శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విప్లవ స్ఫూర్తిపై కుట్ర

>> Saturday, July 7, 2012

విప్లవ స్ఫూర్తిపై కుట్ర
- పడాల వీరభద్రరావు

'అల్లూరి చరిత్రలో వాస్తవాలు' (ఆంధ్రజ్యోతి, మే 20) అనే శీర్షికతో రిటైర్డ్ డిఎస్పీ బర్ల వెంకటరావు రాసిన వ్యాసం చదివాను. పోలీసు వ్యవస్థలో పనిచేయడం వల్ల ఆ వ్యవస్థ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా ఆయన వ్యాసం వుంది. ఏ అంశంపైనైనా చర్చ మంచిదే. 'విప్లవజ్యోతి' అల్లూరి శ్రీరామరాజు చరిత్రపై కూడా చర్చ జరగాలి. భారత స్వాతంత్య్ర సమరంలో బ్రిటీషు సామ్రాజ్యవాదులపై మూడు సంవత్సరాలు ప్రత్యక్ష సాయుధ పోరాటం చేసిన శ్రీరామరాజు కోట్లాది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అటువంటి మహావీరుని చరిత్రను పూర్తిగా పరిశీలించకుండా, అవగాహన లేకుండా పోలీస్ మనస్తత్వంతో పోలీస్ రికార్డులను సైతం వక్రీకరించి బర్ల వెంకటరావు రాసిన వ్యాసం మనస్తాపాన్ని కలిగించింది. ఆయన రాసిన దానికే సమాధానం చెబుతాను.

శ్రీరామరాజు తండ్రి వెంకటరామరాజు 1908లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో చనిపోయాడు. అప్పటికి రామరాజు వయసు 11 సంవత్సరాలు. తండ్రి చనిపోయిన తర్వాత రామరాజు కుటుంబం తహశీల్దారుగా పనిచేస్తున్న పినతండ్రి రామకృష్ణంరాజు సంరక్షణలోకి వెళ్ళింది. రామకృష్ణంరాజు ఉద్యోగరీత్యా ఎక్కడకు బదిలీ అయితే రామరాజు కుటుంబం కూడా వారితో పాటు మారవలసి వచ్చేది. తునికి మకాం మార్చినప్పుడు 1915లో తుని హైస్కూల్‌లో రామరాజు ఐదవ ఫారమ్‌లో చేరాడు. మరో ఆరు సంవత్సరాల తర్వాత గాని శ్రీరామరాజు మన్యంలో ప్రకాశించలేదు. 1921 తుది రోజుల్లో ఆయన మన్యంలో ప్రవేశించడం జరిగింది.

అక్కడ దోపిడీకి గురవుతున్న గిరిజనులకు అండగా నిలబడి బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడడానికి రాజు సిద్ధమయ్యాడు. గిరిజన స్త్రీ, పురుషుల హక్కుగా చెప్పే తాగుడు మాన్పించడానికి ప్రయత్నం చేశాడు. వారికి అక్షరజ్ఞానం బోధించి, చైతన్యవంతులుగా తీర్చిదిద్ది బ్రిటీషు వారిపై తిరుగుబాటుకు సమాయత్తం చేశాడు. ఆనాడు గిరిజనులు రామరాజు నివాసముండటానికి కృష్ణదేవుపేట రెండేర్ల మొగగా పిలవబడే ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ ఆశ్రమ ప్రాంతానికి 'శ్రీరామ విజయనగరం'గా నామకరణం చేశారు. ఇదంతా బ్రిటీషు ప్రభుత్వాధికారుల దృష్టికి వెళ్ళింది.

ఈ పోరాటాన్ని ఆదిలోనే అణచివేయాలనే దృష్టితో చర్యలు తీసుకోవడానికి సమాయత్తమౌతున్నట్లు తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్ ఫజులుల్లాఖాన్ తనకు సన్నిహితుడైన రామరాజు పినతండ్రి తహశీల్దార్ రామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్ళాడు. రామరాజు మీదవున్న అమితమైన ప్రేమతో ఆ చర్యలు ఏదోవిధంగా నిలుపుచేయాలని పినతండ్రి కోరడం జరిగింది. ఫజులుల్లాఖాన్‌కు కూడా రామరాజుపై ఎనలేని ప్రేమ అనురాగాలు వున్నాయి. అందువల్ల ఫజులుల్లాఖాన్ పై అధికారులతో మాట్లాడడం, రామరాజు ఉద్యమాన్ని నిలుపుచేయిస్తామని, కొంతకాలం నిఘాలో వుంచుదామని అధికార్లను ఒప్పించడం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన చర్చల్లోనే, ఉద్యమం నుంచి తప్పుకొన్నట్లయితే ఆయన వ్యవసాయం చేసుకోవడానికి అడ్డతీగల మండలం 'పైడిపుట్ట' గ్రామంలో 50 ఎకరాల పట్టా ఇవ్వడానికి రామరాజుకు ఎరగా చూపించారు. దీనికి పినతండ్రి రామకృష్ణంరాజు, ఫజులుల్లాఖాన్‌లు అంగీకరించి, రామరాజును ఒప్పించగలమన్నారు. తర్వాత పినతండ్రి రామకృష్ణంరాజు, ఫజులుల్లాఖాన్‌లు తల్లి సూర్యనారాయణమ్మ సమక్షంలో రామరాజును కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది.

తల్లి, పినతండ్రి మాట కాదనలేకపోవడం, ఫజులుల్లాఖాన్ మీద వున్న గౌరవంతో ఎదురుచెప్పలేక మౌనంతో అంగీకరించినట్లు తలూపాడు. అయితే ఆయన మదిలో వేరే ఉద్దేశం మెదిలింది. ఇక్కడనుంచే బ్రిటీషు వారి మీద యుద్ధానికి వ్యూహాలు రచించవచ్చని, తనకు వెనుకవున్న యోధులందరిని కృష్ణదేవుపేట రెండేర్ల మొగ 'శ్రీరామ విజయనగరం' వద్ద సిద్ధంగా వుండమన్నాడు. ఆయన ఒక్కడే పైడిపుట్టలో మకాం చేశాడు.

రామరాజు పైడిపుట్టలో వుండగానే పోలీస్ స్టేషన్‌లపై దాడులకు వ్యూహరచన చేసాడు. యుద్ధానికి సిద్ధమైన తర్వాత పైడిపుట్టలో బ్రిటీషు ప్రభుత్వం ఇచ్చిన 50 ఎకరాల భూమి మీద హక్కును వదిలేసుకుంటున్నట్లు 1922 జూన్ 14న దుచ్ఛర్తి ముఠాదారు చొక్కలింగం దొరకు ఒక లేఖ రాశాడు. అల్లూరి శ్రీరామరాజు సంతకంతో స్వదస్తూరీతో రాసిన లేఖ ఆధారం వుంది. రామరాజును ప్రేమించి, అభిమానించిన ఫజులుల్లాఖాన్ 1922 జూలై 27న మరణించడంతో రామరాజు బంధనాలు పూర్తిగా తెగిపోయాయి. యుద్ధభేరి మోగించాడు. పైడిపుట్ట నుంచి నడింపాలెం చేరుకున్నాడు. అక్కడ అనుచరులతో 1922 ఆగస్టు 15న సమావేశమయ్యాడు.

విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడికి సిద్ధం కావాలని పిలుపునిచ్చాడు. 19వ తేదీన మహారుద్రాభిషేకం జరిపించాడు. 1922 ఆగస్టు 22న చింతపల్లి, 23న కృష్ణదేవునిపేట, 24న రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్లపై వరుస దాడులు చేసి ఆయుధాలు సమీకరించాడు. రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌లో బందీగా వున్న లాగరాయి పితూరీ పోరాటానికి చెందిన వీరయ్య దొరను విడిపించుకుపోయారు. తరువాత ఆయన రామరాజు పోరాటానికి సహకరించాడు. పోలీస్‌స్టేషన్‌పై దాడులు చేసిన సందర్భాల్లో రికార్డులో ఆయుధాలు ఎన్ని పట్టుకు వెళుతున్నారో అదే క్లుప్తంగా రాయడం జరిగింది. ఇక్కడ బ్రిటీషు వారు దేశం విడిచి పోవాలని, దేశానికి స్వాతంత్య్రం కావాలని అవకాశం వున్నా రాయలేదనడం అర్థరహితం.

ఈ దాడులు తాత్కాలికంగా కొంతకాలం ఆగినా, మళ్ళీ అక్టోబర్ 15న అడ్డతీగెల, 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్‌లపై దాడులు చేశారు. తిరిగి 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి చేసాడు. ఈ సందర్భంగా అక్కడ రామరాజును ఆంధ్ర పత్రిక విలేఖరి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది 21వ తేదీన ప్రచురించబడింది. ఈ ఇంటర్వ్యూ అల్లూరి చరిత్రకు ఆధారంగా, ప్రత్యక్ష సాక్ష్యంగా వుంది. దానిలో రామరాజు, మల్లుదొర ఆకారం ఎలావున్నది వివరించడం జరిగింది. రామరాజు కాకి నిక్కరు, ఖద్దరు చొక్కా ధరించివున్నట్లు, 5 అడుగుల 4 అంగుళాలు ఎత్తు, బక్కబలచగా అందంగా వున్నట్లు వర్ణించాడు.

అది వాస్తవం. అయితే ఆయన స్నానమాచరించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు అంగస్త్రం కట్టుకునేవాడు. ఆయన పరమేశ్వర భక్తుడు, దేవీ ఉపాసకుడు కావడం వల్ల స్నానమాచరించిన తర్వాత అంగస్త్రంతో నేరుగా దేవి విగ్రహం వద్దకు వెళ్ళి పూజలు చేసే సమయంలో నుదుట నిలువుగా కుంకుమ బొట్టునుపెట్టుకోవడం జరిగేది. దీన్ని చరిత్రకారులు, చిత్రకారులు మెరుగులు దిద్ది అంగస్త్రానికి కాషాయ రంగు వేయడం, రామరాజు విల్లంబులు వాడిన ఆధారాలు వుండడంతో వాటిని ధరించినట్లు రూపొందించిన చిత్రం వాడుకలోకి వచ్చింది. ఆ చిహ్నమే విగ్రహాల రూపంలో అందరూ ఏర్పాటు చేసుకుంటున్నారు.

రిటైర్డ్ డిఎస్పీ బర్ల వెంకటరావు పనిచేసిన రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్ ఆవరణలో పోలీసులే రామరాజు విగ్రహాన్ని ఇదే రూపంలో ఏర్పాటుచేసి ఆరాధిస్తున్నారు. ప్రాచుర్యం పొందాక మనం కాదన్నా ఆ మహావీరుని మీద వున్న భక్తితో ఆ విధంగానే ఆచరిస్తున్నారు. అల్లూరి పోరాటాన్ని అణచివేయడానికి ఒక పక్క బ్రిటీషు వారు ప్రయత్నిస్తుంటే మరో పక్క మనవారూ అందుకు పూనుకోవడం దురదృష్టకరం. ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు టంగుటూరి ప్రకాశం పంతులు రామరాజు పోలీస్ స్టేషన్‌లపై వరుస దాడులు సల్పిన తర్వాత 'రామరాజు'ను 'బందిపోటు దొంగ'గా అభివర్ణించారు. కాంగ్రెస్‌కు సంబంధించిన వారు ఎవరు ఆయన వద్దకు పోగూడదని, ఆయన ఉద్యమానికి సహకరించకూడదని కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రకాశం పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.

కాకినాడ, పిఠాపురం మహారాజా హైస్కూల్‌లో చదువుకున్న ఆయన సహచరుడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య విభేదించాడు. స్వాతంత్య్రం పోరాటం అహింసాయుతంగా, విప్లవ పంథాలలో సాగుతున్నాయని, రెండు పంథాలను సమర్థించవలసి వుందని, అటువంటిది రామరాజును బందిపోటుగా చిత్రీకరించడం సరైంది కాదని నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు ప్రకాశంపంతులు వద్ద మద్దూరు అన్నపూర్ణయ్య అనడం జరిగింది. ఆనాడు ప్రకాశం పంతులు అన్న 'బందిపోటు దొంగ' పదానికే బ్రిటీషు వారు కూడా వంతపాడారు. రామరాజును వారు బందిపోటు, దోపిడీ దొంగగా అభివర్ణించారు నీచులు. ఆనాడే కాదు నేడూ ఆ విప్లవవీరుని అంతర్గతంగా వ్యతిరేకించేవారు వుండడం విశేషం. అందుకు సాక్ష్యం రిటైర్డ్ డిఎస్సీ బర్ల వెంకటరావు.

- పడాల వీరభద్రరావు
అల్లూరి చరిత్ర పరిశోధకులు
(july 4  సీతారామరాజు జయంతి) 

from andhrajyothy.daily

1 వ్యాఖ్యలు:

voleti July 7, 2012 at 5:43 AM  

ఏనుగు వెనకాల కుక్కలు మొరిగినట్లు మొరిగే కుక్కల గురించి మనం పట్టించు కోనక్కరలేదు.. అల్లూరి పేరు చెపితేనే రోమాలు నిక్క బొడుచుకునే మన లాంటి అభిమానులైన తెలుగు వారు వున్నంత కాలం ఆ మహానుభావుడి మీద ఎవరెన్ని కూతలు కూసినా సముద్రంలో అది కాకిరెట్ట..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP