శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు - 3

>> Thursday, March 14, 2013


Inline image 1
8.ఆచార్యుడే ఈశ్వరుడు
ఆచార్య పురుషులకు బంధము లేదు. వారు స్వతంత్రులు, నిత్యముక్తులు. మనకు నియమబద్ధ జీవనాన్ని చూపుటకొరకే వారు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. అట్టివారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యుని రూపములో మనకి జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్నారు. సర్వమూ ఈశ్వరుడే, అప్పుడు గురువులోనూ ఆచార్యునిలోనూ ఉన్నాడంటే అభ్యంతరమేమి?

అట్లా అయితే మనం ఎవరం? మనమూ ఈశ్వరులమే కదా. మరొకరిని ఆచార్యుడనీ, ఈశ్వరుడనీ మనమెందుకు ఆరాధించాలి?

అన్నీ అతడే. కానీ మన ఈశ్వరత్వాన్ని మనం స్వయంగా గుర్తించలేకున్నాము. కించిత్తైనా మన ఈశ్వరత్వాన్ని మనం గుర్తించగలిగితే ఈ కామక్రోధాలు, ఆశాపాశాలు, దుఃఖం, కష్టం, పాపం ఉంటాయా?? మనం ఈశ్వరులం అన్న జ్ఞానం లేక అలమటిస్తున్నాము. కానీ ఆచార్యునికి తన ఈశ్వరత్వం తెలుసు. ఆయనకు మనకున్న సుఖ దుఃఖాలు లేవు. అతడు ద్వంద్వాలకు అతీతుడు. మనలో చూడలేని ఈశ్వరత్వాన్ని అతనిలో మనం చూడగలుగుతున్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం ఆచార్యుని సేవ చేశామంటే, ఆయన మన అజ్ఞానమనే తెరని తొలగించి, మనలో సత్యప్రతిష్ట చేయగలడు.

అందుకని పరమార్ధ ప్రయోజనం కోసం ఆచార్యుని ఇప్పుడే ఇక్కడే ఈశ్వరునిగా భావించి విధేయులమై ఆయన అనుగ్రహం చేసిన ఉపదేశానుసారం జీవితాలను నడుపుకోవాలి.

9. స్వధర్మాన్ని పాటించండి
మన పూర్వ కర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సాంప్రదాయంలో పుట్టించాడో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకుని పురుషార్ధాన్ని సాధించాలి. మన శాఖకో, జాతికో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణమైననూ పర్వాలేదు.

కర్మశేషం ఉండడం వలన జీవునికి పూర్ణత్వం అవగతమవడం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతం అసంపూర్ణమైనా, పూర్ణ కర్మ క్షయానికి అది సహాయ పడుతుంది. ఎవనికి అనన్య భక్తి ఉన్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణ చేసుకుంటున్నాడో వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్టుడు కాదు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ ఉంటుంది. "ఈ జీవితాన్ని నీవు నాకు ప్రసాదించావు. నేను నా సాంప్రదాయాచార్యుని పాదములు నమ్ముకున్నాను" అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.

మన ఆచార్యుడే ఈశ్వరుడు అన్న విశ్వాసం మనకి ఉండాలి. గురువుకి స్వాత్మార్పణ చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి అది ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటప్పుడు చెప్పే శాంతి పాఠంలో ఉంది.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తంహదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే II


"ఎవడు బ్రహ్మను పూర్వం సృష్టించాడో, వేదములను అతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధిప్రేరకుని మోక్షార్ధం శరణు చెందుతున్నాను".

ఒక సాంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్ధమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హాని కంటే అధికం. ఒక సాంప్రదాయాన్ని అనుసరించని వాడు మూర్ఖుడని శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు.

10. దేవతలే శిష్యులుగా ఉండడం
మనందరమూ సాంప్రదాయాన్ని వదలరాదు. సంప్రదాయ ఆచార్యుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువుల అడుగుజాడలలో మనం నడవాలి. మన ఆచార్యులందరూ పరమ గురుభక్తులే.

మనకు మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుడే. ఆయనకూడా ఒక గురువుని వరించి ఉపదేశం పొందవలసి వచ్చింది. ఆయన తనపుత్రుని వద్ద వినయవిధేయతలతో ప్రణవం ఉపదేశం పొందాడు.

జ్ఞాన స్వరూపమే అంబిక (అమ్మవారు). ఆమె కూడా తన భర్త ఈశ్వరుని వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు ఈశ్వరుడు ఆగమములను, తంత్రములనూ ఉపదేశించాడు. అంతేకాదు ఆమెకు క్రింది తారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే II

మూరు మార్లు రామ నామం చేస్తే అది వేయి విష్ణు నామాలు చేసినంత పుణ్యం.

ఈశ్వరుడు అంబికకి ఉపదేశించాడు అన్న విషయం ఎన్నో స్థలపురాణాలలోనూ ఉన్నది. మహావిష్ణువు రామకృష్ణాది అవతారములలో గురుకుల వాసం చేశాడు. రాముడు వశిష్ఠుని వద్ద, కృష్ణుడు సాందీపమహర్షి వద్ద గురుకుల వాసం చేశారు. కృష్ణుడు తన సహాధ్యాయి అయిన సుధామునితో వానలో, తుఫానులో వంట చెఱకు కోసం వెళ్ళాడు. చిత్రకూటంలో భరతునితో పాటు వశిష్టుడు వచ్చి రాముని తిరిగి అయోధ్యకి రమ్మని కోరినప్పుడు, ఆయన గురువు యొక్క సమ్మతితో, అయోధ్యకి మరలి వచ్చుటకు నిరాకరించాడు. ఈ నిరాకరన కూడా వినయపూర్వకముగానే చేశాడు.

గురుపరంపరలో దత్తాత్రేయస్వామికి ఒక విశిష్ట స్థానమున్నది. భాగవతంలో ఆయన తనకు 24 గురువులు ఉన్నట్లు చెప్పాడు. భూమి, నీళ్ళు, కొండచిలువ, కందిరీగ, వేశ్య, వేటగాడు, శిశువు - వీళ్లంతా ఆయనకి గురువులు అన్నాడు. ఒక్కక్కరి వద్దా ఒక్కో పాఠం తాను నేర్చుకున్నట్లు ఆయన వివరంగా చెప్పుకున్నాడు.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

---------------------------------------------
 


Inline image 1

11. ఆదిశంకరుల గురుభక్తి

'ఆచార్య' అనే పదం చెవిలో పడితే చాలు, మనకి జ్ఞాపకానికి వచ్చేది శంకరాచార్యులే. ఆయన తన గురువు గోవింద భగవత్పాదాచార్యులను, వారి గురువైన గౌడపాదాచార్యులను దక్షిణామూర్తి స్వరూపంలో చూసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నమస్కారక్రియగా వ్రాశారు. శంకరులవారే స్వయంగా దక్షిణామూర్తి అవతారము. కానీ వారు వ్రాసిన దక్షిణామూర్తి స్తోత్రంలో, ప్రతీ శ్లోకంలోనూ, "తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అన్న వాక్యం నాలుగవ పాదంలో జోడించి నమస్కరిస్తున్నారు.

తమ గురుభక్తిని ఒక శ్లోకంలో శంకరులు ఈ విధంగా వ్యక్తం చేశారు.

"ఈ మూడు లోకాలలోనూ జ్ఞానదాతయైన సద్గురువుతో పోల్చదగిన వస్తువు లేదు. వరుసవేది అయః పిండాన్ని బంగారంగా మార్చగలదు. కానీ రాతిని మరొక వరుసవేదిగా అది రూపొందించలేదు.

గురువు అనగా తనను ఆశ్రయించిన వారిని తనంతటి వానిగా చేయగలడు. అందుచేత గురువుకు సాటి ఎవరూ లేరు."

కాశీలో పరమేశ్వరుడే ఛండాల రూపంలో శంకరుల ముందు నిలిచినపుడు, "ఛండాలోస్తు సతుద్విజోస్తు గురురాత్యేషామనీషామఘ" ఆత్మజ్ఞాని ఛండాలుడైనా సరే, నాకు గురువే - ఉద్ఘాటించారు. తానే జగదాచార్యులు అయినప్పటికీ, అందరి సమక్షంలో ఈ విధంగా వినయంగా చెప్పుకున్నారు.

12. రామానుజాచార్యుల వారి గురుభక్తి
రామానుజులు తన గురువు యొక్క ఆదేశమునకు విరుద్ధంగా తనకు ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ ఉపదేశించారు. (ఆయన గురువు తిరుకోటియూర్ నంబి). కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ గురువు గారికి రామానుజులు వినమ్రుడై ఉండినారు. ఆయన గురువు ఉపదేశం ఇవ్వడానికి పూర్వము, రామానుజులను 18 మార్లు శ్రీరంగం నుండి తిరుకొట్టియూరుకు వచ్చిపొమ్మన్నారు. కానీ రామానుజులు ఏ విధమైన అనిఛ్చకానీ, అఔకర్యం కానీ గురువుకు వ్యక్తం చేయలేదు.

గురువుకు స్మార్తులు నాలుగు సార్లు సాష్ఠాంగ నమస్కారము చేస్తారు. వైష్ణవులు 'గురువు చాలు' అని చెప్పేంతవరకు నమస్కారాలు చేస్తూనే ఉంటారు. ఒకమారు తిరుకోటి నంబి నదిలో స్నానం చేస్తున్నారు. నదీతీరంలోని ఇసుక సూర్యరశ్మికి వేడిగా ఉంది. ఉష్ణం అసహనంగా ఉన్నా రామానుజులు లెక్కచేయక మండే ఇసుకలో తిరుకోటినంబికి నమస్కారాలు చేస్తూనే వున్నారట. శిష్యుని కష్టం చూసి గురువు ఇక చాలు అని నమస్కారాలు నిలిపారట.

13. శంకరుని శిష్యులు
భగవత్పాదుల శిష్యులు స్వయంగా మహాత్ములు. కానీ వారి గురుభక్తి అసమానము.  శంకరుల శిష్యులలో తోటకాచార్యులు - భవ ఏవభవాన్ - నీవు స్వయంగా భవుడవే (శివుడవే), నీవు వృషధ్వజుడివి అని తోటకాష్టకంలో స్తుతి చేశారు.

ఒకప్పుడు వ్యాసుల వారు శంకరులను పరీక్షింపదలిచి వృద్ధ వేషంలో బ్రహ్మసూత్రభాష్యంపై వాదానికి వచ్చారు. అపుడు వారి సమక్షంలో పద్మపాదాచార్యుల వారున్నారు. వారి వాదం అతి తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు - 'శంకరః శంకర స్సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం' - అని పద్మపాదులు తమ గురువును హెచ్చరించారు.

పిదప పద్మపాదులు శంకరభాష్యంపై ఒక విసృతిని రచించారు. దానిని పంచపాదిక అని అంటారు. అందులో శంకరులు వారు 'అపూర్వ శంకరులు' అని పిలిచి తమ గురుభక్తిని వెల్లడి చేశారు.

పద్మపాదుల అసలు పేరు సనందుడు. ఆయనది చోళదేశం. వారు కాశీలో ఆదిశంకరులకు 16 ఏళ్ళు నిండక ముందే శిష్యులయ్యారు. భాష్యములన్నీ అప్పటికే శంకరులు పూర్తి చేసి జీవితాన్ని చాలించాలని అనుకున్నారు. ఆ సమయంలోనే వ్యాసుల వారు శంకరులతో భాష్యసంవాదం చేసి, మెచ్చుకొని వారికి మరొక 16 ఏళ్ళు ఆయుర్దానం చేసి, 'భాష్యాలు వ్రాసినంత మాత్రాన ప్రయోజనం లేదు, పండితులతో చర్చ చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థిరీకరణ చేయడానికి, దేశమంతటా సిద్ధాంతం వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. ఆ కథ అట్లా ఉండనీయండి.

శంకరులు కాశీలో ఉన్నప్పుడు గంగలో స్నానం చేస్తున్నారు. గంగకు ఆవలి తీరంలో పద్మపాదులు ధౌతవస్ర్తాలను ఎండపెడుతున్నారు. పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటుట కొఱకు శంకరులు ఎండిన మడి బట్టలను తెమ్మన్నారు. మధ్యలో నది ఉన్నదన్న సంగతి కూడా సనందుడు మరిచిపోయాడు.

నీళ్లలో నడుస్తూ ఉంటే గంగాదేవి ఆయన మునగకుండా పాదముల క్రింద తామర పుష్పములను ప్రభవింపజేసింది. తాను నడుస్తుంటే తన పాదముల క్రింద పద్మములు విచిత్రంగా వస్తున్నవన్నదీ, శంకరులు నీవు గంగను ఎట్లా దాటావు అని అడిగేంతవరకూ ఆయనకి దేహస్ఫురణ లేదు.

మీ స్మరణ మాత్రాన ఈ సంసారార్ణవం జానుధగ్ధమౌవుతుంది. (మోకాలి లోతు) గంగను తరించడం ఒక లెక్కయా?? అని సనందనుడు బదులు చెప్పారట. అప్పటి నుంచీ వారికి పద్మపాదులన్న పేరు స్థిరమయింది. ఈశ్వరావతారమైన భగవత్పాదుల వారి శిష్యుడు పద్మపాదులవటం సమంజసంగానే ఉంది.

(సశేషం .....)

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP