శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"భూత భృత్" అంటే చాలు.....

>> Sunday, September 8, 2019

శ్రీరామానుజచార్యుల వారి కాలంలో జరిగిన సంఘటన :

శ్రీరంగం శ్రీరంగనాథస్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు భక్తులు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టు పట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకి, అతనికి వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కిపోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆ పేద వైష్ణవుడు వాదించేవాడు.

ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు.

స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికీ సేవలు చేయడములోనే నాకు సమయం సరిపోతుంది. వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. పైగా నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యం చేయలేను. నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను అన్నాడు.

సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్.." నాకంత వరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే నీకు భూత భృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారం కొరకు రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు.

ఆ నాటి నుండి ఆ వైష్ణవుడు మరల ఆలయంలో ప్రసాదం పెట్టే ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాల భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాల ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరకి రామానుజులకి తెలియ చేసారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకురమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు.

కొంతకాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటుతుండగా ఆ పేద వైష్ణవుడు "స్వామి స్వామి" అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగం చేసి, ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది.. "స్వామీ, మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు. అందువల్ల నా పిల్లలు ఆ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను "భూతభృతే నమః" జపాన్ని చేస్తున్నాను" అన్నాడు.

ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎవరా పిల్లవాడు? వాని పేరేమి అని అడుగగా, ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడనని చెప్పాడని చెప్పాడా వైష్ణవుడు. ఇంతకీ ఆ బాలుడు ఇంకెవ్వరు, సాక్షాత్ ఆ "శ్రీరంగనాథుడే"

"భూత భృత్" నామానికి అర్థం "సమస్త జీవులని పోషించువాడు" అని అర్థం.
(సేకరణ...)

"ఓం నమో నారాయణాయ"
"ఓం నమో నారాయణాయ"
"ఓం నమో నారాయణాయ"
🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP