శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జయజయ దుర్గే .[నవరాత్రి నివేదన]

>> Tuesday, September 29, 2009




అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి అద్భుత వైభవం మైన నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి . భక్తజనుల అర్చనతో శోభిల్లిన ఆతల్లి దివ్యపాదాలను దర్శించి జన్మ ధన్యమైనది.

తొమ్మిది రోజులు నానావిధ అర్చనారీతులలో తన భక్తులు సమర్పిస్తున్న నివేదనలను స్వీకరించి భక్త జనులకరుణించినది అమ్మ.

శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో పాఢ్యమినాటినుండి జరిగిన పూజలలో గోత్రనామాలు పంపిన వారందరి తరపున పూజలలో సంకల్పములు చెప్పబడి నివేదనలు జరిగాయి. ముఖ్యముగా అష్టమి రోజున అమ్మవారికి జరిగిన జన్మదిన ఉత్సవం లో సాయంకాల పూజలలలో గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున పేరు పేరున హారతులు సమర్పించబడ్దాయి . మహర్ణవమి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు హోమాదులను నిర్వహించటం జరిగినది.
ఈసందర్భంగా ఈ కార్యక్రమాలకు ,ఉత్సవాలలో కొన్నిసేవలకు తమ సహాయాన్నందించిన చిరంజీవి పెండేల వెంకట సూర్యనారాయణ,మధురవాణి ,లక్ష్మీనారాయణసునీల్ వైద్యభూషణ్ లకు ఆర్. ఎన్ .వి.రవి,శంకరరావుగార్లకు పీఠసేవానిర్వహణలో సహాయమందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము . ఈసేవాకార్యక్రమములను మాకుప్రసాదించిన ఆతల్లికి మరొకమారి ప్రణతులు సమర్పించుకుంటున్నాము . అలాగే ఈ కార్యక్రమాలకు తమగోత్రనామాలు పంపిన భక్తజనులందరికీ కూడా ధన్యవాదములు .




Read more...

రేపు మా చిన్నారి పుట్టిన రోజట ఆశీర్వాదాలందుకుందురుగాని రారండి

>> Friday, September 25, 2009

ఏమిటిది ? చిన్నారి అంటున్నారు ,ఆశీర్వాదాలు అందుకొన రమ్మంటున్నారు అని ఆశ్చర్య పడకండి . ఆతల్లి పసిబిడ్డలా భక్తుల ఒడిలో ఆటలాడగలదు. అమ్మలా అదరించి ఆర్తి బాపగలదు కనుకనే అన్నిటికీ మూలమైన ఆది తత్వాన్ని శ్రీపీఠము లో చిన్నారి బాలికా భావం తో సేవిస్తుంటాము . కనుకనే అలిగి అల్లరి చేసి ఆటలాడుతూ తన భక్త పరాధీనతను నిరూపించుకుంటున్నదిక్కడ . రేపు ఆజగజ్జనని జగాలరక్షణ కోసం అవతరిచిన పుణ్యదినం. దుర్గాష్టమి. ఈ సందర్భంగా
ఇక్కడ అమ్మకు విశేషంగా పూజలు జరుపబడతాయి . మరీ స్వార్ధం తో మాట్లాడుతున్నాను గానీ ఆవిడ మాకే కాదు, మీకందరకూ కూడా చిన్నారే . మరి మన బుజ్జితల్లికి రేపు పొద్దున జరుపబోయే సేవలన్నింటిలో మీ గోత్రనామాలు పంపితే మీతరపున నివేదించుట జరుగుతుంది. ఇప్పటికే గోత్రనామాలను నవరాత్రి వుత్సవాలకొరకు పంపినవారు మరలా పంపవల్సిన అవసరం లేదు . ఇప్పటివరకు పంపనివారు వెంటనే పంపండి . అమ్మకు తెల్లవారు ఝామున సుప్రభాతం మొదలయ్యేసమయానికి ,మరలా తొమ్మిది గంటలకు సాయంత్రం నాలుగుగంతలకు మెయిల్ చూసి పూజవద్దకు గోత్రనామాలు అందజేస్తారు మాపిల్లలు . అప్పటి లోగా పంపిన గోత్రనామాల తో ఆయా సేవాకార్యక్రమాలలో మీతరపున కూడా అమ్మకు సేవ జరుపబడుతుంది .. జై భవానీ

Read more...

అలిగిన వేళనే చూడాలి ...........అందులో అర్ధం ఈరోజు తెలిసినది

>> Thursday, September 24, 2009




ఈరోజు స్వామి వారి అలకమోము చూడాలి ..ఎంతందం ??? ఎంతందం ?
అసలే ..." పుంసామోహనరూపాయ " అనికీర్తించబడే స్వామి మోము లో అలక ఛాయలు అలరారుతూ వుండగా ఏమందమేమందము ? స్వామివారిది.

అసలేంజరిగినదంటే . ఈరోజు వేకువనే సుప్రభాత సేవ జరిగినతరువాత రోజుకు మల్లే బాలభోగం లో అమ్మ వారికి క్షీరం నివేదన చేస్తున్నాను .కొద్దిగా పక్కకు తిరిగి చూతును కదా ! చిన్న పిల్లవాడు ఎవరో బుంగమూతి పెట్టుకుని , మరి ..నాకో ... అని అలుగుతూ అడిగినట్లనిపించినది . కానీ ఇప్పుడు శరన్నవరాత్రులు కదా ప్రధానంగా దుర్గకు నివేదనం చేస్తే చాల్లే అని సర్దిపుచ్చుకుని దుర్గామాతకు ,రాధాదేవికి మాత్రమే క్షీర నివేదనం గావించాను.

ఇక అభిషేకములు ప్రారంభమయ్యాయి . వినుకొండనుంచి భక్తులు సూరి అతని స్నేహితులు వచ్చారు . అభిషేకానంతరం శ్రీవారికి అర్చన చేస్తున్నాను .స్వామి కి అలంకరిస్తున్న మందార పూలు ఒక పక్క అమరుస్తుంటే మరొకపక్కవి ఎగిరి వచ్చి కింద పడుతున్నాయి . స్వామి వారిముందు నుంచుని తిలకిస్తున్న సూరి వాళ్లు అన్నా!పూలు క్రింద పడుతున్నాయి అని అంటున్నారు . అప్పుడు అర్ధమైనది ఇవి ఎగిరి పడటం కాదు ,స్వామి వారే పీకి విసిరి కొడుతున్నారు అని. అవునయ్యా ! స్వామి వారు ఈరోజు అలిగారు అని చెప్పాను . అందుకనా ? ఎప్పుడు ముసుముసి గానవ్వుతూ కనిపించే స్వామి మొహం లో ఏదో తేడా గా వున్నది .అని వాల్లన్నాక నేను పరీక్షగా స్వామి మోములోకి చూస్తే ... నిజమే ..అయన బుంగమూతి పెట్టినట్లుగా వున్నది.
లెంపలు వేసుకుని . సూరీ ! ఉదయం అమ్మవారికి పాలు సమర్పిస్తూ స్వామి వారిని నిర్లక్ష్యం చేసాను .అలిగాడు అని చెప్పాను . మరలా మనసులో దాసుని తప్పులు దండముతోసరి స్వామీ ! ఇలా అలిగితే ఎలా ? రేపన్నుంచి చూడు ముందుగా నీకే పాలను నివేదన చేస్తాను . లేకుంటే అప్పుడు చూడు అని క్షమాపణలు చెప్పుకుని మరలాపూలు లంకరించి చూద్దును గదా .కిలకిల లాడుతున్నాడు కోనేటి రాయడు . దొంగా .... అనుకుని ,బయటవారితో ఇప్పుడు చూడండి అని అన్నాను. వాల్లు అన్నయ్యా ! స్వామి ఇప్పుడు నవ్వుతూ వున్నట్లుగా కనపడతున్నాడు అని చెప్పుకుని ఆనందం తో పూజలో పాల్గొన్నారు.

నిజమే ! అలగినవేలనే చూడాలీ .. గోకుల కృష్ణుని అందాలూ ..... అని ఓ కవి వ్రాసిన పాటను చాలా సార్లు విన్నానుగానీ ఆయన ఏ అనుభూతినిపొంది ఆపాట వ్రాసాడో ఇప్పుడు అర్ధమవుతున్నది.



Read more...

తాబేలు గురువుగారు

>> Monday, September 21, 2009




ఓవృద్దుడుండేవాడు .గంగాతీరం లో అతని బస. ఓచిన్న గుడెసె వేసుకున్నాడు .ఓ కొయ్యపలక ,నీటితో నిండిన ఓకుండ మాత్రమే వున్నాయి అందులో . ఆయన ఒక తాబేలును పెంచుతున్నాడు. దగ్గరలోవున్న బస్తీకి రొట్టెలకోసం వెళ్ళినప్పుడు కాసిని శనగలుకూడా యాచించి తెచ్చుకుని వాటిని నానబెట్టి తాబేలుకుతినిపించేవాడు.

ఒకరోజు ఆవృద్దుని దగ్గరకు ఒకడొచ్చాడు. మీరు అధమ జీవిని పెంచుతున్నారెందుకు ?దీనిని గంగలో పారవెయ్యండి అన్నాడు.

అందుకు ఆముసలిబాబా విసుక్కుని .... నువ్వు నా గురు బాబా ను అవమానిస్తావా ? చూస్తున్నావుకదా .అల్పమైన శబ్దాన్ని ఆలకించి ఎవరిస్పర్శనైనా పొందినా తన సర్వాంగాలను తన లోపలకు సంకుచితము చేసుకుని స్థిరంగా ఉండిపోతున్నదో ? దీనిని నువ్వు ఎంతకదిపినా ,కుదిపినా ,ఊపినా ఇది తన ఒక్క కాలును కూడా కదపదే !

" అంతమాత్రం చే ఏమయిందయ్యా ? ఏమిటి లాభం " ప్రశ్నించాడతను.

ఎందుకు కాలేదు ? మానవుడు కూడా దీనిలాగానే సావధానుడై వుండాలి .లోభ మోహాలలో కానీ ,జనసముదాయము లో జరిగే కోలాహలాదులలోకానీ కనులు మూసుకుని "రామరామ " అనాలి.

యదార్ధమేమిటంటే ఈ ముసలాయనకూడా ఎవరినైనా చూస్తే తన గుడెసెలోకి వెళ్ళి బిగ్గరగా రామ్ రామ్ అని జపిస్తూవుంటాడు. పిలిచినా పలకకుండావుండిపోతాడు.ఆయన ఎందుకు మాట్లాడడో ఎవరికీ అర్ధం కాదు.

తాతగారూ ! మీరేమైనా చెప్పండి .ఎన్నిచెప్పండి గాక ఈతాబేలు మాత్రం అసహ్యం గావుంది . అన్నాడు మరలా ఆవచ్చినవాడు

:అయితే పోయేదేముంది ? మనకు పరమ లాభం లభించేప్పుడు అధములతో కూడా స్నేహం చేయాలి " అంటూ ఆవృధ్దుడు తాబేలును అరచేతిలోకి తీసుకుని నిమరసాగాడు.....

Read more...

యాదేవీ సర్వభూతేషు ..............

>> Wednesday, September 16, 2009




యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్థస్యై నమస్థస్యై నమస్థస్యై నమో నమః

భావం:
దుర్గా మాత ఈ విశ్వానికే మాత. ఆమె అందరిలోనూ, అన్ని చోట్లా ఎప్పుడూ ఉంటుంది. శక్తి, ముక్తికి ఆమె మూలం. శాంతి, శక్తి స్వరూపిణిగా వెలసిన ఓ అమ్మా నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

Read more...

నవరాత్రిపూజలకు రారండి ...గోత్రనామాలు పంపండి

>> Saturday, September 12, 2009



శ్రీదుర్గాశరన్నవరాత్ర మహోత్సవములు.

శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం, రవ్వవరం, నూజండ్ల మండలం, గుంటూరు జిల్లా


19-9-2009 శనివారం నుండి 28-9-2009 సోమవారం వరకు


Your browser may not support display of this image. 19-9-2009 - శనివారం : మహాగణపతి పూజ, కలశస్థాపన, అభిషేకాదుల పూజలు ప్రారంభము.

ప్రతిరోజు కార్యక్రమములు :

  • ఉదయం 5 గంటలకు సుప్రభాతం సంధ్యాహారతి .బాలభోగం
  • ఉదయం 5-30 గంటలకు పీఠములో పరివారదేవతలైన గణేశ , దత్త,కుమార, అయ్యప్ప, హనుమత్ స్వాములకు పూజ , నవగ్రహపూజ
  • ఉదయం 6- 00 గంటల నుండి పీఠములో నెలకొన్న శ్రీవేంకటేశ్వర, రామలింగేశ్వర సమేతముగా దుర్గామహాదేవికి శ్రీసూక్త ,పురుష,రుద్రసూక్తములతో అభిషేకములు.
    శ్రీచక్రార్చన ,కుంకుమ పూజలు లలితాసహస్రనామార్చన, సప్తశతీపారాయణం, హోమము
    గోత్రనామాదులు పంపిన భక్తజనులతరపున ప్రత్యేక పూజ
  • మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాదనివేదన మధ్యాహ్నసంధ్య హారతి
  • సాయంత్రం 5.30 గంటలకు సంధ్యహారతి సాయంకాలార్చనలు
  • సాయంత్రం 6-30 గంటల నుండి అమ్మవారికి అత్యంతప్రీతిపాత్రమైన సామగానసేవ, భజనలు
  • రాత్రి 9-30 గంటలకు డోలోత్సవం, పవళింపుసేవ

27-9-2009 న పీఠసాంప్రదాయానుసారం మహర్నవమి ఉత్సవం ,విశేషపూజలు ,

అన్నదానం


28-9-2009 పూర్ణాహుతి


ఈ కార్యక్రమములలో పూజకొరకు గోత్రనామాలు పంపినవారందరి తరపున అమ్మవారికి సేవలు జరుపబడతాయి .

శ్రీమాత సంకల్పానుసారంగా నిర్వహించబడుతున్నా ఈసిద్దపీఠములో జరుగుతున్న ఉత్సవాలకు భక్తజనులందరికీ ఆత్మీయాహ్వానం పలుకుతున్నాము.

సంప్రదించవలసిన చిరునామా durgeswara@gmail.com Ph : 9948235641,08646-211717

చూడండి www.durgeswara.blogspot.com

భక్తజనపాదదాసుడు దుర్గేశ్వర,

ప్రధానసేవకుడు, శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠం

________________________________________________________________________



Read more...

ఇదీ విషయం [ఆదాం హవ్వలకొడుకుకు వివాహం గూర్చి]

>> Friday, September 11, 2009

[మొదటిభాగం తరువాత]

నేను ఆపాస్తర్లకువివరణ ఇచ్చాను .

క్రీస్తు తదనంతరం వందలసంవ్త్సరాల తరువాత బైబిల్ రచనమొదలయినది .అది ఇప్పటి కి నాలుగువందలసార్లకు పైగా సవరించి వ్రాయబడుతూ వున్నదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆమార్గం లో సాధన చేసిన ద్రష్టలు లేదా పవిత్రమగ్రంథాన్ని వ్రాసిన ఋషులనవచ్చు. వారు వారితోపాటు మరికొందరు ఈ రచనలో పాల్పంచుకుని వున్నారు. అయితే సృష్టి ఆవిర్భవించినదని ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతున్నకాలానికి ,బైబిల్ రచయితలు సూచించిన కాలానికి పొంతన కుదరటం లేదు . అది మన వేదాలలో చెప్పబడిన కాల ప్రమాణాలతోమాత్రమే సరిపోతున్నది. కాబట్టి ఈరచనలోపాలుపంచుకున్న మహానభావులు ఆదాము హవ్వల కాలంనుంచి మాత్రమే భూమిపైన జీవరాసి ఉద్భవాన్ని చెప్పగలిగారు .అందువలన సృష్టి ఇక్కడనుండి మాత్రమే ఉన్నదని చెప్పబడుతూ వస్తున్నది ఈగ్రంథములో . ఒకవేల ఆమహర్షులు కాక మధ్యలో సామ్రాజ్యవిస్తరణ ధ్యేయంగపనచెసినవారితో ఈ సృష్టి రచనావిధానం పరిశ్కరింపబడినదేమో తెలియదు మనకు. అందువలననే అక్కడ కొద్దిగా గందరగోళం నెలకొని వున్నది.

ఐతే మనం ఇటునుంచి చూద్దాము. ఆదాము హవ్వల కు ముందే సృష్టి ఉన్నది ,నాగరికతలు దేశాలు ఆన్నీ వున్నాయి . కలి పురుషుని కోరిక మేరకు సృష్టించబడిన ఆదాము హవ్వలతో ప్రారంభమయిన కాలాన్నే సృష్టి ప్రారంభకాలంగా భావించరాదు. అందుకు ఈవివరణ వినండి.

ద్వాపర యుగానంతరం తన ధర్మాన్ని కలిపురుషుడు భూమ్మీద విస్తరింపజేయవలసి వున్నది . తగవు,ద్వేషం ,వ్యభిచారాది దుర్గుణాలు, మలినం,అనాచారాలు అతని ధర్మాలు .కలహమంటే ప్రియం అతనికి. చాలాకాలం ప్రపంచం
లో తన ధర్మాన్ని విస్తరింపజేయలేక అతను దు:ఖితుడై పోయాడు. ఎక్కద చూసినా వేదమంత్రాలు యజ్ఞాలూ తపస్సులు నడుస్తుంటే అడుగుపెట్టలేక భగవంతుడైన శ్రీహరిని ఇలా ప్రార్ధిస్తాడు.
దేవా! ఎక్కదచూసినా ధర్మం అగ్నిహోత్రం వలే ప్రజ్వరిల్లుతంటే నాయుగాన నాప్రభావం ఎలా వ్యాపిస్తుంది? మీరే ఈధర్మాన్ని స్థాపించారు , మీఅనుగ్రహం లేకుండా నాకు కాలు పెట్టే అవకాశం లేదు. ఇంతకంటే కలియుగం తీసివేసి నాకు సెలవిప్పించండి అని దీనంగా వేడుకుంటాడు. అప్పుడు భగవానుడు "కలి" కి పశ్చిమ సముద్రములో ఓ ద్వీపం చూపించి అక్కడ మ్లేచ్చ జాతికి మూలపురుషుడైన ఆదముడు,హవ్యవతి అనే స్త్రీ పురుషులను ఒక సుందరవనం లో సృష్టించి ఒక సుందరమైన వనం లో వుంచి వారిలో నీధర్మాన్ని ప్రవేశపెట్టి వ్యాపింపజేసుకోమని ఆనతిస్తాడు.
అలాభగంతుని అనుగ్రహం తో పవిత్రంఘా జీవిస్తున్న ఆతోబుట్టువులకు కలి [ సైతాన్] సర్పరూపం లో వెళ్ళి జ్ఞానఫలం అనే కామాన్ని ప్రేరేపించి తద్వారా అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోధ్భలం చేస్తాడు. ఫలితంగా భగవదనుగ్రహం కోల్పోయి పతితులై దివ్యశక్తులు కోల్పోయి [ఫాల్ అఫ్ మాన్ అండ్ పారడైజ్ లాస్ట్] జీవించే ఈ జంటనుండి కలిధర్మానికి మూలైన మ్లేచ్చజాతి ఉద్భవించింది . అందులోంచే ఒకశాఖ క్రీశ్టియన్,ముస్లిమ్ ,యూదు శాఖలు ఏర్పడ్దాయి. ఈవిధమైన పాపం తో పుట్టిన జాతిని బైబిల్ లోకూడా [ఒరిజనల్ సిం] వున్న సంతతిగా క్రీస్తుకూడా వర్ణించాడు , ఈ చెడు ఖర్మను అనుభవైంచదానికే క్రీస్తు శిలువనెక్కవలసి వచ్చినది.
అలా .... ఆదాము హవ్వల సంతానం ప్రారంభానికి పూర్వమే సృష్టి వికసించివున్నది . ఈవివరణ అంతా వేదవ్యాసులవారు వ్రాసిన భవిష్యపురాణం లో వర్ణించబడివున్నది. ఇలా పశ్చిమ ద్వీపం లో ఆరంభింపబడిన మ్లేచ్చధర్మము ప్రపంచమంతా వ్యాపించి ఇప్పుడు మనభాషలో పాశ్చాత్య నాగరికత అనబడే కలియుగ ధర్మానికి మూలమైనది అని భవిష్యపురాణం ఆశ్చర్యకరమైన రీతిలో వర్ణిస్తున్నది. రాబోయే యుగసంధి చివరలో జరగబోయే మహాయుధ్ధము [ఆర్మ్ ఆఫ్ గెడ్దాన్ ] శ్రీహరి కల్కావతారం గా శ్వేతాశ్వము మీద ఖడ్గధారియై ఆకాశమునుంచి వచ్చి :కలి : ధర్మాన్ని ఎలా నాశనం చేయబడుతుందో భవిష్యపురాణమేగాక ,బైబిల్ ,ఖురాన్ లాలో కూడా అవిధ్యానం లో దర్శించిన ద్రష్టలు వ్రాశారు. [దురదృష్ట వశాత్తూ మన అసలు భవిష్యపురాణం బ్రిటన్ లోని మ్యూజియం లో తాళపత్రాలలో వున్నది. బ్రిటీష్ చరిత్రకారుల చే మార్పులు చేర్పులు జరుపబడినది మనకు మారెట్ లో వున్నది. అసలు ప్రతిని డా . వేదవ్యాస లాంటి మహానుభావులు చాలాశ్రమకోర్చి చదివి వాటిలో రహస్యాలు ్ వెల్లడించారు.


నేను ఈ వివరణ ఇస్తుండగానే నరసరావు పేట స్టేషన్ రావటం తో నేను దిగాను .

భవిష్యపురాణం లో వున్న యుగరహస్యాలు మరికొన్ని తీరిక దొరికాక మీముందు వుంచుతాను మరికొన్ని పోస్ట్ లలో .

ఇదీ విషయం [ఆదాం హవ్వలకొడుకుకు వివాహం గూర్చి]




ఇక

Read more...

సృష్టిలో మొదటి మానవుల కొడుక్కి పెళ్ళామెలా దొరికింది ?

>> Wednesday, September 9, 2009

ఆమధ్య నేను నరసారావుపేట వెళ్లాలని వినుకొండలో రైలెక్కాను. నేను కూర్చున్న సీటు పక్కనే ఒక పెద్దాయన ఆయనకు ఎదురుగా ఇద్దరు కుర్రపాస్టర్ లు కూర్చుని వున్నారు. వారి భుజాన సంచీ తెలుపు గుడ్డలు,చేతిలో బైబిల్ మనగ్రామాలలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న వేషధారణేకనుక సులభంగనే గుర్తుపట్టాను. వారు మాట్లాడుకుంటున్న దానిని బట్టి ఆయన ఈమధ్య కొత్తగా మతం మారిన వ్యక్తని వాల్లు ఆయనను గుంటూరు లో జరుగుతున్న స్వస్థతకూటములకు తీసుకు వెళుతున్నారని.
ఆయనే నన్ను అడిగాడు మీరెక్కడికి అని . నేను చెప్పాను . ఆయన తనగూర్చి చెప్పుకున్నాడు ఇలా " నేను నీలగంగవరం గ్రామానికి చెందినవాడిని ,స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేసి రిటైర్డ అయ్యాను. ఈమధ్య నేను బైబిల్ చదవటం మొదలెట్టాను .అప్పుడప్పుడొ రామాయణ భారతాలను చదివానుగాని ,ఈబైబిల్ చదువుతుంటే చాలా ప్రశాంతంగా వున్నట్లనిపిస్తుంది . ఇలా ఆయన చెబుతున్నాడు ఎదురుగా వున్న కుర్రపాస్టర్లు సంతోషం తో మరిన్ని వివరాలు చెబుతున్నారు.హిందూమతం లో లేని విశేషత ,బైబిల్ చదవటం వలన మారుమనసుకలిగి లభించే ఆనందము ఏదో వారి గ్రంథాలగూర్చి మతం గూర్చి మహిమలగూర్చి చెప్పుకుంటున్నారు . నేను మౌనంగా గమనిస్తున్నాను. ఉన్నట్లుండి మాస్టర్ గారు ఓ బాణం వదిలారు .

’ అంతా బాగుందిగాని . బైబిల్ చదువుతున్నప్పుడు నాకుకలిగిన ఒక అనుమానం నన్ను గందరగోళపరుస్తున్నది"
ఏమిటది? అడిగారు పాస్టర్ లు.
’ మనగ్రంథం లో భూమి ఏర్ప్పడ్డాక సృష్టించబడిన మొదటి మానవులు ఆదాం ,హవ్వ లుకదా?
"అవును " సందేహమేముంది.
"అంతకుమునుపు భూమి మీద ఏమానవుడూ లేడని కదా అర్ధం ?"

"అవును నిస్సంశయంగా అదే , అదేమనపవిత్రబైబిల్ చెబుతున్నది. అదే సత్యం .మానవులంతా వారి సంతానమే "

"ఆదాం హవ్వలకు ఇద్దరుకుమారులు ,కయీను .హేబేలు . వారిలో ్కయీను ఈర్ష్యాపరుడై హేబేలును చంపాడు కదా. ఆతరువాత దైవం కోపించి అతనిని అక్కడనుండి వెళ్లగొట్టగా తూర్పుగా ఏథెను దేశం లో నోదు నగరం లో నివాసముండి అక్కడ వివాహమాడినట్లు వున్నదికదా ?"

అవును.

అరి ఆదాం హవ్వల మొదటీసంతానము వీల్లు కనుక భూమి మీద ఉన్న మొదటి నలుగురు మానవులలో ఒకరు చంపబడ్దారు. కనుక మిగిలినది ముగ్గురు. అలాగయితే ఇతనికి వేరే చోట వివాహమాడటానికి పిల్ల ఎలదొరికినది . అసలు వేరేదేశము ,నగరము ఉన్నాయనుకుంటే అక్కడ మనుషులున్నట్లేకదా ? మరి లాంటప్పుడు మొదటిమానవులు ఆదాం హవ్వలని ఎలా చెప్పవచ్చు ?

అంతే పిడుగుపాటువంటి ఈప్రశ్న వినగానే మన కుర్రపాస్టర్లు పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టు గిలగిలలాడారు.

గుంటూరు లో పెద్ద ఫాదర్ గారున్నారు ఆయన చెబుతారు అని నీళ్ళునములుతున్నారు.


నెను చాలాసేపుచూసి నవ్వు ఆపుకోలేక నవ్వి ,అందులో అబద్దాన్ని మాత్రమే మీరు తెలుసుకున్నారు ,నిజాన్ని నేను చెబుతాను మతద్వేషం తోకాక విజ్ఞానం తో ఆలోచిస్తానంటె అని చెప్పాను .
నేనేమి ప్రమాణాలు చూపించి సమాధానం చెప్పివుంటానో వూహించండి ,[రేపు మరొక పోస్ట్ లో చెబుతాను వాస్తవాన్ని]






Read more...

ముప్పుముంచుకొచ్చె...ధూమకేతువుపొంచివుండె.. మత్తువదిలి మహాశక్తిని ప్రార్ధించండి

>> Monday, September 7, 2009

ఆక్రమణకు సిద్ధమవుతున్నధూమకేతువు [చైనా]

[పొంచివున్న పాక్ ముష్కరమూకలు]
దేశానికి మరో విపత్తుపొంచివున్నది . ధూమకేతువు ఈధరిత్రిపై నెత్తురుపారించలని కుయుక్తులు పన్నుతున్నది.
ఈదేశరక్షణ కోసం ప్రతి వారూ శత్రుగర్వ విమర్ధిని .రాక్షససంహారిణి మహిషాసురమర్ధిని అగు ఆజగన్మాతను శరన్నవరాత్రులలొ ఆరాధించి ఆతల్లి కరుణ కలిగేలా ప్రార్ధించాలి.

మీరు ప్రామాణికమైన పంచాంగాలన్నీ పరిశీలించి చూడండి . ఈ విరోధినామ సంవత్సరాన జరగనున్న పెనుముప్పులను సూచించాయి . ప్రమాదాలు ,విరోధాలు ,నాయకుల మరణాలు అంతేగాక దుర్మార్గులైన శత్రువులవలన యుద్దభయం కూడా సూచన చేసి వున్నాయి . దానికి ప్రమాణముగా చైనా దురాగతాలు మొదలయ్యాయి . మొన్న రెండు హెలీకాప్టర్ లు మన గగనతలం లోకి రావటమేగాక నిన్న సరిహద్దు దాటి మన భూభాగం లో వచ్చి చైనా అని వ్రాసిన సంఘటనల్ను తేలికగా తీసుకోరాదు. ఓపక్క పెద్దమామ అమెరికా సహాయం తో ఆయుధసంపత్తిని సమకూర్చుకుని మరోవైపున ముష్కరమూకలు పొంచివున్నాయి. ఈసమయం లో దుర్మార్గులు తెగబడుతూ వుంటే వీరపుత్రులైన మన సైన్యం తమప్రాణాలను తృణప్రాయంగా ఎంచి శతృమూకలను తరిమి కొట్టడానికి సిద్దమవుతారు.ప్రాణం పోయినా వెనుకకు తిరగరు. వారి గూర్చి వారిశక్తిగూర్చి అనుమానం లేదు . కానీ అత్యాధునిక ఆయుధసంపత్తి రీత్యా చూసి వాస్తవాన్ని గమనిస్తే ఇరువైపులా ఒకేసారి దాడిజరిగితే అది మహాప్రమాదము ఒప్పుకొనకతప్పదు ,. ప్రపంచం రేపు పెద్దరికానికి ఒప్పుకున్నా వాడుచెప్పేది వీల్లవైపునే గాని మనవైపున కాదు. బలవంతుడే నిజాయితీపరుడు ఈ కలికాలం లో .
అందుకోసమే శత్రువును నిర్జించాలంటే మనకు భౌతిక శక్తి మాత్రమే చాలదు. దైవసహాయం కావాలి .అందుకోసము దేశం శక్తివంతము కావాలని ,శత్రుదుర్భేధ్యమై , శత్రుజనమారకమై సంపన్నం కావాలని కోరుతూ ఆమహాశక్తిని ఆరాధించాలి. శరన్నవరాత్రులు ఆతల్లికి ప్రీతిపాత్రమైన సమయము . కనుక జనులందరూ ఆతల్లిని వేడుకోవాలని ప్రార్ధిస్తున్నాము. శ్రీవెంకటేశ్వర జగన్మాత పీఠము లో భక్తులు ఈదిశగా సాధనలను ప్రారంభించనున్నారు.మీరంతా ఆసంకల్పానికి మీమనోశక్తులతో తోడ్పాటు నివ్వాలని మనవి.

ఏం ? మనమేనా మిగతా శత్రుదేశాలాలో వారు చేసే ప్రారధనలు భగవంతుడు తోడ్పాటునివ్వడా అంటారేమో . భగవంతుడు ఎవరి ప్రార్ధననైనా వింటాడు కానీ దుర్మార్గం తలచేవారి పట్ల కరుణ చూపడు. మనమెవరిమీదకు ఆక్రమణచేయటం లేదు. మనసరిహద్దులవరకే రక్షిస్తూ ధర్మంగావుంటున్నాము .కనుక యతోధర్మ స్థతోజయ : అన్నారు పెద్దలు .ధర్మం మనవైపునున్నది . ధర్మం వైపునే దైవం వుంటూంది. అందుకే సంఖ్యాబలం ఎక్కువైఅనా కౌరవులు ఓడిపోయారు.
ఈదేశాన్ని .భౌతికంగా ,నైనా ధార్మికంగా నైనాజరిగే దాడులనుండి కాపాడుతూ ధర్మాత్ములైన మనవీరులను ప్రేరేపించి దేశాన్ని రక్షిస్తున్నది దైవశక్తే . కనుక ఆతల్లిని వేడుదాము . మనదేశము ,సైన్యము శక్తివంతులను విజేతలను చేయమని.శత్రువుల వ్యూహాలు నశించి మన వైపురాకుండా పలాయనం చిత్తగించేలా చేయమని .........

"యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా:
నమస్తస్యై
నమస్తస్యైనమస్తస్యై నమో నమ: "



Read more...

తిరుమలలో అపచారాలు ..పాలకులకు శాపాలు

>> Sunday, September 6, 2009


తిరుమల కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని దివ్యధామము . కనుకనే ప్రపంచము నలుమూలలనుండి ఆస్వామి ప్రత్యక్ష సన్నిధానాన్ని దర్శించిన అనుభవాన్ని పొందుతుంటారు. ఈరోజుకూ అక్కడ వృక్షరూపాలలో లోనూ అదృశ్యరూపాలలోనూ మహామునులు యోగీశ్వరులు స్వామిని సేవిస్తుంటారని నమ్మకం . కనుకనే ఈ స్థలాన్ని కలిమాయలకు దూరంగా పవిత్రంగా వుంచేందుకు పూర్వంనుండి మహంతులు,రాజులు ,పాలకులు శ్రద్ధ చూపేవారు . ఇక్కడ అపచారం జరగటం లోకానికి అరిష్ఠమని తరతరాలుగా నమ్ముతున్నారు. కొంచెం బాధాకరమే అయినా ఈమధ్య జరుగుతున్న కొన్ని దురదృష్టకరసంఘటనలకు తిరుమలలో జరుగుతున్న అపచారాలే కారణమని ఆస్తికలోకం నమ్ముతున్నది. కొన్ని సంఘటనలను మనం పరిశీలించాల్సి వున్నది. ఇప్పుడు భక్తులు అనుకుంటూన్న విషయాలు కొన్ని తెలుపుతాను.

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు శ్రీవేంకటేశ్వరుని భక్తుడే కాని .ఆయన కూడా కలిమాయవలనేమో చేసిన పొరపాటు తరువాత జరిగిన వరుస సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన చివరగా ముఖ్యమంత్రి అయ్యాక టీ.టీడి. పాలకమండలి ని కొత్తగానియమించి ప్రమాణ స్వీకారం జరిపించారు .అందులో రజనీకాంత్.భానుమతిగారు తదితరులు సభ్యులుగా వున్నారు. ఆలయం లోపలే ప్రమానస్వీకారం జరిపారు .వెంటనే రజనీకాంత్ భానుమతి గారితో సహా సభ్యులు రామారావుగారికి పాదాభివందనాలు చెయ్యటం మొదలెట్టారు . శ్రీవారి ఆలయం లో పరాత్పరుడైన ఆయనకు తప్ప వేరొకరికి నమస్కరించరాదు. అలానమస్కరించినా వారించి తప్పుసరిదిద్దుకోవాలి .లేకుంటే వారి పుణ్యఫలం మొత్తం కొట్టివేయబడుతుంది అని పెద్దలంటారు. మరి భక్తుడైనా రామారావుగారికి ఆవిషయం స్ఫురనకు రావకపోవటం విధివిచిత్రం .

ఆతరువాత కొద్దిరోజులకు ఒక కార్యకర్త ఆయనకు పాదాభివందనం చేయబోగా సెక్యూరిటీసిబ్బంది అత్నిని లాగివేశారు. కానీ ఆకార్యకర్త అప్పటీకే ఆయన కాల్లు పట్టుకుని వుండటం తో రామారావుగారు పడటం ముక్కుకు దెబ్బతగలటం జరిగినది. ఆతరువాత మరికొద్దిరోజులకు ఆయన ప్రయాణిస్తున్నా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడి దానిని పైలెట్ పొలాలోదించటం తో ప్రమాదం తప్పింది. కానీ మరికొద్దికాలం లో అల్లుళ్ళ ద్వారానే ఆయన అధికారం కోల్పోవటం ,మానసికంగా క్రుంగి ......తరువాత తెలిసిన కథే .

మహాభక్తుడైనా ,మామూలువాడైనా కర్మఫలితాన్ని అతిక్రమించలేరంటారు.

ఆతరువాత చంద్రబాబుగారి హయాములో తిరుమలను తీర్ధయాత్రాస్థలంకన్నా కూడా విహార యాత్రాస్థలం గామార్చాలనే పద్దతిలో కొండమీదకు రోప్ వే ఏర్పాటుచేయాలని తలచిన నిర్ణయంతోఒక అలజడి రేగటం ,అక్కడ కొన్ని నిర్మాణాలను తొలగించటం వివాదాస్పదమైనది . భక్తులు రోడ్లెక్కి ధర్నాచేసేవరకు వెళ్ళినది . వరుసగా కరువుకాటకాలు రావటం తోపాటు నక్సలైట్ల మందుపాతర పేలి స్వామి అనుగ్రహం తో ప్రమాదం నుంచి బయటపడ్దా తరువాత అధికారం కోల్పోవటం జరిగినది.


ఇక తిరుమలలో రాజశెఖరరెడ్డిగారి హయాములో పలు వివాదాలు చెలరేగాయి . సాక్షాత్తూ శ్రీవారి కొండపైనే పరమత ప్రచారం జరపటం పెద్దదుమారాన్ని రేకెత్తించినది. అలాగే తిరుమల డబ్బున్నవారు ,అధికారమున్నవారు మందీమార్బలంతో వచ్చి పద్దతులు పాటించకుండా పలు అపచారాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి . మద్యం వ్యాపారం చేసేవారిని పవిత్ర తిరుమల కు చైర్మన్ గానియమించటం .ఆస్వామి వారి పట్ల ఏమాత్రం నమ్మకం లేని కొందరు అధికారులను,వుద్యోగులను నియమించటం జరిగినది. నిజమెంతో తెలియదు గాని సాక్షాత్తూ ఒక మంత్రిగారు అర్చకులిచ్చి శ్రీవారి తీర్ధాన్ని సేవించకుండా చేతిలోనుంచి క్రిందబోసి అవమానించారని ,ఆయనకు వున్న నమ్మకంప్రకారం గెస్ఠ్ హౌస్ కెళ్ళి తీర్ధం తీసుకున్నందుకు బాధపడ్దారని తిరుమలలో గుసగుసలాడుతున్నారు. మనకైతే నిజం తెలియదు. జనం ముక్కుమీద వేలేసుకునేలా వివాదాస్పదుదైన శేషాద్రిలాంటివారిని అక్కడ నియమించటం ప్రభుత్వాలను ప్రజలు చీత్కారించుకుంటున్నారు.భక్తులు తిరుమల ఎందుకొచ్చామురా బాబూ అనుకునేలా చేయాలనేవిధంగా వుంది అక్కడ ఉద్యోగుల బాధ్యతల నిర్వహణ .
ఇక ఈమధ్య ఆభరణాల ను మాయం చేసిన విషయాలు బయటకు పొక్కటం సంచలనం కలిగించగా , ఈ విషయం లో పలు అనుమానాలు వున్నాయి జనం లో . ఈ వరుసలో రాజశేఖరరెడ్డిగారి దుర్మరణం తో ఒక సమర్ధుడైన నాయకున్ని కోల్పోయినది రాజకీయరంగం . దీంతో తిరుమలలో జరిగే అపచారాలు పాలకులకు శాపాలుగా మారుతున్నాయని జనం అభిప్రాయపడుతున్నారు. తాము చేసినా ,తమ తరపువారు చేసినా లేక తమక్రిందపనిచేసే టిటీడి వుద్యోగులవలన చేసినా పాలకులకే ఈ దోషం సంక్రమిస్తున్నదని ఆస్తికలోకం కోడైకూస్తున్నది.
ప్రజలు తాము పన్నులరూపం లో తమ పాపాలను రాజులకు సంక్రమింపజేస్తారు అంటున్నాయి ధర్మ శాస్త్రాలు . ధర్మాన్ని ,ధార్మిక క్షేత్రాలపవిత్రతను కాపాదవలసిన బాధ్యత పాలకులదే . ఇది మహాశక్తిప్రసరణ జరిగేపుణ్యస్థలి .ఇక్కడ పచారాలు జరిగితే దాని పర్యవసానం చాలాభయంకరంగా వుంటుందని , లోకంలో అశాంతికి కారణమవుతుందని పెద్దలు చెబుతున్నారు . పాలకులు చిత్తశుధ్ధితో తిరుమల నిర్వహణను చూడవలసివుంది . ఏవివాదము లేకుండా కలియుగ వైకుంఠ పవిత్రతను కాపాడవలసి వున్నది.





Read more...

ఏమిటీ వెర్రిమమకారం ? మరణం తప్పదని తెలిసినా !

>> Friday, September 4, 2009

జాతస్యహి మరణం ధృవం . పుట్టిన ప్రతిప్రాణీ ఏదోఒకరోజు మరణించటం తప్పదు. కాకుంటే ఆజీవి ఖర్మానుసారం చివరదశ రోగాలతోను .వేదనలతోనో .ఘోరపరిస్థితులలోనో ..సునాయాసముగానో ఏదో ఒకరీతిలో జరిగిపోతుంది . ప్రతిరోజూ మనముందు ఏదో ఒకజీవి తమప్రస్థానాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నా నేనుకూడా మరణిస్తాననేవిషయాన్ని మాత్రం నమ్మడు మానవుడు. అదినమ్మితే చాలు ఏఇతరజీవికి చెందాల్సిన దానినీ తానే స్వంతం చేసుకోవాలనే స్వార్ధానికి తెగబడడు. కానీ అలా జరకుండా మాయ అతనిని కమ్మేస్తుంది . కాబట్టే మనిషి చేయరాని పనులన్నీచేసి దాని ఫలితాలన్నిటికీ బాధ్యుడవుతున్నాడు.
అయితే కొన్నిసార్లు అంటే మరణసన్నివేశాలను చూసినప్పుడూ ఈవివేకం కలుగుతుంది. దానినే స్మశానవైరాగ్యమంటారు. మహాకవి జాషువాగారు ఇలా ఈమరణస్న్నివేశాన్ని స్మశానం లో ఆవాస్తవాలను చూసి కాబోలు .............. అద్బుతంగా తనపద్యాలలో వ్యక్తపరచారు ఆవైరాగ్యాన్ని . కాబట్టి ఏవ్యక్తి పట్లనైనా ఏవస్తువుపట్లనైనా మితిమీరిన మమకారం మానవజీవితానికి అర్ధం లేకుండా చేస్తుందని హెచ్చరించారు పెద్దలు .

ప్రస్తుతము ముఖ్యమంత్రి మరణవార్త విని తట్టుకోలేక గుండెఆగి,ఆత్మహత్యలకు పాల్పడి మొత్తం వందమందికి పైగా మరణించారనే వార్తలు చూస్తుంటే ఏమిటీ మానసిక దౌర్భల్యమని బాధకలుగుతుంది. మరణం సహజమే .అది మహాత్మాగాంధీనైనా ,మహాయోగులనైనా ,రాజకీయనాయకులనైనా రంగులుపూసుకుని నటించి మెప్పించిన నటులనైనా ఒకేరకంగా గౌరవిస్తుంది. మీరు ,నేను ,మరొకరు ఏదో వొకరోజు మరణిస్తాము. ఇది మానవజీవిత వేదనకు ఒక విశ్రాంతి . అది సహజంగా జరగాలి .అలాకాక ఆత్మహత్యలు చేసుకోవటం అనవసర ఆవేదనలు తెచ్చుకోవటం ముందుగా జీవితాన్ని ముగించటం భగవంతుడిచ్చిన అవకాశాన్న వ్యతిక్రమించడమే .దానిద్వారా మరణానంతర ము జీవి వేదనాభరితమైన స్థితిని స్వీకరిస్తాడు ఆవేదన మరింతభయంకరంగావుంటూంది.

నా అభిమానవ్యక్తి మరణం నేను తట్టుకోలేనని విలపిస్తున్నావా ? ఏదీ ఎలాకలిగినదీ అభిమానం ఆలోచించి చూడు.
నువుపెంచుకున్న విపరీత మమకారం అనేమాయ నిన్నుఅలా ఆలోచింపజేస్తున్నది అంతే . నీకు రాజకీయంగా నో కుటుంబపరంగానో ఇంకాఎలానీ చాలామంది పై అభిమానముంటుంది ఎన్నిసార్లు మరణించగలవు ? వారికోసం.

నువ్వు మానవత్వం లేని మూర్ఖుడివి ఒకప్రాణి మరణిస్తే కనీసం సానుభూతిలేకుండా విమర్శిస్తున్నావని నన్ను తిడతావేమో .అలానే కానీ ...
కానీ ఓసారి ఆలోచించిచూడు. ఈసన్నివేశం లో ఆయనతోపాటు ఇంకా నలుగురు మరణించారు .వారిపట్లనీమానవత్వం ప్రదర్శింపబడదేమి ? కేవలం నీకిష్టమైన విషయం పట్లనే మాత్రమే మమకారమనే మాయను పెంచుకుంటున్నది నువ్వే ..తుంచుకుంటున్నదీ నువ్వే ! కాదా?
నేనుపెంచిన పిల్లి ఒకరోజు మాఇంట్ళో ఎలుకతలనుకొరికినది సంతోషమేసినది. మరొకరోజు మాకోడిని పట్టుకుని తలకొరికిచంపింది దు:ఖం వచ్చినది. అదేపిల్లి ఒకేరకమయినా పనిచెసినా నాకు వేర్వేరు భావాలెందుకు కలిగాయి?
ఇక్కడ ఆభావాలకు మూలం ఆవస్తువుపట్ల నేను పెంచుకున్న మమకారం .అంతవరకు పర్వాలెదు. ఆకోడిలేకుంటే నేను బ్రతకననో , లేక ఆకోడి నిచంపినపిల్లిని చంపిగాని శాంతించననో అంటే దానిని నామూర్ఖత్వమనాలి. అవునా ?కాదా?

కనుక సోదరా ! ఆలోచించు భగవంతుడిచ్చిన జీవితం లో అభిమానం అనేది ఒకరుచి దానిని అలానే ఆస్వాదించాలి .అంతవరకే . నీకిచ్చిన జీవితం లో నీ అభిమానవ్యక్తులమరణం తో కొన్నిపాఠాలు నేర్చుకోవాలి. వారి జీవితాలలో వున్న మంచిని స్వీకరించి ఆమంచితనాన్ని నీజీవితం లో అన్వయించుకోవాలి. వారిలో వున్న చెడును కూడా తెలుసుకుని అవి నీజీవితం లోకితొంగిచూడకుండా జాగ్రత్తపడాలి. భగవంతుడిచ్చిన పూర్ణజీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఆనందంగా మృత్యువుకు స్వాగతం చెబుదాము సమయమొచ్చినప్పుడు. తనంత తానుగా వచ్చినప్పుడు.
తమసోమా జ్యోతిర్గమయ



Read more...

ఏమాత్రం అజాగ్రత్తగావున్నా ప్రమాదమే తస్మాత్ జాగ్రత్

>> Wednesday, September 2, 2009

మన ముఖ్యమంత్రి వైయస్ ఇకలేరని నమ్మటం కష్టం గానే వున్నది. మొండితనం,పట్టుదల ,అనుకున్నది సాధించేదాకా
విశ్రమించని కార్యదీక్ష గల నాయకుడు తనబాధ్యతల నిర్వహణలోనే రణరంగం లో వీరునిలా మరణించారు. ఆయన ఆత్మకుశాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిధ్ధాము.

ఆయన బయలుదేరిన సమయము జ్యోతిష శాస్త్రరీత్యా దుర్ముహూర్తము కావటము , ఎక్కడికన్నా బయలుదేరేప్పుడు వద్దు అని ఎవరినోటనుండైనా రావటము శుభసూచకలు కాదని మనపెద్దలంటారు. శుభాశుభాలను హెచ్చరిమ్చేవారన్నా ఆయనను నిలువరించలేకపోవటము దురదృష్ట కరము. మాహత్ములైనా ,మహానాయకులైనా మృత్యువుముందు తలవంచాల్సినదే . మనకెంతబాధవున్నా విధిని ఎదిరించి మార్చలేని మానవ మాత్రులము.

ఐతే ఈబాధ విషాధం లో కొన్ని విషయాలలో అప్రమత్తతలోపిస్తే మరింత విషాధకరమవుతుంది పరిస్థితి. ఉగ్రవాదులు సమయము కోసము కాచుకుని సిద్దంగావున్నారని గూఢాచార వర్గాల హెచ్చరికలు పేపర్లలో చదువుతున్నాము. ప్రస్తుతము అధికారయంత్రాంగమంతా ఈవిషయం పైన ద్రుష్టి సారించివున్నందున వారి కదలికలను గమనించకుంటే దేశానికి మరింతప్రమాదము .వారు దేనికైన తెగబడవచ్చు. ఇక అసాంఘీక శక్తులు ఏ అవకాశాన్ని వదులుకోరు .ప్రస్తుతం హైదరాబాద్ లో గణేశ నిమజ్జనం లో వేలాదిమంది గుంపులుగా చేరే అవకాశమున్నది గనుక అక్కడ మరింత జాగ్రత్త అవసరం . గనేశ్ నిమజ్జనాలను కూడా నిరాడంబరముగాను త్వరగాను పూర్తిచేయటం మంచిది .

ఏమాత్రం అజాగ్రత్తగావున్నా ప్రమాదమే తస్మాత్ జాగ్రత్ .

Read more...

ఏమిటీ అశుభం ?

ఈసంవత్సరం ప్రమాదాలు ,విరోధాలు ఎక్కువగావుంటాయనే పంచాంగకర్తల మాటలను ఉటంకిస్తూ చెబుతూనే వున్నాను. ఏమిటో ,అసెంబ్లీభవనం లోను ఆతరువాత మొన్న ప్రధాన న్యాయస్తానం లోనూ అగ్నిప్రమాదం జరగటం ఏదో అశుభాన్ని సూచిస్తున్నాయి. శ్రీవారి ఆలయం లో అనాచారాలు కూడా వుపద్రవాలకు దారితీయవచ్చు .

భగవంతుని దయవలన మన ముఖ్యమంత్రిగారికి ఏ ఆపదా రాకుందా వుండాలని వేడుకుందాము.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP