శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నిన్నటి రోజు మృత్యువు ను అడ్డుకుని ముగ్గురు చిన్నారులను కాపాడిన హనుమత్ మహిమ

>> Tuesday, December 28, 2021



నిన్నటి రోజు మృత్యువు ను  అడ్డుకుని ముగ్గురు చిన్నారులను కాపాడిన  హనుమత్ మహిమ 

నేను ప్రస్తుతం  గాంధీనగర్ అనే  ఊరిలో పనిచేస్తున్నాను.  మాపాఠశాలలో  విద్యార్థులంతా  నాపూర్వ విద్యార్థుల  పిల్లలే . 
ఇక   ఎక్కడున్నా పిల్లలకు సదాచారములు, దైవభక్తి, దేశభక్తి  పెంపొందించేలా  శిక్షణ ఉంటుంది. . దానిలో భాగంగానే పాఠశాల   సమయం అనంతరం   హనుమంతుని  గూర్చి చెప్పటం  ఆయనను ఆశ్రయించటం  ,దండకం  పారాయణం చేయటం నేర్పుతున్నాను. .చిలకపలుకుల్లా  చిన్నారుల నోట  పలుకుతుంటారు.  

          ఇక ఈ రోజు  పాతహశాలకు వెళ్ళగానే  వంటావిడ ,ఆయా, పిల్లలు  చుట్టూచేరి గుండెలు జలదరించే విషయం చెప్పారు.  నిన్న సోమవారం రోజు సాయంత్రం  పిల్లలంతా ఆడుకునే సమయం,     రైతుల ట్రాక్టర్లు కాలువకట్టపై పెట్టి ఉంచారట. 
అందులో తరుణ్ రెడ్డి అనే పిల్లవాడు    [మానసికంగా  సరైన ఎదుగుదల లేదు]   వాళ్ళ నాన్నగారు ఆపి ఉం చిన ట్రాక్టర్  ఎక్కి కూర్చుని  సాయిబ్రహ్మాచారి ,భరత్ కుమార రెడ్డి  అనే  నాలుగవ తరగతి విద్యార్థులను  పిలిచి ఎక్కమని  అందరూ కూర్చున్నారు. .  హఠాత్తుగా వీడు వాళ్ళనాన్నగారు ట్రాక్టర్ తాళాలు  కవర్ లో పెట్టడం చూసాడు కనుక ఆ కవర్ జిప్ లాగి తాళాలు తీసి కీ హోల్ లో  ఉంచి తిప్పటం తో అది స్టార్ట్ అయి ముందుకు దూకింది. దాంతో పిల్లలు పెద్దగా కేకలు పెట్టారు. పిల్లలు కేకలువేయటం చూసి చుట్టుపక్కలున్నవాళ్ళంతా హాహాకారాలు చేస్తున్నారట  . అయిపోయారు ముగ్గురు పిల్లలు  అని కేకలువేస్తున్నారు. ఎడమవైపు పెద్దకాలువ  ప్రవహిస్తున్నది కాలువగట్టున  కుడివైపు  పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం స్థాపించి ఉన్నారు గ్రామంలో.  ట్రాక్టర్ కాలువలోకి వెళ్లి తిరగబడుతుందని అనుకుంటున్న సమయంలో ఆపిల్లవాని చేతిలో ఉన్న స్టీరింగ్ కుడికి తిరగటం ట్రాక్టర్ వేగంగా వెళ్లి ఆంజనేయస్వామి  దగ్గరనున్న బోరింగ్ మోటర్కు గుద్దుకొని  ఆగిపోయింది  డ్రైవింగ్ సీటులో ఉన్న తరుణ్ అంతెత్తు ఎగిరి పడ్డాడట . గ్రామస్తులు పరుగులుపెట్టి వఛ్చి చిన్నారులను దించారు. . ఈసమయంలో మిగతా ఇద్దరుపిల్లలు భయపడి  క్రిందకు      దూకితే టైర్లకింద పడి  నుజ్జునుజ్జయ్యేవారు.  ట్రాక్టర్ కొద్దిగా కాలువంచుకు చేరినా తిరగబడి ఘోరప్రమాదం జరిగి ఉండేది. నేరుగా కాలువలోకి వెళ్లినా ప్రమాదం ఊహించటానికే  భయంగా ఉంది. 

స్వామి బిడ్డలప్రాణాలు కాపాడారని గ్రామస్తులంతా  ఊపిరిపీల్చుకున్నారు. విన్న నాకు ఘోరం తలుచుకుంటేనే వణుకు పుట్టింది. స్వామి కి మనసులో పలుమారులు కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. 


అందుకే ఆశ్రితులకు వజ్రకవచమై  కాపాడే హనుమంతుని  ఆశ్రయించి ఉండండి అని పెద్దలు చెప్పేది.
 జైశ్రీరామ్ 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP