమయాలలో ఇవి ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ స్థూల క్రియలు. గురువు సంకల్పం మాత్రాన "ఈ బిడ్డకు ఆరోగ్యం కలగాలి" అని అనుకున్న మాత్రంలో, అది ఉపదేశతుల్యమై గురుశిష్య సంబంధాన్ని వెంటనే సృష్టిస్తుంది. 

---------------------------------------------------------------

to సత్సంగము
Inline image 1

4. దీక్ష
ఉపదేశమూలకముగా గురు-శిష్య సంబంధం ఏర్పడుతున్నదనే విషయం గురించి ఇంతవరకూ చెప్పాను. శాస్త్ర పరిభాషలో దీనినే "దీక్ష" అంటారు. తమిళంలో దీనిని "దీక్కై" అని చెబుతారు. ఉపదేశమూలకముగా గురువు నుంచి ఒక చైతన్యము శిష్యుడిలో ప్రవేశించి, తీవ్ర సంవేగాన్ని కల్పించి, ఆధ్యాత్మ మార్గములో ఒక అన్వేషణకి పురికొల్పేదే దీక్ష. ఈ చైతన్యం దీక్ష అయిపోయినంతనే అంతరించిపోవడం లేదు. ఈ చైతన్యము శిష్యునిలో ప్రవిష్టమై, అతనిని ఆధ్యాత్మంలో ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్ళి, మంత్రసిద్ధి కలుగజేస్తున్నది.

గురువు ఒక్కమారైనా సరే, మంత్రోపదేశం చేసియో, కటాక్షమూలకముగానో, హస్తమస్తక స్పర్శనం చేతనో, అనుకంపన చేతనో గురుశిష్య సంబంధమైన దీక్షని ఇచ్చినట్లైతే, ఆ అనుగ్రహం శిష్యుని మీద ఎల్లకాలమూ ఉంటుంది. స్విచ్చిని నొక్కి ఉంచినంతసేపూ బల్బు వెలిగేట్లు ఈ అనుగ్రహం పనిచేస్తుంది. ఆచార్యుడు శిష్యుడిని సమక్షంలో ఉంచుకుని దీర్ఘ కాలం అతనికి విద్యను, అనుష్టాన విధానాలను బోధించాల్సి ఉంటుంది. గురువు విషయం అట్లా కాదు. అతనికి శిష్యునితో స్థూల సంబంధం అక్కర్లేదు. అతనికి ఒక్క క్షణం ఉంటే చాలు. కొన్ని సమయాలలో అదికూడా అక్కర్లేదు. అతని అనుగ్రహం దీక్షామూలకముగా ప్రసరించి, శిష్యుని సంసారాన్ని క్షణంలో భస్మం చేస్తుంది. శిష్యునికి సిద్ధి ప్రాప్తించేవరకు, గురువు అనుగ్రహం అన్నికాలాలలోనూ అతనితో ఉంటుంది.

దీక్ష ఇచ్చినవాడు గురువు. భారత, రామాయణాదులలో, పురాణాలలో తండ్రియే గురువని చెప్పబడినది. తండ్రి ఘనుడైనా సరే, కాకపోయినా సరే, మహాత్ముడైనా సరే కాకపోయినా సరే, తనయునికి అతను దైవసమానుడే. వేదాలు పితృదేవోభవ అని కూడా చెప్పినవి. తండ్రిని గురువుగా భావించడానికి మరో కారణం కూడా ఉంది. పుత్రునికి బ్రహ్మోపదేశ సమయంలో తండ్రియే కదా గాయత్రీ మంత్ర దీక్ష ఇస్తున్నది? తండ్రిని గురువుగా భావించడానికి ఈ ఆచారము కూడా కారణము.

ఇదే కాదు, అక్షరాభ్యాసకాలంలో, తండ్రి కుమారునికి "ఓమ్ నమో నారాయణాయ" అని అష్టాక్షరియో, "ఓం నమః శివాయ" అని పంచాక్షరీయో ఉపదేశం చేసే ఆచారం మనలో ఉంది. ఈ కారణంగా కూడా తండ్రి కుమారునికి గురువు అవుతున్నాడు. గురువు వద్ద శరణుజొచ్చిన శిష్యుడు శరణాగతి కారణంగా జ్ఞానలాభాన్ని పొందుతున్నాడు. ఈ జ్ఞానోపలబ్ధికి గురువు యొక్క లాఘవం కానీ, అనుభూతి రాహిత్యంకానీ అడ్డురాదు. శరణాగతి యొక్క మహాత్మ్యం అలాంటిది.

ఇలాంటి గురుభక్తి గురించి చెప్తున్నప్పుడు, కంచి మఠంలో జరిగిన ఒక ఉదంతం జ్ఞప్తికి వస్తున్నది. మఠ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు కుర్రవాళ్లని చూచి, మీ అధ్యాపకులు వచ్చారా అని నేను అడిగాను. ఒక బాలుడు ఇంకా రాలేదు అని బదులిచ్చాడు. రెండవ వాడు "ఆ! వచ్చారు" అని బదులు చెప్పాడు. నిజానికి అధ్యాపకుడు రాలేదు. రెండవ అబ్బాయితో ఎందుకు నీవు ఈ విషయములో అబద్ధము చెప్పావు అని నేను అడుగగా, "గురువు రానిదేమో నిజమే! ఆయన రాలేదంటే ఆయన లోపం చూపినట్లవుతుంది. అందుచేత నిజం చెప్పి గురువు యందు దోషం చూపేదాని కన్నా, అబద్ధం చెప్పి దోషాన్ని చూపకుండుట మంచిదని తోచి అట్లు చెప్పాను" అని అన్నాడు.

గురువు యోగ్యత ఎలాంటిదైనా సరే, శిష్యునికి అఖండమైన, అనన్యమైన భక్తి ఉంటే, అతనిని ఈశ్వరానుగ్రహం వెన్నంటియే ఉంటుంది.

మనం ఏ విషయాన్నైనా స్వయంగా నేర్చుకుంటే అది అహంకారానికి దారితీస్తుంది. ఏ విద్యకైనా ఒక గురువు అవసరం. మంత్రములు కూడా స్వయంగా గ్రహించినవి కాక, గురూపదేశములై ఉండవలె. గురువు లేకుండా తీసుకున్న మంత్రమో, చదివిన విద్యయో, "భార్యకు ఆమె ప్రియుడి చేత కలిగిన సంతానము వంటిది, అతనిని కుమారుడని పిలుచుకోవచ్చు, కానీ వైదిక కర్మలు చేయడానికి అతనికి అర్హత లేదు".

అందుచేత దీక్షకు గురువు అనివార్యము. వాగ్రూపక దీక్ష - మంత్రోపదేశము, కటాక్షముతో అనుగ్రహించే దీక్ష - నయనదీక్ష, శిష్యుని స్పర్శతో అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదులు - అంటే భగవంతుని పాదములు శిరసా గ్రహించి, ఆ పాదములే తాను అయినవాడు అని అర్ధం. అనగా మనం శంకర భగవత్పాదుల వారిని శిరసా ధరించాలి. గురువు ప్రత్యక్షోపదేశం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎక్కడో దూరాన గురువు కూర్చుని శిష్యుని స్మరించినంత మాత్రాన, శిష్యునికి స్మరణ దీక్ష లభ్యమౌతున్నది.

(సశేషం ......)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.

--------------------------------------------------------

to సత్సంగము

Inline image 1

5. అంబికానుగ్రమే దీక్ష
సచ్చిదానందమని మనం చెబుతూ ఉంటాము. చిత్ అనే పదానికి జ్ఞానం అని అర్ధం. అంబికయే జ్ఞాన స్వరూపిణి. లలితాసహస్ర నామాలలో చిదేకరసరూపిణి అని ఒక నామం ఉన్నది. ఏకరసము చిత్తే. శ్రీకాళహస్తిలో అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అని అంటారు.

గురురూపములో వచ్చి మనల్ని అనుగ్రహించేది అంబికయే. కాళిదాసు "దేశిక రూపేణ దర్శితభ్యుదయాం" అని అమ్మవారిని కీర్తించారు. దేశికుడంటే గురువే. వైష్ణవ సాంప్రదాయ ఆచారములో వేదాంతదేశికులొకరు. భగవత్పాదుల శిష్యుడు తోటకాచార్యులు ఆయన చేసిన తోటకాష్టకంలో 'శంకర దేశికమే శరణం' అని ప్రార్ధించారు. దేశికుడంటే అన్ని ప్రదేశాలను ఎరిగిన వాడు, శాస్త్ర నిష్ణాత. దేశికుని రూపములో అంబ అవతరించి శిష్యుణ్ణి స్పర్శ, నయన, స్మరణ దీక్షలతో అనుగ్రహిస్తున్నది.

స్పర్సదీక్షను కుక్కుటదీక్ష అనీ, నయనదీక్షను మత్స్య దీక్ష అనీ, స్మరణదీక్షని కమఠ దీక్ష అనీ అంటారు.

గురువు అనుగ్రహించిన దీక్ష ప్రతిభావంతమై ఉంటే, ఆ శిష్యుడు తన అర్ధరహితమైన జీవితానికి స్వస్తిచెప్పి పరమార్ధిక పథగాముడై పోతాడు. నిజానికి అది అతనికి ఒక పునర్జన్మ అనే అనాలి. అందులకే గాయత్రీ మంత్రోపదేశం చేత ఒకడు ద్విజుడౌతున్నాడు. ద్విజ అంటే రెండో పుట్టుక.

అంటే దీక్షకు ముందు ఒక జన్మ ఉండినదనీ, దీక్ష పిదప మరల అతను జన్మిస్తున్నాడనీ కాదు దీనర్ధం. దీక్షకు ముందుకూడా అతడు అంతరంగములో బ్రహ్మభేదముగా ఉండినప్పటికీ, అతనికి ఆ ఎరుక లేకపోవడం చేత, అతను అజ్ఞానము నందు ఉండినాడు. దీక్షా మూలముగా ఆ అజ్ఞానమనే పొర అతనిని వీడిపోయింది. ఒక కోడి గుడ్లు పెట్టి దానిపై కూర్చుని పొదిగినప్పుడు, గుడ్డును పగులగొట్టుకొని పొర నుండి బయటపడే కోడిపిల్ల వలే, శిష్యుడూ, గురువు అనుగ్రహించిన కుక్కుట దీక్షా మూలముగా (కుక్కుటం అంటే కోడి) అజ్ఞానం అనే అండాన్ని భేదించుకొని, జ్ఞాని ప్రపంచములో పడుతున్నాడు. తన నిజతత్త్వమేమో తెలుసుకుంటున్నాడు.

నీళ్లలో చేపలు గ్రుడ్లు పెడతాయి. ఆ గ్రుడ్లు నీళ్ళలో తేలుతూ ఉంటాయి. చేపలు ఆ గ్రుడ్లపై కూర్చుని పొదగడంలేదు. తేలుతూ ఉన్న ఆగుడ్లని అవి చూసినంత మాత్రాన, అవి చేపపిల్లలౌతాయని మన శాస్త్ర సాంప్రదాయం. అందుకే గురువు యొక్క వీక్షా దీక్షని మత్య్స దీక్ష అని అంటారు.

ఇక కమఠ దీక్ష సంగతి అంటే తాబేలు. తాబేలు గ్రుడ్లను ఇసుకలో పెట్టి మళ్ళా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఆ గుడ్ల సమక్షంలో లేకపోయినా తాబేలుకు అదే ధ్యాస. ఆ పిల్లలు సుఖంగా గుడ్ల నుంచీ బయట పడతాయా లేదా అని విచారిస్తూనే ఉంటుంది. దాని స్మరణ బలం చేతనే గుడ్లు పొదగబడి తాబేలు పిల్లలు బయటకి వస్తాయి. అందుకే గురువు యొక్క స్మరణ దీక్షను కమఠ దీక్ష అని కూడా అంటారు.

అంబిక ఏ విధముగా దేశిక రూపములో ఈ మూడురకాలైన దీక్షలను మనకు అనుగ్రహిస్తున్నది??
అంబిక (అమ్మవారు) అక్షత్రయమని, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని మూడు రూపాలలో ఆవిర్భవించి ఉన్నది. ఆమె అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో..

శృతీనాం మూర్ధానో దధతి తనయౌ శేఖరతయా
మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః


"అమ్మా!! నీ పాదాలను ఆ శృతి శిరస్సులనబడే ఉపనిషుత్తులే తలదాల్చి ఉన్నవి. అట్టి నీ చరణములను నా శిరస్సుపై ఉంచి, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటూన్నారు. ఉపనిషత్తులు వేదాంతాన్ని బోధిస్తాయి. శంకరుల జ్ఞాన మార్గము వేదాంత సాంప్రదాయమే.
జ్ఞానస్వరూపిణియే కామాక్షి. ఆమెను భగవత్పాదుల వారు స్పర్శ దీక్షకై ప్రార్ధిస్తున్నారు.

మదురలో మీనాక్షి అమ్మ ఉన్నది, ఆమె మీన నేత్ర. ఆమె మనకి అనుగ్రహించే దీక్ష నయన దీక్ష. ఆమె కటాక్షములే మనకు జ్ఞాన దీక్ష ఇస్తున్నది. ఇకపోతే కాశీలో విశాలాక్షి ఉన్నది, ఆమె సర్వకాలములలోనూ మనల్నే స్మరిస్తూ, స్మరణదీక్షా ప్రదానం చేస్తున్నది. ఆమె అనుగ్రహించేదే కమఠ దీక్ష.

ఈ విధంగా అంబిక మూడు రూపాలలో మూడు విధాలైన దీక్షలను అందరికీ అనుగ్రహిస్తూ పరతత్త్వజ్ఞానదానం చేస్తూఉన్నది.

(సశేషం ......)

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!


సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
[ అనువాదంః  శ్రీ వి]]

1 వ్యాఖ్యలు:

SD March 12, 2013 at 11:06 AM  

Just a dazzling piece of article. Not surprising it came from the Paramacharya. sivOhaM!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP